ఆర్థిక మంత్రిత్వ శాఖ

కట్ మరియు పాలిష్ వజ్రాల తిరిగి దిగుమ‌తి చేసుకునే గ‌డువు మూడు నెలలు పొడిగింపు

Posted On: 12 JUL 2020 8:22PM by PIB Hyderabad

కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నేడు రత్నాలు మరియు ఆభరణాల రంగానికి గొప్ప ఉపశమనం కలిగించే నిర్ణ‌యం తీసు‌కుంది.
ధ్రువీక‌ర‌ణ మ‌రియు గ్రేడింగ్ కోసం విదేశాలకు పంపిన కట్ మరియు పాలిష్ వజ్రాలను తిరిగి దిగుమతి చేసుకొనే గ‌డువును మ‌రో మూడు నెలల వరకు కేంద్రం పొడిగించింది. విదేశాలలో పేర్కొన్న ప్రయోగశాలల్లో త‌గిన ధ్రువీక‌ర‌ణ‌ మరియు నాణ్య‌త గ్రేడింగ్‌ల‌ను పూర్తి చేసుకున్న తర్వాత కట్ మరియు పాలిష్ వజ్రాలను ఎగుమతిదారులు తిరిగి తీసుకురావడానికి తాజాగా పొడిగించిన మూడు నెల‌ల కాలావ‌ధి అందుబాటులో ఉంటుందని సీబీఐసీ తెలిపింది. గ్రేడింగ్‌ల‌ను పూర్తి చేసుకున్న తర్వాత కట్ మరియు పాలిష్ వజ్రాల దిగుమ‌తుల‌కు ఈ పొడిగింపు వర్తిస్తుంద‌ని తెలిపింది. వీటిని ఫిబ్రవరి 1, 2020 నుండి జూలై 31, 2020 మధ్య తిరిగి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. కానీ కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితితో ఏర్ప‌డిన‌ అంతరాయం కారణంగా వీటిని స‌కాలంలో తిరిగి తీసుకు రాలేక ‌పోయారు. దీంతో 9 మార్చి 2012 నాటి కస్టమ్స్‌కు చెందిన నోటిఫికేషన్ నెంబర్ 09/2012ను సవరించడం ద్వారా తాజా ఉపశమనాన్ని ప్రకటించినట్లు సీబీఐసీ తెలిపింది. కేంద్ర తాజా నిర్ణ‌యంతో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ(బీసీడీ) మరియు ఐజీఎస్‌టీ చెల్లించకుండానే పొడిగించిన కాలంలో వ‌ర్త‌కులు తిరిగి దిగుమతి చేసుకోవడానికి వీలు క‌లుగనుంది. గత మూడేండ్లుగా సగటు వార్షిక ఎగుమతి టర్నోవర్ రూ.5 కోట్ల మేర‌ క‌లిగి ఉన్న‌వారికి ఈ సౌక‌ర్యం అందుబాటులో ఉండ‌నుంది. ‌గ్రేడెడ్ కట్, పాలిష్ చేసిన వజ్రాలు విదేశాలలో చిక్కుకొని ఇబ్బందుల్లో ఉన్న ఆయా ఎగుమతిదారులకు ఈ మూడు నెల‌ల కాలావ‌ధికి సంబంధించిన పొడిగింపు ఉప‌శ‌మ‌నం ఇవ్వ‌బ‌డుతుంది. మహమ్మారి కారణంగా ఏర్ప‌డిన ప‌రిస్థితుల కార‌ణంగా తిరిగి వ‌జ్రాల దిగుమ‌తి చేసుకోవడానికి అనుమతి ఉంది. ఇటువంటి అనేక క‌న్‌సైన్‌మెంట్‌లో కస్టమ్స్ వారి క్లియరెన్స్ కోసం నిలిచిపోయి ఉన్నాయి.
                                 

****



(Release ID: 1638252) Visitor Counter : 182