నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో - 'ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్'


ఐకానిక్ వారంలో నిర్వహించిన - పౌరుల కేంద్రీకృత ప్రతిస్పందన కార్యక్రమాలు

Posted On: 30 AUG 2021 3:04PM by PIB Hyderabad

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని, ప్రభుత్వం ‘ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్' జరుపుకుంటోంది.  నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ (ఎం.ఎన్.ఆర్.ఈ) 2021 ఆగస్టు 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు వారం రోజుల పాటు అనేక పౌరుల కేంద్రీకృత పరస్పర ప్రతిస్పందన కార్యక్రమాలను నిర్వహించింది.  ఎం.ఎన్.ఆర్.ఈ. పథకాల లబ్ధిదారుల తో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని వారి అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు.  స్టేట్ నోడల్ ఏజెన్సీలు (ఎస్.ఎన్.ఏ) మరియు డ్యూయిష్ గెసెల్‌షాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసామెనార్‌బీట్ (జి.ఐ.జెడ్) వంటి ద్వైపాక్షిక సహకార సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.

2021 ఆగష్టు, 25వ తేదీన "ఆఫ్-గ్రిడ్ మరియు వికేంద్రీకృత సోలార్ పి.వి అప్లికేషన్స్ ప్రోగ్రామ్‌" అనే అంశంపై సదస్సు జరిగింది.  ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం సదస్సులో, ఎం.ఎన్.ఆర్.ఈ. డైరెక్టర్, శ్రీ జె.కె. జెథానీ పాల్గొని, సోన్‌భద్ర జిల్లాలోని రాజకీయ బాలికా ఇంటర్ కళాశాల విద్యార్థులతో సంభాషించారు. ఆఫ్-గ్రిడ్ మరియు వికేంద్రీకృత సోలార్ పి.వి. అప్లికేషన్స్ ప్రోగ్రామ్ మూడవ దశ కింద ఈ  కళాశాల విద్యార్థులకు సౌర అధ్యయన దీపాలు పంపిణీ చేయడం జరిగింది. ఉత్తర ప్రదేశ్‌రాష్ట్రంలో ఎల్.డబ్ల్యూ.ఈ. ప్రభావిత జిల్లాలో సోన్‌భద్ర జిల్లా ఒకటి.  సౌర అధ్యయన దీపాలతో సంతోషంగా ఉన్నామని, విద్యార్థులు తెలియజేశారు.  గ్రిడ్ సరఫరా అందుబాటులో లేనప్పుడు, సాయంత్రం సమయాల్లో వారి అధ్యయనాలలో ఇది వారికి గణనీయంగా సహాయపడింది.  సౌర విద్యుత్తు మరియు దాని ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి ఇది వారికి సహాయపడింది.

తదనంతరం, స్థానిక లబ్ధిదారులు / లబ్ధిదారుల ఏజెన్సీలతో సంభాషించిన మంత్రిత్వ శాఖ అధికారులు,   ఎం.ఎన్.ఆర్.ఈ. కార్యక్రమం కింద నెలకొల్పిన సౌర విద్యుత్ వీధి దీపాల (ఎస్.ఎస్.ఎల్) పై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.  ముఖ్యంగా అస్సాం, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన లబ్ధిదారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జమ్మూ-కశ్మీర్ లోని బాద్గాం జిల్లాలో హస్తకళలకు ప్రసిద్ధి చెందిన కనిహామా గ్రామానికి చెందిన లబ్ధిదారులు మాట్లాడుతూ, ఎస్.ఎస్.ఎల్. ల వ్యవస్థాపన, తమ జీవితాలను మార్చివేసిందని పేర్కొంటూ,  ఇది నిజంగా, తమ కుటుంబాల్లోని మహిళలు, పిల్లలకు స్వేచ్ఛను ఇచ్చిందనీ, వారు, ఇప్పుడు రాత్రి సమయాల్లో కూడా, సురక్షితంగా వీధుల్లో నడవ గలుగుతున్నారనీ, వివరించారు.    వీరితో పాటు, మీరాన్ సాహిబ్, సలోని గ్రామాలకు చెందిన స్థానికులు, సర్పంచులు పాల్గొని, ఎస్.ఎస్.ఎల్. లను ఏర్పాటు చేయడం వల్ల సమాజానికి కలిగిన ప్రయోజనాల గురించి, వారి గ్రామాల్లో భవిష్యత్తు అవసరాల గురించి, తమ అనుభవాలను, ఈ సందర్భంగా పంచుకున్నారు.

