రైల్వే మంత్రిత్వ శాఖ
జన్ జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా రైల్ భవన్లో భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్
జన్ జాతీయ గౌరవ్ దివస్ను భారతీయ రైల్వేలు దేశభక్తితో జరుపుకున్నాయి
Posted On:
15 NOV 2022 8:21PM by PIB Hyderabad
జన్ జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా రైల్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు "బిర్సా ముండా" జయంతి అయిన నవంబర్ 15ని 'జన్ జాతీయ గౌరవ్ దివస్'గా జరుపాలని 2021 నుంచి భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాకుండా సంఘ సంస్కర్త, గిరిజన ఉద్యమానికి నాయకత్వం వహించిన నేత. బ్రిటిష్ ప్రభుత్వ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉల్గులాన్ (తిరుగుబాటు) పేరిట గిరిజన ఉద్యమం సాగింది. తమ జాతి సాంస్కృతిక మూలాలు అర్థం చేసుకునేలా, ఐక్యత పెంపొందించేలా గిరిజనులను ప్రోత్సహించినందున ఆయన్ను ధర్తి అబ్బా అని కూడా పిలుస్తారు.
భారతీయ రైల్వేల వ్యాప్తంగా జన్ జాతీయ గౌరవ్ దివస్ను దేశభక్తితో జరుపుకున్నారు. ప్రధాన రైల్వే స్టేషన్లలో డిజిటల్ బ్యానర్లను ప్రదర్శించారు. జన్ జాతీయ గౌరవ్ దివస్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ రైల్వే స్టేషన్లలోని పబ్లిక్ అడ్రస్ సిస్టంల మీద ఆడియో క్లిప్లు కూడా వినిపించారు. దీంతోపాటు ఆన్లైన్ క్విజ్లు, వ్యాసాలు రాయడం, చిత్రలేఖన పోటీలను కూడా ప్రాంతీయ రైల్వేలు నిర్వహించాయి. ప్రాంతీయ రైల్వేల సాంస్కృతిక బృందాలు జానపద గీతాలను ఆలపించాయి.
గిరిజన ప్రాంతాలకు అనుసంధానత పెంచేలా, అక్కడి ప్రజల వ్యాపార అవకాశాలకు ఊతమిచ్చేలా రైల్వేలు గత 8 సంవత్సరాల్లో గిరిజన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు చేపట్టాయి.
***
(Release ID: 1876330)