రక్షణ మంత్రిత్వ శాఖ
దేశ ప్రయోజనాలు కాపాడటానికి సాంకేతికంగా అభివృద్ధి సాధించిన సైనిక దళాలు కీలకమని రక్షణ మంత్రి అన్నారు
న్యూ ఢిల్లీలో గురువారం రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఓ) - విద్యారంగ ప్రముఖుల రెండు రోజుల సమాలోచన సదస్సును మంత్రి ప్రారంభించారు.
డి ఆర్ డి ఓ మరియు మేధావి వర్గం కలసికట్టుగా కృషి చేసి ఇండియాను రక్షణ సాంకేతిక రంగంలో అగ్రగామిగా మార్చాలని పిలుపు ఇచ్చారు
Posted On:
25 MAY 2023 2:00PM by PIB Hyderabad
దేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి సాంకేతికంగా అభివృద్ధి సాధించిన సైనిక దళాలు కీలకమని రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు. డి ఆర్ డి ఓ - విద్యారంగ ప్రముఖుల రెండు రోజుల సమాలోచన సదస్సును గురువారంనాడు ప్రారంభిస్తూ శ్రీ రాజ్ నాథ్ సింగ్ సరిహద్దుల్లో రెండింతల ముప్పును ఎదుర్కొంటున్న ఇండియా వంటి దేశానికి అటువంటి సైన్యం ఉండటం కీలకమని అన్నారు.
"ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సాయుధ దళాలలో ఇండియా ఒకటి. మన సైన్యం శౌర్యం, పరాక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలు మన సైనిక దళాలతో కలసి సంయుక్త విన్యాసాలు చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తాయి. అటువంటి పరిస్థితిలో దేశ ప్రయోజనాలను కాపాడేందుకు మనకు సాంకేతికంగా అభివృద్ధి చెందిన సైన్యం ఉండటం ఆవశ్యకం. సరిహద్దులలో జోడు ముప్పులు ఎదుర్కొంటున్న ఇండియా వంటి దేశానికి అది చాలా ముఖ్యమైనది" అని రక్షణ శాఖ మంత్రి అన్నారు.
సమాలోచన సదస్సు ఇతివృత్తం " డి ఆర్ డి ఓ - విద్యా సంస్థల భాగస్వామ్యం -- అవకాశాలు & సవాళ్లు" చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నదని అందువల్ల 21వ శతాబ్దంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ -- విద్యా సంస్థల పరస్పర భాగస్వామ్యంలో పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. "ఈ భాగస్వామ్యం ఇండియాను రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రగామి దేశంగా మార్చడానికి సహాయపడగలదు" అని ఆయన అన్నారు. సాధారణంగా అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సముపార్జన పరిశోధనాభివృద్ధి (ఆర్ & డి) ద్వారా జరుగుతుందని, ఏ దేశ అభివృద్ధిలోనైనా అది కీలకపాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి అన్నారు.
" పరిశోధన జరుపకుండా కొత్త టెక్నాలజీని దత్తత తీసుకోలేము. సాధారణ పదార్థాలను కూడా విలువైన వనరుగా మార్చే సామర్ధ్యం
ఆర్ & డి కి ఉంది. చరిత్రలో నాగరికతల అభివృద్ధిలో అదే కీలకమైన అంశం" అన్నారు. డి ఆర్ డి ఓ - విద్యా సంస్థల భాగస్వామ్యం ఫలితాలు అనేక కొత్త వనరులను ప్రోది చేయగలవని, అది మొత్తం దేశానికి ప్రయోజనకారి కాగలదని ఆయన అన్నారు. ఈ రెండింటి కూడిక 1+1=2 కాకుండా 1+1=11 కాగలదని మంత్రి అన్నారు.
ఈ ఇద్దరి కలయిక వల్ల సుప్రసిద్ధ విద్యా సంస్థలు ఐ ఐ ఎస్ సి, ఐ ఐ టిలు, ఎన్ ఐ టిలు ఇతర యూనివర్సిటీలకు చెందిన నిపుణులైన యువత డి ఆర్ డి ఓ లో చేరేందుకు అవకాశం ఉందని అన్నారు. మరొకవైపు విద్యాసంస్థలకు డి ఆర్ డి ఓ పరిశోధనాభివృద్ధి నిధి నుంచి ఆర్ధిక వనరులు సమకూరుతాయని అన్నారు. ఆ విధంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీలను పౌర, రక్షణ రంగ అవసరాలు తీర్చడానికి ఉపయోగించవచ్చని అన్నారు. ఈ సహజీవన సంబంధం దేశంలో అంకుర సంస్కృతిని మరింత పెంచడానికి తొడపడుతుందని మంత్రి అన్నారు.
ఈ సందర్బంగా విశిష్ట ప్రతిభ కనబరచిన శాస్త్రజ్ఞులను మంత్రి సత్కరించారు. రక్షణ పరిశోధనాభివృద్ధి శాఖ కార్యదర్శి, డి ఆర్ డి ఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్, రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డి, డైరెక్టర్ జనరల్ (టెక్నాలజీ మేనేజిమెంట్) శ్రీ హరిబాబు శ్రీవాత్సవ, శాస్త్ర సాంకేతిక శాఖ మాజీ కార్యదర్శి ప్రొఫెసర్ ఆశుతోష్ శర్మ, రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, డి ఆర్ డి ఓ సీనియర్ శాస్త్రజ్ఞులు మరియు విద్యాసంస్థలకు చెందిన మేధావి వర్గం హాజరయ్యారు.
డి ఆర్ డి ఓ అవసరాలు మరియు విద్యాసంస్థల సామర్ధ్యాల గురించి పరస్పర అవగాహనకు, చర్చలకు రెండు రోజుల సమాలోచన సదస్సు దోహదం చేస్తుంది. ఈ సభలో ఒక ప్లీనరీ మరియు నాలుగు సాంకేతిక సమావేశాలు -- వైమానికశాస్త్రము, నౌకా దళం, జీవ శాస్త్రాలు మరియు యుద్ధ సామాగ్రి గురించి --ఉంటాయి. సదస్సులో దేశంలోని నలుమూలల నుంచి 350 మంది సీనియర్ విద్యావేత్తలు హాజరవుతున్నారు.
*****
(Release ID: 1927518)
Visitor Counter : 124