జల శక్తి మంత్రిత్వ శాఖ

2023 నాటికి చత్తీస్ గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఒక్క ఇంటికీ టాప్ వాటర్ కనెక్షన్ ఇచ్చే దిశగా పెద్ద అడుగు; జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం రూ.1909 కోట్లు కేటాయింపు

Posted On: 11 JUN 2021 7:05PM by PIB Hyderabad

ప్రతీ ఒక్క ఇంటికీ టాప్ ల ద్వారా నీరు అందించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలను సాకారం చేసే దిశగా కేంద్రప్రభుత్వం చత్తీస్ గఢ్ కు గ్రాంట్ ను 2021-22 సంవత్సరంలో రూ1908.96 కోట్లకు పెంచింది. 2020-21లో ఈ గ్రాంట్ రూ.445.52 కోట్లు మాత్రమే. జల్ శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ జల్ జీవన్ మిషన్ రాష్ర్టానికి తొలి విడతగా రూ.453.71 కోట్లు విడుదల చేసింది. గత ఏడాదితో పోల్చితే నాలుగు రెట్ల అధిక కేటాయింపునకు ఆమోదముద్ర వేసిన కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ హెకావత్ 2023 సంవత్సరం నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఒక్క ఇంటికీ టాప్ నీరు సరఫరా చేసేందుకు రాష్ర్టానికి పూర్తి సహకారం అందచేస్తామని హామీ ఇచ్చారు. 

2019లో ఈ మిషన్ ప్రారంభించే నాటికి దేశంలోని మొత్తం 19.20 కోట్ల గ్రామీణ గృహాల్లోనూ 3.23 కోట్ల ఇళ్లకు (17%) టాప్ నీటి సరఫరా ఉండేది. గత 21 నెలల కాలంలో ఒకపక్క కోవిడ్-19 విజృంభణ, లాక్ డౌన్ అవరోధాలు ఉన్నప్పటికీ జల్ జీవన్ మిషన్ వేగంగా అమలుపరిచి 4.25 కోట్ల ఇళ్లకు పైప్ ల ద్వారా నీటి కనెక్షన్లు అందించారు. ఆ కవరేజిని 22% పెంచడం ద్వారా ఇప్పుడు దేశవ్యాప్తంగా 7.50 కోట్ల (39%) గ్రామీణ ఇళ్లకు టాప్ నీటి సరఫరా అందుబాటులోకి వచ్చింది. గోవా, తెలంగాణ, అండమాన్ & నికోబార్ దీవులు, పుదుచ్చేరి గ్రామీణ ప్రాంతాల్లోని నూరు శాతం ఇళ్లకు పైప్ నీటి సరఫరా సాధించి "హర్ ఘర్ జల్" రాష్ర్టాలుగా మారాయి. ప్రధానమంత్రి "సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్" సిద్ధాంతానికి దీటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఒక్క ఇల్లు పైప్ నీటి సరఫరా కనెక్షన్ లేకుండా ఉండకూడదన్నది లక్ష్యం. ఇప్పుడు దేశంలోని 62 జిల్లాల్లోని 92 వేల గ్రామాల్లో ప్రతీ ఒక్క ఇంటికీ టాప్ నీటి సరఫరా అందుబాటులో ఉంది.

చత్తీస్ గఢ్ లో 19,684 గ్రామాల్లో మొత్తం 45.48 లక్షల  ఇళ్లుండగా 5.69 లక్షల ఇళ్లకు (12.52%) టాప్ ల ద్వారా నీటి కనెక్షన్లు అందించడం జరిగింది. 2019 ఆగస్టు 15న జల్ జీవన్ మిషన్ ప్రారంభించే నాటికి కేవలం 3.19 లక్షల (7.03%) ఇళ్లకే పైప్ నీటి కనెక్షన్లున్నాయి. 21 నెలల కాలంలో రాష్ట్రంలో 2.49 లక్షల (5.49%) ఇళ్లకు మాత్రమే టాప్ నీటి కనెక్షన్లు కల్పించారు. దేశంలో మందకొడిగా కనెక్షన్లు ఇచ్చిన రాష్ర్టాల్లో రెండో స్థానం ఇది. చత్తీస్ “హర్ ఘర్ జల్” రాష్ట్రం కావాలంటే ఇంకా 39.78 లక్షల ఇళ్లకు టాప్ నీటి కనెక్షన్లు ఇవ్వాలి. అలాగే చత్తీస్ గఢ్ లో 5,530 గ్రామాలకు టాప్ నీటి కనెక్షన్లు అందించే పనులు ప్రారంభం కాలేదు. “హర్ ఘర్ జల్” రాష్ట్రం కావాలన్న లక్ష్యంలో భాగంగా చత్తీస్ గఢ్ 2021-22లో 22.14 లక్షలు, 2022-23లో 11.37 లక్షల ఇళ్లకు, 2023-24లో చివరిగా మిగిలిపోయిన 6.29 లక్షల ఇళ్లకు టాప్ నీటి కనెక్షన్లు అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది.

