చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు త‌దుప‌రి ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా


జూన్ 01, 2020 నుంచి అమల్లోకి వ‌చ్చేలా నోటిఫికేషన్ జారీ చేసిన న్యాయ‌శాఖ‌

Posted On: 24 MAY 2021 2:35PM by PIB Hyderabad

 

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుంటూ భారత రాష్ట్రపతి.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ హైకోర్టులో చాలా సీనియర్ జ‌డ్జిగా ప‌నిచేస్తున్న‌ శ్రీ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియ‌మించారు. ప్ర‌స్తుత ఛ‌త్తీస్‌గ‌ఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ పరప్పిల్లిల్ రామకృష్ణన్ నాయర్ రామచంద్ర మీనన్ త్వ‌ర‌లో పదవీ విరమణ పొంద‌నున్నారు. జ‌స్టిస్ మీన‌న్ త‌రువాత జూన్ 01వ తేదీ 2020 నుంచి ఆ ప‌ద‌విని శ్రీ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చేప‌ట్టేలా ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి కేంద్ర న్యాయ శాఖ ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, బి.ఎస్.సి, ఎల్.ఎల్.బి పూర్తి చేసిన త‌రువాత‌ సెప్టెంబర్ 4, 1987న న్యాయవాదిగా చేరారు. జిల్లా కోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు, ఛత్తీగ‌ఢ్‌ హైకోర్టులో సివిల్, కాన్‌స్టిట్యూష‌న‌ల్‌, రెవెన్యూ మరియు క్రిమినల్ అంశాల‌పై ప్రాక్టీస్ చేశారు. భార‌త‌ రాజ్యాంగం, పౌర విషయాల‌లో జ‌స్టిస్ పి.కె. మిశ్రా నిష్ణాతులు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రానికి అదనపు అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ జనరల్‌గా కూడా జ‌స్టిస్ పి.కే. మిశ్రా సేవ‌లందించారు. జ‌స్టిస్ పి.కె.మిశ్రా డిసెంబర్ 10, 2009న ఛ‌త్తీస్‌గ‌డ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగాను, నవంబర్ 28, 2014న శాశ్వత న్యాయమూర్తిగా నియమితుల‌య్యారు.
                               

****



(Release ID: 1721329) Visitor Counter : 89


Read this release in: English , Urdu , Hindi , Tamil