వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
మణిపూర్ రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాం
రాష్ట్ర పరిశ్రమ వర్గాలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ హామీ
నాడు పోస్టు చేయడమైనది:
21 NOV 2021 11:03AM by PIB Hyderabad
మణిపూర్ రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పియుష్ గోయల్ హామీ ఇచ్చారు.
ఇంఫాల్ లో శనివారం రాత్రి రాష్ట్రానికి చెందిన వివిధ పరిశ్రమలు, వాణిజ్య, వర్తక సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి దేశాభివృద్ధితో మణిపూర్ అభివృద్ధి ముడిపడి ఉందని స్పష్టం చేశారు. మారుమూల రాష్ట్రమైన మణిపూర్ లో పరిశ్రమ, వర్తక, వాణిజ్య రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రం పూర్తి అవగాహన కలిగి ఉందని ఆయన అన్నారు.
మణిపూర్ తో సహా ఈశాన్య రాష్ట్రాలలో పారిశ్రామిక, వర్తక, వాణిజ్య రంగాలలో అభివృద్ధి సాధించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రత్యేక అభివృద్ధి పధకాలను రూపొందించి అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.దీనిలో భాగంగా ఈశాన్య పారిశ్రామిక అభివృద్ధి పథకం మరియు పారిశ్రామిక ప్రాజెక్టుల సమీకృత అభివృద్ధి పథకాలు రూపొందించామని, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక, వర్తక, వాణిజ్య రంగాలు అభివృద్ధి సాధించడానికి పరస్పర సహకారం, పోటీతత్వ స్ఫూర్తితో పని చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల ద్వారా పూర్తి ప్రయోజనం పొందడానికి సహకార యూనిట్లను, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి కార్యక్రమాలను అమలు చేయాలని పారిశ్రామిక సంస్థలకు మంత్రి సూచించారు. దీనివల్ల రాష్ట్రంలో పరిశ్రమలు, వాణిజ్య, వర్తక రంగాల్లో అభివృద్ధి చెందుతాయని అన్నారు.
ఈశాన్య రాష్ట్రాలు సొంతంగా నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నాయని శ్రీ గోయల్ అన్నారు. ప్రతి పనికి ఈ రాష్ట్రాలు ఢిల్లీ లేదా కోల్కతాకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చూస్తామని ఆయన అన్నారు. తమ మంత్రిత్వ శాఖ పూర్తి పారదర్శకంగా పనిచేస్తూ ప్రతి పని ఆన్లైన్లో జరిగేలా చూడడానికి చర్యలను తీసుకున్నదని శ్రీ గోయల్ అన్నారు. మయన్మార్ మరియు ఆసియాన్ దేశాలకు మణిపూర్ గేట్వేగా ఉందని మంత్రి అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పూర్తి ప్రయోజనాన్ని రాష్ట్రం పొందేలా తమ మంత్రిత్వ శాఖ సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
మణిపూర్ వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి తొంగం బిశ్వజిత్ సింగ్, భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజేష్ కుమార్ మరియు రాష్ట్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో పాల్గొన్న మణిపూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఇండో-మయన్మార్ బోర్డర్ ట్రేడర్స్ యూనియన్, ఆల్ మణిపూర్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్, బిజినెస్ ఎక్సలెన్స్ గ్రూప్, మణిపూర్ పవర్ లూమ్ డెవలప్మెంట్ అసోసియేషన్, మణిపూర్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్టిసన్ డెవలప్మెంట్ సొసైటీ మరియు ఆర్గనైజేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సెల్ఫ్ హెల్ప్ల సంస్థల ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వర్తక, వాణిజ్య రంగాలలో అభివృద్ధి సాధించడానికి గల అవకాశాలను వారు మంత్రికి వివరించారు.
ట్రాన్సిట్ డ్యూటీ సిస్టమ్ను ప్రవేశపెట్టడం, వీసా రుసుము తగ్గింపు, డీజీఎఫ్టీ, ఎక్సిమ్ బ్యాంక్ లాంటి వాణిజ్య సంబంధిత కార్యాలయాలు ప్రారంభించడం ఇంఫాల్లో ఆర్బీఐ ఫోరెక్స్ సెల్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అభివృద్ధి, ఎగుమతులు దిగుమతి వ్యాపారులను ప్రోత్సహించడానికి రవాణా రాయితీలు వంటి అంశాలను వారు లేవనెత్తారు. కోల్డ్ స్టోరేజీ, కస్టమ్స్ కార్యాలయం మొదలైన సౌకర్యాలతో ఇంఫాల్ విమానాశ్రయాన్ని అప్గ్రేడ్ చేయాలని వారు సూచించారు.
***
(రిలీజ్ ఐడి: 1773741)
సందర్శకుల సూచీ సంఖ్య : : 193