ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
స్టార్టప్ కంపెనీలతో కేంద్రమంత్రి దీపావళి!
ఇష్టాగోష్టిగా మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సంభాషణ,..
కంపెనీల ప్రతినిధులతో మధ్యాహ్న భోజనం..
ప్రపంచంలోనే క్రియాశీలక స్టార్టప్ వ్యవస్థ లక్ష్యంగా
ప్రధాని మోదీ దార్శనికతపై మంత్రి వివరణ
‘భారత్.లో డీప్.టెక్ వ్యవస్థ అభివృద్ధి’పై విస్తృత చర్చ..
దేశంలో స్టార్టప్ కంపెనీల అభివృద్ధికి ఇదివరకెన్నడూ
లేని సానుకూలత ఉందన్న రాజీవ్ చంద్రశేఖర్..
నమ్మకమైన టెక్నాలజీ భాగస్వామిగా భారతదేశాన్నే
ప్రపంచం కోరుకుంటోందని వెల్లడి
ప్రభుత్వాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను
వేగంగా డిజిటలైజ్ చేస్తున్న ప్రధాని: చంద్రశేఖర్
Posted On:
06 NOV 2021 5:40PM by PIB Hyderabad
బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీల ప్రతినిధులతో కలసి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ నెల 6న దీపావళి పండుగను జరుపుకున్నారు. వారితో కలసి సరదాగా మధ్యాహ్న భోజనం చేశారు. సాఫ్ట్.వేర్, సేవా కంపెనీల జాతీయ సంఘం (నాస్.కామ్), భారతీయ సాఫ్ట్.వేర్ టెక్నాలజీ పార్కుల సంస్థ (ఎస్.టి.పి.ఐ.) ఆధ్వర్యంలో బెంగళూరులో ఈ కార్యక్రమం జరిగింది. సాఫ్ట్ వేర్ కంపెనీల అనుభవాలను, వారు ఎదుర్కొన్న సవాళ్లను గురించి కేంద్రమంత్రి స్వయంగా తెలుసుకున్నారు. స్టార్టప్ కార్యక్రమాలకు ప్రభుత్వం అందించే మద్దతును ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై కూడా ఆయన వారితో చర్చించారు.

సాఫ్ట్ వేర్ పరిశ్రమల ప్రతినిధులతో సహా, కర్ణాటక బయటి ప్రాంతాలకు చెందిన దీప్ టెక్, టెక్ వుయ్., ఎస్.టి.పి.ఐ., ఐ.ఒ.టి. ఓపెన్ ల్యాబ్ వంటి స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో కూడా కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సంభాషించారు. స్టార్టప్ కంపెనీలు ప్రదర్శించిన గేమ్ చేంజింగ్ సొల్యూషన్స్.ను ఆయన తిలకించారు. స్టార్టప్ కంపెనీల డిజిటల్ కార్యక్రమాలతో ప్రభావితమైన వారితో ఆయన మాట్లాడారు. ‘2026 సంవత్సరానికి భారతదేశంలో డీప్ టెక్ సానుకూల పరిస్థితులను కల్పించేందుకు అనుసరించే వ్యూహాల’పై విస్తృతంగా చర్చ కూడా జరిగింది.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా కార్యక్రమంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను, ఆయన ఆలోచనలను గురించి ప్రస్తావించారు. “మూడు ముఖ్యమైన లక్ష్యాలతో ప్రధానమంత్రి 2015లో డిజిటల్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. i) ప్రజల జీవితాల్లో పరివర్తన తేవడం ii) ఆర్థిక అవకాశాలను విస్తృతం చేయడం iii) కీలకమైన కొన్ని సాంకేతిక పరిజ్ఞాన అంశాలకు సంబంధించి నిపుణుల్లో సామర్థ్యాలను అభివృద్ధి చేయడం వంటి 3 లక్ష్యాల సాధనకు టెక్నాలజీని సానుకూలంగా వినియోగించుకోవాలన్న భావనతోనే డిజిటల్ ఇండియా కార్యక్రమం మొదలైంది.“ అని ఆయన అన్నారు. దేశంలో వైరస్ మహమ్మారి సంక్షోభం అనంతరం భారతీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి గట్టిగా నిలదొక్కుకున్నతీరును ఆయన ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారాప్రధానమంత్రి వేసిన పటిష్టమైన పునాదులను వినియోగించుకుని చాలా పనులు చేయాల్సి ఉందన్నారు. డిజిటల్ టెక్నాలజీ విస్తృతితో దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా కేవలం ఒక మౌస్ క్లిక్.తో సంప్రదించగలుగుతున్నామని, లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రతి పైసా నేరుగా బదిలీ అవుతోందని ఆయన అన్నారు.
