ప్రధాన మంత్రి కార్యాలయం

80వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సు ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పూర్తిపాఠం

Posted On: 26 NOV 2020 5:38PM by PIB Hyderabad

నమస్కారం,
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ జీ, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాజీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీజీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ జీ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అర్జున్ మేఘ్వాల్ జీ, గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ రాజేంద్ర త్రివేదీ జీ, దేశంలోని వివిధ రాష్ట్రాలనుంచి వచ్చిన ప్రిసైడింగ్ అధికారులు, ప్రముఖులు, సోదర, సోదరీమణులారా..
నర్మదానది ఒడ్డున, సర్దార్ పటేల్ విగ్రహ సమీపంలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు జరగడం సంతోషకరం. నాతోటి భారతీయులందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మన:పూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఇవాళ రాజ్యాంగ దినోత్సవంతోపాటు రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషించే ప్రిసైడింగ్ అధికారుల సదస్సు కూడా జరగడం ముదావహమన్నారు. దీంతోపాటుగా ప్రిసైడింగ్ అధికారుల సదస్సుకు వందేళ్లు పూర్తవుతున్నాయి. ఈ కీలకమైన మైలురాయిని చేరుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
రాజ్యాంగ సభలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బాబాసాహెబ్ అంబేడ్కర్ సహా ముఖ్య సభ్యులందరినీ గుర్తుచేసుకోవాల్సిన దినమిది. వారందరి నిరంతర శ్రమ కారణంగానే.. మనందరికీ ఇంత చక్కటి రాజ్యాంగం మనకు అందుబాటులోకి వచ్చింది. మహాత్మాగాంధీ స్ఫూర్తికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ నిబద్ధతను గౌరవించుకుని నమస్కరించే రోజు ఇది. అలాంటి ఎందరో నాయకులు స్వాతంత్ర్య భారతానికి బలమైన పునాదిని వేయడంలో త్యాగాలు చేశారు. వీరందరి త్యాగాలను గుర్తుంచుకోవాలన్న ఉద్దేశంతోనే ఐదేళ్ల క్రితం రాజ్యాంగదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కీలకమైన ప్రజాస్వామ్య కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారతీయులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
దేశంలోని అతిపెద్ద ఉగ్రవాద దాడి కూడా ఈ రోజే  జరిగింది. 2008లో పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వివిధ దేశాలకు చెందిన వారు కూడా చనిపోయారు. ఈ సందర్భంగా ముంబై దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ఈ దాడిలో ఎందరోమంది పోలీసు వీరులు అమరులయ్యారు. వారికి కూడా నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ముంబై దాడి గాయాలను భారతదేశం ఎన్నటికీ మరిచిపోదు. నేటి భారతం ఉగ్రవాదాన్ని ఎదుర్కునేందుకు కొత్త విధానం, సరికొత్త మార్గాల్లో ముందుకెళ్తోంది. ముంబై దాడులవంటి కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ.. శత్రుమూకలకు ధీటైన సమాధానం ఇస్తున్న మన భద్రతా బలగాలకు కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.
మిత్రులారా,
