జల శక్తి మంత్రిత్వ శాఖ

లక్ష గ్రామాలు.. 50 వేల గ్రామ పంచాయతీల‌లో 'హర్ ఘర్ జల్'


- మేటి నైపుణ్యంతో వేగంగా పనిచేస్తున్న జల్ జీవన్ మిషన్.. గత 23 నెలల్లో 4.5 కోట్ల గృహాలకు కుళాయిల‌ ద్వారా నీటి సరఫరా

Posted On: 14 JUL 2021 4:38PM by PIB Hyderabad

2024 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి పంపుల ద్వారా స్వ‌చ్ఛ‌మైన మంచి నీటిని అందించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ విజ‌న్‌ను సాకారం చేస్తూ జల్ జీవన్ మిషన్ మేటి నైపుణ్యంతో వేగంగా ప‌నులు చేప‌డుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జల్ జీవన్ మిషన్ (జేజేఎం)దేశ వ్యాప్తంగా లక్ష గ్రామాల్లోని ప్రతి ఇంటికి పంపు నీటి సరఫరాను అందించి స‌రికొత్త‌ మైలురాయిని సాధించింది. కేవ‌లం 23 నెలల స్వల్ప కాలంలో ఇంత‌టి మైలురాయిని చేరుకోవ‌డం విశేషం. దేశంలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు మొత్తంగా 18.94 కోట్ల గ్రామీణ గృహాలుండ‌గా కేవ‌లం 3.23 కోట్ల‌ (17%) గృహాల‌లో మాత్రమే కుళాయి నీటి కనెక్షన్లు ఉండేవి. కోవిడ్-19 మహమ్మారి విస్త‌ర‌ణ లాక్‌డౌన్ అంతరాయాలు ఉన్నప్పటికీ.. జల్ జీవన్ మిషన్ 23 నెలల్లో 4.49 కోట్ల పంపు నీటి కనెక్షన్లను అందించింది. ఈ పంచాయతీలలోని ప్రతి ఇంటికి కుళాయి నీటి సరఫరాను అందించడం ద్వారా 50 వేల గ్రామ పంచాయతీలకు ‘హర్ ఘర్ జల్’ను చేరువ చేసింది. దీంతో నేడు పంపుల ద్వారా నీటి సరఫరా చేయ‌డం దాదాపు 7.72 కోట్ల (40.77%) గృహాలకు చేరుకుంది. గోవా, తెలంగాణ, అండమాన్ & నికోబార్ దీవులు, పుదుచ్చేరి గ్రామీణ ప్రాంతాలు 100% పంపు నీటి సరఫరాను సాధించి ‘హర్ ఘర్ జల్’గా మారాయి. ‘సబ్‌కాసాత్, స‌బ్‌కా వికాస్, సబ్‌కా విశ్వస్’ అనే ప్రధాన మంత్రి దృష్టి సూత్రాన్ని అనుసరించి.. మిషన్ యొక్క నినాదం ఏమిటంటే..‘ఎవ్వరిని వదిలివేయకుండా అందిర‌కీ నీటి స‌ర‌ఫ‌రా’ అనే విధంగా గ్రామంలోని ప్రతి ఇంటికి పంపు నీటి కనెక్షన్ అందించాలి. ప్రస్తుతం 71 జిల్లాలు, 824 బ్లాక్‌లు, 50,309 గ్రామ పంచాయతీలు, 1,00,275 గ్రామాలు ‘హర్ ఘర్ జల్’ లక్ష్యాన్ని సాధించాయి. గ‌త నీటి సరఫరా కార్యక్రమాల నుండి ఒక నమూనా మార్పులో భాగంగా.. 2019 ఆగస్టు 15న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రకటించిన జల్ జీవన్ మిషన్ (జేజేఎం) కేవలం నీటి సరఫరా మౌలిక సదుపాయాలను కల్పించడం కంటే నీటి సేవా పంపిణీపై దృష్టి పెట్టింది.
అంద‌రికీ తాగునీటి స‌ర‌ఫ‌రా భ‌రోసా..
