రక్షణ మంత్రిత్వ శాఖ
సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ఉదారంగా సహకారం అందించాలని న్యూఢిల్లీలో జరిగిన సిఎస్ఆర్ కాన్క్లేవ్ సందర్భంగా రక్షణ మంత్రి విజ్ఞప్తి చేశారు
సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం ప్రతి పౌరుని నైతిక మరియు సమిష్టి బాధ్యత
"జాతీయ భద్రతకు భరోసా ఇచ్చే సైనికుల శ్రేయస్సు ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు అది అందరి కర్తవ్యం"
మాజీ సైనికులకు ప్రైవేట్ రంగం ఉద్యోగాలు కల్పించాలి..ఎందుకంటే వారు దేశం యొక్క విలువైన ఆస్తులు: శ్రీ రాజ్నాథ్ సింగ్
Posted On:
29 NOV 2022 1:27PM by PIB Hyderabad
సైనికులు మరియు వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రతి పౌరుడు తన నైతిక బాధ్యతగా సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ, మాజీ సైనికుల సంక్షేమ శాఖ ఈ రోజు న్యూ ఢిల్లీలో నిర్వహించిన సాయుధ దళాల పతాక దినోత్సవం సిఎస్ఆర్ కాన్క్లేవ్లో రక్షణ మంత్రి ప్రసంగిస్తూ..దేశ సమగ్రత మరియు సార్వభౌమత్వాన్ని కాపాడిన పదవీ విరమణ చేసిన అలాగే ప్రస్తుతం సేవలందిస్తున్న సాయుధ దళాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
నాగాలాండ్లోని కోహిమా వార్ మెమోరియల్పై 'మీరు ఇంటికి వెళ్లినప్పుడు మా గురించి వారికి చెప్పండి అలాగే మీ రేపటి కోసం మేము మా ఈరోజు ఇచ్చాము' అని వ్రాసిన సైనికుడి సందేశాన్ని రక్షణ మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సైనికులను, వారి కుటుంబాలను ఆదుకోవడం దేశ సమిష్టి బాధ్యత అని ఆయన అన్నారు.
“స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి యుద్ధాలను గెలవడానికి లేదా సరిహద్దు ఆవల నుండి ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి మన సైనికులు అన్ని సవాళ్లకు ధైర్యం అలాగే సత్వరమే తగిన సమాధానం ఇచ్చారు. ఈ ప్రక్రియలో వారిలో చాలా మంది అత్యున్నత త్యాగం చేసారు. చాలా మంది శారీరకంగా వికలాంగులయ్యారు. అయినా వారి కుటుంబ బాధ్యత అంతా వారిపైనే ఉంటుంది. కాబట్టి మన సైనికులను మరియు వారి కుటుంబాలను సాధ్యమైన ప్రతి విధంగా ముందుకు వచ్చి ఆదుకోవడం మన బాధ్యత. సరిహద్దుల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే మన వీర సైనికుల వల్లే మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం, నిర్భయంగా జీవిస్తున్నాం’’ అని శ్రీ రాజ్నాథ్ సింగ్ అన్నారు.
35 నుండి 40 సంవత్సరాల వయస్సులో పెద్ద సంఖ్యలో సైనిక సిబ్బంది పదవీ విరమణ చేస్తారు. తద్వారా సాయుధ దళాల యువత ప్రొఫైల్ నిర్వహించబడుతుందని కూడా రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అందువల్ల మాజీ సైనికులు మరియు వారిపై ఆధారపడిన వారికి ప్రజలకు అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి ఇది మరో కారణమని ఆయన వివరించారు.
దేశంలోని సైనికుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఆ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని శ్రీ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీ రాజ్నాథ్ సింగ్ హోం మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర సాయుధ పోలీసు బలగాల అధికారులు మరియు జవాన్ల సంక్షేమం కోసం ప్రారంభించిన ‘భారత్ కే వీర్’ పోర్టల్ కూడా ఈ కార్యక్రమాలలో ఉంది. ఇటీవలే, సాయుధ దళాల యుద్ధ ప్రాణనష్టాల సంక్షేమ నిధికి సహకారం కోసం రక్షణ మంత్రి ద్వారా ‘మా భారతి కే సపూట్’ వెబ్సైట్ ( www.maabharatikesapoot.mod.gov.in ) ప్రారంభించబడింది.
"మన జాతీయ భద్రతకు భరోసా ఇచ్చే సైనికుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది అందరి కర్తవ్యం" అని రక్షణ మంత్రి నొక్కి చెప్పారు. దేశ భద్రత పటిష్టంగా లేని దేశంలో పరిశ్రమలు, వ్యాపారాలు ఎప్పటికీ అభివృద్ధి చెందవని ఆయన ఉద్ఘాటించారు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద కార్పొరేట్ దాతల మద్దతును అభినందిస్తూ ఫండ్లో గణనీయమైన పెరుగుదలకు దారితీసిందని, సైనికులు మరియు దేశం యొక్క శ్రేయస్సు కోసం మరింత సహకారం అందించాలని ఆయన ఉద్బోధించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన అగ్రశ్రేణి కార్పొరేట్ అధిపతులతో శ్రీ రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ రంగ శక్తిని అలాగే దేశ పురోగతిలో దాని పాత్రను ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. గతంలో రక్షణ రంగంలో ప్రైవేట్ కంపెనీలకు అనుమతి లేదని కానీ ఇప్పుడు వాటిని స్వాగతించడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన ఈ మాజీ సైనికులు అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకొని నైపుణ్యంతో ఉపయోగించుకోగలరని అందువల్ల ప్రతి సంవత్సరం అతి చిన్న వయస్సులో పదవీ విరమణ పొందుతున్న సుమారు 60 వేల మంది సైనికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయివేటు రంగంలో కోరారు. మాజీ సైనికుల సంక్షేమ శాఖ అనుభవజ్ఞులకు ఉపాధి కల్పించే పనిని చేస్తోందని ఆ దిశగా పరిశ్రమలు ప్రత్యేక సహకారం అందించగలవని ఆయన అన్నారు.
