విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఎలక్ట్రికల్ ఇంటర్‌కనెక్షన్స్, గ్రీన్ / క్లీన్ హైడ్రోజన్ సప్లై చెయిన్‌లలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన భారతదేశం, సౌదీ అరేబియా


అవగాహన కుదిరిన రంగాల్లో విలువ ఆధారిత వ్యవస్థ అభివృద్ధి చేయడానికి తరచు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన రెండు దేశాలు

సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన మెనా వాతావరణ వారోత్సవాల్లో పాల్గొన్న కేంద్ర ఇంధన, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి శ్రీ ఆర్.కే.సింగ్

బయో ఫ్యూయల్ అలయన్స్, లైఫ్ ,ఇంధన సరఫరా రంగాల్లో దేశాలు కలిసి పనిచేయాలని ప్రపంచ దేశాలను కోరిన శ్రీ ఆర్.కే.సింగ్

ఇంధన వినియోగ రంగంలో వేగంగా మార్పు తీసుకురావడానికి గ్రీన్ హైడ్రోజన్ ఒక మంచి ప్రత్యామ్నాయం.శ్రీ ఆర్.కే.సింగ్

Posted On: 08 OCT 2023 6:04PM by PIB Hyderabad

ఎలక్ట్రికల్ ఇంటర్‌కనెక్షన్స్, గ్రీన్ / క్లీన్ హైడ్రోజన్  సప్లై చెయిన్‌లలో కలిసి పనిచేయడానికి  భారతదేశం, సౌదీ అరేబియా అంగీకరించారు. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఈరోజు మధ్యాహ్నం రియాద్ లో జరిగిన కార్యక్రమంలో రెండు దేశాలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. భారతదేశం తరపున సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ద్ర ఇంధన, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి శ్రీ ఆర్.కే.సింగ్, సౌదీ అరేబియా  ఇంధన మంత్రి శ్రీ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ అల్-సౌద్ సంతకాలు చేశారు. రియాద్‌లో జరుగుతున్న  మెనా వాతావరణ వారోత్సవాల సందర్భంగా రెండు దేశాల మధ్య అవగాహన కుదిరింది. 

 

 

ఒప్పందంలో భాగంగా  ఎలక్ట్రికల్ ఇంటర్‌కనెక్షన్ రంగంలో రెండు దేశాల మధ్య సహకారం కోసం ఒక సాధారణ వ్యవస్థను అభివృద్ధి చేస్తారు.వినియోగం ఎక్కువగా ఉండే సమయాలు, అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ మార్పిడి, రెండు దేశాలు కలిసి ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం,; గ్రీన్ / క్లీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వనరులను కలిసి ఉత్పత్తి చేయడం, గ్రీన్ / క్లీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన రంగంలో ఉపయోగించే పదార్థాలను  సురక్షితమైన, నమ్మదగిన, స్థితిస్థాపక విధానంలో   సరఫరా చేయడానికి  వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కూడా రెండు దేశాలు అంగీకరించాయి.  

అవగాహన కుదిరిన రంగాల్లో సహకారాన్ని మరింత ఎక్కువ చేయడానికి తరచు సాధారణ, వాణిజ్య సమావేశాలు నిర్వహించడానికి కూడా రెండు దేశాలు అంగీకరించాయి. 

అంతకుముందు, కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి  శ్రీ ఆర్.కే.సింగ్ నాయకత్వంలో  భారత ప్రతినిధి బృందం సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరుగుతున్న మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా (మేనా) క్లైమేట్ వీక్ 2023 ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొంది. సదస్సు అక్టోబర్ 8 నుంచి 12 వ తేదీ వరకు జరుగుతుంది. సౌదీ అరేబియా ప్రభుత్వం ఆతిధ్యం ఇస్తున్న కాప్ 28 సమావేశంలో చర్చించే వాతావరణ అంశాలపై  మేనా సమావేశంలో చర్చించి పరిష్కార మార్గాలు సూచిస్తారు. గ్లోబల్ స్టాక్‌టేక్, పారిస్ ఒప్పందంలోభాగంగా పర్యావరణ  ఆర్థిక అంశాలు, ఇంధన భద్రత అంశాలతో సహా అనేక అంశాలపై చర్చలు జరుగుతాయి. వాతావరణ అంశాలకు సంబంధించి వివిధ దేశాలు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు, వివిధ అంశాలపై దేశాల అభిప్రయాలను వాతావరణ వారోత్సవాల్లో చర్చిస్తారు.  

ఈ రోజు రియాద్‌లో మెనా వాతావరణ వారోత్సవాల మొదటి రోజున" పారిస్ ఒప్పందంలో  గ్లోబల్ స్టాక్‌టేక్  ప్రాంతీయ సంభాషణ: ఆశయం మరియు న్యాయమైన మరియు సమగ్ర పరివర్తనం కోసంచర్యలు, సాంకేతిక వినియోగం" అనే అంశంపై జరిగిన సమావేశంలో  శ్రీ ఆర్.కే.సింగ్ పాల్గొన్నారు. ప్రపంచ స్థాయిలో ఇంధన ఉత్పత్తి, వినియోగం, స్థిరత్వం సాధించడానికి దేశాల మధ్య సహకారం పెంపొందించే అంశంలో  మెనా క్లైమేట్ వీక్ చాలా ముఖ్యమైనదని  శ్రీ ఆర్.కే.సింగ్ అన్నారు.భవిష్యత్తు ఇంధన రంగంలో  మేనా ప్రాంత దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు.  