అస్సాంలోని బొంగాగావ్ మునిసిపాలిటీకి చెందిన లబ్ధిదారులు మాట్లాడుతూ, ఈ సౌర వీధి దీపాల వల్ల, స్థానిక సమాజాలకు లభిస్తున్న ప్రయోజనాల గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా సోలార్ వీధి లైట్లు స్త్రీలు, పిల్లల భద్రతను మెరుగుపరిచాయని వారు పేర్కొన్నారు. 

తదనంతరం, అక్షయ్ ఉర్జా శిక్షణ పై జి.ఐ.జెడ్. సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.  జీవనోపాధి ఉత్పత్తి కోసం వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధన ఉత్పత్తుల సమాచారం మరియు మార్కెట్ అభివృద్ధి కోసం, మహిళా పారిశ్రామికవేత్తలకు జి.ఐ.జెడ్. కు చెందిన "యాక్సెస్ టు ఎనర్జీ ప్రాజెక్ట్" కింద అందించిన డిజిటల్ శిక్షణ గురించి, ఈ కార్యక్రమంలో వివరించారు.   డిజిటల్ వేదికలను ఉపయోగించడం ద్వారా గ్రామీణ మహిళా సామర్థ్య నిర్మాణం డి.ఆర్.ఈ. ఉత్పత్తులను ప్రోత్సహించడానికి,  'ఆత్మ నిర్భర్ భారత్' కోసం అందించిన సహకారాన్ని ఈ కార్యక్రమంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా లబ్ధిదారులను వారి అనుభవాలను పంచుకోవలసిందిగా ఆహ్వానించడం జరిగింది. 

జి.ఐ.జెడ్. మరియు క్లీన్ నెట్‌వర్క్‌ తో కలిసి ‘లైవ్‌-లీ-హుడ్-ప్రమోషన్-అండ్-వాల్యూ-ఎన్‌హాన్స్‌మెంట్‌-లో డి.ఆర్.ఈ. పవర్డ్-ప్రొడక్టివ్-అప్లికేషన్’ పై మరో సదస్సు జరిగింది.   జీవనోపాధి వృద్ధి మరియు విలువ పెంపు కోసం వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులతో పని చేసిన, జి.ఐ.జెడ్. మద్దతు ఉన్న ప్రాజెక్టు కింద నాలుగు క్షేత్ర స్థాయి భాగస్వామ్య సంస్థలు ఈ సందర్భంగా, తమ అనుభవాలను, పంచుకున్నాయి.   వ్యవసాయ, వ్యవసాయేతర జీవనాధారాలలో డి.ఆర్.ఈ.-ఆధారిత జీవనోపాధి దరఖాస్తులను విస్తరించే అవకాశాన్నీ, డిమాండ్‌ నీ, ఈ సదస్సు, ప్రత్యేకంగా పేర్కొంది.

2021 ఆగష్టు 26, 27 తేదీల్లో, ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఎవామ్ ఉత్తాన్ మహాభియాన్ (ప్రధానమంత్రి-కుసుమ్) పై సదస్సులు జరిగాయి.  ప్రధానమంత్రి-కుసుమ్ పథకం యొక్క కమ్యూనికేషన్ మరియు ప్రజా అవగాహన అంశాలపై 2021 ఆగష్టు, 26వ తేదీన మొదటి సదస్సు జరిగింది.  ఎం.ఎన్.ఆర్.ఈ., సంయుక్త కార్యదర్శి శ్రీ అమితేశ్ సిన్హా, ఈ సదస్సులో మాట్లాడుతూ, సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యూహాన్ని కలిగి ఉండటంతో పాటు పథకంపై ప్రజల్లో అవగాహన పెంపొందించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.  ప్రధానమంత్రి-కుసుమ్ పథకంపై ప్రచారం మరియు అవగాహన పెంచడం కోసం జి.ఐ.జెడ్. అభివృద్ధి చేసిన హోర్డింగ్ డిజైన్‌ లు మరియు ఆడియో-విజువల్స్ పంచుకున్నారు.  రాష్ట్ర స్థాయి అమలు సంస్థలు, వారు అమలు చేస్తున్న కమ్యూనికేషన్ వ్యూహాలను పంచుకున్నారు.