2020-21 సంవత్సరంలో చత్తీస్ గఢ్ కేవలం 1.51 లక్షల టాప్ కనెక్షన్లు మాత్రమే అందించగలిగింది. 2023 నాటికి హర్ ఘర్ జల్ రాష్ట్రం కావాలన్న లక్ష్యం నెరవేరడానికి టాప్ కనెక్షన్ల వేగం పెంచాలని, అలాగే టాప్ కనెక్షన్లు కల్పించే పనులు అన్ని గ్రామాల్లో ఒకే సారి ప్రారంభించాలని తెలియచేస్తూ చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రికి జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ లేఖ రాశారు.

2020-21 సంవత్సరంలో చత్తీస్ గఢ్ కు రూ.445.52 కోట్ల కేంద్ర గ్రాంట్ కేటాయించినప్పటికీ అమలు మందకొడిగా ఉన్నందు వల్ల రాష్ట్రం రూ.334.14 కోట్లు మాత్రమే డ్రా చేసుకోగలిగింది. గ్రామీణ ప్రాంతాల్లో టాప్ నీటి సరఫరాకు కేటాయించిన మిగతా రూ.111.48 కోట్లు తిరిగి వాపసు చేసింది. ఈ ఏడాది కేంద్ర కేటాయింపు నాలుగింతలు పెంచగా (రూ.1908.96 కోట్లు) అందులో వినియోగించకుండా ఉన్న సొమ్ము రూ.168.52 కోట్లుంది. దీనికి తోడు 2020-21 సంవత్సరం రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ లో రూ.113.04 కొరత ఉంది. కాగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ కింద 2021-22 సంవత్సరపు నీటిసరఫరా పనుల కోసం రాష్ట్ర మాచింగ్ వాటాగా రూ.4268 కోట్లు అందుబాటులో ఉంచనున్నట్టు హామీ ఇచ్చింది. ఆ రకంగా నిధుల అందుబాటులో ఎలాంటి కొరత లేదు. రాష్ట్రప్రభుత్వం ఈ నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామీణ గృహాలన్నింటికీ టాప్ నీటి కనెక్షన్లు కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుందన్న ఆశాభావం కేంద్ర మంత్రి ప్రకటించారు.

2021-22 సంవత్సరంలో చత్తీస్ గఢ్ కు గ్రామీణ స్థానిక సంస్థలు/  పిఆర్ఐలలో నీటి సరఫరా, పారిశుధ్య కార్యక్రమాల కోసం 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుకు అనుగుణంగా రూ.646 కోట్లు గ్రాంట్ కేటాయించడం జరిగింది. అలాగే 2025-26 వరకు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో రాష్ర్టానికి రూ.3402 కోట్లు హామీగా నిధులు అందుబాటులో ఉన్నాయి. చత్తీస్ గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో పెడుతున్న ఈ భారీ పెట్టుబడి వల్ల కొత్తగా ఉపాధి అవకాశాలు ఏర్పడడంతో పాటు ఆర్థిక కార్యకలాపాల్లో వేగం పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది.

దేశంలోని పాఠశాలలు, ఆశ్రమశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు టాప్ ల ద్వారా రక్షిత నీరు అందించడం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 100 రోజుల కార్యక్రమం ప్రకటించగా 2020 అక్టోబర్ 2వ తేదీన కేంద్ర మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెకావత్ ప్రారంభించారు. ఫలితంగా రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ & నికోబార్ దీవులు పాఠశాలలు, ఆశ్రమశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో నీటి సరఫరాకు కేటాయింపులు చేశాయి.  ఇదిలా ఉండగా చత్తీస్ గఢ్ లో మాత్రం కేవలం 11,521 పాఠశాలలు (25%), 4810 అంగన్ వాడీ కేంద్రాలకు (10%) మాత్రమే పైప్ ల ద్వారా నీటి సరఫరా అందుబాటులో ఉండడం ఆందోళనకరమైన అంశం. విద్యార్థుల ఆరోగ్యం మెరుగు పరచడంతో పాటు పారిశుధ్యం, శుభ్రత పెంచేందుకు మిగిలిపోయిన అన్ని పాఠశాలలు, ఆశ్రమశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు టాప్ ల ద్వారా రక్షిత మంచినీరు అందించే ప్రయత్నం చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెకావత్ రాష్ర్టానికి సూచించారు.