ప్రిసైడింగ్ అధికారులుగా ప్రజాస్వామ్యంలో మీ పాత్ర కీలకం. సామాన్య ప్రజలను, రాజ్యాంగాన్ని అనుసంధానం చేయడంలో ప్రిసైడింగ్ అధికారులుగా మీ పాత్ర ప్రముఖమైనది. మీరు ఎమ్మెల్యేతోపాటు.. సభలో స్పీకర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. అందుకే మీరు రాజ్యాంగంలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల వ్యవస్థల మధ్య కీలమైన సమన్వయానికి మీ వారథులు. ఈ సదస్సులో మీరు దీని గురించి కూలంకశంగా చర్చించారు. రాజ్యాంగాన్ని కాపాడటంలో న్యాయవవ్యస్థ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. కానీ స్పీకర్ అనే వ్యక్తి చట్టాల రూపకల్పనకు కీలకమైన వ్యక్తి. అందుకే స్పీకర్‌ను రాజ్యాగ భద్రతావలయానికి తొలి కాపలాదారుడు.
మిత్రులారా,
ఈ మూడు విభాగాలు నిర్వర్తించాల్సిన విధులను రాజ్యాంగంలోనే చక్కగా వివరించారు. 1970లో ఈ విధుల్లోనుంచి ఒక భాగానికి ప్రత్యేక అధికారాలు కట్టబెట్టేందుకు జరిగిన ప్రయత్నాన్ని మనమంతా చూశాం. దానికి కూడా పరిష్కారం రాజ్యాంగంలోనుంచే లభించింది. వాస్తవానికి అత్యవసర పరిస్థితి తర్వాత వ్యవస్థలోని నియంత్రణ, సంతులనం ఎప్పటికప్పుడు బలోపేతం అవుతోంది. ఈ ఘటన తర్వాత శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు సరికొత్త పాఠాలను నేర్చుకుని ముందుకెళ్తున్నాయి. ఈ పాఠాలు నేటికీ సందర్భోచితంగానే ఉంటాయి. గత ఐదారేళ్లుగా ఈ మూడు విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మిత్రులారా,
ఈ ప్రయత్నాలు.. ప్రజావిశ్వాసంపై పెను ప్రభావాన్ని చూపిస్తాయి. కఠినమైన, విపత్కర పరిస్థితుల్లోనే ఈ మూడు వ్యవస్థలపై ప్రజల విశ్వాసం కొనసాగుతుంది. కరోనా మహమ్మారి సందర్భంగా ఈ పరిస్థితిని మనం గమనించాం. 130కోట్ల మంది భారతీయులు రాజ్యాంగంలోని ఈ మూడు వ్యవస్థలపై నమ్మకాన్ని చూపించారు. ఈ విశ్వాసాన్ని పెంపొందించడంలో నిరంతర ప్రయత్నాలు జరిగాయి.
జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పార్లమెంటు ఉత్సాహంగా, చిత్తశుద్ధితో చేస్తున్న చట్టాలు.. ఆత్మనిర్భర భారత నిర్మాణం కోసం కరోనా సమయంలోనూ తీసుకొచ్చిన కీలకమైన చట్టాలు అనన్యసామాన్యమైనవి, అపూర్వమైనవి. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం పార్లమెంటు ఉభయసభలు పనిచేశాయి. వారి వేతనాలను తగ్గించుకునేందుకు అంగీకరించడం ద్వారా పార్లమెంటేరియన్లు తమ చిత్తశుద్ధిని, అంకితభావాన్ని చాటుకున్నారు. చాలా రాష్ట్రాల్లో కూడా చట్టసభ్యులు తమ వేతనాలను తగ్గించుకుని కరోనాపై పోరాటానికి తమవంతు సహాయాన్ని అందించారు. ఈ ప్రయత్నాలన్నింటినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కరోనా సమయంలో తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేవిగా ఉన్నాయి.
మిత్రులారా,
కరోనా సమయంలో ప్రపంచం మొత్తం మన ఎన్నికల వ్యవస్థ బలాన్ని చూసింది. ఇంత భారీ స్థాయిలో ఎన్నికలు నిర్వహించడం, సరైన సమయానికి ఫలితాల వెల్లడి, ఎలాంటి సమస్యల్లేకుండా కొత్త ప్రభుత్వాల ఏర్పాటు జరగడం  అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. రాజ్యాంగం నుంచి మనం పొందిన ఈ శక్తే మనందరి జీవితాల్లోని కష్టాలను సులభతరం చేస్తోంది. 21వ శతాబ్దంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం కనుగొనడంతోపాటు కొత్త తరాన్ని ముందుకు నడిపించడంలో మన రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకెళ్లడం మనందరి బాధ్యత.
