రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రహదారి భద్రతను మెరుగుపరచడానికి విస్తృతమైన రహదారి భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్న - ఎన్.హెచ్.ఏ.ఐ.

Posted On: 13 JAN 2023 3:54PM by PIB Hyderabad

జాతీయ రహదారులను మరింత సురక్షితంగా చేసేందుకు, వాటిపై వివిధ భద్రతా చర్యలు అంచనా వేసేందుకు, 'రహదారి భద్రతా వారోత్సవాలను పాటిస్తూ, ఎన్.హెచ్.ఏ.ఐ. కృషి చేస్తోంది.  రహదారి భద్రతా తనిఖీలు నిర్వహించడానికి ఎన్.హెచ్.ఏ.ఐ. విస్తృతమైన విధానాలు నిర్దేశించింది.  తనిఖీలను సులభతరం చేయడానికి, సిఫార్సులు అమలు చేయడానికి, భాగస్వాములు అందరికీ బాధ్యతలు కేటాయించింది. 

జాతీయ రహదారులపై ప్రణాళిక, నిర్మాణం, వివిధ కార్యకలాపాల నిర్వహణ దశల్లో ఎన్.హెచ్.ఏ.ఐ. భద్రతా తనిఖీలను నిర్వహిస్తోంది.  సురక్షితమైన రహదారుల ఇంజనీరింగు అధ్యయనాలలో నిష్ణాతులైన భద్రతా  తనిఖీ అధికారుల ద్వారా ఎన్.హెచ్.ఏ.ఐ. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 16,500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల భద్రతా తనిఖీలు చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో - 2022 డిసెంబర్, వరకు 19,300 కి.మీ. మేర భద్రతా ఆడిట్ చేయడం జరిగింది. 

భద్రతా తనిఖీ అధికారులు చేసిన సిఫార్సుల అమలును నిర్ధారించడానికి, ఎన్.హెచ్.ఏ.ఐ. ఒక వెబ్ ఆధారిత పోర్టల్ (డేటా లేక్) ను అభివృద్ధి చేసింది. డేటా లేక్‌ లోని భద్రతా సలహాదారుల ద్వారా 260 భద్రతా తనిఖీ నివేదికలు అప్‌-లోడ్ చేసి, వాటి అమలు కోసం పర్యవేక్షిస్తున్నారు.

వీటితో పాటు, సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డి.పి.ఆర్) సమర్పించే దశలోనే, అన్ని ప్రాజెక్టులకు, "థర్డ్-పార్టీ-రోడ్-సేఫ్టీ-ఆడిట్‌" ను, ఎన్.హెచ్.ఏ.ఐ. తప్పనిసరి చేసింది.  అన్ని కొత్త ప్రాజెక్టుల కోసం డి.పి.ఆర్. లను స్వతంత్ర భద్రతా సలహాదారుల బృందం ద్వారా సురక్షితంగా తనిఖీ చేయడం జరుగుతుంది. డిజైన్ తదుపరి దశల్లో భద్రతా ఆడిటర్ల సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.  అదేవిధంగా, అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నట్లుగా నిర్ధారించడానికి, ఎన్.హెచ్.ఏ.ఐ. కి చెందిన అంకితమైన రహదారి భద్రతా అధికారులు డి.పి.ఆర్. ల భద్రతా సమీక్ష నిర్వహిస్తారు.

జనావాసాల గుండా జాతీయ రహదారులు వెళ్లే చోట, భద్రతా తనిఖీలు, ప్రమాదాల వివరాల సమాచారం ఆధారంగా, కూడళ్ళను మెరుగుపరచడంతో పాటు, రాకపోకల రద్దీని తగ్గించే చర్యలను కూడా ఒక క్రమపద్ధతిలో చేపట్టడం జరుగుతోంది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో 6,179 ప్రదేశాలలో, అదే విధంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 లో 2,015 ప్రదేశాల్లో భద్రత కు అవసరమైన చర్యలు చేపట్టడం జరిగింది.  రాకపోకల రద్దీని నియంత్రించి, క్రమబద్ధీకరించడానికి వీలుగా, లైటింగ్, రహదారి చిహ్నాలు, భద్రతా అవరోధాలు, పాదచారుల రక్షణ కోసం కంచెలు, రంబుల్ స్ట్రిప్స్, రోడ్ల కూడళ్ళ వద్ద వేగాన్ని తగ్గించడానికి స్పీడ్ బ్రేకర్లు, స్పీడ్ కుషన్‌లు, రోడ్డుకు అడ్డంగా గుర్తులు మొదలైన వాటిని ఏర్పాటు చేయడం ద్వారా కూడళ్ళలో భద్రతను మెరుగుపరచడం జరుగుతోంది.  జాతీయ రహదారుల వెంబడి రోడ్డు పక్కన జరిగే ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి ఎన్.హెచ్.ఏ.ఐ. ట్రాఫిక్ ప్రభావాన్ని నియంత్రించే పరికరాలను నెలకొల్పుతోంది. 

పూర్తయిన 4/6 వరుసల జాతీయ రహదారులపై గ్రామీణ ప్రాంతాల్లో ప్యాసింజర్ క్రాస్ మూమెంట్ సౌకర్యాల నిర్మాణం కూడా ప్రారంభమైంది.  అలాగే, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పాదచారుల అండర్‌-పాస్, పాదచారుల సబ్‌-వే, వెహికల్ అండర్‌పాస్ వంటి సురక్షితమైన ప్రయాణీకుల క్రాసింగ్ సౌకర్యాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతోంది.  

 

****


(Release ID: 1891188)
Read this release in: English , Urdu , Hindi