రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

పిఎం కేర్స్ నిధి కింద మూడు నెల‌ల్లో 500 మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న డిఆర్‌డిఒ

Posted On: 28 APR 2021 1:05PM by PIB Hyderabad

తేలిక‌పాటి యుద్ధ విమానం (ఎల్‌సిఎ) తేజ‌స్‌కు వాహ‌నంలోనే ఆక్సిజ‌న్ ను ఉత్ప‌త్తి చేసే  మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ప్లాంట్ (ఎంఒపి) ను అభివృద్ధి చేసిన డిఆర్‌డిఒ సంస్థ ప్ర‌స్తుతం  కోవిడ్‌-19 రోగులు ఎదుర్కొంటున్న ఆక్సిజ‌న్ సంక్షోభాన్ని తీర్చేందుకు తోడ్ప‌డ‌నుంది. ఆక్సిజ‌న్ ప్లాంట్ నిమిషానికి 1,000 లీట‌ర్లు (ఎల్‌పిఎం) ఉత్ప‌త్తి చేసే సామ‌ర్ధ్యాన్ని క‌లిగి ఉండేలా రూపొందించారు. ఈ వ్య‌వ‌స్థ 5ఎల్‌పిఎంల ప్ర‌వాహ రేటుతో 190 మంది రోగుల‌కు అందుబాటులోకి రాగ‌ల‌దు. రోజుకు 195 సిలెండ‌ర్ల‌ను చార్జి చేయ‌గ‌ల‌దు. సాంకేతిక‌త‌ను బెంగ‌ళూరుకు చెందిన‌ ఎం/ఎస‌్ టాటా అడ్వాన్స‌డ్ సిస్టమ్స్కు, కోయంబ‌త్తూర్‌కు చెందిన ఎం/ఎస‌్ ట్రైడెంట్ న్యుమాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బ‌దిలీ చేశారు. దేశ‌వ్యాప్తంగా వివిధ హాస్పటళ్ళ‌లో 380 ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసేందుకు అవి ప‌ని చేస్తాయి. సిఎస్ ఐఆర్‌కు చెందిన ఇండియ‌న్  ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, డెహ్రాడూన్‌తో క‌లిసి ప‌ని చేసే ప‌రిశ్ర‌మ‌లు 500 ఎల్‌పిఎం సామ‌ర్ధ్యం గ‌ల 120 ప్లాంట్ల‌ను ఉత్ప‌త్తి చేస్తాయి.  
కోవిడ్‌-19 రోగుల చికిత్స‌లో ఆసుప‌త్రుల‌లోనూ, ఆరోగ్య సంర‌క్ష‌ణ కేంద్రాల‌లోనూ ఆక్సిజ‌న్ అన్న‌ది అత్యంత కీల‌క‌మైన చికిత్సా వాయువు. మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ప్లాంట్ (ఎంఒపి) సాంకేతిక 93.3% ఆక్సిజ‌న్ గాఢ‌త‌ను ఉత్ప‌త్తి చేయ‌గ‌ల సామ‌ర్ధ్యాన్ని క‌లిగి ఉంటుంది. నేరుగా ఆసుప‌త్రుల‌లో ప‌డ‌క‌ల వ‌ద్ద‌కు  స‌ర‌ఫ‌రా చేయ‌గ‌ల లేదా మెడిక‌ల్ ఆక్సిజ‌న్ సిలెండ‌ర్ల‌లో నింప‌గ‌ల సామ‌ర్ధ్యం ఈ ప్లాంట్‌కు ఉంటుంది. నేరుగా వాతావ‌ర‌ణంలోని గాలి నుంచి ఆక్సిజ‌న్ను త‌యారు చేసేందుకుప్రెష‌ర్ స్వింగ్ అబ్సార్బ్ష‌న్ (పిఎస్ఎ) ప‌ద్ధ‌తిని, మాలిక్యులార్ సీవ్ (జియోలైట్‌) సాంకేతిక‌త‌ను ఉప‌యోగిస్తుంది. 
క‌రోనా మ‌హ‌మ్మారి కాలంలో ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల‌లోని ఆసుప‌త్రుల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసేందుకు ఎంఒపి సాంకేతికత ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఇత‌ర ప్రాంతాల నుంచి ఆక్సిజ‌న్‌ను తెప్పించుకునేలా కాకుండా ఈ ఆక్సిజ‌న్ ప్లాంట్ సాయంతో ఆసుప‌త్రులు అక్క‌డిక‌క్క‌డ మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను అందుబాటు ధ‌ర‌లో త‌యారు చేసుకోగ‌లుగుతారు.
ఎత్తైన ప్రాంతాలు, చేరుకోలేని మారుమూల ప్రాంతాల‌లో  ఆక్సిజ‌న్ సిలెండ‌ర్ల కోసం ఆసుప‌త్రులు ఇత‌రుల‌పై ఆధార‌ప‌డే ప‌రిస్థితిని ఈ ప్లాంట్ ఏర్పాటు నివారించేందుకు తోడ్ప‌డుతుంది. ఈశాన్య ప్రాంతాలు, లే-లడాక్ ప్రాంతంలోని కొన్ని సైనిక స్థావ‌రాల‌లో ఎంఒపిని ఇప్ప‌టికే ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటు ఐఎస్ఒ 1008, యూరోపియ‌న్‌, యుఎస్‌, భార‌తీయ ఫార్మాకోపియా ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉంటుంది. ఢిల్లీ/ ఎన్‌సిఆర్ ప్రాంతంలో 5 ప్లాంట్ల ఏర్పాటు కోసం జాగాను ఏర్పాటు చేయ‌డం ప్రారంభించారు.
పిఎం కేర్స్ నిధి కింద 125 ప్లాంట్ల‌ను ఉత్ప‌త్తి చేయాల‌న్న ల‌క్ష్యంతో  ఎం/ఎస‌్ టాటా అడ్వాన్స్‌డ్ లిమిటెడ్ కు 332, ఎం/ఎస‌్‌ ట్రైడెంట్ న్యుమాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌, కోయంబ‌త్తూరు 48 కు స‌ప్లై ఆర్డ‌ర్ల‌ను విడుద‌ల చేయ‌డం ద్వారా 380 మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ప్లాంట్లను సృష్టించేందుకు డిఆర్‌డిఒ చొర‌వ తీసుకుంది. నెల‌కు 125 ప్లాంట్ల చొప్పున ఉత్ప‌త్తి చేయాల‌న్న ల‌క్ష్యంతో డిఆర్‌డిఒ ఉంది. దీనితో రానున్న మూడు నెల‌ల్లో 500 మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.
ప్ర‌స్తుత సంక్షోభాన్ని అధిగ‌మించి కోవిడ్‌-19 రోగుల‌కు అత్య‌వ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ ను ఉత్ప‌త్తి చేసేందుకు ఎంఒపి సాంకేతిక‌త‌ను ఉప‌యోగిస్తున్నందుకు ర‌క్ష‌ణ మంత్రి రాజ‌నాథ్ సింగ్ డిఆర్‌డిఒను ప్ర‌శంసించారు. ఆసుప‌త్రులు, ఇత‌ర ఆరోగ్య ఏజెన్సీలు ఈ సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకునేందుకు డిఆర్‌డిఒ మ‌ద్ద‌తునిస్తుంద‌ని ర‌క్ష‌ణ ఆర్‌&డి కార్య‌ద‌ర్శి, డిఆర్‌డిఒ చైర్మ‌న్ డాక్ట‌ర్ జి స‌తీష్ రెడ్డి హామీ ఇచ్చారు.

***



(Release ID: 1714769) Visitor Counter : 231