సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

‘‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’’ పై ఏర్పాటు చేసిన జాతీయ క‌మిటీ రెండో స‌మావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్ర‌ధాన మంత్రి


కోవిడ్ అనంత‌ర నవీన ప్రపంచ వ్యవస్థ లో భార‌త‌దేశం నాయకత్వ భూమిక ను పోషిస్తుంది: ప్ర‌ధాన మంత్రి

మనం ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ ను జరుపుకొంటున్న నేప‌థ్యం లో, ఈ అవకాశాన్ని వినియగించుకొని మనం 2047వ సంవత్సరం కోసం మన నూతన ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకొంటూ ముందడుగు వేయడం పైన శ్రద్ధ వహించాలి: ప్ర‌ధాన మంత్రి

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ మన యువత లో కర్తవ్య పాలన తాలూకు భావన ను అంకురింప జేస్తుంది: ప్ర‌ధాన మంత్రి

మన దేశ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌కు, మరుగునపడిపోయిన స్వాతంత్ర్య పోరాట వీరులకు సముచిత గౌరవాన్ని కట్టబెట్టడం లో శాయశక్తుల పాటుపడాలి: ప్ర‌ధాన మంత్రి


Posted On: 22 DEC 2021 9:50PM by PIB Hyderabad

న్యూ ఢిల్లీ లో నిర్వ‌హించిన ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ జాతీయ క‌మిటీ రెండో స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఈ స‌మావేశం లో లోక్ స‌భ స్పీక‌ర్, గ‌వ‌ర్న‌ర్లు, కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రులతో పాటు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, అధికారులు, మీడియా ప్ర‌తినిధులు, ఆధ్యాత్మిక వేత్త‌లు, క‌ళాకారులు, సినిమారంగ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కు సంబంధించి చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల గురించి సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ గోవింద మోహ‌న్ ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌ద్వారా వివ‌రించారు.

ఈ ఏడాది మార్చి నెల 12 వ తేదీన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. అంత‌కుముందు మార్చి 8వ తేదీన దీనికి సంబంధించిన కేంద్ర క‌మిటీ మొద‌టి స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

పూర్వ ప్ర‌ధాని శ్రీ హెచ్.డి. దేవె గౌడ‌, గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఆచార్య దేవ‌వ్ర‌త్‌, కేర‌ళ గ‌వర్న‌ర్ శ్రీ ఆరిఫ్ మొమ్మ‌ద్ ఖాన్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్‌, ఆంధ్ర‌ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి, బిజెపి అధ్య‌క్షుడు శ్రీ జె.పి. న‌డ్డా, శ్రీ శ‌ర‌ద్ ప‌వార్‌, భార‌త్ ర‌త్న ల‌త మంగేశ్ కర్‌, శ్రీ ర‌జినీకాంత్, శ్రీ రామోజీ రావు, వ్యాపార రంగ ప్రముఖుడు శ్రీ ఎ.ఎమ్. నాయిక్‌, స్వామి ప‌ర‌మార్థానంద స‌ర‌స్వ‌తి గారు తదితర జాతీయ కమిటీ సభ్యులు ఈ సమావేశం లో పాల్గొన్న వారి లో ఉన్నారు. వారంతా వారి వారి సూచ‌న‌ల ను, స‌ల‌హాల ను ఇచ్చారు.
 
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న ప్ర‌సంగం లో, భార‌త‌దేశం తో స‌హా ప్ర‌పంచ‌ం అంతా క‌రోనా మ‌మ‌మ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాలం లో మనం ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ ను నిర్వ‌హించుకోవ‌డం జ‌రుగుతోంద‌ని  పేర్కొన్నారు. ఈ సంక్షోభం దేశానికి కొత్త పాఠాల‌ను నేర్పింద‌ని, ప్ర‌స్తుత‌మున్న అనేక వ్య‌వ‌స్థ‌లు ప్ర‌భావిత‌మ‌య్యాయ‌ని, ఇది కోవిడ్ అనంత‌ర ప‌రిస్థ‌ితుల్లో నూత‌న ప్ర‌పంచ నిర్మాణానికి దారి తీస్తుంద‌ని ప్ర‌ధాని అన్నారు. ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మాన్ని జ‌రుపుకొంటున్న నేప‌థ్యంలో మ‌నం కూడా ఈ కోవిడ్ అనంత‌రం ఏర్ప‌డే నూత‌న ప్ర‌పంచంలో కీల‌క పాత్ర పోషించ‌డానికిగాను కృషి చేయవలసి ఉంద‌ంటూ ప్ర‌ధాన మంత్రి పిలుపునిచ్చారు. 21వ శ‌తాబ్దం ఆసియాదే అని ఆయ‌న అన్నారు. ఈ శ‌తాబ్దంలో ఆసియాలో భార‌త‌దేశం స్థానాన్ని అభివృద్ధి చేసుకోవ‌డంపై దృష్టి పెట్ట‌డం ముఖ్య‌మ‌న్నారు.

భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 2047 నాటికి 100 సంవ‌త్స‌రాలు నిండుతాయి. ఆ సంద‌ర్భంగా భార‌త‌దేశం సాధించాల్సిన ల‌క్ష్యాల‌పై దృష్టి పెట్ట‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌ం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ప్ర‌స్తుతమున్న త‌రాల‌కు చెందిన‌ వారు ఆ స‌మ‌యానిక‌ల్లా ప‌లు ప్ర‌ధాన‌మైన పాత్ర‌లు పోషిస్తుంటార‌ని, జాతి భ‌విష్య‌త్తు వారి చేతుల్లో ఉంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. కాబ‌ట్టి ఈ త‌రాల‌కు చెందిన‌ వారిలో త‌గిన స్ఫూర్తిని క‌లిగించి దేశ భ‌విష్య‌త్ కోసం త‌గిన కృషి చేసేలా వారిని తీర్చిదిద్దాల‌ని, ఆ బాధ్య‌త అంద‌రి మీదా ఉంద‌న్నారు.  జాతి నిర్మాణం కోసం ప్ర‌స్తుత త‌రాలు స‌ముచితంగా కృషి చేయాలంటే మెరుగైన భార‌త‌దేశం కోసం చేప‌ట్టవలసిన విధుల ప్రాధాన్య‌ాన్ని వారికి తెలియ‌జేయాల‌ని ప్ర‌ధాన మంత్రి త‌న ప్రసంగంలో వివ‌రించారు. హ‌క్కుల‌ కోసం పోరాటం చేయాల‌ని మ‌నం ప‌దే ప‌దే చెబుతూ వ‌చ్చాం. హ‌క్కుల సాధ‌న‌తో పాటు ఎవ‌రి విధుల‌ను వారు స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డంలో కూడా గొప్ప‌ద‌నం ఉంది. మ‌నం మ‌న విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హిస్తే ఇత‌రులకు అందవలసిన హ‌క్కులు కూడా వాటంత‌ట అవే వారికి స‌ంక్ర‌మిస్తాయని ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగంలో స్ప‌ష్టం చేశారు. కాబ‌ట్టి ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ ను ఘ‌నంగా నిర్వ‌హించుకుంటున్న ఈ స‌మ‌యంలో విధి నిర్వ‌హ‌ణ ప‌ట్ల నిబ‌ద్ద‌త అనేది మ‌న ప్ర‌ధాన‌మైన ప్రాధాన్య‌ంగా ఉండాలి. అంతే కాదు దేశం కోసం స‌ముచితంగా మ‌న క‌ర్త‌వ్యాల‌ను నిర్వ‌హించ‌డ‌మ‌నేది మ‌న ప్ర‌ధాన‌మైన ప్ర‌తిన కావాలి. నేటి యువ‌త‌లో వారి క‌ర్త‌వ్యం ప‌ట్ల త‌గిన పునాది వేయ‌డానికిగాను ఆజాదీ కా అమృత మ‌హోత్స‌వ్ దోహ‌దం చేస్తుంది అని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

నూత‌న భ‌విష్య‌త్తు ను త‌యారు చేసుకోవ‌డం కోసం ప్రస్తుత త‌రం యువ‌త లో త‌గిన స్ఫూర్తి ర‌గిలివుంది. అయితే అదే స‌మ‌యంలో  భ‌విష్య‌త్తు అనేది గ‌తం ఒడిలో జ‌న్మిస్తుంద‌నే విష‌యాన్ని మ‌నం మ‌రిచిపోకూడ‌దు. ఈ నేప‌థ్యం లో చూసిన‌ప్పుడు ఈ దేశం కోసం మ‌న పూర్వికులు చేసిన త్యాగాల‌ను మ‌నం మ‌రిచిపోకూడ‌దు. అమృత్ మ‌హోత్స‌వంలో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం త‌గిన విధంగా ఉండేలా చూసుకొంటూనే స్వాతంత్ర్య పోరాట యోధుల‌కు త‌గిన నివాళి ని ఘ‌టించ‌డంలో ఎక్క‌డా వెన‌క‌బ‌డి పోకూడ‌దు అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విజ్ఞ‌ప్తి చేశారు. ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ ను నిర్వ‌హించుకొంటూనే 2047వ సంవత్సరం లో సాధించవలసిన ల‌క్ష్యాల‌ కోసం త‌గిన ప్ర‌ణాళిక‌ తో ముంద‌డుగు వేయాలి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.
 
‘‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’’ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టినందుకుగాను ప్ర‌ధాన మంత్రి కి క‌మిటీ స‌భ్యులు త‌మ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఈ కార్య‌క్ర‌మం కోసం చేప‌ట్టిన కార్య‌కలాపాలను గురించి క‌మిటీ స‌భ్యులు వివ‌రించారు. ఈ ఉద్య‌మాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి త‌మ సూచ‌న‌ల ను, స‌ల‌హాల ను ఇచ్చారు. హోంశాఖ మంత్రి కేంద్ర శ్రీ అమిత్ షా స్వాగ‌త ఉపన్యాసం చేశారు. ఈ సంద‌ర్భం గా ఆయన ఈ ప్రచార ఉద్య‌మానికి సంబంధించిన ఐదు స్తంభాలను గురించి, ఉద్దేశ్యాల‌ను గురించి వివరించారు. ప్ర‌ధాన మంత్రి తో పాటు మిగ‌తా స‌భ్యులంద‌రూ వారి కాలాన్ని కేటాయించి విలువైన సూచ‌న‌లను, స‌ల‌హాలను ఇచ్చినందుకు గాను అంద‌రికీ శ్రీ అమిత్ షా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.


 

***



(Release ID: 1784552) Visitor Counter : 340