ఆర్థిక మంత్రిత్వ శాఖ

మార్చి 31వ తేదీ నాటికి రూ.2.62 ల‌క్ష‌ల కోట్ల విలువైన ప‌న్ను రిఫండ్‌లు జ‌రిపిన సీబీడీటీ

Posted On: 01 APR 2021 5:12PM by PIB Hyderabad

కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగాను మరియు భారత దేశానికి సవాళ్లతో నిండిన సంవత్సరంగా సాగింది. క‌రో‌నా మహమ్మారి ప్రభావం వల్ల ప్రజలకు వచ్చే ఆర్థిక ఇబ్బందులను తగ్గించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలు చేపడుతూ వ‌చ్చింది. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా ఇబ్బందుల నేప‌థ్యంలో పన్ను చెల్లింపుదారులైన పౌరులు, వ్యాపార సంస్థలకు తక్షణ ఉపశమనం కల్పించడానికి గాను ప్ర‌భుత్వం పెండింగ్‌లో ఉన్న కేసుల‌లో.. ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో ఆదాయపు పన్ను వాపసులను జారీ చేసింది.
2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2021 మార్చి 31వ తేదీ వరకు ప్ర‌త్య‌క్ష ప‌న్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) 2.38 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.2.62 లక్షల కోట్ల మేర ప‌న్ను రిఫండ్‌ల‌ను జ‌రిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ.1.83 లక్షల కోట్ల మేర ప‌న్ను రిఫండ్‌ల‌ను జారీ చేశారు. అంటే గ‌త‌ ఏడాది ప‌న్ను రిఫండ్ చెల్లింపుల‌లో ఇది దాదాపు 43.2 శాతం పెరుగుదలను సూచిస్తుంది. మార్చి 31వ తేదీతో గ‌త ముగిసిన ఆర్థిక సంవ‌త్స‌రంలో 2,34,27,418 కేసులకు సంబంధించి రూ.87,749 కోట్ల మేర సొమ్మును ఆదాయ‌పు ప‌న్ను శాఖ వాప‌సు చేసింది. ఇదే స‌మ‌యంలో 3,46,164 కేసులకు సంబంధించి సుమారు రూ.1,74,576 కోట్ల మేర కార్పొరేట్ పన్ను వాపసుల‌ను జ‌రిపింది. మహమ్మారి నేప‌థ్యంలో ఆర్ధిక పతనం నుంచి ఉపశమనం కలిగించడానికి.. వివిధ చర్యలతో కేంద్ర ప్రభుత్వం త‌గు విధంగా ముందుకు వ‌చ్చింది.. దీనికి అనుగుణంగా సీబీడీటీ కూడా పెండింగ్‌లో ఉన్న ప‌న్ను వాపసులను వేగంగా జారీ చేసింది.
                               

****



(Release ID: 1709195) Visitor Counter : 140