సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ఐఏఏడిబి నిర్వహణ కోసం కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించి లోగో ఆవిష్కరించిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ


2023 డిసెంబర్ నెలలో ఢిల్లీ, ముంబయి , బెంగళూరు లో ఇండియా ఆర్ట్ ఆర్కిటెక్చర్ డిజైన్ ప్రదర్శన : శ్రీ జి కిషన్ రెడ్డి

క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న కళాకారులు, సమకాలీన డిజైనర్ల మధ్య చర్చలు, సమావేశాల ద్వారా ఆవిష్కరణలు, సహకారాన్ని పెంపొందించి సృజనాత్మక కళారంగం అభివృద్ధి లక్ష్యంగా ప్రదర్శన నిర్వహణ శ్రీమతి మీనాక్షి లేఖి

Posted On: 08 OCT 2023 9:16AM by PIB Hyderabad

రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఇండియా ఆర్ట్ ఆర్కిటెక్చర్ డిజైన్ బైనాలే (ఐఏఏడిబి  ‘23) లోగో ని  నిన్న సాయంత్రం ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. 2023 డిసెంబర్ నెలలో ఢిల్లీ, ముంబయి , బెంగళూరు లో ఇండియా ఆర్ట్ ఆర్కిటెక్చర్ డిజైన్ ప్రదర్శన జరుగుతుందని  ఈ సందర్భంగా పంపిన వీడియో సందేశంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి వెల్లడించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తన తొలి ఇండియా ఆర్ట్ ఆర్కిటెక్చర్ డిజైన్ బినాలేను నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. 

 

 

కేంద్ర విదేశీ వ్యవహారాలు,సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి.మీనాక్షీ లేఖి కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ స్థాయిలో భారతదేశ నిగూడ  నిర్మాణ, కళాత్మక ప్రతిభకు గుర్తింపు తెచ్చేందుకు ఇండియా ఆర్ట్ ఆర్కిటెక్చర్ బినాలే ఉపయోగపడుతుందని శ్రీమతి.మీనాక్షీ లేఖి అన్నారు. జాతీయ అంతర్జాతీయ నిపుణులు పాల్గొనే ప్రదర్శన నిర్మాణ, కళాత్మక రంగాలకు మరింత స్ఫూర్తిని కలిగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. నిర్మాణ, కళారంగాలపై ఆసక్తి కలిగించే విధంగా ప్రదర్శన ఉంటుందన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న కళాకారులు, సమకాలీన డిజైనర్ల మధ్య చర్చలు, సమావేశాల ద్వారా ఆవిష్కరణలు, సహకారాన్ని పెంపొందించి సృజనాత్మక కళారంగం అభివృద్ధి లక్ష్యంగా ప్రదర్శన జరుగుతుందని   శ్రీమతి మీనాక్షి లేఖి అన్నారు.  

 

 

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి  శ్రీమతి ముగ్ధా సిన్హా ప్రదర్శన వివరాలు వివరించారు. ప్రసిద్ధ ఎర్రకోటలో 2023 డిసెంబర్ 9 నుంచి 15 వరకు సదస్సు జరుగుతుందని  ఆమె వెల్లడించారు. ప్రదర్శనలో వివిధ అంశాలపై  ఎగ్జిబిషన్‌లు, నిపుణుల మధ్య చర్చలు జరుగుతాయి.  ప్రతి రోజు ఒక నిర్దిష్ట అంశంపై నిపుణులు చర్చిస్తారు.  తలుపులు మరియు గేట్‌వేలు, మంత్రముగ్ధులను చేసే ఉద్యానవనాలు, విస్మయపరిచే మెట్లు ,  ఆలయ వాస్తుశిల్పం, స్వతంత్ర భారతదేశంలో ఆధునిక అద్భుతాలు, స్వదేశీ డిజైన్ సమకాలీన పరిస్థితి, వాస్తుశిల్పం లో మహిళల పాత్ర వంటి అంశాలపై ప్రదర్శనలు, చర్చలు జరుగుతాయని మంత్రి వివరించారు. 

2024 లో జరగనున్న వెనిస్ బినాలే 2024లో భారతదేశం పాల్గొంటుంది. దీనికి సన్నాహక కార్యక్రమంగా ఇండియా ఆర్ట్ ఆర్కిటెక్చర్ డిజైన్ బినాలే 2023 ని నిర్వహిస్తున్నారు. కళ, ఆర్కిటెక్చర్ , డిజైన్ రంగాల్లో పనిచేస్తున్న వారు,  నిపుణుల మధ్య సమగ్ర సంభాషణలు నిర్వహించేందుకు ప్రదర్శన అవకాశం కలిగిస్తుంది. వయస్సు, లింగం తో సంబంధం లేకుండా  సాంప్రదాయ కళాకారులు, సమకాలీన డిజైనర్లు,  వాస్తుశిల్పులు ఒక వేదికపైకి వచ్చి కళ , వాస్తు రంగాలపై చర్చలు జరిపదానికి, సహకారం సాధించడానికి ప్రదర్శన వేదికగా నిలుస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా జరిగే కార్యక్రమంలో  ఎర్రకోట వద్ద సాంస్కృతిక ప్రదేశాల అభివృద్ధి ప్రాజెక్టు ను కూడా ప్రారంభిస్తారు. 

 

 

 

లోగో ఆవిష్కరణ  కార్యక్రమంలో దౌత్యవేత్తలు, కళాకారులు, వాస్తుశిల్పులు, డిజైనర్లు,  ప్రభుత్వ అధికారులు, గ్యాలరిస్టులు , మ్యూజియం నిపుణులు, పెద్ద సంఖ్యలో  ప్రజలు  పాల్గొన్నారు. కార్యక్రమంలో నిర్వహించిన  జాజ్ క్వార్టెట్ 'క్యాపిటల్ త్రీ' ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. 

ఇంస్టాగ్రామ్ లో ఇండియా ఆర్ట్, ఆర్కిటెక్చర్ మరియు డిజైన్ బైనాలే  అధికారిక పేజీ @iaadb2023లో తాజా సమాచారం చూడవచ్చు. 

 

***



(Release ID: 1965741) Visitor Counter : 120