హోం మంత్రిత్వ శాఖ

గుజరాత్ లోని సనంద్ లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


2047 లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని ప్రతిజ్ఞ చేయడానికి సాగే ప్రయాణమే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదేళ్లలో దేశంలో భద్రత , ఆర్థిక వ్యవస్థ తో సహా ప్రతి రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయి.

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కలల భారతాన్ని నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది
దేశంలో రెండు కోట్ల ' లాక్ పతి దీదీ'లను తయారు చేయాలని శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు; ఒక్కసారి ఈ పథకం దేశంలోని ప్రతి గ్రామానికి చేరితే, మొత్తం భారతదేశంలో నిజమైన మార్పు వస్తుంది

శాంతి, అభివృద్ధి, సౌభాగ్యం, నిరుపేదలకు స్వావలంబన కల్పించే సంప్రదాయాన్ని గుజరాత్ లో శ్రీ నరేంద్ర మోదీ నెలకొల్పారు; వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ఆ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళుతుంది

Posted On: 16 DEC 2023 6:46PM by PIB Hyderabad

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా శనివారం నాడు ఈగుజరాత్ లోని సనంద్ లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, 2047 లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి  భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని ప్రతిజ్ఞ చేయడానికే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అని అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదేళ్లలో దేశంలోని ప్రతి రంగంలోనూ గణనీయమైన మార్పులు    చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు.  

దేశ భద్రతకు మోదీ ప్రభుత్వం భరోసా ఇచ్చిందన్నారు. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న కల సర్దార్ పటేల్, శ్యాంప్రసాద్ ముఖర్జీల కాలం నుంచి నెరవేరలేదని, దాన్ని పూర్తి చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేశారన్నారు. మోదీ  నాయకత్వంలో బ్రహ్మాండమైన రామ మందిరాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో చంద్రయాన్ చంద్రుడిపైకి చేరిందని, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశామని తెలిపారు.

 స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో తొలిసారిగా దేశ ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా మారిందని, పారిశ్రామికాభివృద్ధి అత్యధికంగా ఉందని కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశంలోని కోట్లాది మంది పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచే పని చేశారని ఆయన అన్నారు. ప్రతి గ్రామాన్ని రోడ్డు మార్గం ద్వారా అనుసంధానం చేయడానికి, ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించడానికి,  ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతాను అందించడానికి , ప్రతి పేదవానికి నెలకు ఐదు కిలోల ఉచిత ఆహార ధాన్యాలను అందించడానికి ప్రధాని మోదీ ఏర్పాట్లు చేశారని తెలిపారు.

గత 75 ఏళ్లలో దేశం అనేక రంగాల్లో ఎంతో పురోగతి సాధించిందని, అయితే స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన వారంతా భారతదేశాన్ని అన్ని రంగాల్లో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు పోరాడారని శ్రీ అమిత్ షా అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కలల భారతాన్ని నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఇంట్లో గ్యాస్ సిలిండర్, టాయిలెట్, ఆహారం, కరెంటు లేని వారు దేశంలో ఒక్కరు కూడా ఉండకూడదన్నారు. ఎవరూ నిరక్షరాస్యులు కాకూడదు; ఈ కార్యక్రమం అటువంటి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టించడంలో సహాయపడటానికి ఒక తీర్మానం తీసుకోవడానికి ఉద్దేశించినదని చెప్పారు.

దేశంలో రెండు కోట్ల ' లాక్ పతి దీదీ'లను సృష్టించాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని కేంద్ర హోం మంత్రి తెలిపారు. ఈ పథకం విజయవంతంగా దేశంలోని ప్రతి గ్రామానికి చేరితే, అప్పుడు భారతదేశంలో నిజమైన మార్పు వస్తుందని ఆయన అన్నారు. దేశంలోని పేద సోదరీమణుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారి జీవితాల్లోని అనేక చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయని, వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఇలాంటి వ్యవస్థను రూపొందించామని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని ప్రజా సంక్షేమ పథకాలకు 'మోదీ గ్యారంటీ' ఉందని అమిత్ షా అన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని ప్రభుత్వం రూపంలో గుజరాత్ లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రయోజనాలు కనిపించాయని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ  ప్రభుత్వం గుజరాత్ లో మంచి రహదారులను నిర్మించిందని, 24 గంటల విద్యుత్ ను అందించిందని శ్రీ షా అన్నారు.గుజరాత్ లో శ్రీ నరేంద్ర మోదీ నెలకొల్పిన శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు, నిరుపేదలకు స్వావలంబన కల్పించే సంప్రదాయాన్ని విక సిత్ భారత్ సంకల్ప్ యాత్ర ముందుకు తీసుకెళ్తుందని ఆయన అన్నారు.

 

***



(Release ID: 1987381) Visitor Counter : 84