రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

హరిత దృష్టితో మౌలిక‌స‌దుపాయాల‌ను అభివృద్ధి చేయాలి: గ‌డ్క‌రి

Posted On: 24 MAR 2021 4:07PM by PIB Hyderabad

దేశానికి అభివృద్ధి అవ‌స‌ర‌మ‌ని అయితే అదే స‌మ‌యంలో ప‌ర్యావ‌ర‌ణం, ప్ర‌కృతి స‌మ‌తుల్య‌త ను కాపాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని 

కేంద్ర  రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారులు,సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ఎంట‌ర్‌ప్రైజెస్‌, శాఖ మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ అన్నారు. 

 జాతీయ ర‌హ‌దారులు , హైవేల స‌మ్మేళనాన్ని ఉద్దేశించి  హ‌రిత మౌలిక‌స‌దుపాయాల‌పై దృ ష్టి అనే అంశంపై వ‌ర్చువ‌ల్ స‌మావేశాన్ని నిర్వ‌హిస్తూ ఆయ‌న ఈ మాట‌లు అన్నారు. హ‌రిత ర‌హ‌దారుల మౌలిక ల‌క్ష‌ణాల గురించి ఆయ‌న మాట్లాడారు. ఈ త‌ర‌హా ర‌హ‌దారులు గ్రీన్ హౌస్ ఉద్గారాలు, , కార్బ‌న్ ఫుట్‌ప్రింట్ త‌గ్గింపు ల‌క్ష్యాలు సాధించ‌డానికి , పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల వినియోగానికి ఉప‌యోగ‌ప‌డతాయ‌న్నారు.

రోడ్డు ర‌వాణా జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ‌శాఖ తీసుకున్న ప‌లు ప‌ర్యావ‌ర‌ణ హిత‌ చ‌ర్య‌ల‌ను వివ‌రిస్తూ ఆయ‌న నీటి పొదుపు, వ‌ర్ష‌పునీటి సంర‌క్ష‌ణ‌, జాతీయ ర‌హ‌దారుల వెంట కృత్రిమంగా భూగ‌ర్భ జ‌లాల‌రీచార్జ్ వ్య‌వ‌స్త‌ల  ఏర్పాటు వంటి వాటిని ఆయ‌న ప్ర‌స్తావించారు.అన్ని టోల్‌ప్లాజాలు సౌర విద్యుత్ వాడ‌కాన్ని త‌ప్ప‌ని స‌రి చేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు.  మార్పు చేసిన రోడ్డు, బ్ర‌డ్జి నిర్మాణ ప‌నుల‌లో ప‌దిశాతం ప్లాస్టిక్ లేదా ర‌బ్బ‌రును వాడేందుకు మంత్రిత్వ‌శాఖ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని దృష్టితో చూసిన‌పుడు ఇది చాలా కీల‌క‌మైన‌ద‌ని ఆయ‌న అన్నారు. కొబ్బ‌రి పీచు, జ‌న‌ప‌నార కార్పెట్‌ను రోడ్డు నిర్మాణ‌ప‌నుల‌లో వాడేఅంశానికి సంబంధించి ప్ర‌ణాళిక ఉన్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

జాతీయ ర‌హ‌దారుల అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రీన్ హైవే మిష‌న్‌ను ఏర్పాటు చేసిన‌ట్టు శ్రీ గ‌డ్క‌రి తెలిపారు. దీనిద్వారా జాతీయ‌ర‌హ‌దారుల వెంట మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుత చెట్ల‌ను కాపాడేందుకు ట్రాన్స్‌ప్లాంటేష‌న్ టెక్నాల‌జీని అనుస‌రించాల్సి ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఒక్క చెట్టునుకూడా కొట్టివేయ‌కుండా చెట్ల ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌కు వెయ్యిమంది కాంట్రాక్ట‌ర్ల‌ను క‌లిగి ఉండేందుకు త‌మ మంత్రిత్వ‌శాఖ ఆలోచిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. రోడ్ల నిర్మాణ ప్ర‌ణాళిక రూపక‌ల్ప‌న ద‌శ‌లోనే  అభ‌యార‌ణ్యాలు, జాతీయ పార్కులను వ‌దిలివేసి ర‌హ‌దారుల‌ను వేరే మార్గంవైపు మ‌ళ్లించేందుకు  వీలైనంత‌వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత ఏజెన్సీల‌కు సూచించిన‌ట్టు మంత్రి తెలిపారు.

