కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ భేటీ!
కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతలో నిర్వహణ
Posted On:
23 DEC 2022 3:49PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఎన్.సి.ఎస్. పోర్టల్లో 3,600 జాబ్రోల్స్ వ్యవస్థ సిద్ధం.
కేంద్ర కార్మిక, ఉపాధికల్పనా మంత్రిత్వ శాఖ పోర్టల్ ఇ-శ్రమ్తో;
కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ పోర్టల్ ఉద్యమ్తో
కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ పోర్టల్ అసీమ్తో ఎన్.సి.ఎస్. పోర్టల్ అనుసంధానం పూర్తి.
27 రాష్ట్రాలు, అనేక ప్రైవేట్ పోర్టల్ల ఉద్యోగ సమాచార వ్యవస్థలతో ఎన్.సి.ఎస్. పోర్టల్ ఏకీకృతం
|
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖకు అనుబంధించిన పార్లమెంటరీ సలహా సంఘం సమావేశం 2022 డిసెంబరు 22న జరిగింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ ఈ సమావేశానికి హాజరయ్యారు. వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులు ఈ పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యులు సునీల్ కుమార్ మోండల్, సుమేదానంద సరస్వతి, డాక్టర్ ఉమేష్ జి. జాదవ్, సునీల్ కె. సోనీ, సుశీల్ కుమార్ గుప్తా, అహ్మద్ అష్ఫక్ కరీం, భగీరథ్ చౌధరి, రాజమణి పటేల్, వినయ్ డి. టెండూల్కర్ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖ పరిధిలోని "జాతీయ ఉద్యోగ సేవల (ఎన్.సి.ఎస్.) పోర్టల్" విస్తరణపై ఈ సమావేశంలో చర్చించారు. పోర్టల్ పనితీరు తదితర అంశాలను డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఇ) అమిత్ నిర్మల్ సమావేశంలో వివరించారు.

కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఎన్.సి.ఎస్. పోర్టల్ను గురించి ఈ సమావేశంలో సభ్యులకు వివరించారు. ఈ పోర్టల్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015, జూలై 20న ప్రారంభించినట్టు కమిటీకి తెలియజేశారు. ఎన్.సి.ఎస్. పోర్టల్ అనేది కేవలం ఉద్యోగ సేవలందించే పోర్టల్ మాత్రమే కాదని, దేశంలోని ఉద్యోగార్ధులందరికీ ఉద్యోగ, వృత్తి జీవితం, అభ్యున్నతిపై సలహాలిందించే పోర్టల్ అని వివరించారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాలతో పాటు ప్రైవేట్ పోర్టల్లతో వివిధ అనుసంధానాల ద్వారా ఈ పోర్టల్ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఉద్యోగార్థులకు సలహాలు, , వృత్తిపరమైన మార్గదర్శకత్వం, ఆన్లైన్-ఆఫ్లైన్ పద్ధతిలో జాబ్ మేళాలు నిర్వహించడం తదితర ఉద్యోగ, వృత్తి సంబంధిత సహాయ సేవలనే కాకుండా, డిజిటల్ నైపుణ్యాలు-సాఫ్ట్-స్కిల్స్పై ఆన్లైన్ ఉపాధి శిక్షణలను ప్రారంభించడం తదితర కార్యకలాపాలను ఈ పోర్టల్ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా జిల్లా స్థాయిలో ఉద్యోగ, వృత్తి సంబంధమైన సేవలను అందించడానికి ప్రభుత్వం 370 మోడల్ కెరీర్ సెంటర్లను కూడా ఆమోదించింది.

అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోని ఉన్న ఉద్యోగాల కోసం కొత్త మాడ్యూల్ను 2022, ఏప్రిల్ నెలలో పోర్టల్లో పొందుపరిచారు. ఎన్.సి.ఎస్. పోర్టల్లో అందుబాటులో ఉన్న అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను ఈ పోర్టల్లో పోస్ట్ చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో నమోదైన నియామక ఏజెంట్ సంస్థల ప్రక్రియను ఈ మాడ్యూల్ సులభతరం చేస్తుంది. ఉద్యోగం కోసం అన్వేషించేవారు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను శోధించేందుకు, దరఖాస్తు చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు ఎన్.సి.ఎస్. పోర్టల్లో ఉంటాయి.
