మంత్రిమండలి

ఉజ్వల యోజన విస్తరణకు మంత్రిమండలి ఆమోదం


మూడేళ్ల వ్యవధిలో 75 లక్షల కొత్త వంటగ్యాస్‌ కనెక్షన్ల జారీ;
10.35 కోట్లకు పెరగనున్న ‘పిఎంయువై’ లబ్ధిదారుల సంఖ్య

Posted On: 13 SEP 2023 6:26PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి 75 లక్షల అదనపు ఉజ్వల వంటగ్యాస్‌ కనెక్షన్ల జారీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) కింద 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26దాకా మూడేళ్ల వ్యవధిలో ఈ కనెక్షన్లు జారీ అవుతాయి. దీంతో దేశవ్యాప్తంగా ‘పిఎంయువై’ లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుతుంది.

దేశంలో 2014-2023 సంవత్సరాల మధ్య వంటగ్యాస్‌ వివరాలు:

 

(యూనిట్‌)

01.04.2014

01.04.2016

01.04.2023

దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ స్థాయి

శాతాల్లో

55.9

61.9

దాదాపు సంతృప్త స్థాయి

ఓఎంసీలకు చెందిన బాట్లింగ్‌ ప్లాంట్లు

అంకెల్లో

186

188

208

దేశంలో వంటగ్యాస్‌ పంపిణీదారులు

అంకెల్లో

13896

17916

25386

దేశంలో వంటగ్యాస్‌ ప్రస్తుత ఖాతాదారులు

లక్షల్లో

1451.76

1662.5

3140.33

ఉజ్వల 2.0 కింద ప్రస్తుత విధివిధానాల ప్రకారం… ఈ పథకం లబ్ధిదారులకు తొలి రీఫిల్ సిలిండర్‌తోపాటు స్టవ్ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. అలాగే ‘పిఎంయువై’ వినియోగదారులకు 14.2 కిలోల సిలిండరుపై నిర్దిష్టంగా రూ.200 వంతున ఏడాదిలో 12 సిలిండర్లపై రాయితీ ఇవ్వబడుతుంది. ఈ పథకాన్ని కొనసాగించని పక్షంలో అర్హులైన పేద కుటుంబాలకు దీనికింద సముచిత ప్రయోజనం పొందే వీలుండదు.

వంటింటి పొగనుంచి మహిళలకు జీవన సౌలభ్యం

   ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) అంచనాల ప్రకారం- ప్రపంచంలో దాదాపు 240 కోట్లమంది (ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు) వంట కోసం ఇళ్ల బయట కట్టెల పొయ్యి లేదా వంటింట్లో కిరోసిన్, జీవ ఇంధనాలు (వంటచెరకు, పిడకలు, పంట వ్యర్థాలు), బొగ్గు వంటివాటిని వినియోగిస్తున్నారు. దీనివల్ల ఇళ్లలో పెరిగే వాయు కాలుష్యం వల్ల 2020నాటికి ఏటా 32 లక్షల మంది మరణించారని అంచనా. ఇలా మరణించేవారిలో 2,37,000 మందికిపైగా ఐదేళ్లలోపు బాలలేనని ‘డబ్ల్యుహెచ్‌ఒ’ పేర్కొంది. ఈ నేపథ్యంలో సుస్థిర, కాలుష్య రహిత భవిష్యత్తు దిశగా ఇళ్లలో వాయు కాలుష్య సమస్యను పరిష్కరించడం అవసరమన్నది సుస్పష్టం. తద్వారా ముఖ్యంగా మహిళలు, బాలలకు కష్టాలు తప్పుతాయి.

   దేశంలోని పేదలు.. ముఖ్యంగా గ్రామీణులు పూర్వకాలంలో వంటకోసం కట్టెలు, బొగ్గు, పిడకలు వంటి సంప్రదాయ ఇంధనాలను వాడేవారు. అయితే, ఆరోగ్యంపై ఇవి చూపే ప్రతికూల ప్రభావం గురించి ఆ రోజుల్లో వారికి అంతగా తెలియదు. ఫలితంగా మహిళలు, బాలల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తేవి. ఈ మేరకు న్యుమోనియా, న్యుమోనియా, ఊపిరితిత్తుల కేన్సర్, ‘ఇస్కీమిక్ హార్ట్-క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్’ వంటి జబ్బులతో మరణాల ముప్పు విస్తృతంగా ఉండేది. వంట కోసం సంప్రదాయ కలప ఇంధన వనరుల వినియోగం వల్ల ఒక  గిగాటన్ను కర్బన ఉద్గారాలు వెలువడతాయి. అలాగే నివాస ఘన ఇంధనాల వినియోగం ద్వారా 58 శాతం బ్లాక్ కర్బన ఉద్గారాలు వెలువడతాయి. ఘన జీవ ఇంధనాల అసంపూర్ణ దహనం ఫలితంగా ఇళ్లలో వాయు కాలుష్యం కూడా గణనీయంగా పెరిగిపోతుంది.