జేజేఎం కింద ప్రతి ఇంటి సామాజిక- ఆర్ధిక స్థితిగతులతో సంబంధం లేకుండా కుళాయిల‌ ద్వారా నీటి సరఫరా ఉండేలా చూడటమే దీని లక్ష్యం. సమాజంలోని పేద, బలహీన మరియు అట్టడుగు వర్గాలలోని పేదలకు భరోసా ఇచ్చే ‘ఎవ్వరిని వదిలివేయకుండా అంద‌రికీ నీరు’ అనే సూత్రంపై జేజేఎం నిర్మించబడింది. ఈ ల‌క్ష్య సాధ‌న‌కు గాను  ఎలాంటి అర్హత లేని వారికి కూడా వారి ఇళ్లలో తాగునీటి సరఫరాకు భరోసాను అందిస్తారు. ఇళ్లలోనే తాగునీరు లభిస్తుందనే భరోసా క‌లుగుతోంది. గ్రామీణ భారతదేశం అంతటా శ‌తాబ్దాల‌ కాలంగా మ‌హిళ‌లు, యువ‌త‌ ఎదుర్కొంటున్న తాగునీటి స‌మ‌స్య‌ల నుంచి వారిని కాపాడుతుంది. ఇది వారి ఆరోగ్యం, విద్య, సామాజిక- ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటిలో నీటి కనెక్షన్ ఉండ‌డం పట్టణ-గ్రామీణ ప్రాంత అంతరాన్ని తీర్చడంతో పాటుగా.. ప్రజలకు గౌరవం క‌ల్పిస్తుంది. సురక్షితమైన నీటిని పొందడంలో ‘జీవన సౌలభ్యం’ తెస్తుంది. అయిదేండ్ల స్వల్ప వ్యవధిలో ప్రతి గ్రామీణ గృహాలకు కుళాయి నీటి సరఫరా అందించాల‌నే ఈ బృహ‌త్ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం రూ.3.60 లక్షల కోట్ల నిధుల‌ను కేటాయించింది. 2020-21లో రాష్ట్రాలు / కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ కోసం రూ.11,000 కోట్ల మేర నిధుల‌ను కేటాయించారు. 2021-22 నిమిత్తం అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధుల కేటాయింపులో నాలుగు రెట్ల మేర అధిక నిధుల‌ను అందించేందుకు కేంద్ర మంత్రి జల్ శక్తి, శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్ స‌మ్మ‌తినిచ్చారు. ఈ నిధుల ద్వారా లక్ష్యాన్ని సాధించడానికి నిధుల‌ కొరత లేకుండా పోతుంది. కేవలం మూడు నెలల్లో, వారి వార్షిక కార్యాచరణ ప్రణాళికలు (ఆప్) కింద ప్రతిపాదించిన నిధుల వినియోగం మరియు అవసరాల ఆధారంగా రాష్ట్రాలు / యుటీలు రూ.8,891 కోట్ల మేర నిధుల‌ను డ్రా చేశారు.
రూ .1,42,084 కోట్ల నిధులకు హామీ..
