పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

భారత జీ20 అధ్యక్షతన, భారత విధానాల రూపకల్పనలో సుస్థిరాభివృద్ధి ఎలా ప్రధానాంశంగా మారిందన్న విషయాన్ని జాతీయ ప్రాధాన్యత అంశమైన 'హరిత వృద్ధి' విధానం నిరూపిస్తోందని చెప్పిన శ్రీ భూపేందర్ యాదవ్


ప్రకృతితో కలిసి జీవించడం అనేది తరతరాలుగా భారతీయ తత్వంలో పాతుకుపోయింది, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన 'లైఫ్' నినాదంలో అది ప్రతిబింబిస్తుంది: శ్రీ యాదవ్

Posted On: 22 FEB 2023 5:50PM by PIB Hyderabad

ఈరోజు న్యూదిల్లీలో జరిగిన 'ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు2023' ప్రారంభోత్సవంలో భాగంగా, సుస్థిరాభివృద్ధి & వాతావరణ స్థితిస్థాపకతను ప్రధానాంశంగా చూసే దూరదృష్టి గల నాయకత్వం అనే అంశంపై కేంద్ర పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ కీలకోపన్యాసం చేశారు.

రిపబ్లిక్‌ ఆఫ్‌ గయానా ఉపాధ్యక్షుడు డా.భరత్ జగ్‌దేవ్‌, వాతావరణ మార్పులపై ప్రత్యేక రాయబారి & కాప్‌28 అధ్యక్షుడి హోదాలో ఉన్న డా. సుల్తాన్‌ అల్‌ జాబెర్‌, టీఆర్‌ఈఐ అధ్యక్షుడు శ్రీ నితిన్ దేశాయ్, టీఆర్‌ఈఐ డైరెక్టర్ జనరల్ శ్రీమతి విభా ధావన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ, గత సంవత్సరం తీసుకున్న అంశం & చర్చకు కొనసాగింపుగా, ఈ సంవత్సరం "మెయిన్ స్ట్రీమింగ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ అండ్ క్లైమేట్ రెసిలెన్స్ ఫర్ కలెక్టివ్ యాక్షన్" అనే అంశాన్ని తీసుకున్నామని, భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టినప్పటిన సరైన సమయంలో ఈ అంశం వచ్చిందని చెప్పారు. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన సమస్యలతో ప్రపంచం పోరాడుతున్న సమయంలో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు, ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి - పర్యావరణ పరిరక్షణ కలిసి ఎలా సాగుతాయన్న విషయంపై భారతదేశం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

ప్రకృతికి జరుగుతున్న నష్టాలను ఆపడం ద్వారా పర్యావరణ సామరస్యాన్ని తీసుకురావాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృక్పథం క్షేత్ర స్థాయిలో ప్రతిబింబిస్తోందని, ప్రాజెక్ట్‌ చీతాను విజయవంతంగా అమలు చేయడం భారత్‌లో ఉన్న అనేక ఉదాహరణల్లో ఒకటని శ్రీ యాదవ్ అన్నారు. దక్షిణాఫ్రికా నుంచి రెండో బృందం చీతాలను 18 ఫిబ్రవరి 2023న మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు విజయవంతంగా తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.

వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టాలు, భూ క్షయాన్ని ఎదుర్కోవడం అన్ని దేశ సరిహద్దులకు అతీతంగా మారిందని, అందువల్ల ఇది ఒక ప్రపంచ స్థాయి సవాలని శ్రీ యాదవ్ చెప్పారు. సాక్ష్య ఆధారిత విధానాల రూపకల్పన, అమలు ద్వారా, దేశీయంగా & అంతర్జాతీయంగా పర్యావరణ సమస్యలో భారత్‌ ఎప్పుడూ భాగం కాలేదని, కానీ పరిష్కారంలో మాత్రం గణనీయమైన భాగంగా మారిందని చెప్పారు.

