శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సీఎస్‌ఐఆర్‌ ద్వారా "ఒక వారం, ఒక ప్రయోగశాల" కార్యక్రమాన్ని 2023 జనవరి 6 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్


దేశవ్యాప్తంగా సీఎస్‌ఐఆర్‌కు చెందిన 37 ముఖ్య ప్రయోగశాలలు/సంస్థలు ప్రతి వారం ఒకదాని తర్వాత ఒకటి తమ ప్రత్యేక ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతులను భారతదేశ ప్రజల కోసం ప్రదర్శిస్తాయి

Posted On: 17 DEC 2022 5:01PM by PIB Hyderabad
  • యువ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, విద్యాసంస్థలు, పరిశ్రమల ఆలోచనలకు స్ఫూర్తినిస్తూ, సాంకేతిక అంకుర సంస్థలు ద్వారా అవకాశాలను అన్వేషించడానికి ఉద్దేశించిన కార్యక్రమం "ఒక వారం, ఒక ప్రయోగశాల"

    న్యూదిల్లీలో జరిగిన సీఎస్‌ఐఆర్‌ 200వ పాలకమండలి సమావేశంలో మంత్రి ప్రసంగించారు; మహిళా శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలకు ఆర్థిక సాయం ప్రతిపాదనలపై ప్రత్యేకంగా మాట్లాడారు

    సీఎస్‌ఐఆర్‌ సాంకేతిక పురోగతులు, ఆవిష్కరణలను పాఠశాలల స్థాయుల్లోకి తీసుకెళ్లడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించేలని కోరుతూ త్వరలో కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాస్తానని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

    సంస్థ కొత్త ట్యాగ్‌లైన్‌ "సీఎస్‌ఐఆర్‌-ది ఇన్నోవేషన్ ఇంజిన్ ఆఫ్ ఇండియా"ను మంత్రి ఆవిష్కరించారు

జనవరి 6, 2023 నుంచి దేశవ్యాప్తంగా "ఒక వారం, ఒక ప్రయోగశాల" కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విజ్ఞానం & సాంకేతికత శాఖ మంత్రి, సీఎస్‌ఐఆర్‌ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్) ఉపాధ్యక్షుడు డా.జితేంద్ర సింగ్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా సీఎస్‌ఐఆర్‌కు చెందిన 37 ముఖ్య ప్రయోగశాలలు/సంస్థలు ప్రతి వారం ఒకదాని తర్వాత ఒకటి తమ ప్రత్యేక ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతులను భారతదేశ ప్రజల కోసం ప్రదర్శిస్తాయి.

న్యూదిల్లీలో జరిగిన సీఎస్‌ఐఆర్‌ 200వ పాలకమండలి సమావేశంలో మంత్రి ప్రసంగించారు. యువ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, విద్యాసంస్థలు, పరిశ్రమల ఆలోచనలకు స్ఫూర్తినిస్తూ, సాంకేతిక అంకుర సంస్థలు ద్వారా అవకాశాలను వెతకడానికి ఉద్దేశించిన కార్యక్రమం "ఒక వారం, ఒక ప్రయోగశాల" అని చెప్పారు.

సీఎస్‌ఐఆర్‌ అధ్యక్షుడిగా ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, 2022 అక్టోబర్ 15న సీఎస్‌ఐఆర్‌ సొసైటీ సమావేశానికి అధ్యక్షత వహించారని, సీఎస్‌ఐఆర్‌ గత 80 ఏళ్లుగా చేస్తున్న కృషిని అభినందించారని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేసుకున్నారు.

2042లో సీఎస్‌ఐఆర్‌ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, అప్పుడు ఒక విజన్‌ను అభివృద్ధి చేయాలని సొసైటీ సమావేశంలో ప్రధాన మంత్రి సీఎస్‌ఐఆర్‌ను కోరారు. గత 80 సంవత్సరాల ప్రయాణాన్ని భద్రపరచాల్సిన ప్రాముఖ్యతను కూడా వివరించారు. సాధించిన పురోగతిని సమీక్షించడానికి, అభివృద్ధి చేయాల్సిన రంగాలను గుర్తించడంలో అది సహాయ పడుతుందని వివరించారు. అన్ని ప్రయోగశాలలు తరచుగా వర్చువల్ సమావేశాలను నిర్వహించుకుంటే, ఒకరి నుంచి మరొకరు అనుభవాలు, కొత్త విషయాలను నేర్చుకోవచ్చని కూడా సూచించారు.

ఇవాళ జరిగిన సీఎస్‌ఐఆర్‌ 200వ పాలకమండలి సమావేశంలో, మహిళా శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలకు ఆర్థిక సాయం చేసే ప్రతిపాదనలు ఉన్నాయని డా.జితేంద్ర సింగ్‌ ప్రకటించారు. ప్రస్తుతం విరామం తీసుకుంటున్నా, పరిశోధనల కోసం తిరిగి రావడానికి, కెరీర్‌ను పునఃప్రారంభించాలన్న ఆసక్తి ఉన్న వారికి కూడా గ్రాంట్‌ ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు. సీఎస్‌ఐఆర్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా, “సీఎస్‌ఐఆర్‌-ది ఇన్నోవేషన్ ఇంజిన్ ఆఫ్ ఇండియా” అనే కొత్త ట్యాగ్‌లైన్‌ను మంత్రి ఆవిష్కరించరు.

