జల శక్తి మంత్రిత్వ శాఖ
ప్రజలకు తగిన పరిమాణంలో స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో పురోగతి
Posted On:
18 DEC 2023 1:56PM by PIB Hyderabad
దేశంలోని అన్ని గ్రామీణ కుటుంబాలకు తగిన పరిమాణంలో, నిర్ణీత నాణ్యతతో, స్థిరంగా, దీర్ఘకాలిక ప్రాతిపదికన సురక్షితమైన తాగునీటిని కొళాయి ద్వారా అందించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం, అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేసేలా 2019 ఆగస్టులో జల్ జీవన్ మిషన్ను (జేజేఎం) ప్రారంభించింది. తాగునీరు రాష్ట్రానికి సంబంధించిన అంశం. అందువల్ల, జల్ జీవన్ మిషన్ పనులు సహా తాగునీటి సరఫరా పథకాల ప్రణాళిక, ఆమోదం, అమలు, నిర్వహణ బాధ్యత రాష్ట్రాలు/యూటీ ప్రభుత్వాలది. సాంకేతిక, ఆర్థిక సాయం ద్వారా భారత ప్రభుత్వం రాష్ట్రాలు/యూటీలకు మద్దతుగా నిలుస్తుంది.
జల్ జీవన్ మిషన్ ప్రారంభించినప్పటి నుంచి, గ్రామీణ గృహాలకు కొళాయి నీటి లభ్యతను పెంచడంలో గణనీయమైన పురోగతి ఉంది. జల్ జీవన్ మిషన్ ప్రారంభ సమయంలో, 2019 ఆగస్టులో, దేశవ్యాప్తంగా కేవలం 3.23 కోట్ల (16.8%) గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కొళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. అప్పటి నుంచి 13.12.2023 నాటికి, రాష్ట్రాలు/యుటీలు నివేదించిన ప్రకారం, జేజేఎం కింద దాదాపు 10.58 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీటి కనెక్షన్లు ఇచ్చాం. అంటే, 13.12.2023 నాటికి, దేశంలోని 19.24 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో దాదాపు 13.81 కోట్ల (71.77%) కుటుంబాలు తమ ఇళ్లలో కొళాయి నీటి సరఫరాను కలిగి ఉన్నాయి.
పట్టణ వ్యవహారాలకు నోడల్ మంత్రిత్వ శాఖగా గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉంది కాబట్టి, జాతీయ పథకాల అమలు ద్వారా పట్టణ ప్రాంతాల్లో నీటి నిర్వహణకు సంబంధించి అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్), అమృత్ 2.0. వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆ శాఖ తెలిపింది.
అమృత్ పథకం పట్టణ ప్రాథమిక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై, ముఖ్యంగా 500 నగరాల్లో నీటి సరఫరా, ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్పై దృష్టి పెడుతుంది. ఆమోదించిన రూ.77,640 కోట్ల ప్రణాళికలో, నీటి సరఫరా రంగానికి గణనీయంగా రూ.39,011 కోట్లు (దాదాపు 50%) కేటాయించడమైనది. కొత్త నీటి సరఫరా వ్యవస్థల ఏర్పాటు, పునరుద్ధరించడం; నీటి సరఫరా కోసం నీటి వనరుల పునరుజ్జీవనం, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు సంబంధించిన ప్రాజెక్టులను యూఎల్బీలు/రాష్ట్రాలు చేపట్టవచ్చు. ఇప్పటి వరకు, రూ.42,987 కోట్ల విలువైన 1,348 ప్రాజెక్టులు మొదలయ్యాయి. వీటిలో రూ.22,280 కోట్ల విలువైన 1,048 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ.35,650 కోట్ల వ్యయాలతో మొత్తం రూ.39,435 కోట్ల విలువైన భౌతిక పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా, ఇతర జల కార్యక్రమాలతో కలిపి ఇప్పటి వరకు 187 లక్షల గృహ కొళాయి కనెక్షన్లు అందించడం జరిగింది.
ఇదే ఒరవడిని కొనసాగించేలా, అమృత్ 2.0 పథకం దేశంలోని అన్ని ప్రణాళికబద్ధ పట్టణాలకు వర్తిస్తుంది, వాటిని జల భద్రత కల్పిస్తుంది. మంచినీటి వనరులను పెంచడానికి నీటి వనరుల పునరుజ్జీవనం, పట్టణ జలాశయ నిర్వహణ, పునర్వినియోగం, వర్షపు నీటి సంరక్షణను ఈ పథకం ప్రోత్సహిస్తుంది. అమృత్ 2.0 కింద ఆమోదించిన నీటి సరఫరా ప్రాజెక్టుల ద్వారా 1.64 కోట్ల కొత్త కొళాయి కనెక్షన్లు అందించడానికి ప్రణాళిక సిద్ధంగా ఉంది.
జేజేఎం కింద చేపట్టే గ్రామీణ నీటి సరఫరా పథకాలను నిర్వహించడం, నీటి సరఫరా పైపులు వేసేటప్పుడు దెబ్బతినే వీధులు, రహదారులను మరమ్మతులు చేయడం, నిర్మించడం వంటి పనుల బాధ్యత రాష్ట్ర/యూటీ ప్రభుత్వాలది. జేజేఎం కింద అందుబాటులో ఉన్న నిధులను ఈ పనుల కోసం ఉపయోగించవచ్చు. ఈ పనుల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రహదారుల వంటి మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లకుండా గ్రామీణ నీటి పథకాలను చేపట్టాలని, పైపులు వేసేటప్పుడు దెబ్బతిన్న రహదారులను వెంటనే పునరుద్ధరించాలని రాష్ట్రాలు/యూటీలకు సూచించాం. అంతేకాదు, జేజేఎం పథకాల అమల్లో జాప్యాన్ని నివారించడానికి, ఆలస్యంగా పనులు చేసే సంస్థలపై తగిన జరిమానా విధించేలా ఒప్పంద పత్రాల్లో నిబంధనలు చేర్చాలని రాష్ట్రాలు/యూటీలకు సూచించాం.
జల శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1988077)