ఇంధన రంగంలో ప్రపంచంలో భారతదేశం  అత్యంత కీలకమైన స్థానంలో ఉందని  శ్రీ ఆర్.కే.సింగ్  అన్నారు.   శక్తి పరివర్తనలో అగ్రగామిగా ఎదిగిందని మంత్రి పేర్కొన్నారు. " ప్రపంచ జనాభాలో    17% మంది భారతదేశంలో నివసిస్తున్నారు.  ప్రపంచంలో 5వ వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ గుర్తింపు పొందింది.  2030 నాటికి జీడీపీ  ఉద్గార తీవ్రతను 45% తగ్గించడానికి, 2070 నాటికి నికర జీరో లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం చర్యలు అమలు చేస్తోంది " అని మంత్రి వివరించారు. దేశ  ప్రజలకు విశ్వసనీయమైన, సరసమైన , స్థిరమైన విద్యుత్ సరఫరా చేయాలన్న లక్ష్యంతో ఇంధన రంగం విశేషమైన పరివర్తన తీసుకురావడానికి చర్యలు అమలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.  . "శిలాజయేతర ఇంధనాల నుంచి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడంలో దేశం గణనీయమైన పురోగతి సాధించింది. ఏకీకృత జాతీయ గ్రిడ్‌ను స్థాపించింది.  పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసింది, పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడం, ఇంధనానికి ప్రాప్యతను విస్తరించడం మరియు 100% గృహ విద్యుదీకరణ సాధించి, వినూత్న విధానాలను అమలు చేయడానికి చర్యలు అమలు జరుగుతున్నాయి" అని మంత్రి తెలిపారు. 

భారతదేశ శక్తి పరివర్తనను వేగవంతం చేయడానికి గ్రీన్ హైడ్రోజన్  ప్రత్యామ్నాయమని శ్రీ సింగ్ అన్నారు. "భారత ప్రభుత్వం హైడ్రోజన్ శక్తిని వినియోగించుకోవడం కోసం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభించింది.  ఈ మిషన్ కోసం US $ 2.3 బిలియన్ల ప్రారంభ వ్యయాన్ని ప్రభుత్వం ఆమోదించింది " అని శ్రీ సింగ్ వివరించారు. 

 

 స్థిరమైన జీవ ఇంధనాలలో అంతర్జాతీయ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్‌లో చేరాలని మంత్రి మెనా  దేశాలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ  సంస్థల సహకారంతో సుస్థిర జీవ ఇంధనాల అభివృద్ధి, విస్తరణలో సహకారాన్ని సులభతరం చేయడం, జీవ ఇంధన రంగంలో వాణిజ్యాన్ని సులభతరం చేయడం కోసం  అలయన్స్ కృషి చేస్తుందని  ఆయన అన్నారు.

శక్తి పరివర్తన రంగంలో సవాళ్లతో పాటు  అభివృద్ధి సాధించడానికి అవకాశాలు అందుబాటులో ఉంటాయని  అభివృద్ధి చెందుతున్న దేశాలు ముఖ్యంగా పరిఫిక్ ప్రాంత దేశాలు గుర్తించి చర్యలు అమలు చేయాల్సి ఉంటుందని శ్రీ సింగ్ పేర్కొన్నారు.ఇంధన పరివర్తన కోసం అమలు జరుగుతున్న చర్యలకు దేశాల మధ్య సహకారం తప్పనిసరి అని శ్రీ సింగ్ స్పష్టం చేశారు.  శక్తి పరివర్తనను స్థిరమైన పద్ధతిలో సాధించడానికి వ్యక్తిగత చర్యలు , స్థిరమైన ప్రవర్తనా ఎంపికలు కీలకంగా ఉంటాయని శ్రీ సింగ్ అన్నారు. దీనికోసం భారతదేశం ప్రతిపాదించిన పర్యావరణం కోసం జీవనశైలి (లైఫ్) విధానాన్ని అమలు చేయాలని మెనా దేశాలకు శ్రీ సింగ్ సూచించారు. 

  గ్లోబల్ స్టాక్‌టేక్ పై పారిస్ ఒప్పందం

 

మిడిల్-ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా (మెనా) పర్యావరణ వారోత్సవంలో   గ్లోబల్ స్టాక్‌టేక్ ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ పై ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయి. పర్యావరణ పరిరక్షణలో ఎదురవుతున్న సవాళ్లు, అడ్డంకులను చర్చించి  పరిష్కార మార్గాలు సూచించి  పర్యావరణ పరిరక్షణ కోసం  అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి గల అవకాశాలను చర్చించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది.

 

 పారిస్ ఒప్పందం  ఉద్దేశ్యం,  దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంలో సామూహిక పురోగతిని అంచనా వేయడానికి, పారిస్ ఒప్పందం అమలును ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి జిఎస్టీ  దేశాలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.తీవ్రత తగ్గించడానికి అమలు చేయాల్సిన చర్యలు, ఉత్తమ విధానాలను పరిశీలించి అన్ని దేశాల్లో  అమలు చేయడానికి సమగ్ర విధానాలను రూపొందిస్తుంది.  2021లో గ్లాస్గో లో ప్రారంభమైన జిఎస్టీ దుబాయ్ వాతావరణ మార్పు సదస్సులో ముగుస్తుంది. 

 

పారిస్ ఒప్పందం నిబంధనలు,లక్ష్యాల సాధన కోసంప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలు,  సాధించిన పురోగతిని సమీక్షించడానికి  మొదటి ప్రపంచ స్టాక్‌టేక్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  సవాళ్లను గుర్తించి వేగంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు అమలు జరిగేలా చూసేందుకు సమావేశాలు దోహదపడతాయి.  ఐక్యత, సహకారం ప్రాధాన్యత ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా సమావేశంలో చర్చలు జరిపి, తీర్మానాలు ఆమోదిస్తారు. 

 

***

 



(Release ID: 1965831) Visitor Counter : 96