పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

పెట్రోల్.. డీజిల్‌పై 25 రాష్ట్రాలు/యూటీలలో వ్యాట్‌ తగ్గింపు

Posted On: 12 NOV 2021 6:09PM by PIB Hyderabad

   దేశంలోని ఇంధన వినియోగదారులకు ఊరటనిస్తూ ఇప్పటిదాకా 25 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు పెట్రోల్, డీజిల్‌పై విలువ జోడింపు పన్ను (వ్యాట్)ను తగ్గించాయి. పెట్రోలుపై రూ.5, డీజిల్‌పై రూ.10 వంతున సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని గణనీయంగా తగ్గించాలని 2021 నవంబర్ 3న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రభుత్వాలు ఈ చర్యను చేపట్టాయి. తన నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రాలు కూడా వినియోగదారులకు ఉపశమనం కలిగించడం కోసం ఇదేవిధంగా వ్యాట్‌ను తగ్గించాలని కేంద్రం కోరింది.

   కాగా... కొన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌లో ఎలాంటి తగ్గింపును ప్రకటించలేదు. ఈ జాబితాలో- మహారాష్ట్ర, ‘ఎన్‌సిటి ఢిల్లీ’, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఉన్నాయి. ఇక లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రభుత్వం కేరళ రాష్ట్ర వ్యాట్ ప్రకారం పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై పన్నులేదు.

   వ్యాట్‌ తగ్గింపు పెట్రోల్ ధర పంజాబ్‌లో అత్యధికంగా లీటరుకు రూ.16.02 తగ్గింది. కాగా, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో రూ.13.43, కర్ణాటకలో రూ.13.35 వంతున తగ్గింది. అండమాన్-నికోబార్‌లో పెట్రోలు ధర అత్యంత చౌకగా లీటరుకు రూ.82.96 కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో రూ.92.02గా ఉంది. ఇక రాజస్థాన్‌లోని జైపూర్‌లో లీటరు రూ.117.45 కాగా, మహారాష్ట్రలోని ముంబైలో రూ.115.85గా ఉంది.

   డీజిల్ విషయానికొస్తే- లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో లీటరుకు వ్యాట్ రూ.19.61 తగ్గింది. అలాగే కర్ణాటకలో రూ.19.49, పుదుచ్చేరిలో రూ.19.08 చొప్పున తగ్గింది. అండమాన్-నికోబార్‌లో డీజిల్ అత్యంత చౌకగా లీటరు ధర రూ.77.13 ఉండగా, మిజోరాంలోని ఐజ్వాల్‌లో రూ.79.55గా ఉంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యధికంగా లీటరు ధర రూ.108.39 ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రూ.107.48గా ఉంది.

 

***



(Release ID: 1771334) Visitor Counter : 160