 ప్ర‌భుత్వం 22 గ్రీన్ ఫీల్డ్ కారిడార్ల‌ను అభివృద్ధి చేస్తున్న‌ద‌ని, ఇందులో ఐదు ఎక్స్‌ప్రెస్ హైవేలు, 17 యాక్సెస్ కంట్రోల్ హైవేలు ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. రోడ్ల అనుసంధానానికి సంబంధించి, స్వ‌ర్ణ చ‌తుర్భుజి ప్రాజెక్టు, ఎన్‌.హెచ్‌డిపి కార్య‌క్ర‌మం, భార‌త్‌మాలా, పిఎంజిఎస్‌వై, సేతు భార‌తం, సాగ‌ర‌మాల ప్రాజెక్టు ల  కింద చెప్పుకోద‌గిన స్థాయిలో ప‌నులు జ‌రుగుతున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.ఇందుకు సంబంధించి ఆయ‌న ప్ర‌త్యేకంగా ఢిల్లీ- మేర‌ట్ ఎక్స్‌ప్రెస్ వే గురించి ప్ర‌స్తావించారు. ఇది రెండు న‌గ‌రాల మ‌ధ్య ప్ర‌యాణ కాలాన్ని ప్ర‌స్తుత 4 గంట‌ల స‌మ‌యం నుంచి కేవ‌లం 45 నిమిషాల‌కు త‌గ్గించివేస్తుందని ఇది రాగ‌ల రెండునెల‌ల్లో అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నారు. ఢిల్లీ- డెహ్రాడూన్ మ‌ధ్య ప్ర‌యాణ స‌మ‌యం కూడా ప్ర‌స్తుతం ఉన్న ఆరు నుంచి ఏడు గంట‌ల కాలానికి బ‌దులు ప‌ట్టుమ‌ని రెండు గంట‌ల కాలానికి త‌గ్గుతుంద‌ని అన్నారు. చార్‌ధామ్ యోజ‌న ను పూర్తి చేయ‌డం గురించి కూడా శ్రీ గ‌డ్క‌రీ ప్ర‌స్తావించారు. బ‌ద్రీనాథ్, కేదారినాథ్‌, గంగోత్రి, య‌మునోత్రిల‌కు అన్ని కాలాల‌లో ఉప‌యోగ‌ప‌డే ర‌హ‌దారుల నిర్మాణ ప్ర‌క్రియ పూర్తి కానున్న‌ద‌ని ఆయ‌న అన్నారు. ఇది ఉత్త‌రాఖండ్‌లో ప‌ర్యాట‌కం పెర‌గ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని అన్నారు.

 

 రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణంలో సిమెంటు , స్టీలు వాడ‌కాన్ని త‌గ్గించేందుకు గ‌ల మార్గాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు మంత్రి తెలిపారు. స్టీలు, సిమెంటు వాడ‌కుండా నూత‌న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడేందుకు నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని చేప‌ట్ట‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

వ్య‌ర్థాల నుంచి సంప‌ద‌, వ్య‌ర్థాల నుంచి ఇంధ‌నం అనేవి ప‌ర్యావ‌ర‌ణానికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌కు ముఖ్య‌మైన సుస్థిర ప‌రిష్కారాల‌ని ఆయ‌న అన్నారు. విద్యుత్‌పై న‌డిచే ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ విష‌యాన్నిప్ర‌భుత్వం ప్రాధాన్య‌తా అంశంగా చేప‌ట్టిన‌ట్టు ఆయ‌న తెలిపారు. 2020 ఏప్రిల్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు రోజుకు 34 కిలోమీట‌ర్ల వంతున 12,205 కిలోమీట‌ర్ల జాతీయ ర‌హ‌దారుల‌ను నిర్మించిన‌ట్టు శ్రీ గ‌డ్క‌రీ తెలిపారు.

 

 కేంద్ర మంత్రి శ్రీ గ‌డ్క‌రీ ప్ర‌సంగాన్ని ఈ లింక్‌లో విన‌వ‌చ్చు :  https://www.youtube.com/watch?v=URtXYlt-CvQ

 

***



(Release ID: 1707444) Visitor Counter : 119