2023 ఏప్రిల్ 01 నుంచి అన్ని ప్రయోగశాలల్లో కాగిత రహిత ఈ-కార్యాలయం అమలు, 2022-2023 సంవత్సరం కోసం నిర్వాహక స్థాయి సిబ్బందికి ఈ-పనితీరు మదింపు వ్యవస్థకు కూడా ఆమోదం లభించింది.

విజ్ఞాన శాస్త్రం, పరిశోధనలను భవిష్యత్‌ ఎంపికగా కొనసాగించాలనుకునే విద్యార్థులు, ఆశావహుల కోసం, సీఎస్‌ఐఆర్‌ సాంకేతిక పురోగతులు, ఆవిష్కరణలను పాఠశాలల స్థాయుల్లోకి తీసుకెళ్లడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించేలని కోరుతూ త్వరలో కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాస్తానని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

సీఎస్‌ఐఆర్‌కు చెందిన అనేక జాతీయ ప్రయోగశాలలు, సంస్థల ఉమ్మడి సహకారం మీద సీఎస్‌ఐఆర్‌ వారసత్వం నిర్మింతమైందని డా.జితేంద్ర సింగ్ చెప్పారు. సీఎస్‌ఐఆర్‌లోని ప్రతి ప్రయోగశాల విశిష్టమైనదని, విభిన్న రంగాల్లో ప్రత్యేకతలు కలిగి ఉంటుందని అన్నారు.

ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా ఆవిర్భవించేలా సంస్థను పటిష్ట పరచాలని 4,500 మందికి పైగా సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్తలకు డా.జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. హైడ్రోజన్ ఇంధనం, కార్బన్ సేకరణ & నిల్వ, సౌరశక్తిని ఒడిసిపట్టి వినియోగించుకోవడం, ప్లాస్టిక్ పునర్వినియోగం, చౌక ఇంధనాల నిల్వ వంటి అభివృద్ధి చెందున్న రంగాల్లో ఆవిష్కరణల మీద దృష్టి సారించాలని సూచించారు.

199 నుంచి 200వ పాలకమండలి సమావేశాల మధ్యకాలంలో సీఎస్‌ఐఆర్‌ కార్యకలాపాలు, విజయాల గురించి సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్ జనరల్ డా.ఎన్‌ కళైసెల్వి వివరించారు.

పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ అజయ్ సూద్, భారత ప్రభుత్వ పీఎస్‌ఏ; డా.సమీర్ వి కామత్, కార్యదర్శి, డీవోడీ & ఛైర్మన్, డీఆర్‌డీవో; గుర్దీప్ సింగ్, ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఎన్‌టీపీసీ; డా.శ్రీనివాస రెడ్డి, డైరెక్టర్, సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ; డా.ఎన్‌ అనడవల్లి, డైరెక్టర్, సీఎస్‌ఐఆర్‌-ఎస్‌ఈఆర్‌సీ; ఆర్థిక కార్యదర్శి, కార్యదర్శి (వ్యయం); శ్రీ బాబా ఎ కళ్యాణి, చైర్మన్ & ఎండీ, కల్యాణి గ్రూప్; ప్రొఫెసర్ కె విజయ రాఘవన్, ప్రభుత్వ పూర్వ పీఎస్ఏ; డా.విజయ్ భట్కర్; డా.కె.ఎన్.వ్యాస్, కార్యదర్శి, డీఏఈ; ఏఈసీ చైర్మన్, డా.ఎన్ కలైసెల్వి, సీఎస్‌ఐఆర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డ్రోన్లు, హెలి-బోర్న్ సాంకేతికత, మురుగునీటి శుభ్రపరిచే అత్యాధునిక యంత్రాలు, అరోమా మిషన్ వంటి రంగాల్లో సీఎస్‌ఐఆర్‌ సాధించిన పురోగతులు పరిశోధన, విద్యాసంస్థలు, పరిశ్రమల కోసం భారీ అవకాశాలను తెరిచాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. జల శక్తి మంత్రిత్వ శాఖ సహకారంతో అత్యాధునిక హెలి-బోర్న్ సర్వే సాంకేతికతను రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో గత సంవత్సరం వినియోగించామని; ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్‌ అయిన “ఇంటింటికి కొళాయి నీళ్లు” కార్యక్రమంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి చెప్పారు. అదేవిధంగా, సీఎస్‌ఐఆర్‌ అభివృద్ధి చేసిన మురుగునీటి శుభ్రపరిచే యాంత్రిక వ్యవస్థ స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతుందని తెలిపారు.

1942 సెప్టెంబర్ 26న సీఎస్‌ఐఆర్‌ను స్థాపించారు. సొసైటీల నమోదు చట్టం, 1860 ప్రకారం సీఎస్‌ఐఆర్‌ సొసైటీగా నమోదైంది. 09 మార్చి 1942న పాలకమండలి మొదటి సమావేశం జరిగింది. అజెండా అంశాలతో పాటు కౌన్సిల్‌ కోసం ఉప-చట్టాలను ఈ సమావేశంలో రూపొందించారు.

<><><><><>



(Release ID: 1884649) Visitor Counter : 153