శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారతదేశంలో పెట్టుబడులకు ఇదే సరైన తరుణం!
న్యూయార్క్లోని భారతీయులకు
కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు...
ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానంగా
భారతదేశం వేగంగా మారుతోందన్న కేంద్రమంత్రి
భారత సంతతి ప్రముఖులతో
న్యూయార్క్లో జితంద్ర సమావేశం..
గత 8ఏళ్ల విధాన సంస్కరణలతో
సులభతర వాణిజ్య నిర్వహణలో భారత్ ర్యాంకు
గణనీయంగా మెరుగుపడిందని వెల్లడి.
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం
భారత్ ర్యాంకు 142నుంచి 63కు చేరిందన్న జితేంద్ర
దేశంలోని స్టార్టప్ బూమ్లో పెట్టుబడుల అవకాశాలు
అన్వేషించాలని ఎన్.ఆర్.ఐ.లకు,
పి.ఐ.ఒ.లకు పిలుపు
జాతీయ విద్యా విధానం ఆవిష్కరణతో
భారత్లో అవకాశాలు సిద్ధంగా ఉన్నాయని
అమెరికా వర్సిటీలకు పిలుపు
Posted On:
25 SEP 2022 1:05PM by PIB Hyderabad
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయ (ఇన్చార్జి) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు న్యూయార్క్ నగరంలోని ప్రవాస భారతీయులతో సమావేశం జరిపారు. ప్రపంచానికి పెట్టుబడి గమ్యస్థానంగా భారతదేశం వేగంగా మారుతోందని, దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే "అత్యుత్తమైన తరుణం" అని ఆయన వారికి పిలుపునిచ్చారు. కేంద్ర సహాయమంత్రి హోదాలో భూగోళ శాస్త్రాలు, ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు-పెన్షన్ల మంత్రిత్వ శాఖలను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. న్యూయార్క్లో తన గౌరవార్థం నిర్వహించిన పౌర సన్మానం సందర్భంగా భారతీయ సంతతి ప్రముఖులతో ఆయన ముచ్చటించారు. గత ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ చేపట్టిన వ్యాపార అనుకూల సంస్కరణలు, సమ్మతికోసం అనుమతుల ఆవశ్యకత తగ్గింపు, వెనుకటి తేదీనుంచి అమలులోకి వచ్చే పన్ను విధానం తొలగింపు, కార్పొరేట్ పన్ను సరళీకరణ వంటి సానుకూల అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం "సులభతర వాణిజ్య నిర్వహణలో భారతదేశం ర్యాంకు మెరుగుపడిందని, 2014వ సంవత్సరంలో 142గా ఉన్న భారతదేశం ర్యాంకు 2022లో 63కు చేరుకుందని ఆయన అన్నారు.
పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్లో జరిగిన "ప్రపంచ స్థాయి స్వచ్ఛ ఇంధన కార్యాచరణ వేదిక - 2022"లో ఉమ్మడి మంత్రిత్వ శాఖల స్థాయి ప్లీనరీ సమావేశం (సి.ఇ.ఎం.13), మిషన్ ఇన్నోవేషన్ (ఎం.ఐ.-7) కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చిన అనంతరం న్యూయార్క్లోని భారతీయ ప్రవాసులతో కేంద్రమంత్రి మాట్లాడారు. 2022, సెప్టెంబరు 21 నుండి 23వ తేదీ వరకు జరిగిన ఇంధన శిఖరాగ్ర సమావేశంలో విద్యుత్, నూతన-పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, సైన్స్-టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తరఫున ఉన్నత-స్థాయి ఉమ్మడి భారతీయ మంత్రిత్వ ప్రతినిధి బృందానికి జితేంద్ర సింగ్ నాయకత్వం వహించారు. వివిధ రౌండ్టేబుల్ సమావేశాల్లో, ఉమ్మడి ప్లీనరీ సమావేశాల్లో జరిగిన చర్చల్లో కూడా ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛమైన ఇంధన కార్యక్రమాలు, వాతావరణ చర్యలపై భారతదేశం తరఫున అభిప్రాయాన్ని ఆయా సమావేశాల్లో వివరించారు.

