ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

జమ్ము&కశ్మీర్‌, లద్దాఖ్‌లో విధుల్లో ఉన్న సైనికులకు రాఖీలు కట్టిన ఈశాన్య ప్రాంత మహిళలు; కేంద్రమంత్రి శ్రీ డా.జితేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం

Posted On: 02 AUG 2020 5:15PM by PIB Hyderabad

రాఖీపూర్ణిమ సందర్భంగా, జమ్ము&కశ్మీర్‌, లద్దాఖ్‌లో విధుల్లో ఉన్న సాయుధ బలగాలు, పారామిలిటరీ జవాన్లకు  ఈశాన్య ప్రాంత మహిళలు, యువతులు రాఖీలు కట్టి సోదర బంధాన్ని చాటారు. 

    ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ డా.జితేంద్ర సింగ్‌ (స్వతంత్ర బాధ్యత) చొరవ తీసుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, మణిపూర్‌, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర, సిక్కింకు చెందిన స్వయం సహాయ బృందాల మహిళలు సైనికులకు రాఖీలు, త్రివర్ణ బ్యాండ్లు, ఫేస్‌ మాస్కులు పంపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటారు.

 

    కేంద్రమంత్రి డా.జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ, జమ్ము&కశ్మీర్‌ తన పార్లమెంటు నియోజకవర్గమని, ఈశాన్య ప్రాంతం తన అధికారిక నియోజకవర్గమని అన్నారు. ఈశాన్య ప్రాంత బాధ్యతను తనకు అప్పగించినప్పుడు, దేశంలోని రెండు ప్రాంతాలను అనుసంధానించే అరుదైన అవకాశంగా దానిని భావించానన్నారు. తమ రక్షణ కోసం సరిహద్దుల్లో రాత్రిబవళ్లూ కావలి కాస్తున్న ప్రతి సైనికుడి భద్రత గురించి దేశంలోని అక్కచెల్లెళ్లంతా ఆలోచిస్తున్నారన్నది, ఈశాన్య ప్రాంత మహిళలు తెచ్చిన రాఖీలకు అర్ధమని కేంద్ర మంత్రి చెప్పారు. ఉత్సవాలను మనం కోరుకున్నట్లు ఈ విధంగా జరుపుకుంటే, సరిహద్దుల్లోని సైనిక సోదరులు రాత్రిబవంళ్లూ కాపలా కాసి మన భద్రతకు హామీ ఇస్తారన్నారు.

    మార్చి-ఏప్రిల్‌ నెలల నుంచి ఈశాన్య ప్రాంత స్వయం సహాకయ బృందాల మహిళలు ఫేస్‌మాస్కులు తయారు చేస్తున్నారంటూ డా.జితేంద్ర సింగ్‌ మెచ్చుకున్నారు. రాఖీ పూర్ణిమ సందర్భంగా సైనికుల కోసం ఫేస్ మాస్కులు తయారు చేయడానికి ఈ లాక్‌డౌన్‌ సమయంలో వారు చాలా శ్రమించారని అన్నారు.

    ఈశాన్య ప్రాంత స్వయం సహాయక బృందాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, నార్త్‌ ఈస్టర్న్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఈసీ), నార్త్ ఈస్టర్న్ రీజియన్ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ (ఎన్‌ఈఆర్‌సీవోఆర్‌ఎంపీ) సహకారం అందించాయి. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

<><><>



(Release ID: 1643065) Visitor Counter : 171