ఆర్థిక మంత్రిత్వ శాఖ
పూణె, మహారాష్ట్రలలో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్నుశాఖ
నాడు పోస్టు చేయడమైనది:
02 DEC 2021 1:53PM by PIB Hyderabad
పాడి పరిశ్రమ, పాల ఉత్పత్తుల తయారీలో నిమగ్నమైన పూణెకు చెందిన ఒక ప్రముఖ గ్రూప్ పై ఆదాయపు పన్ను శాఖ 25.11.2021న సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్ (సోదాలు, స్వాధీనం)ను నిర్వహించింది. భారత దేశంలోని 6 నగరాలలో విస్తరించి ఉన్న 30 ప్రాంగణాలపై సోదాల చర్య కొనసాగింది.
ఈ సోదాల సందర్భంగా, పన్ను ఎగవేతకు సంబంధించిన పలు నేరారోపణ చేసే పత్రాలు, ఆధారాలను కనుగొని, స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాల ప్రాథమిక విశ్లేషణలో నకిలీ కొనుగోళ్ళు, లెక్కల్లోకి రాని నగదు అమ్మకాలు, నగదు పరపతి బదలాయింపులు, వాటి చెల్లింపు, వివరణలేని నగదు రుణాలు తదితర పద్ధతులను అవలంబించి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంపై పన్నును ఎగవేసినట్టు స్పష్టంగా తేలింది. పశువుల అమ్మకం లేదా మరణం కారణంగా నష్టం వాటిల్లినట్టు తప్పుగా పేర్కొనడాన్ని కూడా గమనించారు.
పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంపై నిర్ధిష్ట తగ్గింపులను కోరేందుకు సరైన, వేర్వేరు ఖాతా పుస్తకాలను కూడా అసెసీ గ్రూప్ నిర్వహించలేదని సేకరించిన ఆధారాలు వెల్లడించాయి.
సోదాలలో దాదాపు రూ. 2.50 కోట్ల విలువైన లెక్కల్లోకి రాని నగదును, వివరించలేని ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బ్యాంక్ లాకర్లను ఇంకా తెరవవలసి ఉంది. ఈ సోదా చర్యలో ఇంతవరకూ, దాదాపు రూ. 400 కోట్లకు పైగా లెక్కల్లోకి రాని ఆదాయాన్ని కనుగొన్నారు.
తదుపరి దర్యాప్తులు కొనసాగుతున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 1777236)
సందర్శకుల సూచీ సంఖ్య : : 198