శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి మోదీ "ఆత్మ నిర్భర్ భారత్" సాధించడానికి శాస్త్ర, సాంకేతికత కీలకమని పేర్కొన్న - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


సాంకేతికాభివృద్ధి మండలి 25వ వ్యవస్థాపక దినోత్సవంలో కీలక ప్రసంగం చేసిన - కేంద్ర మంత్రి

రాబోయే 25 సంవత్సరాలకు సంబంధించిన రోడ్‌-మ్యాప్ అన్ని రంగాల్లోని శాస్త్రీయ, సాంకేతిక ఆవిష్కరణల ద్వారా నిర్ణయించబడుతుందని పేర్కొన్న - డాక్టర్ జితేంద్ర సింగ్


నూతన అంకురసంస్థల అవసరాలను ముందుగానే తెలుసుకుని, సాంకేతికాభివృద్ధి మండలి సహకరించాలని సూచించిన - కేంద్ర మంత్రి

Posted On: 01 SEP 2021 6:47PM by PIB Hyderabad

ప్రధానమంత్రి మోదీ "ఆత్మ నిర్భర్ భారత్" సాధించడానికి శాస్త్ర, సాంకేతికత కీలకమని, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి; భూ విజ్ఞాన శాఖ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి; ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా పిర్యాదులు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి, డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ రోజు పేర్కొన్నారు. సాంకేతికాభివృద్ధి మండలి, టి.డి.బి., 25వ వ్యవస్థాపక దినోత్సవంలో, ఆయన, ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ, నూతన అంకురసంస్థలకు, అవి కోరినప్పుడు మద్దతు ఇవ్వడంతో పాటు, వాటి అవసరాలను ముందుగానే తెలుసుకుని సహకారం అందించాలని నొక్కి చెప్పారు. విజయవంతమైన ఉత్పత్తి అభివృద్ధి కోసం తప్పనిసరిగా ప్రారంభ పర్యావరణ వ్యవస్థ ను కనుగొని, పెంపొందించుకోవాలని ఆయన, టి.డి.బి.ని కోరారు. 

దేశంలో ప్రతిభావంతులైన మానవ వనరుల బృందానికి కొరత లేనప్పటికీ, కొత్త నమూనాలను అభివృద్ధి చేయడానికి దాన్ని మార్చడం ప్రధాన సవాలుగా ఉందని, డాక్టర్ జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు.  స్వావలంబన యొక్క విశ్వాసం తదుపరి తరానికి చేరుతుందనీ, శాస్త్ర, సాంకేతిక రంగంలో అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించడంలో ఇది సహాయపడుతుందనీ, ఆయన, పేర్కొన్నారు. 

75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని, డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావిస్తూ, "75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని మనం కేవలం ఒక వేడుకగా జరుపుకోడానికి మాత్రమే పరిమితం చేయకూడదు. మనం కొత్త తీర్మానాలకు పునాది వేసి, సరికొత్త తీర్మానాలతో ముందుకు సాగాలి. ఇక్కడి నుండి ప్రారంభించి, భారత స్వాతంత్య్రం శతాబ్ది ఉత్సవాలను జరుపుకునే వచ్చే 25 సంవత్సరాల మొత్తం ప్రయాణం, ఒక నూతన భారతావనికి సంబంధించిన అమృత కాలాన్ని సూచిస్తుంది.", అని పేర్కొన్నారు.  రాబోయే 25 సంవత్సరాలకు సంబంధించిన భవిష్యత్ ప్రణాళిక అన్ని రంగాల్లోని శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణల ద్వారా నిర్ణయించబడుతుందని, ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్;  డి.ఎస్.ఐ.ఆర్. కార్యదర్శి, డా.శేఖర్ సి. మండే;  సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్;  టి.డి.బి. బోర్డు సభ్యులు;  డి.బి.టి. కార్యదర్శి;  శ్రీమతి రేణు స్వరూప్;  టి.డి.బి., ఐ.పి. & టి.ఏ.ఎఫ్.ఎస్. కార్యదర్శి, శ్రీ రాజేష్ కుమార్ పాఠక్;  సాంకేతికాభివృద్ధి మండలి డైరెక్టర్, శ్రీ రాజేష్ జైన్;  శాస్త్ర, సాంకేతిక విభాగం మాజీ కార్యదర్శి, ప్రొఫెసర్ అశుతోష్ శర్మ;  భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు ప్రొఫెసర్ కె. విజయ్ రాఘవన్ ప్రభృతులు దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. కాగా,  భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ కృష్ణ ఎల్ల; యువ పారిశ్రామికవేత్త, కో-ల్యాబ్ సహ వ్యవస్థాపకురాలు మరియు సి.ఓ.ఓ. శ్రీమతి అక్షత కరి ఈ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరై, సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.    