'ప్రధానమంత్రి-కుసుమ్ : ఉత్పాదక ఫలితాలను పెంచడం' అనే అంశంపై, 2021 ఆగష్టు, 26వ తేదీన రెండవ సదస్సు జరిగింది. ఈ సదస్సులో, అంతర్జాతీయ నీటి నిర్వహణ సంస్థ (ఐ.డబ్ల్యూ.ఎం.ఐ); భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఏ.ఆర్); ప్రభుత్వేతర సంస్థలు; పౌర సంస్థలు; సౌర పంపుల తయారీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా, ఈ సమావేశంలో పాల్గొన్నారు. జి.ఐ.జెడ్. మద్దతుతో, ఐ.డబ్ల్యూ.ఎం.ఐ.; సి.సి.ఏ.ఎఫ్.ఎస్. (వాతావరణ మార్పు, వ్యవసాయం, ఆహార భద్రతలపై సి.జి.ఐ.ఏ.ఆర్. పరిశోధనా కార్యక్రమం) మరియు ఐ.సి.ఏ.ఆర్. కలిసి అభివృద్ధి చేసిన సోలార్ పంప్ సైజింగ్ సాధనాన్ని, ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు చూపించి, వివరించడం జరిగింది.  యూనివర్సల్-సోలార్-పంప్-కంట్రోలర్ (యు.ఎస్‌.పి.సి) ను విస్తృత వినియోగం కోసం వ్యూహాలతో పాటు, నీటిపారుదల అవసరం లేనప్పుడు ఇతర వ్యవసాయ ఉపకరణాలను నడపడానికి సౌర శక్తిని ఉపయోగించడం పై కూడా ఈ సదస్సులో చర్చించారు.

ఆ తర్వాత, "ప్రధానమంత్రి-కుసుమ్ పథకం సామర్థ్యాన్ని ఆవిష్కరించడం" అనే అంశంపై నిర్వహించిన ఒక వెబినార్ లో వివిధ రాష్ట్రాలు, డిస్కమ్‌ లతో పాటు, పౌర సమాజానికి చెందిన కీలక భాగస్వాములు పాల్గొన్నారు.  గ్రిడ్ ఆధారిత సోలరైజేషన్ విధానాలలో రాష్ట్ర స్థాయి సవాళ్లకు పరిష్కారాలను గుర్తించడంతో పాటు, ఆఫ్-గ్రిడ్ సోలార్ పంపుల కోసం వినూత్న నమూనాలు మరియు అమలు వ్యూహాలను కనుగొనడంపై ఈ వెబినార్ దృష్టి పెట్టింది.  ఈ కార్యక్రమంలో, రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (శక్తి); హెచ్.ఐ.ఎం.యు.ఆర్.జె.ఏ. ముఖ్య కార్యనిర్వహణాధికారి; జె.వి.వి.ఎన్.ఎల్. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్;  ఝార్ఖండ్ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ కు చెందిన జె.ఓ.హెచ్.ఏ.ఆర్. ప్రాజెక్టు డైరెక్టర్;  శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్ (ఎస్.ఎస్.ఈ.ఎఫ్), డైరెక్టర్ తో పాటు, విద్యుత్తు, పర్యావరణం, జల శాఖలతో కూడిన మండలి (సి.ఈ.ఈ.డబ్ల్యూ) సభ్యులూ పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులతో పరస్పర చర్చలు కూడా జరిగాయి.

