సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్య, జీవనోపాధి తో ముడి పెట్టకుండా డిగ్రీ విద్య అందించే విధంగా జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ-2020) రూపకల్పన .. డాక్టర్ జితేంద్ర సింగ్


ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ కృష్ణ మహావిద్యాలయ లో విద్యార్థులు, యువతను ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ జితేంద్ర సింగ్

వ్యవసాయ, పాడి ఆధారిత అంకుర సంస్థల స్థాపనకు పచ్చని, సారవంతమైన పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అపార అవకాశాలు .. డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 27 OCT 2022 2:58PM by PIB Hyderabad

  విద్య, జీవనోపాధి తో ముడి పెట్టకుండా డిగ్రీ విద్య అందించే విధంగా జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ-2020)కి రూపకల్పన జరిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్ర, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు,పెన్షన్లు, అణుశాస్త్రం, అంతరిక్ష శాఖ సహాయ (స్వతంత్ర బాధ్యత) మంత్రి డాక్టర్  జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 

 ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోని ఠాకుర్‌ద్వార్‌లోని కృష్ణ మహావిద్యాలయంలో విద్యార్థులు మరియు యువతను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ వ్యవసాయ, పాడి ఆధారిత అంకుర సంస్థల స్థాపనకు పచ్చని, సారవంతమైన పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అపార అవకాశాలు అన్నారు. భారతదేశంలో యువత, విద్యార్థులకు  నూతన ఉపాధి అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో  ఎన్ఈపీ-2020 అంకుర సంస్థల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.  

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచనల మేరకు రూపొందిన ఎన్ఈపీ-2020 ప్రపంచ ప్రమాణాల మేరకు భారతదేశ విద్యా విధానాన్ని అభివృద్ధి చేస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో అమలు జరిగిన  అతిపెద్ద సంస్కరణగా ఎన్ఈపీ-2020ని డాక్టర్ జితేంద్ర సింగ్  అభివర్ణించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని  ప్రగతిశీల నూతన విద్యా విధానం రూపొందిందని అన్నారు.    అభివృద్ధి చెందుతున్న భారతదేశం  21వ శతాబ్దపు  అవసరాలు, పరిస్థితులకు  అనుగుణంగా విద్యా విధానం ఉందని మంత్రి అన్నారు. కేవలం డిగ్రీ పైనే దృష్టి పెట్టకుండా విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి  ఉన్న ప్రతిభ, జ్ఞానం, నైపుణ్యం, ప్రతిభను వెలికి తీసే అంశానికి  తగిన ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

విద్యతో డిగ్రీలను ముడి పెట్టడం వల్ల దేశ  విద్యా వ్యవస్థ, సమాజం తీవ్రంగా నష్టపోయిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.ఇంతవరకు అమలు జరిగిన విధానం వల్ల  విద్యావంతులైన నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. బహుళ ప్రవేశ/నిష్క్రమణ ఎంపికను కలిగి ఉండే  ఎన్ఈపీ -2020  విద్యార్థులకు విద్యాపరమైన సౌలభ్యాన్ని అందిస్తుంది. నూతన విద్యా విధానం వల్ల విద్యార్థులు తమ ప్రతిభ, అభిరుచికి అనుగుణంగా  వివిధ సమయాల్లో వివిధ ఉపాధి అవకాశాలు  పొందే సానుకూల అవకాశం కలిగి ఉంటారని ఆయన అన్నారు.

 జీవితంలో విజయం సాధించేందుకు విద్యార్థులు  బహుళ నైపుణ్యాలను అలవర్చుకోవాలని  డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. స్కిల్ ఇండియా మిషన్‌ విద్యార్థులకు అనేక అవకాశాలను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. అత్యాధునిక నైపుణ్యాలు కలిగి ఉన్నవారు  ప్రపంచంలో అద్భుతాలు చేయగలుగుతారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దీనికి  అనేక ఉదాహరణలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. 

దేశంలో అభివృద్ధి చెందుతున్న అంకుర  (స్టార్టప్) రంగంలో జీవనోపాధి అవకాశాలను అన్వేషించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ విద్యార్థులు మరియు యువతను కోరారు. ఈ ఏడాది ఆగస్టులో  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి కల్పన మరియు ఆర్థిక కార్యకలాపాల కోసం 4,000 కోట్ల రూపాయలను ప్రత్యేక నిధులు కేటాయించిందని మంత్రి వెల్లడించారు.  స్టార్ట్-అప్‌లకు అవసరమైన మూలధనాన్ని  అందించడానికి మొదటిసారిగా ' యూపీ   ఇన్నోవేషన్ ఫండ్ ' ఏర్పాటు అయ్యిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్-అప్ ఇండియా అభివృద్ధికి 2015లో పిలుపు ఇచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను  డాక్టర్ జితేంద్ర సింగ్ కొనియాడారు.ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు యువతలో స్ఫూర్తి నింపిందని అన్నారు. యువత ముందు రావడంతో దేశంలో అంకుర సంస్థల సంఖ్య భారీగా పెరిగిందని అన్నారు. భారతదేశంలో  2014లో కేవలం 350  స్టార్టప్‌లు మాత్రమే ఉన్నాయని అన్నారు.   2022 నాటికి వీటి సంఖ్య 80,000కి చేరిందని అన్నారు. అంకుర సంస్థల్లో  105 పైగా  యునికార్న్‌ సంస్థలు ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 

2023 నాటికి ప్రతి జిల్లాలో కనీసం ఒక ఇంక్యుబేటర్ ఏర్పాటు చేయాలన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం పట్ల డాక్టర్ జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 జిల్లాల్లో 47 ఇంక్యుబేటర్లు పనిచేస్తున్నాయి.  స్టార్టప్‌ల పోటీలో  ఉత్తరప్రదేశ్ వేగంగా దూసుకుపోతోందని మంత్రి అన్నారు.ఈ రోజు నాటికి రాష్ట్రంలో 6,500 కంటే ఎక్కువ స్టార్టప్‌లు నమోదు చేసుకున్నాయని  ఆయన చెప్పారు. డ్రోన్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు  రాష్ట్రంలో రెండు ఎక్స్‌లెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఐఐటీ-కాన్పూర్‌లో ఒక ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటవుతుంది. 

నోయిడా స్టార్టప్‌లకు అత్యంత ప్రాధాన్య గమ్యస్థానంగా మారిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. నోయిడా తర్వాత ఘజియాబాద్, ఆగ్రా, లక్నో మరియు పూర్వాంచల్ ప్రాంతంలోని గోరఖ్‌పూర్‌లో అంకుర సంస్థలు ఎక్కువగా వస్తున్నాయని వివరించారు.  వినూత్న ఆలోచనలు స్టార్టప్‌లను ప్రారంభించేందుకు పశ్చిమ యుపిలోని యువత ముందుకు రావాలని మంత్రి సూచించారు. పచ్చని, సారవంతమైన భూములు కలిగి ఉన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో వ్యవసాయ, పాడి ఆధారిత  స్టార్టప్‌ల స్థాపనకు అనువైన ప్రాంతంగా ఉంటుందని ఆయన అన్నారు. స్టార్టప్‌ల  వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అందిస్తుందని డాక్టర్మం జితేంద్ర సింగ్ హామీ  ఇచ్చారు.

***


(Release ID: 1871475)