"ప్రభుత్వం మాజీ సైనికులను ఒక బాధ్యతగా పరిగణించదు. మేము వారిని విలువైన ఆస్తులుగా చూస్తాము. వారు క్రమశిక్షణ మరియు సమాజానికి స్ఫూర్తిని మాత్రమే కాకుండా, శ్రామిక శక్తిగా కూడా సమానంగా ప్రభావవంతంగా ఉంటారు. వారిని చేర్చుకోవడం ద్వారా ప్రైవేట్ కంపెనీలు తమ ఉత్పాదకతను పెంచుతాయి. అంతేగాకుండా ఈ మాజీ సైనికులు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి సహాయపడతాయి” అని శ్రీ రాజ్నాథ్ సింగ్ అన్నారు.
ఈ సందర్భంగా రక్షా మంత్రి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ కోసం కొత్త వెబ్సైట్ ( www.affdf.gov.in ) ను ప్రారంభించారు. ఫండ్కు ఆన్లైన్ సహకారాన్ని ప్రోత్సహించడానికి అభివృద్ధి చేయబడిన ఈ పోర్టల్ ఇంటరాక్టివ్ మరియు యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్. సాయుధ దళాల పతాక దినోత్సవం కోసం ఈ ఏడాది ప్రచార సంబంధించిన గీతాన్ని కూడా ఆయన విడుదల చేశారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్, మదర్ డెయిరీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐఫౌండేషన్, ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్,ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్తో సహా ఫండ్కు మద్దతుదారులుగా ఉన్న ప్రముఖ సిఎస్ఆర్ కంట్రిబ్యూటర్లను కూడా ఆయన సత్కరించారు.
ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, సెక్రటరీ (మాజీ సైనికుల సంక్షేమం) శ్రీ విజయ్ కుమార్ సింగ్, రక్షణశాకు చెందిన ఇతర సీనియర్ అధికారులు,సిఎస్ఆర్ సోదర సంఘాల సభ్యులు మరియు సాయుధ దళానికి చెందిన రిటైర్డ్ సిబ్బంది హాజరయ్యారు.
నేపథ్యం:
వికలాంగులతో పాటు యుద్ధ వితంతువులు, అమరవీరులైన సైనికులు మరియు మాజీ సైనికుల సంక్షేమం మరియు పునరావాసం కోసం మాజీ సైనికుల సంక్షేమ శాఖ పని చేస్తోంది. వారి గుర్తించిన వ్యక్తిగత అవసరాలైన పెన్యూరీ గ్రాంట్, పిల్లల విద్యా ఖర్చులు, అంత్యక్రియలకు ఆర్థిక సహాయం, వైద్య ఖర్చులు, అనాథ/వికలాంగ పిల్లలకు ఆర్ధికసాయం వంటివి అందజేస్తుంది. ఈ సహాయం సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ నుండి అందించబడుతుంది. దీని కోసం ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న జరుపుకునే ఏఎఫ్ఎఫ్డిలో సాధారణ ప్రజల నుండి విరాళాలు అందుకుంటారు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80జి(5)(vi) ప్రకారం ఫండ్కు అందించే విరాళాలు ఆదాయపు పన్ను నుండి మినహాయించబడ్డాయి.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధికి విరాళంగా రూ. 34 కోట్లు అందాయి. పెరుగుతున్న ఆర్థిక సహాయం అవసరాలను తీర్చడానికి నిధికి విరాళాలను పెంచడానికి సమిష్టి కృషి అవసరం. కింది బ్యాంక్ ఖాతాలలో చెక్కు/డిడి/ఎన్ఈఎఫ్టి/ఆర్టీజీఎస్ ద్వారా ఈ నిధికి విరాళాలు అందించవచ్చు:
క్రమ సంఖ్య
|
బ్యాంక్ పేరు & చిరునామా
|
ఖాతా సంఖ్య
|
ఐఎఫ్ఎస్సి కోడ్
|
1
|
పంజాబ్ నేషనల్ బ్యాంక్,
సేవ భవన్ బ్రాంచ్,
ఆర్కే పురం , న్యూఢిల్లీ-110066
|
3083000100179875
|
F'UNB0308300
|
2
|
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సేవింగ్ అకౌంట్ )
ఆర్కే పురం , న్యూఢిల్లీ-110066
|
34420400623
|
SBIN0001076
|
3
|
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కరెంట్ అకౌంట్)
ఆర్కే పురం , న్యూఢిల్లీ-110066
|
40601079720
|
SBIN0001076
|
4
|
ఐసీఐసీఐ బ్యాంక్,
ఐడీఏ హౌస్, సెక్టార్-4
ఆర్కే పురం , న్యూఢిల్లీ-110022
|
182401001380
|
ICIC0001824
|
***
(Release ID: 1879777)
Visitor Counter : 187