యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
బచేంద్రీపాల్ సారథ్యంలోని ఫిట్ 50+ బృందానికి సత్కారం!
అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా సన్మానం
సరిహద్దుల్లో ఫిట్నెస్ కార్యక్రమాల
నిర్వహణకు కేంద్రమంత్రి పిలుపు
Posted On:
02 AUG 2022 7:46PM by PIB Hyderabad
ఫిట్ @ 50 ప్లస్ పేరిట 2022వ సంవత్సరపు హిమాలయ యాత్ర సాహసోపేతంగా జరిపినందుకు యాబైఏళ్లు దాటిన మహిళల బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మంగళంవారం న్యూఢిల్లీలో సత్కరించారు. సుప్రసిద్ధ పర్వతారోహకురాలు బచేంద్రీ పాల్ నాయకత్వంలోని ఈ బృందానికి న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియంలో సన్మానం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బచేంద్రీపాల్ నాయకత్వంలో చేపట్టిన ఈ యాత్రను క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి సుజాతా చతుర్వేది మార్చి 9వ తేదీన పతాకం ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
అరుణాచల్ ప్రదేశ్లో, భారత, మయన్మార్ సరిహద్దులోని పంగ్సావూ కనుమ నుంచి మొదలైన ఈ హిమాలయ యాత్ర లడఖ్ ప్రాంతం, కార్గిల్లోని డ్రాస్ సెక్టార్ వరకూ 4,841కిలోమీటర్లకు పైగా సాగింది. తూర్పు హిమాలయాలనుంచి పశ్చిమ హిమాలయాలవరకు అతి ఎత్తైన 35 పర్వత కనుమల ద్వారా భారత, నేపాల్ భూభాగాల్లో 140రోజుల పాటు సాగింది.
సత్కార కార్యక్రమం సందర్భంగా కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, 17మంది పర్వతారోహకులు పాల్గొన్న ఈ యాత్ర చాలా గొప్పదని అన్నారు. “ఈ యాత్ర యావత్తూ ఒక నినాదం లాంటిది. యాబై ఏళ్ల వయస్సులోని మహిళా పర్వతారోహకులు పాల్గొన్న ఈ యాత్ర యాబైఏళ్ల వారికే కాక, దేశప్రజలందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఇది అన్నివిధాలా అద్భుతమైన కార్యక్రమం. అసలు సిసలు నారీశక్తి అంటే ఏమిటో ఈ యాత్ర రుజువుచేసింది.” అని ఆయన అన్నారు.
ఫిట్ ఇండియా కార్యక్రమానికి సంబంధించి ప్రధానమంత్రి దార్శనికత ప్రాముఖ్యతను ఠాకూర్ మరోసారి ప్రస్తావించారు. “ఫిట్ఇండియా కార్యక్రమం కోసం ‘ఫిట్నెస్ మోతాదు.. రోజూ అరంగంట చాలు’ అన్న మంత్రాన్ని నరేంద్ర మోదీ మనకు అందించారు. ఆయన కలలను సాకారం చేసేందుకు సాధ్యమైనంత మేర మనం కృషి చేశాం. ఇందుకు సంబంధించిన సవాళ్లు కూడా చాలా భారీగానే ఎదుర్కొన్నాం. అయితే, ప్రతి అడుగులోనూ సైన్యం తమ సహాయం అందించింది. ఇక బచేంద్రీపాల్ నాయకత్వమైతే మరింత ప్రత్యేకం.” అని ఆయన అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఫిట్నెస్ సంబంధిత కార్యక్రమాలను మరికొన్నింటిని మనం చేపట్టాల్సి ఉందని, వాటిని ఫిట్ఇండియా, ఏక్ భారత్ శ్రేష్ట భారత్ ప్రచార కార్యక్రమాలుగా మార్చవచ్చని అనురాగ్ సింగ్ ఠాకూర్ సూచించారు. ఈ కార్యక్రమాలతో సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాల గురించి తెలుసుకోవడానికి యువతకు అకాశం ఏర్పడుతుందని అన్నారు. మెట్రో నగరాల్లోని ప్రజల జీవితాలు సరిహద్దు ప్రాంతాల్లోని యువతకు కూడా అనుభవంలోకి రావాలన్నారు.
