హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రివర్గ కీలక నిర్ణయాలను ప్రశంసించి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన హోంమంత్రి అమిత్ షా
దేశవ్యాప్తంగా పేదలకు రేషన్ అందించే 'ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన'ను నవంబర్ వరకు పొడిగించడంపై ప్రధానికి కేంద్ర హోంమంత్రి కృతజ్ఞతలు
కరోనా సమయంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ప్రధాని సంకల్పం అభినందనీయం: అమిత్ షా
7.4 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే ఉజ్వల యోజన కూడా సెప్టెంబర్ వరకు పొడిగింపు: అమిత్ షా
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, నగరాల్లో వలస కూలీల కోసం అద్దె ఇళ్ల భవన సముదాయాలు నిర్మించాలని తీసుకున్న చారిత్రక నిర్ణయంతో వలస కూలీలకు తక్కువ ధరకే అద్దె వసతి దొరుకుందన్న అమిత్ షా
'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' స్ఫూర్తితో, ఈపీఎఫ్ చందా సాయాన్ని ఆగస్టు వరకు పొడిగిస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 72 లక్షల మంది చిన్న వ్యాపారస్తులకు ఉపయోగం: అమిత్ షా
నాడు పోస్టు చేయడమైనది:
08 JUL 2020 8:09PM by PIB Hyderabad
కరోనా సమయంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ప్రధాని సంకల్పం ప్రశంసనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే 'ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన'ను నవంబర్ వరకు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి హోంమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
"కరోనా ప్రారంభ సమయంలో, ఉజ్వల యోజన కింద, మూడు నెలలపాటు పేద మహిళలకు నెలకు ఒక్కో వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. చాలా కుటుంబాలు ఆ సాయాన్ని సంపూర్ణంగా పొందలేకపోయాయి కాబట్టి, సెప్టెంబర్ వరకు ఈ పథకాన్ని పొడిగించారు. దీనివల్ల 7.4 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది" అని అమిత్ షా ట్వీట్లో పేర్కొన్నారు.
"ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, నగరాల్లో ప్రాంతాల్లో వలస కూలీల కోసం "తక్కువ ధర అద్దె ఇళ్ల భవన సముదాయాలు" నిర్మించాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రక నిర్ణయం వల్ల, నగరాల్లో పీఎంఏవై ఫ్లాట్లు తక్కువ ధరకే వలస కూలీలకు అద్దెకు దొరుకుతాయి" అని అమిత్ షా చెప్పారు. "అందరికీ ఇళ్లు" లక్ష్యాన్ని బలోపేతం చేసేలా నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
""సబ్ కా సాత్, సబ్ కా వికాస్" నినాదం పట్ల తన నిబద్ధతను చాటేలా, చిన్న వ్యాపారస్తులకు ఊరటనిచ్చే మరో ముఖ్యమైన పథకాన్ని ప్రధాని మోదీ పొడిగించారు. ఈపీఎఫ్ చందా సాయాన్ని ఆగస్టు వరకు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 72 లక్షల మంది చిన్న వ్యాపారస్తులకు ఉపయోగం" అని అమిత్ షా ట్వీట్లో పేర్కొన్నారు.
రూ. లక్ష కోట్ల "వ్యవసాయ మౌలిక వసతుల నిధి" వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తుందని, గ్రామీణ భారతాన్ని అన్ని రంగాల్లో ప్రగతి బాటలో నడిపించాలన్న మోదీ నిబద్ధతకు ఇది దర్పణమని అమిత్ షా వెల్లడించారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో ఈ నిర్ణయం ఊపు తెస్తుందని అమిత్ షా ట్వీట్ చేశారు.
*****
(రిలీజ్ ఐడి: 1637608)
సందర్శకుల సూచీ సంఖ్య : : 331