   ఈ సమస్యను లింగపరమైనదిగానూ కొన్ని పరిశోధనలు సూచించాయి. ముఖ్యంగా మహిళలు, బాలికలు ఈ ఘన ఇంధనాల దుష్ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారు. ఇక ఘన ఇంధనాలతో వంట ఫలితంగా ఐక్యరాజ్యసమితి నిర్దేశిత సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో ఐదింటిని సాధించడంలో జాప్యం ఏర్పడుతుందని కూడా పరిశోధనలు పేర్కొంటున్నాయి.

   ఈ నేపథ్యంలో ‘పిఎంయువై’ పథకం మహిళలకు ఆర్థికంగా-సామాజికంగా సాధికారత కల్పించింది. వంటగ్యాస్‌ సులభంగా లభ్యం కావడంతో వారు ఇకపై కట్టెలు లేదా ఇతర సంప్రదాయ ఇంధనాల వాడకంవల్ల ఎదురయ్యే బాధలు తప్పుతాయి. అంతేగాక ఈ ఇంధనాల సేకరణ కోసం చాలాదూరం వెళ్లాల్సి రావడంతోపాటు మోసుకొచ్చే శ్రమ తప్పుతుంది. వంటగ్యాస్‌ సౌలభ్యంవల్ల వారు సామాజిక జీవన కార్యకలాపాల్లో మరింత చురుగ్గా పాల్గొనగలరు. తద్వారా కుటుంబ అదనపు ఆదాయార్జన అవకాశాలు పెరుగుతాయి. మరోవైపు ఉజ్వల పథకంతో మహిళలకు భద్రత, రక్షణ సౌలభ్యం కూడా కలిగింది. ఆ మేరకు వారు కట్టెలు లేదా ఇతర ఇంధన వనరుల సేకరణ కోసం దూరప్రాంతాలకు ఒంటరిగా వెళ్లాల్సిన దురవస్థ తప్పింది.

వంటగ్యాస్‌ లభ్యత విస్తరణకు చర్యలు

  1. పహల్‌ (ప్రత్యక్ష ప్రయోజన బదిలీ): సబ్సిడీ ధరకు వంటగ్యాస్‌ సిలిండర్‌ అందించే బదులు, వాటిని మార్కెట్ ధరకు విక్రయించి, అనువర్తిత రాయితీ మొత్తం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆన్‌లైన్‌ పద్ధతిలో బదిలీ చేయబడుతోంది. దీనివల్ల నకిలీ ఖాతాల బెడద తప్పింది. అలాగే వాణిజ్య ప్రయోజనాల కోసం గృహ సిలిండర్ల చట్టవిరుద్ధ వినియోగం నిరోధంతో అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనం లభిస్తోంది.
  2. రాయితీ స్వచ్ఛంద త్యాగం: రాయితీలను అధికారికంగా రద్దుచేసే బదులు, ప్రజలే  స్వచ్ఛందంగా త్యాగం చేసేలా విస్తృత ప్రచారం ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో లక్షలాది వినియోగదారులు తమంతట తామే రాయితీని వదులుకున్నారు. ఇలా వదులుకున్న రాయితీ మొత్తం నిరుపేదల వంటగ్యాస్‌ సిలిండర్ల కొనుగోలుకు మళ్లించేందుకు ఉపయోగపడుతోంది.
  3. కోవిడ్‌-19 దిగ్బంధం సందర్భంగా 2020లో ప్రధానమంత్రి పేదల సంక్షేమ పథకం కింద ఉచితంగా వంటగ్యాస్‌ పంపిణీ పథకం అమలు చేయబడింది. దీనికింద ‘పిఎంయువై’ లబ్ధిదారులకు 14.17 కోట్ల వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.9,670.41 కోట్లు వెచ్చించింది.
  4. దేశంలో 2018-19నాటికి ‘పిఎంయువై’ లబ్ధిదారుల తలసరి గ్యాస్‌ సిలిండర్ల వినియోగం 3.01 కాగా, 2022-23లో 3.71కి పెరిగింది. వీరు ప్రస్తుతం (2022-23) ఏటా 35 కోట్లకుపైగా సిలిండర్లు తీసుకుంటున్నారు.

 

***



(Release ID: 1957251) Visitor Counter : 130