రైల్వే మంత్రిత్వ శాఖ

భారత-బంగ్లాదేశ్ వర్చువల్ ద్వైపాక్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా హల్దిబరి-చిలహటి రైల్ లింక్ ను ప్రారంభించిన భారత, బంగ్లాదేశ్ ప్రధానమంత్రులు

ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాలకు, ఆర్థిక కార్యకలాపాలకు అత్యంత సహాయకారి

Posted On: 17 DEC 2020 6:41PM by PIB Hyderabad

భారత-బంగ్లాదేశ్ ప్రజల మధ్య బంధం మరింత బలోపేతం చేయడంతో చారిత్రకమైన పెద్ద అడుగు పడింది. ఉభయ దేశాల ప్రధానమంత్రుల స్థాయి వర్చువల్ ద్వైపాక్షిక శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనా 2020 డిసెంబర్ 17వ తేదీన భారత్ లోని హల్దిబరి నుంచి బంగ్లాదేశ్ లోని చిలహటిని కలిపే రైల్ లింక్ ను ప్రారంభించారు.  
ఆ తర్వాత బంగ్లాదేశ్ రైల్వే మంత్రి మహమ్మద్ నూరుల్ ఇస్లాం సుజన్ చిలహటి స్టేషన్ లో పచ్చ జెండా ఊపి ప్రారంభించిన గూడ్సు రైలు అంతర్జాతీయ సరిహద్దును దాటుతూ భారత భూభాగంలోకి ప్రవేశించింది. దీంతో ఉభయ దేశాల మధ్య ఒక కొత్త శకానికి తెర లేచింది.

భారత-బంగ్లాదేశ్ ల  మధ్య రైల్వే నెట్ వర్క్ మనకి బ్రిటిష్ శకం నాటి భారత రైల్వే నుంచి వారసత్వంగా వచ్చింది. 1947లో దేశ విభజన తర్వాత భారత, తూర్పు పాకిస్తాన్ మధ్యన 7 రైల్ లింక్ లు నిర్వహణలో ఉండేవి (1965 వరకు). ప్రస్తుతం భారత, బంగ్లాదేశ్ మధ్య నాలుగు రైల్ లింక్ లు...  పెట్రపోల్ (భారత్)-బెనాపోల్ (బంగ్లాదేశ్);  గెడే (భారత్)-దర్శన (బంగ్లాదేశ్);  సింఘాబాద్ (భారత్)- రోహన్ పూర్ (బంగ్లాదేశ్);  రాధికాపూర్ (భారత్)-బిరోల్ (బంగ్లాదేశ్) ఆపరేషన్ లో ఉన్నాయి. 2020 డిసెంబర్ 17 నుంచి ప్రారంభమైన హల్దిబరి-చిలహటి రైల్ లింక్ ఉభయ దేశాల మధ్య ఏర్పడిన ఐదో మార్గం. 

హల్దిబరి-చిలహటి రైల్ లింక్ 1965 వరకు పని చేసేది. దేశవిభజన సమయంలో కోల్కతా-సిలిగురి బ్రాడ్ గేజ్ రూట్ లో భాగంగా ఇది ఉండేది. అస్సాం నుంచి ఉత్తర బెంగాల్ మధ్య నడిచే రైళ్లు అప్పట్లో తూర్పు పాకిస్తాన్ ద్వారా ప్రయాణించేవి. ఉదాహరణకి సెల్దా నుంచి సిలిగురి ప్రయాణించే రైలు దర్శన నుంచి తూర్పు పాకిస్తాన్ భూభాగంలో ప్రవేశించి హల్దిబరి-చిలహటి లింక్ ద్వారా వెలుపలికి వచ్చేది. కాని 1965 యుద్ధ సమయంలో అప్పటి తూర్పు పాకిస్తాన్ తో ఉన్న అన్ని రైల్ లింక్ లు తెగిపోయాయి. అలా 1965లో భారత్ లోని తూర్పు భాగం వేరుపడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రైలు లింక్ తెరవడం ఎంతో ప్రయోజనకరం.

2015 మే నెలలో ఢిల్లీలో జరిగిన ఉభయ దేశాల అంతర్గత ప్రభుత్వ రైల్వే సమావేశంలో (ఐజిఆర్ఎం) చేసిన  సంయుక్త ప్రకటనకు అనుగుణంగా గతంలో పని చేసిన ఈ రైలు లింక్ ను తిరిగి తెరవాలన్న సంకల్పంలో భాగంగా హల్దిబరి స్టేషన్ నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు వరకు చిలహటిని (బంగ్లాదేశ్) అనుసంధానం చేయగల 3.5 కిలోమీటర్ల నిడివి గల కొత్త బ్రాడ్ గేజ్ రైలు మార్గం నిర్మించేందుకు రైల్వే బోర్డు అనుమతి మంజూరు చేసింది. భారతీయ రైల్వే హల్దిబరి స్టేషన్ నుంచి రూ.82.72 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ సరిహద్దు వరకు ట్రాక్ లను పునరుద్ధరించింది. అలాగే తమ భూభాగంలో చిలహటి స్టేషన్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు మిస్ అయిన రైల్వే ట్రాక్ లను బంగ్లాదేశ్ నిర్మించడంతో పాటు అప్ గ్రేడ్ చేసింది. బంగ్లాదేశ్ వైపు చిలహటి-పర్బతిపూర్-సంతహార్-దర్శన మధ్య ఇప్పటికే బ్రాడ్ గేజ్ మార్గం ఉంది.

2020 డిసెంబర్ 17న ప్రారంభమైన హల్దిబది-చిలహటి రూట్ అస్సాం, పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ లో ప్రవేశిస్తుంది. ఈ కొత్త రైల్ లింక్ ప్రధాన పోర్టులు, డ్రైపోర్టులు, భూ సరిహద్దుల మధ్య రైలు నెట్ వర్క్  అనుసంధానతను పెంచుతుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి మద్దతు ఇవ్వడంతో పాటు ఈ ప్రాంతం సామాజిక, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. వస్తు రవాణా ద్వారా, తదుపరి దశలో ప్రయాణికుల రవాణాకు అనుమతి లభించిన అనంతరం ప్రయాణికుల రవాణా ద్వారా ఉభయ దేశాల ప్రజలు, వ్యాపారవేత్తలు లాభపడతారు. ఈ రైల్ లింక్ అందుబాటులోకి రావడంతో బంగ్లాదేశ్ కు చెందిన పర్యాటకులు డార్జిలింగ్, సిక్కిం, దువార్స్ వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించగలుగుతారు. దీనికి తోడు నేపాల్, భూటాన్ సందర్శించడం కూడా తేలికవుతుంది. ఈ దక్షిణాసియా దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఈ కొత్త రైల్ లింక్ ప్రయోజనకరం అవుతుంది.

 

****
 



(Release ID: 1681676) Visitor Counter : 185