గత 18 నెలల్లో దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తృతంగా అభివృద్ధి చెందిన తీరును కేంద్రమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. “దేశంలో స్టార్టప్ కంపెనీలకు ఇపుడున్న సానుకూల వాతావరణం గతంలో ఎప్పడూ లేదు. స్టార్టప్ కంపెనీలకు అవకాశాలు విస్తృతంగా పెరిగాయి. భారతదేశం వంటి నమ్మకమైన టెక్నాలజీ సరఫరాదార్లకోసం ప్రపంచం ఇపుడు ఎంతగానో ఎదురుచూస్తోంది.” అని ఆయన అన్నారు. దేశంలో అన్ని సేవలను డిజిటలీకరించడానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, దీనితో,..టెక్నాలజీ సరఫదారుగా మన దేశానికి మరింత డిమాండ్ ఏర్పడుతుందని ఆయన అన్నారు.
ఔత్సాహిక పారిశ్రామిక, వాణిజ్య తత్వాన్ని చిన్న చిన్న నగరాలకు విస్తరింపజేయాల్సిన అసరం ఉందని, ప్రస్తుతం అనుసరిస్తున్న అవుట్ సోర్సింగ్ నమూనానా స్థానంలో,.. కలసి అభివృద్ధి చెందడం, కలసి పనిచేయడం అన్న విధానం అమలులోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక, వాణిజ్య స్వభావం తదుపరి దశకు అప్పుడే తగిన మద్దతు లభిస్తుందన్నారు.
స్టార్టప్ సంస్థలకు సానుకూల వాతావరణ కల్పించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజీవ్ చంద్రశేఖర్ తన ప్రసంగం చివర్లో పునరుద్ఘాటించారు. అన్ని రకాల విధానపరమైన మద్దతుతో, మార్కెట్ అనుసంధాన ఏర్పాట్ల ద్వారా స్టార్టప్ కంపెనీలకు సహాయం అందించడానికి, ఈ లక్ష్యంతో మరింత క్రియాశీలకంగా పనిచేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆయన స్టార్టప్ కంపెనీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
సార్టప్ కంపెనీలతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఇష్టాగోష్టి తరహాలో చేపట్టారు. పాల్గొన్న ప్రతినిధులు స్వేచ్ఛగా తమ ఆలోచనలను, అనుభవాలను, తామెదుర్కొన్న సవాళ్లను, పంచుకునేందుకు వీలుగా తగిన ప్రోత్సాహం అందించారు. స్టార్టప్ వ్యవస్థ మరింత చైతన్యవంతంగా పనిచేయడానికి వారందించే సూచనలను, సలహాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు అవకాశం ఇచ్చారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రోత్సహంతో స్టార్టప్ కంపెనీలను నిర్వహిస్తున్న కొందరు మహిళా ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.
మధ్యాహ్న భోజనంతో ఇష్టాగోష్టి చర్చా కార్యక్రమం ముగిసింది. ఔత్సాహిక పారిశ్రామిక, వాణిజ్య ప్రతినిధులు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు, కేంద్రమంత్రితో కలసి స్థానిక వంటకాల రుచులను చవిచూశారు. పరస్పరం దీపావళి శభాంకాంక్షలు తెలుపుకున్నారు.
****
(Release ID: 1769859)
Visitor Counter : 186