భారత రాజ్యాంగం 75 వసంతలను పూర్తిచేసుకునే దిశగా దూసుకెళ్తోంది. ఇదే విధంగా మన స్వాతంత్ర్యానికి కూడా 75 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సమయంలో మన అవసరాలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పుల చేసుకుంటూ మన చిత్తశుద్ధిని చాటుకునే సమయం ఇది. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చక్కటి సమన్వయంతో సామరస్యంగా పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా రాజ్యాంగంలోని మూడు విభాగాలపై ఉంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం జాతి ప్రయోజనాలను ప్రాధాన్యంగా తీసుకునే జరగాలి. దేశహితమే మనకు సర్వోన్నతం కావాలి. ప్రజాప్రయోజనాలు, దేశ హితంపై మన రాజకీయాలు పైచేయి సాధించే పరిస్థితి తలెత్తినపుడు దేశం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందనే విషయాన్ని మనమంతా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ వేర్వేరుగా ఆలోచిస్తున్నపుడు దాని దుష్ప్రభావం ఎలా ఉంటుందనేది మనం ఆలోచించాలి. సర్దార్ సరోవర్ డ్యామ్ కూడా దీనికి ఓ పెద్ద ఉదాహరణ.
మిత్రులారా,
కెవాడియా పర్యటన సందర్భంగా సర్దార్ సరోవర్ డ్యామ్ విస్తీర్ణం, వైభవం, శక్తిని మీరు గమనించే ఉంటారు. కానీ ఈ డ్యామ్ పని ఏళ్ల పాటు ఆగిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన ప్రారంభంలోనే ఈ ప్రాజెక్టు మొదలైంది. కానీ దాదాపు దేశ స్వాతంత్ర్యానికి దాదాపుగా 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తయింది. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసుకుంటూ.. పదే పదే అడ్డంకులు సృష్టించేందుకు జరిగిన ప్రయత్నాల కారణంగానే ప్రజాప్రయోజనాలకోసం ఉద్దేశించిన ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైంది. నేడు గుజరాత్ ప్రజలతోపాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల ప్రజలు ఈ డ్యామ్ వల్ల లబ్ధి పొందుతున్నారు. గుజరాత్‌లోని 10 లక్షల హెక్టార్లు, రాజస్థాన్‌లోని 2.5 లక్షల హెక్టార్లకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతోంది. కేవలం సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కారణంగానే గుజరాత్‌లోని 9వేలకు పైగా గ్రామాలు, రాజస్థాన్, గుజరాత్‌ల్లోని పలు పట్ణణాలకు తాగునీరు అందుతోంది.
నీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి.. దీనికి సంబంధించిన ఓ విషయం నాకు గుర్తొచ్చింది. నర్మద జలాలకోసం ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. కానీ పలు కఠినమైన పరిస్థితుల అనంతరం.. శ్రీ భైరాన్‌సింగ్ షెకావత్ జీ, శ్రీ జస్వంత్ సింగ్ జీ గాంధీనగర్‌లో నాతో సమావేశమైన తర్వాతే ఈ సమస్యకు ఓ పరిష్కారం లభించింది. వారు మొదట మాట్లాడి కలుద్దాం అన్నప్పుడు.. ఏమైనా ముఖ్యమైన అంశమా అని అడిగాను. దానికి.. వ్యక్తిగతంగా మాట్లాడదామని వారు చెప్పారు. వారు వచ్చి నన్ను కలిసి వారి ఆశీస్సులు అందించిన తర్వాత.. ఇంత అత్యవసరంగా సమావేశానికి కారణమేంటని అడిగినపుడు.. చుక్క నీటికోసం రెండు కుటుంబాలు విడిపోయిన చరిత్రను కూలంకషంగా వివరించారు. గుజరాత్‌నుంచి ఎలాంటి పోరాటం లేకుండా రాజస్థాన్ లోని బీడు భూములకు నర్మదా నది నీరు చేరడాన్ని చెబుతూ.. తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. మీరే చెప్పండి.. ఈ ప్రయత్నం ముందుగానే జరిగి ఉంటే.. ఎలా ఉండేది. ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యు్త్తు వల్ల మధ్యప్రదేశ్, మహారాష్ట్ర చాలా లబ్ధిపొందుతున్నాయి.