బచేంద్రీపాల్ తన 68ఏళ్ల వయస్సులో పర్వతారోహకుల బృందానికి నాయకత్వం వహించడమే ఒక ప్రత్యేక విన్యాసం. హిమాలయ్యాల్లోని అత్యంత ఏత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఆమేనని అన్నారు. హిమాలయ యాత్రలో తన అనుభవాలను గురించి బచేంద్రీపాల్ విపులంగా వివరించారు. “ఈ వయస్సులో ఇంత కార్యక్రమాన్ని చేపట్టాలంటే మొదట నేను మరోలా ఆలోచించాను. అయితే, మహిళా సాధికారతకు ఇది చాలా అవసరమని ఆ తర్వాత గ్రహించాను. ఈ యాత్ర ప్రతి అడుగులోనూ కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, టాటా స్టీల్ సంస్థ, ప్రత్యేకించి భారతీయ సైన్యం ఎంతో సాయం అందించాయి. ఈ యాత్ర ఏమంత సులభం కాదు. శరీరం బొబ్బలు తేలినా మేం యాత్రను ఆపలేదు. ఎంతో సానుకూల దృక్పథంతో ముందుకు పురోగమించాం. అందువల్లనే ఫలితం సాధించాం. యాత్రలో మేం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. అయితే, భారతీయ సైన్యం మాకు వెన్నుదన్నుగా నిలిచింది. సైన్యం అండగా నిలవడంతో మాకు ఎంతో ప్రోత్సాహం కలిగింది. ఆత్మవిశ్వాసం లభించింది. సైనికులు ప్రతివిషయంలోనూ మాకు అండగా నిలిచారు. సహాయం అందించారు.” అని ఆమె అన్నారు.
శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలన్న అంశంపై వయోవృద్ధుల్లో అవగాహన కల్పించడం, మహిళలు ఏ వయస్సులో అయినా ఫిట్గా, ఆరోగ్యంగా ఉండవచ్చని ప్రత్యేకించి మహిళలకు సోదాహరణంగా వివరించడం ఈ యాత్ర లక్ష్యం. హిమాలయాల్లోని 17,700 అడుగుల ఎత్తైన అతి దుర్గమమైన లంఖాగా కనుమ, 18,300అడుగులతో అతి ఎత్తైన పరాంగ్ లా కనుమ, 16,000 అడుగుల ఎత్తైన భాభా కనుమ, 17,800అడుగుల ఎత్తైన తొరాంగ్ కనుమల గుండా ఈ యాత్ర సాగింది. దాదాపు 12,000 అడుగులకు మించిన ఎత్తైన ప్రాంతాల్లో 29 కిలోమీటర్ల పాటు యాత్ర నిర్వహించారు. తూర్పు, పశ్చిమ నేపాల్ ప్రాంతంలోని కొన్ని మార్గాలైతే మరీ మారుమూలన విసిరేసినట్టుగా ఉంటాయి. యాత్రను సాగించేందుకు అక్కడ అందుబాటులో వనరులు కూడా చాలా తక్కువ. ఎక్కువ రోజులు 10,000నుంచి 14,000అడుగుల ఎత్తైన ప్రదేశాల్లోనే వారు ఈ యాత్రను సాగించారు.
యాత్రలో పాల్గొన్న బృందం సభ్యులు కూడా తమ అనుభవాలను ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. ఉత్తరాఖండ్, లే, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో దుర్గమమైన పర్వత కనుమల ద్వారా సాగిన యాత్రలో తమ అనుభవాలను గురించి వారు వివరించారు. “యాత్ర సందర్భంగా మాలో ప్రతి ఒక్కరికీ కాళ్లు బాగా దెబ్బతిన్నాయి. అయినా మేం ప్రయత్నాన్ని వదలలేదు. ముందుకే సాగిపోయాం,” అని బృందం సభ్యురాలైన చేతనా సాహూ వివరించారు. “యాత్రలో పాఠశాల బాలలను కలసి మాట్లాడాం. ఫిట్ ఇండియా ఉద్యమం గురించి వారికి అవగాహన కల్పించాం. ఫిట్నెస్ సందేశాన్ని మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాపింపజేశాం. యాత్రలో మాకు వనరుల కొరత కూడా ఎదురైంది. కనీస స్థాయి సదుపాయాలతో జీవితం ఎలా సాగించాలో ఐదు నెలల్లో మేం నేర్చుకున్నాం. యాత్ర జరిగినన్ని రోజులూ బచేంద్రీ పాల్ మాకు ఎంతో ప్రేరణ కలిగిస్తూ వచ్చారు.” అని ఆమె అన్నారు.
ఫిట్ @50+ హిమాలయ యాత్ర (2022) మహిళల బృందం:
బచేంద్రీపాల్
డాక్టర్ సుష్మా బిస్సా
బిమ్లా దేవేస్కర్
చేతనా సాహూ
గంగోత్రీ సోనేజీ
ఎల్. అన్నపూర్ణ
మేజర్ కృష్ణా దూబే
వసుమతీ శ్రీనివాసన్
పాయో ముర్ము
సవితా ధాప్వాల్
శ్యామలా పద్మనాభన్
భానూ రాణి
అవినాశ్ శ్రీనివాస్ దేవోస్కర్
రణదేవ్ సింగ్
మోహన్ సింగ్ రావత్
హేమంత్ గుప్తా
ఆశీస్ కుమార్ సక్సేనా
***
(Release ID: 1848450)
Visitor Counter : 104