ఈ నెల ప్రారంభంలో పార్లమెంట్‌లో సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2023 – 2024లోని నిబంధనల గురించి చెబుతూ, అనేక రంగాల్లో 'గ్రీన్ గ్రోత్‌'ను సంకల్పిస్తున్నామని, భవిష్యత్ వృద్ధి తప్పనిసరిగా హరితమయంగా ఉండాలనేది అంతర్లీన ఆలోచన అని శ్రీ యాదవ్‌ అన్నారు. "కేంద్ర బడ్జెట్‌లో 'గ్రీన్ గ్రోత్' అనే అంశం ప్రాధాన్యత అంశంగా ఉండటంతో, దూరదృష్టితో కూడిన విధానం ద్వారా భారత విధానాల రూపకల్పనలో సుస్థిరాభివృద్ధి ఎలా ప్రధానాంశంగా మారిందో నిరూపిస్తోంది" అని చెప్పారు.

వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి భారతదేశ నిబద్ధతకు సంబంధించి, షర్మ్ ఎల్ షేక్‌లో జరిగిన కాప్‌27లో దీర్ఘకాలిక తక్కువ ఉద్గార వ్యూహ పత్రాన్ని భారతదేశం ఇప్పటికే సమర్పించిందని, ఇది సీబీడీఆర్‌-ఆర్‌సీ సూత్రాలతో పాటు పర్యావరణ న్యాయం & సుస్థిర జీవనం అనే రెండు కీలక స్తంభాలపై ఆధారపడి ఉందని శ్రీ యాదవ్ చెప్పారు. దీంతో, కొత్త లేదా నవీకరించిన ఎల్‌టీ-లెడ్స్‌ సమర్పించిన 58 దేశాల జాబితాలో భారతదేశం చేరింది.

దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా, ముఖ్యంగా వాతావరణ స్థితిస్థాపకత దృష్ట్యా, ముఖ్యంగా సముద్ర మట్టం పెరుగుదల ప్రభావం పడే చిన్న ద్వీప సముదాయ దేశాలకు విలువ ఆధారిత అదనపు సమాచారాన్ని అందించడం ద్వారా భారత్‌ ప్రత్యేకంగా సహాయపడుతోందని కేంద్ర పర్యావరణ మంత్రి చెప్పారు. సీడీఆర్‌ఐ లేదా విపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాల బృందాన్ని భారత్‌ ఏర్పాటు చేసింది, పెంపొందించింది. మౌలిక సదుపాయాల రంగంలో నూతన ఆవిష్కరణలు, స్థితిస్థాపకత కోసం వివిధ సంస్థలు, వ్యక్తులను ప్రోత్సహిస్తూ భారతదేశం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న వర్గాల కోసం తీసుకొచ్చిన ఆ తరహా కార్యక్రమాల్లో "డ్రై కనెక్ట్" ఒకటి. స్థితిస్థాపక అవస్థాపనలో సవాళ్లను పరిష్కరించడానికి, విపత్తులను తట్టుకునే అవస్థాపనపై చర్య ఆధారిత అభ్యాసాలు, ఆవిష్కరణల వాతావరణాన్ని పెంపొందించే కొత్త విజ్ఞానం, కార్యాచరణ పరిష్కారాల సృష్టి కోసం ఉమ్మడి సభ్యత్వ సామూహిక మేధస్సును ఉపయోగించుకోవడానికి ఉద్దేశించిన వేదిక ఇది.

ప్రధాన మంత్రి సమక్షంలో కాప్‌26లో చేసిన ప్రకటనల ఆధారంగా, సీడీఆర్‌ఐలో భాగంగా ఐఆర్‌ఐఎస్‌ లేదా మౌలిక సదుపాయాల స్థితిస్థాపకత కలిగిన ద్వీప దేశాలకు స్థితిస్థాపకంగా, స్థిరంగా, సమగ్రమైన మౌలిక సదుపాయాల కోసం క్రమబద్ధ విధానం ద్వారా స్థిరమైన అభివృద్ధిని సాధించడం కీలకం అని శ్రీ యాదవ్ ఉద్ఘాటించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 10 సెషన్లలో 134 దేశాలు పాల్గొన్నాయని, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆందోళనలను చర్చించడానికి గ్లోబల్ సౌత్ ఒక వేదికగా నిలిచిందని శ్రీ యాదవ్ అన్నారు. దక్షిణ దేశాల గొంతుకగా మారడంలో భారతదేశ నాయకత్వానికి ఇది మరో నిదర్శనం.