2021 ఆగష్టు, 27వ తేదీ కార్యక్రమాలు రాజస్థాన్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన లబ్ధిదారులైన రైతులతో సంభాషణ తో, ప్రారంభమయ్యాయి.   ప్రధానమంత్రి-కుసుమ్ పథకానికి సంబంధించి, రైతులు, తమ అనుభవాలను, అభిప్రాయాలను,  పంచుకున్నారు.  వారు అనుసరించిన వినూత్న విధానాల గురించి కూడా, రైతులు, ఈ సందర్భంగా, తెలియజేశారు.  జార్ఖండ్‌లోని కుంతి నుండి మహిళా రైతులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై, వారి అనుభవాలను పంచుకున్నారు.  స్వతంత్ర పంపుల పనితీరుపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ, వారి రాష్ట్రాలు / జిల్లాల్లో మరిన్ని కేటాయింపుల కోసం అభ్యర్థించారు.  కాంపోనెంట్-ఎ మరియు కాంపోనెంట్-సి కింద రైతులు కూడా సమావేశానికి హాజరై, తమ అభిప్రాయాలను పంచుకున్నారు.  కాంపోనెంట్-ఎ కింద, సులభంగా ఆర్ధిక వనరులు అందుబాటులో ఉండాలనీ, వడ్డీ రేట్లను తగ్గించాలనీ, రైతులు, అభ్యర్థించారు.

ఆ తర్వాత, ప్రధానమంత్రి-కుసుమ్ పథకం కింద పెట్టుబడి పెట్టే అంశంపై జి.ఐ.జెడ్. సహకారంతో నిర్వహించిన సదస్సులో,  బ్యాంకులు; ఎస్.ఈ.సి.ఐ.;  కె.ఎఫ్.డబ్ల్యూ.; ఐ.ఆర్.ఈ.డి.ఏ.; డెలాయిట్ ప్రతినిధులతో పాటు, లబ్ధిదారులైన రైతులు కూడా పాల్గొన్నారు.   ప్రధానమంత్రి-కుసుమ్ పథకాన్ని మరింత భారీ స్థాయిలో అమలుచేయడానికి అవసరమైన ఆర్థిక ఉత్పత్తులు, వ్యూహాలను రూపొందించుకోడానికి వీలుగా, ఈ సదస్సులో పాల్గొన్న సంస్థల ప్రతినిధులు, లభిదారులు, తమ తమ అభిప్రాయాలనూ, అనుభవాలనూ, ఒకరికొకరు పంచుకున్నారు.  ప్రధానమంత్రి-కుసుమ్ పథకం కింద ఆర్థిక ఉత్పత్తులకు సంబంధించి, రైతులు తమ అంచనాలపై అభిప్రాయాలను, ఈ సందర్భంగా తెలియజేశారు. 

కమ్యూనిటీ స్థాయి స్వచ్ఛమైన శక్తి జోక్యాల ప్రభావంపై లబ్ధిదారులతో ప్రతిస్పందన కార్యక్రమాన్ని కూడా జి.ఐ.జెడ్. సహకారంతో నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  మినీ / మైక్రో గ్రిడ్ ఆపరేటర్లు, ఈ రంగంలో పనిచేసే ఎన్‌.జి.ఓ.లతో పాటు, ఆయా వ్యవస్థల లబ్ధిదారులు కూడా హాజరయ్యారు.  మైక్రో / మినీ గ్రిడ్‌ ల వంటి కమ్యూనిటీ స్థాయి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ల సంస్థాపన, వారి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే విషయం పై, లబ్ధిదారులు, తమ అనుభవాలను పంచుకున్నారు.

ప్రధానమంత్రి-కుసుమ్ పథకం పై ఎం.ఎన్.ఆర్.ఈ. నిర్వహించిన క్విజ్ పోటీలో అనేక రాష్ట్ర స్థాయి అమలు సంస్థలు పాల్గొన్నాయి. పథకానికి చెందిన ప్రతి అంశం పైన ప్రత్యేకంగా క్విజ్‌ పోటీలు నిర్వహించారు. 

ప్రధానమంత్రి-కుసుమ్ పథకం పై సాయంత్రం ఐదు గంటలకు జరిగిన ముగింపు సమావేశంలో, ప్రధానమంత్రి-కుసుమ్ పథకం అమలులో ఆదర్శప్రాయమైన కృషిని ప్రదర్శించిన రాష్ట్ర స్థాయి అమలు ఏజెన్సీలను, సంస్థాపకులను సత్కరించారు.

*****



(Release ID: 1750599) Visitor Counter : 250