25 సంవత్సరాల టి.డి.బి. విజయవంతమైన ప్రస్థానాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసిస్తూ, ప్రధానమంత్రి ఆశయాలకు అనుగుణంగా, నూతన భారత దేశ భవిష్యత్తు కోసం కృత్రిమ మేధస్సు,  ఖగోళ శాస్త్రం, డేటా సైన్స్, సౌర విద్యుత్తు, గ్రీన్ హైడ్రోజన్, సెమీ కండక్టర్, క్వాంటం కంప్యూటింగ్, వాతావరణ మార్పు,  ఉపశమన సాంకేతికతలు, సైబర్ ఫిజికల్ విధానాల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో,  భారత దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దడానికి వచ్చే 25 సంవత్సరాలకు సంబంధించి బృహత్ ప్రణాళిక రూపొందించాలని కోరారు.  కేంద్ర మంత్రి ఈ సందర్భంగా టి.డి.బి. ప్రత్యేక సంచికను కూడా విడుదల చేశారు.

సాంఘిక ప్రయోజనాల కోసం శాస్త్ర, సాంకేతికతను ఉపయోగించుకోవాలన్న ప్రధానమంత్రి ప్రబోధాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావిస్తూ, భారతదేశ అణు శక్తి కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమే ఉంటుందని డాక్టర్ భాభా ప్రపంచానికి ప్రకటించినప్పుడు మన పూర్వీకులు దీనిని ఊహించారని, పేర్కొన్నారు.  వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వీలుగా చేసే ప్రక్రియలో వికిరణ ప్రక్రియ చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఆయన తెలియజేశారు.  అదే విధంగా, కోవిడ్ సంక్షోభం తీవ్రంగా ఉన్న  సమయంలో అణుశక్తి విభాగం పునర్వినియోగానికి వీలైన పి.పి.ఈ. సామాగ్రిని అభివృద్ధి చేసిందని, ఆయన గుర్తుచేశారు. 

డాక్టర్ జితేంద్ర సింగ్ తమ ప్రసంగాన్ని ముగిస్తూ,  శాస్త్ర, సాంకేతికతకు చెందిన అన్ని రంగాల్లో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందనీ, భారతదేశంలోని ప్రతి ఇంటిలో సాంకేతికత ప్రవేశించిందనీ, వ్యాఖ్యానించారు. మెజారిటీ భారతీయ పౌరులు "సులభంగా జీవించడాన్ని" ఆస్వాదించడానికి సహాయపడటం ద్వారా నిజమైన విజయం నిర్ణయించబడుతుందని ఆయన పేర్కొన్నారు. 

డాక్టర్ వి.కె. సారస్వత్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హయాంలో భారతదేశంలో పరోశోధన, అభివృద్ధి (ఆర్&డి) పర్యావరణ వ్యవస్థ మారిపోయిందనీ, ఇప్పుడు ట్రాన్సలేషనల్ పరిశోధన మరియు వాణిజ్యీకరణపై ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుందనీ, పేర్కొన్నారు. భారతదేశంలో ప్రస్తుతం 5,000 కంటే ఎక్కువగా అంకుర సంస్థలు పనిచేస్తున్నాయనీ, వాటిలో దాదాపు 50 సంస్థలు మహిళా పారిశ్రామికవేత్తల నేతృత్వంలో ఉన్నాయనీ, ఆయన చెప్పారు.  బహుళజాతి కంపెనీలు కూడా భారతీయ ఆవిష్కరణల కోసం నిధులు సమకూర్చడం ప్రారంభించి, భారతదేశంలో పరిశోధనా, అభివృద్ధి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాయనీ, ఇది స్వాగతించదగిన మార్పు అనీ, డాక్టర్ సారస్వత్, పేర్కొన్నారు. 

భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు, ప్రొఫెసర్ కె. విజయ్ రాఘవన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "టి.డి.బి. కీలక పాత్ర పోషిస్తూనే ఉందనీ, మన పర్యావరణ వ్యవస్థలో కొత్త రకాల ఆవిష్కరణలను పెంపొందించవచ్చునని నిరూపించింది." అని పేర్కొన్నారు. 

శాస్ర, సాంకేతిక శాఖ మరియు జీవ సాంకేతిక విజ్ఞాన శాఖ కార్యదర్శి, డాక్టర్ రేణు స్వరూప్, మాట్లాడుతూ, ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలో  టి.డి.బి. కీలక పాత్ర కోసం చేసిన కృషిని నొక్కి చెప్పారు.   డి.ఎస్.ఐ.ఆర్. కార్యదర్శి మరియు సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్ మరియు టి.డి.బి. బోర్డు సభ్యుడు, శేఖర్ సి మండే మాట్లాడుతూ,  టి.డి.బి. చేపట్టిన ప్రయత్నాలు, కార్యక్రమాలతో పాటు, భారతదేశ భవిష్యత్తు కోసం వాటి ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారు.  డి.ఎస్.టి. మాజీ కార్యదర్శి, ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ, సమాజ ప్రయోజనం కోసం, శాస్త్ర, సాంకేతికత,  ఆవిష్కరణల్లో నూతన మరియు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను ఉపయోగించుకోవడంలో టి.డి.బి పాత్ర గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు.

 

<><><>



(Release ID: 1751340) Visitor Counter : 180


Read this release in: English , Urdu , Hindi , Bengali