మిత్రులారా,

ఇది కొన్నిసంవత్సరాల క్రితమే జరిగి ఉండాల్సింది. ప్రజాసంక్షేమం , అభివృద్ధి పై దృష్టి పెట్టే ఆలోచనాపరులు ఉండి ఉంటే ఈ ఫలాలను మనం ఎప్పుడో పొంది ఉండేవాళ్లం. కానీ సంవత్సరాలుగా ప్రజలు వీటికి నోచుకోవడం లేదు.  ఈ పరిస్థితికి కారణమైన వాళ్లకు కనీస పశ్చాత్తాపం లేదు. ఈ స్థాయిలో జాతికి నష్టం జరగినా, డ్యామ్ వ్యయం పెరిగినా వాళ్లలో కనీసం పశ్చాత్తాపం లేదు. ఈ తరహా ఆలోచనా విధానం నుంచి మనం ఈ దేశాన్ని బయటపడేయాలి.

మిత్రులారా

సర్దార్ పటేల్ విగ్రహాన్ని సందర్శించడం ద్వారా మీరు కొత్త ఉత్తేజాన్ని, శక్తిని పొంది ఉంటారు. మీలో స్పూర్తి రగిలి ఉంటుంది. ప్రపంచంలో అతి పెద్ద ఈ ఐక్యతా విగ్రహం... ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తుంది. సర్దార్ పటేల్ విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు ఆయన జన్ సంఘ్ లో లేదా భారతీయ జనతా పార్టీలో సభ్యుడు కాదు. విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఎలాంటి రాజకీయ వివక్ష లేదు.
సభలో ఐక్యత అవసరం ఉన్నట్టే.. దేశానికి కూడా ఐక్యత అవసరం.  ఎలాంటి రాజకీయ వివక్షకు తావులేదనడానికి ఈ నిలువెత్తు సర్దార్ విగ్రహమే ప్రత్యక్ష ఉదాహరణ. దేశం, దేశ గౌరవం ముందు ఏదీ ముఖ్యం కాదు.

2018లో సర్దార్ పటేల్  ఐక్యతా విగ్రహాన్ని ఆవిష్కరించినప్పటి నుంచి 46 లక్షల మంది ప్రజలు ఇక్కడకు వచ్చి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కరోనా కారణంగా ఏడు నెలల పాటు సందర్శనను నిలిపివేయకుంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది.
నది నర్మదా, ఐక్యత విగ్రహం ఆశీస్సులతో కెవాడియా పట్టణం దేశంలోనే అభివృద్ధిలో దూసుకుపోతోంది.  గవర్నర్ శ్రీ ఆచార్య జీ చెప్పినట్టు కొన్నేళ్లలోనే ఈ ప్రాంతంలో ఎంతో మార్పు వచ్చింది. ఏ పనినైనా నిబద్ధతతో ముందుకు తీసుకెళితే ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి.

ఈ రెండు రోజుల్లో వివిధ కార్యాలయాలకు చెందిన వ్యక్తులను, గైడ్స్ ను మీరు కలిసి ఉంటారు. ఈ ప్రాంతానికి చెందిన యువతరం , ముఖ్యంగా గిరిజిన కుటుంబాలు ఇదే విషయాన్ని చెప్పడాన్ని మీరు గమనించి ఉంటారు. ఈ సామర్ధ్యత ఈ దేశానికి  , ప్రతి గ్రామానికి ఉంది. బూడిదను పక్కకు జరపగలిగితే నిప్పు అంటుకుంటుంది. ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు గిరిజన సోదరసోదరీ మణుల్లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయి.

మిత్రులారా,

ప్రతి వ్యక్తి ఆత్మగౌరవంతో , విశ్వాసంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాజ్యాంగం కోరుకుంటుంది. మన హక్కులకు మూలం బాధ్యతలను తెలుసుకోవడంతో పాటు బాధ్యతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. విధులు, బాధ్యతలకు రాజ్యాంగం అధిక ప్రాధాన్యత ఇచ్చినా... గతంలో వాటిని విస్మరించాం. సామాన్యులు , ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, న్యాయ వ్యవస్థలతో సంబంధమున్న వ్యక్తులు ఎవరైనా సరే...ఏ వ్యవస్థలో ఉన్నా సరే... విధులను సక్రమంగా నిర్వహించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి పౌరుడి విధులను రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. మన సభాపతి గౌరవనీయులు బిర్లా జీ వీటి గురించి సవివరంగా వివరించారు.

