వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

రోజ్ గార్ మేళా-II లో ఉద్యోగాల పొందిన 71,000 మంది యువతకు నియామక పత్రాలు అందజేత కర్మయోగి ప్రారంభం మాడ్యూల్ ప్రారంభం


అన్ని రంగాల్లో యువతకు సరికొత్త అవకాశాలు .. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

యువతకు ఉపాధి సాధికారత కల్పించి, దేశాభివృద్ధిలో భాగస్వాములను చేస్తుంది.. ప్రధానమంత్రి
ఉపాధి మేళా అనేది యువతను శక్తివంతం చేయడానికి, వారిని దేశాభివృద్ధిలో ఉత్ప్రేరకాలు గా మార్చే ప్రయత్నం – ప్రధానమంత్రి

యువత బలం, పెట్టుబడి దేశాభివృద్ధికి మూలధనం - శ్రీ తోమర్

Posted On: 22 NOV 2022 4:10PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి రోజ్‌గార్ మేళా కింద ఉద్యోగాలు పొందిన  71,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలు  అందించే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు.  కర్మయోగి ప్రారంభ మాడ్యూల్‌ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి శిక్షణ ఇచ్చే లక్ష్యంతో కర్మయోగి ప్రారంభ మాడ్యూల్‌ను అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ నరేంద్ర మోదీ యువతకు అనేక అవకాశాలను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. స్వయం ఉపాధి కోసం అంకుర సంస్థలు, అంతరిక్షం నుంచి డ్రోన్లు లాంటి అనేక  రంగాలు యువత అన్ని     రంగాల్లో  పురోభివృద్ధి సాధించేందుకు అవకాశం అందిస్తున్నాయని అన్నారు. యువతకు సాధికారత కల్పించి దేశాభివృద్ధిలో వారిని భాగస్వామ్యులను చేయాలన్న లక్ష్యంతో రోజ్ గార్ మేళాను ప్రారంభించామని ప్రధానమంత్రి తెలిపారు. దేశం వివిధ వివిధ ప్రాంతాల్లో ఈ రోజు 45 చోట్ల ఉద్యోగ మేళాలు జరిగాయి. భోపాల్ లో జరిగిన ఉద్యోగ మేళాలో కేంద్ర గ్రామీణ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ తోమర్ దేశానికి బలం, శక్తి, పెట్టుబడి, ఆస్తి యువత అని అన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధానమంత్రి ఈ రోజు 71000 కు పైగా యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందించామని వెల్లడించారు. ఈరోజు అనేక కుటుంబాల్లో ఆనందం నింపిన ప్రభుత్వ చర్య నూతన శకానికి నాంది పలికింది అని అన్నారు. ధన్‌తేరస్‌ రోజున కేంద్ర ప్రభుత్వం యువతకు 75 వేల నియామక పత్రాలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి  పనిచేస్తోందనడానికి ఈరోజు జరిగిన  జాబ్ మేళా నిదర్శనమని ప్రధాని అన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడు ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహిస్తూనే ఉంటాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, లడఖ్‌, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌, డామన్‌ అండ్‌ డయ్యూ, దాద్రా నగర్‌ హవేలీ, చండీగఢ్‌ రాష్ట్రాల్లో వేలాది మంది యువకులకు నియామక పత్రాలు అందించడం పట్ల ప్రధానమంత్రి హర్షం  వ్యక్తం చేశారు.గోవా, త్రిపురల్లో కూడా రాబోయే కొద్ది రోజుల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తాయి.  ఈ అద్భుతమైన విజయానికి కారణం  డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని  ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశ  యువతకు సాధికారత కల్పించడానికి ఎప్పటికప్పుడు  ఉద్యోగ  మేళాలు నిర్వహిస్తామని శ్రీ నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.  

 

దేశానికి అతి పెద్ద బలం యువత అని ప్రధానమంత్రి అన్నారు. యువత శక్తి సామర్ధ్యాలు పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిని శ్రీ మోదీ అభినందించారు. ముఖ్యమైన అమృత కాలంలో తమపై గురుతర బాధ్యత ఉందని  గుర్తించి విధులు నిర్వర్తించాలని సూచించారు. అమృత కాలంలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా తమ పాత్రను, విధులను సమగ్రంగా అర్థం చేసుకుని విధులు నిర్వర్తించే సామర్థ్యాన్ని పెంపొందించడంపై నిరంతరం దృష్టి సారించాలని ఆయన వారికి సలహా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూపొందించిన కర్మయోగి  వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ నైపుణ్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ప్రధానమంత్రి అన్నారు. మహమ్మారి మరియు యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ, ఈ క్లిష్ట సమయాల్లో కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు భారతదేశ వృద్ధి మార్గం గురించి ఆశాజనకంగా ఉన్నారని ప్రధాని అన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సేవల రంగంలో  ఒక ప్రధాన శక్తిగా ఆవిర్భవించిన  భారతదేశం త్వరలో ప్రపంచ  తయారీ కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది అని   ప్రధాని అన్నారు. పిఎల్ఐ లాంటి పథకాలు దేశానికి అవసరమైన శిక్షణ పొందిన యువతను సిద్ధం చేస్తున్నాయని అన్నారు.  పిఎల్ఐ  పథకం కింద దాదాపు 60,00,000 ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. మేక్ ఇన్ ఇండియా, ఓకల్ ఫర్ లోకల్, లోకల్ తో గ్లోబల్ లాంటి కార్యక్రమాలు నూతన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని ప్రధాని అన్నారు. యువత నివసిస్తున్న ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రావడం శుభ పరిమాణం అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దీనివల్ల యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా తాము నివసిస్తున్న ప్రాంతాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తారని అన్నారు.  