2021-22లో దేశంలోని గ్రామీణ స్థానిక సంస్థలు / పీఆర్‌ఐలకు నీరు, పారిశుద్ధ్యం కోసం 15వ ఆర్థిక కమిషన్ మంజూరు చేసినందున రాష్ట్రాలకు రూ.26,940 కోట్లు కేటాయించారు. రాబోయే ఐదేండ్ల కాలానికి అంటే 2025-26 వరకు రూ .1,42,084 కోట్ల నిధులకు హామీ ఉంది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ భారీ పెట్టుబడి ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. ఇది గ్రామాల్లో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. జల్ జీవన్ మిషన్ అనేది ఒక ‘బాటమ్ అప్’ విధానాన్ని అనుసరిస్తుంది. ఇక్కడ ప్రణాళిక, అమలు, నిర్వహణ, ఆపరేషన్ మ‌రియు సాధార‌ణ నిర్వహణ వరకు సమాజం కీలక పాత్ర పోషిస్తుంది. ల‌క్ష్యాన్ని సాధించడానికి, విలేజ్ వాటర్ & శానిటేషన్ కమిటీ (వీడబ్ల్యుఎస్‌సీ) / పాని సమితిని బలోపేతం చేయడం, వచ్చే ఐదేళ్ల పాటు గ్రామ కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయడం, గ్రామ సంఘాలను హ్యాండ్‌హోల్డ్ & సపోర్ట్ చేయడానికి, అవ‌గాహ‌న పెంచ‌డానికి రాష్ట్ర ఏజెన్సీలను(ఐఎస్‌ఐ) అమలు చేయడం వంటి ప‌లు సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 2.67 లక్షల వీడబ్ల్యుఎస్‌సీలు లేదా పాని సమితులు ఏర్పాటు చేయబడ్డాయి. భారతదేశం అంతటా 1.84 లక్షల గ్రామ కార్యాచరణ ప్రణాళికలు అభివృద్ధి చేయబడ్డాయి. జల్ జీవన్ మిషన్ కింద, నీటి కొరత ఉన్న ప్రాంతాలు, నాణ్యమైన ప్రభావిత గ్రామాలు, ఆశాజనక జిల్లాలు, ఎస్సీ / ఎస్టీ మెజారిటీ గ్రామాలు, సాన్సాద్ ఆదర్శ్ గ్రామ యోజన (సాగి) గ్రామాలకు కుళాయి నీటి సరఫరా అందించడానికి ప్రాధాన్యత ఇవ్వబడింది.
33 శాతానికి చేరిన కుళాయి నీటి స‌ర‌ఫ‌రా..
గ‌డిచిన 23 నెలల్లో 117 ఔత్సాహిక జిల్లాల్లో కుళాయి నీటి సరఫరా 7 శాతం నుండి.. 33 శాతానికి చేరింది. అంటే నాలుగు రెట్లు పెరిగింది. దీనికి తోడు జపనీస్ ఎన్సెఫాలిటిస్- అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ (జేఈ-ఐఈఎస్) బారిన పడిన 61 జిల్లాల్లో 97 లక్షలకు పైగా గృహాలకు కుళాయి నీటి సరఫరా అందించబడింది. 696 సాగి గ్రామాలు, 29,063 ఎస్సీ/ఎస్టీ జ‌నాభా అత్య‌ధికంగా క‌లిగిన‌ గ్రామాలు ‘హర్ ఘర్ జల్’ గా మారాయి. దేశంలోని పాఠశాలలు, ఆశ్రమాలు, అంగన్‌వాడి కేంద్రాల‌లోని పిల్లలకు సురక్షితమైన పంపు నీటిని నిర్ధారించడానికి దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ 100 రోజుల క్యాంపెయిన్‌ను  ప్రకటించారు. దీనిని మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్ 2020 అక్టోబర్ 2వ తేదీన‌ప్రారంభించారు.
ఫలితంగా తమిళనాడు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, గోవా,  తెలంగాణ, అండమాన్ & నికోబార్ దీవులు వంటి రాష్ట్రాలు / యుటీలు అన్ని పాఠశాలలు, ఆశ్రమాలు, అంగన్వాడి సెంట‌ర్ల‌కు కుళాయి నీటిని అందించారు. ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా 6,76,789 పాఠశాలలు (65.7%), 6,74,611 (59.8%) అంగన్‌వాడిసెంటర్ల‌కు మధ్యాహ్నం భోజనం వండడానికి మ‌రియు తాగ‌డానికి, మరుగుదొడ్డిలో చేతితో కడుక్కోవడానికి మరియు వాడటానికి తగిన పరిమాణంలో నీటి కుళాయిల ద్వారా నీటి సరఫరా అందించబడింది. మేటి ఆరోగ్యం, మెరుగైన పారిశుధ్యం, పిల్లల పరిశుభ్రతల‌ కోసం మిగిలిన అన్ని ర‌కాల పాఠశాలలు, ఆశ్రమ‌శాలాలు, అంగన్‌వాడి సెంటర్‌లలో కొన్ని నెలల్లో సురక్షితమైన పంపు నీటిని అందించేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు / యుటీలను కోరింది.
నీటి నాణ్యత పర్యవేక్షణకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు..