మిత్రులారా,

మన రాజ్యాంగానికి ఎన్నో ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది విధులు. గాంధీ మహాత్ముడు దీనిపై చాలా స్పష్టతతో ఉండేవారు. హక్కులకు , విధులకు చాలా దగ్గర సంబంధాన్ని ఆయన గమనించారు.  విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించినప్పుడు హక్కులు రక్షించబడతాయని ఆయన విశ్వసించారు.


మిత్రులారా,

సామాన్యులు రాజ్యాంగాన్ని మరింత సమగ్రంగా అర్ధం చేసుకునే దిశగా మన చర్యలు ఉండాలి. రాజ్యాంగాన్ని తెలుసుకోవడం, అర్ధం చేసుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం మనం కేవైసీ గురించి వింటున్నాం. ఇది చాలా సాధారణ , అందరికీ తెలిసిన విషయం. కేవైసీ అంటే కస్టమర్ల గురించి తెలుసుకోవడం. డిజిటల్ భద్రత కు ఇది చాలా ముఖ్యం. కేవైసీ తరహాలోనే రాజ్యాంగం గురించి తెలుసుకోవడం కూడా రాజ్యాంగ పరిరక్షణకు దోహదం చేస్తుంది. అందుకే ముందు తరాలకు రాజ్యాంగంపై అవగాహన పెంచే దిశగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ముందు తరాలకు ముఖ్యంగా స్కూల్స్, కాలేజీల వరకూ దీనిని మనం తీసుకెళ్లాలి.

కొత్త పద్దతుల ద్వారా మన రాజ్యాంగాన్ని దేశ యువతకు దగ్గర చేయడానికి మీరందరూ చొరవ తీసుకోవాలని నేను కోరుతున్నాను.


మిత్రులారా,

రాజ్యాంగ, న్యాయపరమైన భాష విషయంలో మనం మరో పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాం. అవి ఎవరికి ఉద్దేశించినవో తెలుసుకోవడం చాలా కష్టం. భిన్నమైన పదాలు వాటికి భిన్నమైన అర్ధాలు, పెద్ద వాక్యాలు, పెద్ద పారాగ్రాఫ్ లు, క్లాజులు, సబ్ క్లాజులు ఇలా చాలా ఉన్నాయి. మనం ఉపయోగించే న్యాయపరమైన భాష చాలా సులభంగా, సాధారణ ప్రజలకు కూడా అర్ధమయ్యేలా ఉండాలి. ఈ దేశ ప్రజలు తమకు తామే రాజ్యాంగాన్ని అందించుకున్నారు. అందువల్ల ప్రతి నిర్ణయాన్ని, ప్రతి చట్టాన్ని సామాన్యులు తమదిగా భావించేలా మనం భరోసా కల్పించాలి.

ఈ విషయంలో ప్రిసైడింగ్ అధికారులు చాలా సాయం చేయగలరు. అదేవిధంగా కాలం చెల్లిన చట్టాలను తొలగించే ప్రక్రియను కూడా సులభతరం చేయాలి. హరివంశ్ జీ ఈ విషయానికి సంబంధించి చాలా ఉదాహరణలు చెప్పారు. ఇలాంటి చట్టాలు ప్రజల జీవితాలను మరింత సరళతరం చేయకపోగా అనేక అడ్డంకులను సృష్టిస్తాయి. గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఈతరహా కాలం చెల్లిన చట్టాలెన్నింటినో తొలగించాం.  రాజ్యాంగం తరహాలోనే కాలం చెల్లిన చట్టాలు వాటికవే తొలగిపోయేలా ఒక వ్యవస్థను మనం రూపొందించలేమా ?

