ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా అధ్యక్షతన హెపటైటిస్ పై పార్లమెంట్ సభ్యులకు అవగాహన కార్యక్రమం హెపటైటిస్ రహిత దేశంగా భారతదేశం రూపుదిద్దు కొనేందుకు పార్లమెంట్ సభ్యులు కృషి చేయాలి.. శ్రీ వెంకయ్యనాయుడు
హెపటైటిస్ రహిత దేశంగా భారతదేశ నిర్మాణం కోసం ప్రజా ఉద్యమం జరగాలి.. వెంకయ్యనాయుడు
నివారణ, పరీక్ష, చికిత్స అనే మూడు అంశాల ప్రాతిపదికన హెపటైటిస్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలి.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
హెపటైటిస్ నిర్మూలన కోసం ప్రజలకు అవగాహన కల్పించి ప్రజా ఉద్యమం ప్రారంభించాలి..డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
నివారణ, పరీక్ష, చికిత్స విధానం అనే త్రిముఖ వ్యూహం ప్రజా ఉద్యమం ప్రారంభం కావాలి
Posted On:
28 JUL 2022 12:41PM by PIB Hyderabad
ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం 2022 సందర్భంగా ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ శ్రీ వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా అధ్యక్షతన ఈ రోజు హెపటైటిస్ పై పార్లమెంట్ సభ్యులకు అవగాహన కల్పించేందుకు అవగాహన సమావేశం జరిగింది. దేశంలో హెపటైటిస్ తాజా పరిస్థితి, హైపటైటిస్ నిర్మూలనకు అమలు చేస్తున్న చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ సభ్యులకు వివరించారు. వ్యాధిని సాధ్యమైనంత త్వరగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని శ్రీ మాండవీయ పేర్కొన్నారు.
హెపటైటిస్ సంరక్షణను ప్రధాన ఆసుపత్రులకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు మరియు సామాజిక కేంద్రాలలో హెపటైటిస్ సంరక్షణను కార్యక్రమాలను విస్తరించి సులభంగా సంరక్షణ చర్యలు అందుబాటులోకి వచ్చేలా చేయాలన్న లక్ష్యంతో ఈ ఏడాది ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని ' మీ సమీపానికి హెపటైటిస్ సంరక్షణ' ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు.
పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ లో కార్యక్రమాన్ని భారత పార్లమెంట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహించాయి.
కార్యక్రమంలో ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులను ఉప రాష్ట్రపతి అభినందించారు. హెపటైటిస్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన శ్రీ వెంకయ్య నాయుడు హెపటైటిస్ రహిత భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్క సభ్యుడు తమ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించి స్థానిక భాషలో ప్రజలకు అర్ధమయ్యే విధంగా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు.
హెపటైటిస్ నిర్మూలన కోసం సంఘటిత కృషి అవసరమని లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా అన్నారు. భిన్నత్వం తో నిండిన దేశంలో హెపటైటిస్ నిర్మూలన సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పార్లమెంట్ సభ్యులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. తన నియోజకవర్గంలో హెపటైటిస్ వ్యాధిని గుర్తించి, హెపటైటిస్ వ్యాధి సోకిన వారికి తగిన చికిత్స అందించి, చికిత్స అనంతరం తగిన సంరక్షణ అందేలా చూసే బాధ్యత సంబంధిత పార్లమెంట్ సభ్యునిపై ఉంటుందని అన్నారు.
ఆరోగ్యంతో అభివృద్ధిని కలిపి చూస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆరోగ్య సంరక్షణ అంశానికి సమగ్ర రూపం తెచ్చి ప్రజల ఆలోచనా దృక్పధంలో మార్పు తెచ్చారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. దీనికి నిదర్శనం క్షయ వ్యాధి నిర్మూలన అని పేర్కొన్న డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రభుత్వం మేలు చేస్తున్న ఆరోగ్య సంరక్షణ విధానాల వల్ల ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచి సమాజ భద్రతకు దోహదపడతాయని అన్నారు.
హెపటైటిస్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడం వల్ల సకాలంలో సరైన చికిత్స అందించవచ్చునని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. కోవిడ్-19 సమయంలో అనుసరించిన పరీక్ష, నిర్ధారణ,చికిత్స విధానం సత్ఫలితాలు ఇచ్చిందని అన్నారు. ప్రాథమిక దశలో హెపటైటిస్ వ్యాధి ఎక్కువ మంది ప్రజలు గుర్తించలేకపోతున్నారని పేర్కొన్నారు. వ్యాధి లక్షణాలు లేకపోవడం లేదా లక్షణాలు కనిపించకపోవడం దీనికి కారణమని మంత్రి అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు హెపటైటిస్ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలను గుర్తించడం, హెపటైటిస్ వ్యాధి సోకిన వారి కుటుంబ సభ్యులను లేదా తరచూ రక్త మార్పిడి చేయించుకున్న లేదా పొందుతున్న వారు, డయాలసిస్లో ఉన్నవారు, హెచ్ఐవి బారిన పడ్డవారు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై దృష్టి సారించి పరీక్షలు చేయాలని పేర్కొన్నారు.
2030 నాటికి హెచ్ఐవి, వైరల్ హెపటైటిస్ మరియు లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లను నిర్మూలించే లక్ష్యంతో 2022-2030 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా నూతన వ్యూహాలు అమలు కానున్నాయని డాక్టర్ మాండవీయ వివరించారు. హెపటైటిస్ బి వల్ల మరణించిన వారి సంఖ్య హెచ్ఐవి మరణాల సంఖ్య కంటే ఎక్కువగా ఉందని డాక్టర్ మాండవ్య వివరించారు. ఇటీవల కాలంలో ఎక్కువ మరణాలకు, ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న వైరల్ హెపటైటిస్ బి మరియు సి లు ప్రపంచ ఆరోగ్య సమస్యగా డాక్టర్ మాండవీయ వివరాయించారు. ప్రపంచవ్యాప్తంగా వైరల్ హెపటైటిస్తో రోజుకి దాదాపు 4000 మంది చనిపోతున్నారని పేర్కొన్న డాక్టర్ మాండవీయ భారతదేశంలో దాదాపు 40 మిలియన్ల మంది ప్రజలు హెపటైటిస్ బి మరియు సి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని తెలిపారు.
హెపటైటిస్ రహిత భారతదేశాన్ని నిర్మించడానికి ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి సంఘాలను ఉత్సాహ పరిచి లాగ్ భాగీదారి (ప్రజల భాగస్వామ్యం)తో ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించాలని రాష్ట్రాలకు డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సూచించారు. నివారణ, పరీక్షలు మరియు చికిత్స అనే త్రిముఖ విధానాన్ని అవలంబించడం ద్వారా హెపటైటిస్ను నిర్మూలించడానికి మరియు దానిని జన ఆందోళనగా మార్చడానికి ప్రతి ఒక్కరూఅంకిత భావంతో పని చేయాలని ఆయన కోరారు.
హెపటైటిస్తో జీవిస్తున్న వ్యక్తులపై వివక్ష చూపకూడదని ప్రతిజ్ఞ చేసిన పార్లమెంట్ సభ్యులు హెపటైటిస్కు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో లోక్సభ సెక్రటరీ జనరల్ శ్రీ ఉత్పల్ కుమార్ సింగ్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ నారాయణ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్ కె సరిన్, శ్రీ ప్రసేన్జిత్ సింగ్, లోక్సభ సెక్రటేరియట్ అదనపు కార్యదర్శి పాల్గొన్నారు.
(Release ID: 1845813)