ఇక, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖకు చెందిన ఇ-శ్రమ్ పోర్టల్తో, కేంద్ర సూక్ష్మ, చిన్న-మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యమ్ (Udyam) పోర్టల్తో, కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ పరిధిలోని అసీమ్ (ASEEM) పోర్టల్తో ఎన్.సి.ఎస్. పోర్టల్ అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తయినట్టు 2022-23సంవత్సరపు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఎన్.సి.ఎస్. పోర్టల్ను ఉద్యమ్ (Udyam) పోర్టల్తో ఏకీకృతం చేయడం వల్ల, Udyamలో నమోదైన ప్రతి సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థ (ఎం.ఎస్.ఎం.ఇ.) ఇపుడు ఎన్.సి.ఎస్. పోర్టల్లో యాజమాన్య సంస్థగా నమోదైంది. దీనితో ఈ తరహా యజమాన్యసంస్థలన్నీ తమ ఉద్యోగ ఖాళీలను ఎన్.సి.ఎస్. పోర్టల్లో పొందుపరిచేందుకు అవకాశం ఏర్పడింది. ఇప్పటివరకు 3.36 లక్షలకు పైగా ఎం.ఎస్.ఎం.ఇ. యాజమాన్య సంస్థలు ఎన్.సి.ఎస్. పోర్టల్లో నమోదు చేసుకున్నారు. ఇ-శ్రమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నవారు 10 లక్షల మంది ఇప్పటివరకూ ఎన్.సి.ఎస్.లో అనుసంధానం పొందారు. ఇ-శ్రమ్ కార్మికులు ఎన్.సి.ఎస్. పోర్టల్ ద్వారా మరింత మెరుగైన ఉద్యోగాలను పొందుతున్నారు.
ఎన్.సి.ఎస్. పోర్టల్ ఇప్పటికే 27 రాష్ట్రాలతో అనుసంధానమైంది. అలాగే, Monster India, Naukari.com, Freshersworld, Merajob వంటి అనేక ప్రైవేట్ పోర్టల్లతో కూడా ఏకీకృతమైంది. దీనితో ఎన్.సి.ఎస్. పోర్టల్లో ఉద్యోగ ఖాళీల సమాచార వ్యవస్థ మరింత మెరుగుపడింది. ఉద్యోగార్ధులు తమ సామర్థ్యాలకు తగిన ఉద్యోగాలతో అనుసంధానం కావడానికి ఇది దోహదపడింది.
డిజిటల్ నైపుణ్యాలు, సాఫ్ట్-స్కిల్స్పై ఆన్లైన్ ద్వారా ఉపాధి శిక్షణలను కూడా ఎన్.సి.ఎస్. అందిస్తోంది. ఉద్యోగార్ధులు, ఉపాధి కల్పనా అధికారులు, ఉద్యోగ, వృత్తిపరమైన మార్గదర్శకత్వం కోసం 3,600కు పైగా ఉద్యోగ పాత్రలకు సంబంధించిన సమాచార వ్యవస్థ కూడా ఎన్.సి.ఎస్. పోర్టల్కు అందుబాటులో ఉంది. ఉద్యోగ, వృత్తిపరంగా నాణ్యమైన కౌన్సెలింగ్/మార్గదర్శకత్వం ఉద్యోగార్థులకు అందించడానికి పోర్టల్లో దాదాపు 900 మంది అర్హులైన కెరీర్ కౌన్సెలర్ల వ్యవస్థకూడా ఎన్.సి.ఎస్. పోర్టల్లో అందుబాటులో ఉంది.
గత ఏడేళ్లుగా పోర్టల్ ఎంతో అభివృద్ధి చెందిందని, మరిన్ని ఏకీకరణలతో ప్రపంచ స్థాయి దృక్పథాన్ని అందించడానికి, భాగస్వామ్యవర్గాల వారందరికీ మరింత మెరుగైన సేవలను అందించడానికి అందుబాటులో ఉన్న కొత్త సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని కూడా సలహా సంఘం సమావేశంలో పాల్గొన్న సభ్యులు అభిప్రాయపడ్డారు.
యువతకు అవసరానికి తగినట్టుగా ఉపాధి కల్పనా సేవలను, ఇతర సంబంధిత సేవలను అందించడమే లక్ష్యంగా ఎన్.పి.ఎస్. పోర్టల్ను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం చొరవ ప్రశంసనీయమని సమావేశంలో పాల్గొన్న పార్లమెంటు సభ్యులు అన్నారు. జాబ్ మేళాలు నిర్వహించడం, ప్లేస్మెంట్ను ట్రాక్ చేయడం, ఎంపికకు, తుది నియామకానికి మధ్య వ్యవధిని తగ్గించడం, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ కేంద్రాలతో ఎన్.సి.ఎస్. పోర్టల్ను అనుసంధానం చేయడం, ఎన్.సి.ఎస్. పోర్టల్పై అవగాహన పెంచడం తదితర అంశాలతో పాటుగా, ఇతర కార్యకలాపాలకు సంబంధించి, సభ్యులు ఈ సమావేశంలో అనేక సూచనలు చేశారు. సభ్యుల విలువైన సూచనలపట్ల కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ధన్యవాదాలు తెలుపుతూ సలహా సంఘం సమావేశాన్ని ముగించారు.
******
(Release ID: 1886424)