కొన్ని చట్టాల్లో సన్ సెట్ క్లాజ్ వ్యవస్థను ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. అప్రోప్రియేషన్ చట్టంతో పాటు ఇతర చట్టాలను మరింత విస్తరించే అవకాశాలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్రాల శాసన వ్యవస్థలు  తమ చట్టాల పుస్తకం నుంచి అవసరం లేని వాటిని తొలగించే విధంగా ఓ వ్యవస్థను కలిగి ఉండాలన్నది నా సూచన. ఇలా చేయడం ద్వారా న్యాయపరమైన గందరగోళాన్ని తగ్గడంతో పాటు సామాన్యులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

మిత్రులారా,

అన్నింటితో సమానంగా చర్చించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. అదే ఎన్నికల నిర్వహణ. ఒకే దేశం- ఒకే ఎన్నికలు అన్నది కేవలం ఒక చర్చనీయాంశం మాత్రమే కాదు. అది ఈ దేశానికి చాలా అవసరం. ప్రతి కొన్ని నెలలకొకసారి దేశంలో ఏదో మూలన ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఇది అభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతుందన్న విషయం మనందరికీ తెలుసు. అందుకోసమే జమిలి ఎన్నికలపై సమగ్రమైన అధ్యయనం, చర్చ అవసరం. ప్రిసైడింగ్ అధికారులుగా ఈ విషయాన్ని మీరు ముందుకు తీసుకెళ్లగలరు. దీనితో పాటు లోక్ సభ , రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థలు...అన్నింటికీ కలిపి ఒకే ఓటరు జాబితాను కూడా రూపొందించాల్సిన అవసరముంది. ప్రస్తుతం వివిధ ఎన్నికలకు వివిధ రకాల ఓటరు జాబితాను ఉపయోగిస్తున్నారు. ఇంత సమయాన్ని, ధనాన్ని మనం ఎందుకు వృధా చేస్తున్నాం ? 18 ఏళ్లు నిండినవాళ్లందరినీ ఓటర్లుగా గుర్తిస్తున్నప్పుడు రకరకాల ఓటరు జాబితాలు ఉండాల్సిన అవసరం లేదు.
 
మిత్రులారా,

పార్లమెంట్ తో పాటు రాష్ట్రాల అసెంబ్లీలను డిజిటలైజ్ చేసే దిశగా ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ వాటిని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రిసైడింగ్ అధికారులుగా మీరు ఈ విషయంలో చొరవ తీసుకుంటే...చట్ట సభ్యులు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారనడంలో సందేహం లేదు. దేశ  75వ స్వాతంత్ర్య వేడుకలను దృష్టిలో పెట్టుకుని మీరు టైమ్ ఫ్రేమ్ విధించుకోగలరా ? ఇక్కడి నుంచి వెళ్తూనే మీరు ఓ లక్ష్యంతో ముందుకెళ్లగలరా ?

మిత్రులారా,

దేశంలో సెంట్రల్ డేటాబేస్ ఏర్పాటు చేసే దిశగా అన్ని రాష్ట్రాల శాసన వ్యవస్థలు సమాచార బదిలీ దిశగా అడుగులు వేయాలి. అన్ని సభల సమాచారం సామాన్యులతో పాటు అందరికీ రియల్ టైమ్ లో అందుబాటులో ఉండాలి. దీని కోసం నేషనల్ ఈ - విధాన్ అప్లికేషన్ పేరుతో ఆధునిక డిజిటల్ ఫ్లాట్ ఫాంను ఇప్పటికే అభివృద్ధి చేశాం. ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా మీరు కూడా ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను. ఆధునిక సాంకేతికతను మరింత ఎక్కువగా ఉపయోగిస్తూ కాగిత రహిత పాలన కు ప్రాధ్యనత ఇవ్వాలి.



మిత్రులారా,

దేశ సంప్రదాయాలను అనుసరించి భవిష్యత్తులో కొత్త అంశాలెన్నింటినో పొందుపరిచే అవకాశముందని... రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించే సమయంలో రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. కొత్త తరాలు, కొత్త సంప్రదాయాలను కలుపుకొని పోవాలని రాజ్యాంగ సభ ఆకాంక్షించింది. రాజ్యాంగ నిర్మాతలు అందించిన ఈ స్పూర్తిని మనం ముందుకు తీసుకువెళ్లాలి. ప్రిసైడింగ్ అధికారులుగా
మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు, కొత్త విధానాలు ఆ దిశగా ఉంటే... ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూరుతుంది.


