ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 కట్టడిలో ఆదర్శం నాందేడ్ జిల్లాలోని భోసి గ్రామం
Posted On:
20 MAY 2021 1:11PM by PIB Hyderabad
కోవిడ్-19ని కట్టడి చేయడానికి నాందేడ్ జిల్లాలోని భోసి గ్రామం వినూత్న మార్గాన్ని అనుసరించి విజయం సాధించి దేశంలో అందరికి మార్గదర్శకంగా నిలిచింది. దేశంలో గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ కోవిడ్-19 కొత్త సవాళ్లను విసిరింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వ్యాప్తిని నివారించడానికి గ్రామీణ ప్రాంతాల ప్రజలను చైతన్యవంతులను చేసి పంచాయతీ రాజ్ సంస్థలు ముందుకు వచ్చి సహకరించాలని పిలుపు ఇచ్చారు.
పట్టణ ప్రాంతాలతో పోల్చి చూస్తే వైద్య సౌకర్యాలు తక్కువగా కలిగి పరీక్షలను నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడం క్లిష్టంగా ఉంటుంది. ఈ సమయంలో నాందేడ్ జిల్లా భొకర్ తాలూకాలోని భోసి గ్రామంలో అనుసరిస్తున్న విధానం అందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. కోవిడ్ ని కట్టడి చేయడానికి ఏకాంతంగా జీవించడమే మార్గంగా ఈ గ్రామ ప్రజలు ఎంచుకున్నారు.

రెండు నెలల కిందట గ్రామంలో వివాహ వేడుక జరిగిన తరువాత ఒక అమ్మాయికి వైరస్ సోకింది. వారం రోజుల తరువాత మరో అయిదుగురు వ్యక్తులకు వైరస్ సోకడంతో గ్రామంలో భయాందోళన పరిస్థితి ఏర్పడింది. దీనితో గ్రామ పంచాయతి, ఆరోగ్యశాఖ సహకారంతో జిల్లా పరిషత్ సభ్యుడు ప్రకాష్ దేశముఖ్ భోసికర్ వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి కోవిడ్ పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ మరియు ఆర్టీ-పిసిఆర్ పరీక్షలలో 119 మంది కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది.
కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా చూడడానికి వైరస్ సోకినవారిని విడిగా ఉంచాలని నిర్ణయించారు. కొద్దిపాటి వైరస్ లక్షణాలు ఉన్నవారికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 15 నుంచి 17 రోజులు విడిగా ( ఐసొలేషన్) జీవించాలని నిర్దేశించింది. దీనికి అనుగుణంగా గ్రామంలో వైరస్ సోకినవారు తమ పొలాల్లో ఉండేలా ఒప్పించడం జరిగింది. పొలాలు లేని కూలీలు ఇతరులు ఉండడానికి భోసికార్ తన సొంత పొలంలో 40 ’x 60’ షెడ్లను ఏర్పాటు చేశారు.
గ్రామ ఆరోగ్య కార్యకర్త ఆశటాయ్, అంగన్వాడి సేవిక ప్రతిరోజూ పొలాలను సందర్శించి రోగులతో మాట్లాడి వారికి అక్కడికక్కడే ఆహారం, మందులు కూడా అందించారు. దీనికి దాదాపు అందరూ సహకరించారు. 15 నుంచి 20 రోజుల ఐసొలేషన్ తరువాత గ్రామస్తులు ఆరోగ్యంగా ఇళ్లకు తిరిగి వచ్చారు. ఆరోగ్య పరీక్షల్లో వీరికి కరోనా లేదని తేలింది.
ఇది జరిగి 45 రోజులు అయ్యిందని ఇంతవరకు కొత్తగా ఎవరికి కరోనా సోకలేదని భోసికర్ తెలిపారు. పూర్వ కాలంలో వైద్య సౌకర్యాలు అందుబాటులో లేని సమయంలో విడిగా ఏకాంతంగా జీవించి ప్రజలు భయంకర ప్లేగు వ్యాధి నుంచి కూడ బయటపడ్డారని ఆయన వివరించారు.


' గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యాధి బారిన పడకుండా చూడడానికి వారిని విడిగా ఉంచడం ఒక్కటే మార్గం' అని గ్రామ పొలాల్లో 15 రోజులపాటు ఐసొలేషన్ ఉన్న అని లక్ష్మీబాయి అకెమ్వాడ్ స్పష్టం చేశారు.
గ్రామ ప్రజల మధ్య సమన్వయం ఉంటే సమస్యలను పరిష్కరించుకోవచ్చునని చెప్పడానికి భోసి ఒక మంచి నిదర్శనమని నాందేడ్ జిల్లా పరిషత్ సిఇఒ వర్షా ఠాకూర్ ఘుగే అన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కలసి పనిచేస్తే ఫలితాలు వుంటాయని అన్నారు. భోసి లో అమలు చేసిన విధానాన్ని అవసరమైన ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని ఆయన సూచించారు.
***
(Release ID: 1720319)
Visitor Counter : 197