అలాగే జల్ జీవన్ మిషన్ కింద నీటి కొరత అధికంగా ఉన్న  ప్రాంతాలు, నీటిలో నాణ్యత లోపించిన గ్రామాలు, ఆకాంక్షాపూరిత జిల్లాలు, ఎస్ సి/  ఎస్ టి మెజారిటీ గ్రామాలు, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (ఎస్ఏజివై)  గ్రామాల్లో పైప్ ల ద్వారా నీటి సరఫరాకు రాష్ట్రం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది.
అంతే కాదు... నీటి నాణ్యత, నిఘా కార్యకలాపాలకు కూడా అగ్రప్రాధాన్యం ఇవ్వాలి. ఆ కార్యకలాపాల్లో అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, స్వయంసహాయక బృందాల సభ్యులు, పిఆర్ఐ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులను కూడా భాగస్వాములను చేయాలి. ఇందుకోసం ఫీల్డ్ టెస్ట్ కిట్లు (ఎఫ్ టికె) ఉపయోగించి నీటి కాలుష్య పరీక్షలు చేయడంపై వారికి శిక్షణ ఇవ్వాలి. చత్తీస్ గఢ్ లో నీటి నాణ్యత పరీక్షించే 68 ప్రయోగశాలలుండగా వాటిలో 3 మాత్రమే ఎన్ఏబిఎల్ అక్రెడిటేషన్ కలిగి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నీటి పరీక్ష ప్రయోగశాలలను మరింతగా అప్ గ్రేడ్ చేసి ఎన్ఏబిఎల్ అక్రెడిటేషన్ తీసుకోవాలి.

జల్ జీవన్ మిషన్ దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అమలు జరిగే కార్యక్రమం గనుక అమలు, నిర్వహణ, ఆపరేషన్, మెయింటెనెన్స్ వంటి విభాగాల్లో ప్రణాళిక రూపకల్పనలో సమాజానికి కీలక పాత్ర ఉంటుంది. దీన్నిసాధించడానికి రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో గ్రామీణ నీరు, పారిశుధ్య కమిటీలు (విడబ్ల్యుఎస్ సి)/  పానీ సమితులను పటిష్ఠం చేయడంతో పాటు గ్రామీణ కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేయాలి. అలాగే గ్రామీణ సమాజాన్ని చేయి పట్టుకుని ముందుకు నడిపి మద్దతు అందించడం, ప్రజల్లో చైతన్యం పెంచడం కోసం రాష్ట్ర స్థాయి అమలు సంస్థలను (ఐఎస్ఏ) భాగస్వాములను చేయాలి. చత్తీస్ గఢ్ లో గ్రామాలు అధిక సంఖ్యలో ఉన్న కారణంగా 2021-22 లో 14గా ఉన్న  రాష్ట్ర స్థాయి అమలు సంస్థల (ఐఎస్ఏ) సంఖ్యను మరింతగా పెంచాలి. ప్రతీ ఒక్క ఇంటికి హామీగా నీటి సరఫరా అందించడం కోసం నీటి సరఫరా మౌలిక వసతుల దీర్ఘకాలిక మనుగడ, అమలు, నిర్వహణ అన్నింటిలోనూ సామర్థ్యాల నిర్మాణం, మార్గదర్శకం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.

రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో 2024 నాటికి దేశంలోని ప్రతీ ఒక్క గ్రామీణ ఆవాసానికి టాప్ ల ద్వారా నీటి కనెక్షన్ అందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి 2019 ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట నుంచి జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రకటించారు. 2021-22 సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ కింద మొత్తం బడ్జెట్ కేటాయింపు రూ.50011 కోట్లతో పాటు  ఆర్ఎల్ బిలు/  పిఆర్ఐలకు 15వ ఫైనాన్స్ కమిషన్ వాటాగా రాష్ర్టాల వనరుల నుంచి సమకూర్చే రూ.26940 కోట్లు కలిపి ఈ ఏడాది గ్రామీణ మంచి నీటి సరఫరా రంగంపై రూ.1 లక్ష కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతోంది. ఇది గ్రామాల్లో కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది.

 

***
 



(Release ID: 1726432) Visitor Counter : 147


Read this release in: English , Urdu , Hindi