అంకుర సంస్థల నుంచి స్వయం ఉపాధి, అంతరిక్ష రంగం వరకు నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఉపాధి అవకాశాలను శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. దేశంలో దాదాపు 80,000 అంకుర సంస్థలు యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తూ ఉపాధి అందిస్తున్నాయని అన్నారు. స్వమిత్ర పథకం , రక్షణ,  రంగం, వైద్య రంగం, క్రిమిసంహారక రంగాలలో డ్రోన్ల వాడకం పెరుగుతున్నదని చెప్పిన శ్రీ నరేంద్ర మోదీ దీనివల్ల కూడా నూతన ఉపాధి అవకాశాలు వస్తున్నాయని అన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించడాన్ని శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని అన్నారు. ఇటీవల ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్ ను ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు. పరిశోధన, ఆవిష్కరణ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో దేశంలో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగాయని శ్రీ నరేంద్ర మోదీ  అన్నారు. 

భోపాల్ లోని సశస్త్ర సీమా బాల్ అకాడమీ లో జరిగిన ఉద్యోగ మేళాలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీ తోమర్ సాంకేతిక పరిజ్ఞానం అమలులో దేశం అభివృద్ధి పథంలో ఉందని అన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి యువత వేగంగా అలవాటు పడుతున్నదని మంత్రి అన్నారు. జూన్ నెలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన విధంగా ప్రతి నెలా దాదాపు 75000 మందికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన అమలు జరుగుతున్నదని అన్నారు. 10,00,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్య సాధన కోసం ప్రతి నెలా ఉద్యోగ మేళాలు జరుగుతాయని మంత్రి వెల్లడించారు. అయితే, ప్రభుత్వం మాత్రమే ఉపాధి కల్పించలేదన్న వాస్తవాన్ని యువత గుర్తించాలని అన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా లాంటి కార్యక్రమాలు యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని మంత్రి వివరించారు. దీనితో పాటు ప్రైవేటు రంగంలో కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయని అన్నారు.  అన్ని అవకాశాలు ఉపయోగించుకుని యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద కోటిన్నర మంది యువకులకు శిక్షణ ఇచ్చామని అన్నారు. శిక్షణ పొందిన వారిలో 80,00,000 మందికి అర్హతకు తగిన ఉద్యోగాలు లభించాయని శ్రీ తోమర్ తెలిపారు. బ్యాంకుల సహకారంతో నిర్వహిస్తున్న గ్రామీణ శిక్షణా సంస్థల ద్వారా శిక్షణ, రుణాలు అందజేసి యువతను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. 

 

స్వయం సహాయక సంఘాల సభ్యులుగా   పని చేస్తూ దేశంలో  8,00,00,000 మంది మహిళలు జీవనోపాధి పొందుతున్నారు అని మంత్రి తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు   బ్యాంకులు భారీ రుణాలు అందించాయని, అయితే వారి ఎన్‌పిఎ రేటు 2 శాతం కంటే తక్కువగా ఉందని శ్రీ తోమర్ చెప్పారు. వేలకొద్దీ కొత్త స్టార్టప్‌లు దేశంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయని, ప్రతి స్టార్టప్ 5-10 మందికి ఉపాధిని కల్పిస్తోందని, స్టార్టప్‌ల ద్వారా నవ భారతదేశ నిర్మాణ పయనిస్తున్నామని చెప్పారు.

ఏ రంగంలో పనిచేస్తున్నా చిత్తశుద్ధి అంకిత భావంతో పనిచేయడం నేటి అవసరం అని మంత్రి అన్నారు. రాబోయే కాలంలో  దేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా మార్చేందుకు నేను చేస్తున్న కృషి ఎంతగానో దోహద పడుతుంది అన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.  విద్యార్థి స్ఫూర్తి ఎంత దృఢంగా ఉంటే వారి జీవితం అంత అర్థవంతంగా ఉంటుందని శ్రీ తోమర్ వ్యాఖ్యానించారు. 

 

ఎస్ఎస్ బి  అకాడమీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ సోమిత్ జోషి అతిథులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో భోపాల్‌లోని ఎయిమ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కల్నల్‌ అజిత్‌ కుమార్‌, భారతీయ రైల్వే సీనియర్‌ డీపీఓ అజయ్‌ కుమార్‌ దీక్షిత్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కమాండెంట్ శ్రీ అజిత్ కుమార్ రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు.

 

***



(Release ID: 1878121) Visitor Counter : 136


Read this release in: English , Urdu , Manipuri