చట్ట సభల చర్చల్లో ప్రజల భాగస్వామ్యాన్ని ఎలా పెంచాలి ? ఈ దేశ యువతను ఎలా భాగస్వామ్యం చేయాలి ? వంటి అంశాల గురించి కూడా ఆలోచించాలి. చాలా సందర్భాల్లో ప్రజలు విజిటర్ గ్యాలరీలను సందర్శిస్తున్నారు. చర్చలను కూడా చూస్తున్నారు. కానీ ఈ ప్రక్రియ మరింత సమర్ధవంతంగా ఉండాలి. ఏ అంశంపై చర్చ జరుగుతుందో..ఆ అంశానికి సంబంధించిన ప్రజలు చర్చలో పాల్గొంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు విద్యా వ్యవస్థపై చర్చ జరుగుతున్నప్పుడు విద్యార్ధులను, టీచర్లను, యూనివర్శిటీలను భాగస్వామ్యం చేయాలి. ఇతర సామాజిక అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు ఆయా వర్గాల ప్రజలు చర్చలో పాల్గొనేలా చూడాలి. మహిళా సంబంధ చర్చల సమయంలో మహిళలను పిలవాలి.

ఇదే విధంగా కాలేజీల్లో మాక్ పార్లమెంట్స్ నిర్వహించే విధానాన్ని మనం మరింతగా ప్రోత్సహించడం ద్వారా విద్యార్ధులు ఆయా అంశాలకు  కనెక్ట్ అవుతారు. యూనివర్శిటీ విద్యార్ధులు పార్లమెంట్ ను నిర్వహించుకోవడం ద్వారా ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటారు. విద్యార్ధులు స్పూర్తి పొందడంతో పాటు కొత్త విషయాలు నేర్చుకోగలరు. ఇవి కేవలం నా సూచనలు మాత్రమే. మీకున్న సీనియార్టీ, అనుభవాన్ని జోడించడం ద్వారా ఇలాంటి చర్యలు తీసుకుంటే... శాసన వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని నేను నమ్ముతున్నాను.

ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు గౌరవనీయులైన స్పీకర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను కేవలం నా సలహాలను మాత్రమే ఇచ్చాను. స్పీకర్ గారు ఈ  సమావేశాన్ని కెవాడియాలో ఏర్పాటు చేశారు. మంచి ఆతిథ్యానికి పెట్టింది పేరైన గుజరాతీయులు ఎలాంటి లోపాలు లేని మంచి ఆతిథ్యాన్నే మీకు అందించారని భావిస్తున్నాను. వాస్తవానికి ఈ విగ్రహాన్ని చూసిన తర్వాత మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చితే ఈ ప్రాంత అభివృద్ధికి అవి ఎంతో దోహదం చేస్తాయి.  ప్రతి ఒక్కరి సహకారం వల్లనే ఇంత అద్భుతమైన నిర్మాణం సాధ్యమైంది. దేశవ్యాప్తంగా ఆరు లక్షల గ్రామాల్లో రైతులు ఉపయోగించే పనిముట్లే దీనికి మూలం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకుంటారు. అన్నదాతలు ఉపయోగించే ఆ పరికరాలే ఇనుముగా కరిగి ఈ విగ్రహంగా రూపాంతరం చెందింది. ఆ రకంగా చూసుకుంటే..ప్రతి గ్రామం... ప్రతి రైతు ఈ విగ్రహ నిర్మాణం వెనుక ఉన్నాడనే చెప్పాలి.


మిత్రులారా,

నర్మదా జీ, సర్దార్ సాహెబ్ అందించిన స్పూర్తితో మీరు ముందుకు వెళ్తారని ఆశిస్తూ

మీ అందరికీ కృతజ్ఞతలు

శుభాకాంక్షలు

***



(Release ID: 1676637) Visitor Counter : 191