రక్షణ మంత్రిత్వ శాఖ
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన
నాడు పోస్టు చేయడమైనది:
19 SEP 2020 5:01PM by PIB Hyderabad
అధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లోని భారతీయ స్థావరాలపై పాకిస్తానీ బలగాలు ఇటీవల దాడులు చేయలేదు. అయితే,..అధీన రేఖ వెంబడి పదే పదే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాకిస్తాన్ సైన్యం పాల్పడుతూనే ఉంది. ఈ ఏడాది జమ్ము కాశ్మీర్ లో అధీన రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ సైన్యం ఉల్లంఘించిన సంఘటలు 2,453వరకూ జరిగాయి. 2020 మార్చి 1నుంచి సెప్టెంబరు 7 వరకూ ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనికి తోడు జమ్ము కాశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు ఆవలి వైపునుంచి పాక్ సైన్యం కాల్పులు జరిపిన సంఘటనలు ఈ ఏడాదిలో 192వరకూ జరిగాయి. 2020 మార్చి 1నుంచి ఆగస్టు నెలాఖరు వరకూ ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి.
అధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ బలగాలు గత ఆరునెలల్లో జరిపిన కాల్పుల్లో సైనిక సిబ్బందికి చెందిన 10మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణల్లో పాకిస్తాన్ వైపు మృతుల, లేదా క్షతగాత్రుల వివరాలను నిర్దిష్టంగా అంచనా వేయడం సాధ్యం కాలేదు.
పాకిస్తాన్ బలగాల కాల్పుల విరమణ ఉల్లంఘనలకు దీటైన రీతిలో భారతీయ సైన్యం, సరిహద్దు భద్రతా దళం ప్రతిఘటించింది. దీనికి తోడు,..కాల్పుల విరమణ జరిగిన సంఘటనలన్నింటినీ పాకిస్తాన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. హాట్ లైన్, ఫ్లాగ్ మీటింగ్, సైనిక కార్యకలాపాల డైరెక్టరేట్ జనరల్స్ కార్యాలయాల స్థాయి చర్చలు,.. తదితర మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని పాకిస్తాన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఉభయ దేశాల మధ్య దౌత్యపరమైన మార్గాల ద్వారా ఈ అంశంపై చర్చ జరిగింది. భారతీయ సరిహద్దు భద్రతా దళం కూడా వివిధ స్థాయిల్లో పాకిస్తాన్ రేంజర్స్ దళంతో చర్చలు జరిపింది.
సిమ్లా ఒప్పందం, లాహోర్ ప్రకటనలకు అనుగుణంగా జమ్ము కాశ్మీర్ లోని అధీన రేఖ, అంతర్జాతీయ. సరిహద్దు ప్రతిపత్తిని కాపాడేలా వ్యవహరించాలని, భారత్ పదేపదే దౌత్యపరంగా పాకిస్తాన్ కు సూచిస్తూనే వస్తోంది. అత్యున్నత స్థాయిలో కూడా భారత్ తన వాదనను సమర్థంగా వినిపించింది.
రాజ్యసభలో ఈ రోజు డాక్టర్ ఫౌజియా ఖాన్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ ఈ సమాచారం తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 1656793)
సందర్శకుల సూచీ సంఖ్య : : 170