వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
దేశీయంగా వంట నూనెల ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్రం కీలక చర్య
- దిగుమతులపై కస్టమ్ డ్యూటీ రాయితీని మార్చి 2023 వరకు పొడిగింపు
Posted On:
02 OCT 2022 9:57AM by PIB Hyderabad
పేర్కొన్న వంట నూనెలపై ఇప్పటికే ఉన్న రాయితీ దిగుమతి సుంకాలను మార్చి 31, 2023 వరకు పొడిగిస్తూ పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (సీబీఐసీ) నోటిఫికేషన్ను జారీ చేసింది. 31 ఆగస్ట్, 2022 తేదీన పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ కేంద్ర బోర్డు నోటిఫికేషన్ నెం. 46/2022-కస్టమ్స్ ద్వారా ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయ సరఫరాను పెంచడం, ధరలను అదుపులో ఉంచడం లక్ష్యంగా ఈ చర్య తీసుకోంది. తాజా చర్యతో వంట నూనెల దిగుమతిపై రాయితీ కస్టమ్స్ సుంకం మరో 6 నెలలు పొడిగించబడింది, అంటే ఈ పొడగింపు కొత్త గడువు మార్చి 2023గా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా వంట నూనెల ధరల పతనం కారణంగా ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా ధరలు తగ్గడం, దిగుమతి సుంకాలు తగ్గడంతో, భారత దేశంలో వంట నూనెల రిటైల్ ధరలు గణనీయంగా పడిపోయాయి. ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలిన్, ఆర్బీడీ పామాయిల్, ముడి సోయాబీన్ నూనెలు, రిఫైన్డ్ సోయాబీన్ నూనెలు, ముడి సన్ఫ్లవర్ ఆయిల్ మరియు రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్పై ప్రస్తుత అమలులో ఉన్న సుంకం మార్చి 31, 2023 వరకు మారదు. పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ తదితర క్రూడ్ రకాలపై దిగుమతి సుంకం ప్రస్తుతం సున్నాగా ఉంది. అయితే, 5 శాతం మేర అగ్రిసెస్ మరియు 10 శాతం సాంఘిక సంక్షేమ సెస్లను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఈ మూడు వంట నూనెల ముడి సరుకుల దిగుమతిపై సమర్థవంతమైన సుంకం 5.5 శాతానికి చేరుకుంది. శుద్ధి చేసిన పామోలిన్ మరియు శుద్ధి చేసిన పామాయిల్పై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 12.5 శాతం కాగా, సాంఘిక సంక్షేమ సెస్ 10 శాతంగా ఉంది. దీంతో సమర్థవంతమైన సుంకం 13.75 శాతం. శుద్ధి చేసిన సోయాబీన్ మరియు సన్ఫ్లవర్ ఆయిల్పై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 17.5 శాతం మరియు 10 శాతం సాంఘిక సంక్షేమ సెస్ను పరిగణనలోకి తీసుకుంటే, ప్రభావవంతమైన సుంకం 19.25 శాతానికి చేరుకుంటుంది.
***
(Release ID: 1864690)