ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్ 19 పై ప్ర‌ధాని శ్రీ న‌రే్ంద్ర మోదీ యూరోపియ‌న్ క‌మిష‌న్ అధ్య‌క్షురాలు గౌర‌వ‌నీయ ఉర్సులా వాన్ డెర్ లియెన్ మధ్య చ‌ర్చ‌లు

Posted On: 24 MAR 2020 9:20PM by PIB Hyderabad

మ‌హమ్మారి కోవిడ్ -19 పై ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ యూరోపియ‌న్ క‌మిష‌న్ అధ్య‌క్షురాలు హ‌ర్ ఎక్స్‌లెన్సీ ఉర్సులా వాన్ డెర్ లియెన్ మ‌ధ్య టెలిఫోన్ ద్వారా చ‌ర్చ‌లు జ‌రిగాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్న మ‌హ‌మ్మారి కోవిడ్ -19 కార‌ణంగా అంత‌ర్జాతీయంగా ఏర్ప‌డిన ప‌రిస్థితుల గురించి ఇరువురు నేత‌లు చ‌ర్చించుకున్నారు. 
కోవిడ్-19 కార‌ణంగా యూరోపియ‌న్ యూనియ‌న్ లో మ‌ర‌ణించిన‌వారికి ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ నివాళి ఘ‌టించారు. ఈ మ‌హ‌మ్మారిని జ‌యించ‌డానికిగాను ప్ర‌పంచంలోని దేశాల మ‌ధ్య‌న స‌మ‌న్వ‌యం, స‌హ‌కారం చాలా అవ‌స‌ర‌మ‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ అన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరికట్ట‌డానికిగాను భార‌తదేశంలో చేప‌ట్టిన చ‌ర్య‌ల గురించి ప్ర‌ధాని వివ‌రించారు. 
భార‌త‌దేశంలో వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ముంద‌స్తుగా చేప‌ట్టిన చ‌ర్య‌లను ఆయ‌న నాయ‌క‌త్వ ప‌టిమను మిస్ వాన్ డెర్ లియెన్ ప్ర‌శంసించారు. వైర‌స్ వేగంగా వ్యాప్తి చెంద‌కుండా వుండ‌డానికి ప్ర‌ధాని తీసుకున్న చ‌ర్య‌లు ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని అన్నారు. అంతే కాదు కోవిడ్ 19 నేప‌థ్యంలో, భార‌త‌దేశంలో నివ‌సిస్తున్న యూరోపోయన్ యూనియ‌న్ పౌరులను ఆదుకోవ‌డానికిగాను భార‌త‌దేశం అందించిన స‌హాయం ప్ర‌శంస‌నీయంగా వుంద‌ని ఆమె అన్నారు. 
ఈ ప‌రిస్థితుల్లో నిత్యావ‌స‌రాల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూసుకోవాల‌ని, మందులు లాంటివి అందుబాటులో వుండేలా చూసుకోవాల్సి వుంటుందని, వ్యాక్సిన్ అభివృద్ధిలో అంద‌రూ క‌లిసికట్టుగా ప‌ని చేయాల్సి వుంటుంద‌ని ఆమె అన్నారు. 
జి-20 దేశాల ప‌రిధిలో సాధ్య‌మ‌య్యే స‌హ‌కారం గురించి ఇరువురు నేత‌లు చ‌ర్చించుకున్నారు. ఈ నేప‌థ్యంలో నిర్వ‌హించ‌బోయే వీడియో కాన్ఫ‌రెన్స్ గురించి కూడా మాట్లాడుకున్నారు. 

*****



(Release ID: 1655525) Visitor Counter : 106