ప్రవాస భారతీయులు, (ఎన్.ఆర్.ఐ.లు) భారతీయ సంతతి వ్యక్తులు (పి.ఐ.ఒ.లు) కూడా ముందుకు వచ్చి, భారతదేశంలో గొప్ప స్టార్టప్ సంస్థల ఏర్పాటు అవకాశాలను అన్వేషించవలసిందిగా ఆహ్వానించారు, భారతదేశంలో స్టార్టప్ కంపెనీల విజయం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 77,000కు పైగా స్టార్టప్లు, 105 యూనికార్న్ స్థాయి స్టార్టప్లతో, భారతదేశ ఆవిష్కర్తలు, ఇంక్యుబేటర్లు, వ్యవస్థాపకులు తమకంటూ ఒక ముద్ర వేస్తున్నారని, ఇది భారతదేశంలోని అవకాశాలను తరచి చూసేందుకు ప్రేరణ ఇచ్చి, ప్రోత్సహించవచ్చని జితేంద్ర సింగ్ అన్నారు. 5జీ, కృత్రిమ మేధో పరిజ్ఞానం (ఎ.ఐ.), డ్రోన్లు, సెమీకండక్టర్లు, బ్లాక్ చైన్, హరిత ఇంధనం, అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ...ఇలా వృద్ధికి అవకాశం ఉన్న రంగాలపై దేశంలో ప్రాధాన్యంత పెరుగుతు ఉందని కేంద్ర మంత్రి తెలిపారు-
2020వ సంవత్సరపు జాతీయ విద్యా విధానాన్ని(ఎన్.ఇ.పి.ని) గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. నూతన విద్యావిధానం నేపథ్యంలో విశ్వవిద్యాలయం-విశ్వవిద్యాలయం మధ్య అనుసంధానం, ఉమ్మడి విద్యా కార్యక్రమాలు, క్రెడిట్ పోర్టబిలిటీ, పరిశోధన భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు. దేశంలో క్యాంపస్లను ఏర్పాటు చేసే విదేశీ విశ్వవిద్యాలయాలకు భారతదేశం ఆహ్వానం పలుకుతోందని, ఈ అవకాశాలను అమెరికన్ విశ్వవిద్యాలయాలు సద్వినియోగం చేసుకుంటాయని తాము ఆశిస్తున్నామని అన్నారు. భాగస్వామ్య విలువలతో కూడిన రెండు ప్రజాస్వామ్య దేశాలుగా, విజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం బలమైన భాగస్వామ్యానికి కీలకమని జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. అమెరికాలోని భారతీయ విద్యార్థులు ఇందులో అంతర్భాగంగా ఉన్నారని అన్నారు, అలాగే విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల మధ్య సంబంధాలు కూడా ఇరువైపులా ఉన్నాయని, అమెరికాలో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యావేత్తలు, పరిశోధనా విద్యార్థులు కూడా ఉన్నారని అన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థులు రెండవ అతిపెద్ద విదేశీ సమూహమని, వారిలోనూ ఎక్కువ మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్-ఎస్.టి.ఇ.ఎం.) కోర్సులలో నిపుణులుగా పేర్లు నమోదు చేసుకున్నవారే ఎక్కువని, ఈ అంశమే వారిని అమెరికాలో ప్రత్యేకంగా నిలబెట్టిందని మంత్రి అన్నారు. ఉభయదేశాల మధ్య విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, శ్రేయస్సు కొనసాగింపునకు వారు దోహదపడతారని అన్నారు.

రెండు దేశాల మధ్య సాకేతిక పరిజ్ఞాన, పరిశోధనా బంధం, డిజిటల్ యుగానికి, విజ్ఞాన ఆర్థిక వ్యవస్థకు తగిన శక్తినివ్వడానికి, హరిత గ్రహం నిర్మాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ రోజు, గూగుల్ మరియు దాని మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐ.బి.ఎం., ఆల్ఫాబెట్, ట్విట్టర్, ఫెడెక్స్, నెట్యాప్, స్టార్బక్స్ వంటి ఫార్చూన్ 500 కంపెనీలలో చాలా వరకు భారతీయులు నాయకత్వ బాధ్యతలు వహించడమో లేదా సీనియర్ మేనేజిమెంటు విభాగంలో ముఖ్యమైన పాత్ర పోషించడమో జరుగుతోందని, ఇది మనకు, దేశానికి సంతోషదాయకమని కేంద్రమంత్రి అన్నారు.
21వ శతాబ్దపు నిర్దేశిత భాగస్వామ్యానికి మరో రూపంగా భారతదేశం-అమెరికా సంబంధాలు ఆవిర్భవించాయని, ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి సరుకుల ఎగుమతులు 417.81 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అంతకు మునుపటి ఆర్థిక సంవత్సరంలో నమోదైన 291.18 బిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల కంటే ఈ వృద్ధి 43.18 శాతం పెరిగిందని అన్నారు. సరుకుల ఎగుమతుల్లో 400 బిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయిని దాటడం, భారతదేశం తన ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడం ఇదే తొలిసారి అని, ప్రపంచ స్థాయి సంస్థలు తమ సరఫరా వ్యవస్థలను వైవిధ్యపరచాలని, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలని యోచిస్తున్నందున ప్రస్తుతం భారతదేశం విశ్వసనీయమైన భాగస్వామ్య దేశంగా మారిందని ఆయన అన్నారు.

భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని దేశంలోనేకాక, ప్రపంచ వ్యాప్తంగా కూడా జరుపుకుంటోందని, శక్తివంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అద్భుతమైన ప్రయాణాన్నికొనసాగిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రసంగం చివర్లో పేర్కొన్నారు. కొత్త ఆకాంక్షలకు, ఆశయాలకు భారతీయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని భారతీయ ప్రవాసులకు చెప్పారు. పురోగతి, అభివృద్ధి స్వర్ణయుగమైన 'అమృతకాల్' దిశగా భారతదేశం సాగుతోందని. కాన్సులేట్ సహకారంతో భారతీయ సంఘాల సమాఖ్య (ఎఫ్.ఐ.ఎ.) 2022 ఆగస్టు 21న న్యూయార్క్ నగరంలో అతిపెద్ద స్థాయిలో ఇండియా డే కవాతును నిర్వహించడం చాలా సంతోషదాయకమని అన్నారు, భారతదేశ వైవిధ్యం, కళలు, ఆవిష్కరణలు, క్రీడా విజయాలు, మరెన్నో వేడుకల్లో చేతులు కలపాలని, ఒక దేశంగా భారత్ మరింత ముందుకు పురోగమించడానికి సహకరించాలని ప్రవాస భారతీయ ప్రముఖులకు పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయి స్వచ్ఛ ఇంధన వేదిక సమావేశంలో పాల్గొనడానికి, ప్రముఖ విద్యావేత్తలతో పాటు భారతీయ ప్రవాసులతో అర్ధవంతమైన చర్చల్లో పాలు పంచుకోవడానికి అమెరికాలో 5 రోజులు జరిపిన పర్యటన ఫలవంతమైన అనంతరం కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తిరికి స్వదేశానికి బయలుదేరారు.
<><><>
(Release ID: 1862105)