భారతదేశ జాతీయ అభివృద్ధి పథంలో సుస్థిరాభివృద్ధిని ప్రధానాంశంగా చేర్చడంపై దృష్టి సారించిన ఉప-అంశంపై శ్రీ యాదవ్ మాట్లాడుతూ, భారతదేశం జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో, ప్రత్యేకించి 'యూఎన్‌ క్రిటికల్ డికేడ్ ఆఫ్ యాక్షన్‌'లో స్థిరమైన అభివృద్ధి గురించిన చర్చ ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని యాదవ్‌ చెప్పారు.

ప్రకృతితో సామరస్యంగా జీవించడం తరతరాలుగా భారతీయ తత్వంలో పాతుకుపోయిందని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూపొందించిన లైఫ్ లేదా 'లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్' మంత్రం కూడా దీనినే ప్రతిబింబిస్తుందని శ్రీ యాదవ్ అన్నారు. స్థిరమైన జీవనశైలికి దారితీసే వ్యక్తిగత ప్రవర్తనపై దృష్టి సారించే మంత్రం ప్రపంచ నాయకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నిపుణుల నుంచి ఆసక్తిని, ప్రశంసలను పొందింది. కాప్‌27లో షర్మ్ ఎల్ షేక్ అమలు ప్రణాళిక ప్రముఖ నిర్ణయాల్లోనూ చేరింది. భారతదేశ ఆధునిక ఎన్‌డీసీలో ప్రతిబింబించే 'వన్-వర్డ్ మాస్ మూవ్‌మెంట్' - 'లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్' వంటివి సంప్రదాయాలు, పరిరక్షణ, నియంత్రణ విలువల ఆధారంగా ఆరోగ్యకరమైన, స్థిరమైన జీవన విధానాన్ని ప్రపంచ సమాజంలో ప్రచారం చేయడంలో సహాయపడతాయి.

సుస్థిరాభివృద్ధిని పెంపొందించడంలో కీలకాంశం గురించి మాట్లాడిన శ్రీ యాదవ్, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ ఒక కొత్త నమూనాను అందిస్తుందని, ఉత్పత్తులు & ప్రక్రియల సమగ్ర వీక్షణ అవసరాన్ని ఇది నొక్కి చెబుతుందని అన్నారు. స్వావలంబన భారతదేశానికి కీలకమైన సుస్థిరాభివృద్ధికి ఇది దారి తీస్తుంది. ప్రభుత్వం చురుగ్గా విధానాలను రూపొందిస్తోందని, దేశాన్ని వృత్తాకార ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించేందుకు ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోందని శ్రీ యాదవ్ స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, ఈ-వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, నిర్మాణం & కూల్చివేతల వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, లోహాల పునర్వినియోగ విధానం వంటి వివిధ నిబంధనలను భారతదేశం ఇప్పటికే నోటిఫై చేసింది.

2023 ఫిబ్రవరి 9-11 తేదీల్లో బెంగళూరులో జరిగిన జీ20 మొదటి పర్యావరణ & వాతావరణ సుస్థిరత కార్యాచరణ బృందం సమావేశం గురించి శ్రీ యాదవ్ మాట్లాడుతూ, స్థిరమైన అభివృద్ధి & వాతావరణ స్థితిస్థాపకత అంశాలపై విస్తృతమైన చర్చలు జరిగాయని చెప్పారు. మూడు రోజులపాటు జరిగిన సమావేశాల్లో చర్చించిన అంశాలు:

  1. భూ క్షయాన్ని అరికట్టడం, పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణను వేగవంతం చేయడం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం
  2. స్థిరమైన, పర్యావరణ స్థితిస్థాపకత కలిగిన నీలి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం
  3. వనరుల సామర్థ్యం, వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం

ఈ అంశాలతో పాటు, వాతావరణ పరిరక్షణ చర్యలను వేగవంతం చేయడం, పర్యావరణాన్ని పరిరక్షించడంలో విజ్ఞానం, లోపాలు, మిషన్ లైఫ్ పాత్రపై కూడా జీ20 దేశాల ప్రతినిధులు చర్చించారని శ్రీ యాదవ్ చెప్పారు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ, వాతావరణ మార్పు, జీవ వైవిధ్య నష్టం, కాలుష్యం రూపంలోని మూడు సంక్షోభాలను ఎదుర్కోవడంలో భారతదేశం దేశీయంగా, అంతర్జాతీయ స్థాయుల్లో భారీ ప్రగతిని సాధిస్తోందని శ్రీ యాదవ్ చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్ధవంతమైన నాయకత్వంలో భారతదేశం 75 రామ్‌సర్ వెట్‌ల్యాండ్ సైట్‌లు, 33వ ఏనుగుల అభయారణ్యం, 53వ టైగర్ పులుల అభయారణ్యం, 12 బ్లూ ఫ్లాగ్ బీచ్‌లను గుర్తించింది, ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్ నిషేధాన్ని విజయవంతంగా అమలు చేసింది, దాని ఎన్‌డీసీని నవీకరించింది, రెండు దేశాల నుంచి విజయవంతంగా చీతాలను తిరిగి తీసుకొచ్చింది. షర్మ్ ఎల్ షేక్‌లో జరిగిన కాప్‌27, మాంట్రియల్‌లోని సీబీడీ కాప్‌15లో బలమైన, ధైర్యమైన నాయకత్వాన్ని ప్రదర్శించింది. భారతదేశ అభివృద్ధి పథం, విధాన రూపకల్పన ప్రక్రియ ప్రధానాంశాల్లో స్థిరమైన అభివృద్ధి & వాతావరణ స్థితిస్థాపకత ఉన్నాయని ఈ ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి.

ప్రభుత్వ & ప్రైవేటు రంగాలకు చెందిన అన్ని వర్గాలను భాగస్వాములుగా చేయడంలో ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు గత రెండు దశాబ్దాలుగా విజయవంతమైందని, అందుకే సుస్థిరాభివృద్ధి అంశంపై చర్చించడంలో అగ్రగామిగా ఉందని కేంద్ర పర్యావరణ మంత్రి చెప్పారు. సుస్థిరాభివృద్ధి ఆలోచనను సమర్థవంతంగా గ్రహించి, అమలు చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని మాటలను ఉటంకిస్తూ శ్రీ యాదవ్ తన ప్రసంగాన్ని ముగించారు:

"పేదలందరికీ సమానంగా ఇంధనం లభించడం మన పర్యావరణ విధానానికి కీలకాంశంగా ఉంది. భారతీయులు ఎప్పుడూ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నారు. మన సంస్కృతి, ఆచారాలు, దైనందిన పద్ధతులు, పంట పండుగలు ప్రకృతితో మనకున్న బలమైన బంధాన్ని ప్రదర్శిస్తాయి. తగ్గించడం, పునర్వినియోగించడం, పునరుద్ధరించడం, తిరిగి తయారు చేయడం భారతదేశ సాంస్కృతిక నీతిలో భాగం. మనం ఎప్పుడూ పాటించే వాతావరణ అనుకూల విధానాలు, అభ్యాసాల కోసం భారతదేశం కృషి చేస్తూనే ఉంటుంది” - శ్రీ నరేంద్ర మోదీ

ఈ సందర్భంగా, “జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ సమయంలో నిరోధించిన కర్బన ఉద్గారాల అంచనా” నివేదికను కూడా శ్రీ యాదవ్ విడుదల చేశారు. జాతీయ రహదారుల నిర్మాణంలో ప్రతి కిలోమీటరుకు నివారించదగిన కర్బన ఉద్గారాల పరిధిని ఈ నివేదిక అంచనా వేసింది. 

***



(Release ID: 1901623) Visitor Counter : 324


Read this release in: English , Urdu , Hindi , Punjabi