 నీటి నాణ్యత పర్యవేక్షణ మరియు నిఘా కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. దీని కోసం అంగన్‌వాడీ కార్మికులు, ఆశా కార్మికులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, సీఆర్‌ఐ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు మొదలైనవారికి అవ‌గాహ‌న క‌ల్పించ‌బ‌డుతోంది; ఫీల్డ్ టెస్ట్ కిట్స్ (ఎఫ్‌టీకే)ను ఉపయోగించడం ద్వారా నీటి నమూనాల్ని పరీక్షించడానికి వీలుగా వీరు శిక్షణ పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా 2,015 ప్రయోగశాలలు ఉన్నాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులతో దాదాపు 195 నీటి ప్రయోగశాలలు ఎన్ఏబీఎల్‌ గుర్తింపును పొందాయి. ఇందుకు తోడు రాష్ట్రాలు నీటి పరీక్ష ప్రయోగశాలలను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. అవి త‌ద్వారా ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్‌ను పొందుతున్నాయి. ఈ ప్రయోగశాలలు ప్రజలకు తెరిచి ఉంటాయి.. తద్వారా వారి నీటి నమూనాలను నామమాత్రపు ఖర్చుతో పరీక్ష చేయించుకొని సుర‌క్షిత‌మైన నీటిని పొంద‌వ‌చ్చు. జల్ జీవన్ మిషన్ పారదర్శకత, జవాబుదారీతనం, నిధుల సరైన వినియోగం, సేవా బట్వాడా నిర్ధారించడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటుంది.
జియో ట్యాగింగ్‌తో ప‌ర్య‌వేక్ష‌ణ‌..
జేజేఎం-ఐఎంఐఎస్‌ పబ్లిక్ డొమైన్‌లో ఉంచిన ఒక ప్రత్యేక డాష్‌బోర్డ్‌తో కింద భౌతిక మరియు ఆర్థిక పురోగతిని సంగ్రహిస్తుంది. ఈ స‌మాచారాన్ని ప‌బ్లిక్ డొమైన్..
https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx లో అందుబాటులో ఉంచింది. సెన్సార్ ఆధారిత ఐఓటీ పరిష్కారం పైలట్ చేయబడింది.. దీని ద్వారా నిజసమయ ప్రాతిపదికన గ్రామాల్లో నీటి సరఫరా యొక్క పరిమాణం, నాణ్యత, క్రమబద్ధతకు సంబంధించి నీటి సరఫరాను కొలవడం పర్యవేక్షించడం జ‌రుగుతోంది. నీటి స‌ర‌ఫ‌రాకు ఏర్పాటు చేయ‌డ‌మైన వివిధ ర‌కాల ఆస్తుల‌ ఫోటోను జియో-ట్యాగ్ చేయడ‌మైంది. తాగునీటి వనరులను గుర్తించడానికి సింగిల్ విలేజ్ స్కీమ్‌ను ప్లాన్ చేయడానికి హైడ్రో-జియో మోర్ఫోలాజికల్ (హెచ్‌జీఎం) పటాలు ఉపయోగించబడతాయి. దీనికి తోడు ఆక్విఫెర్ రీఛార్జ్ నిర్మాణాలకు కూడా దీనిని వాడ‌డం జ‌ర‌గుతోంది. హర్ ఘర్ జల్ కార్య‌క్ర‌మం కింద అందించబడిన గృహ కుళాయి కనెక్షన్లు ఇంటి య‌జ‌మాని యొక్క ఆధార్ సంఖ్యతో అనుసంధానించబడి ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్టులోని ఆర్థిక లావాదేవీల‌న్నీ పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పీఎఫ్‌ఎంఎస్) ద్వారా జరుగుతున్నాయి. రాష్ట్రాల భాగస్వామ్యంతో పనిచేస్తున్న జల్ జీవన్ మిషన్ 2024 నాటికి భారతదేశంలోని ప్రతి గ్రామీణ గృహాలకు తగిన పరిమాణంలో నిర్దేశిత నాణ్యతతో కుళాయి నీటి సరఫరాను నిర్ధారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది.                                                                            

 ***



(Release ID: 1735732) Visitor Counter : 191