రక్షణ మంత్రిత్వ శాఖ
భారత నావికాదళ అకాడమీలో కోర్సు ముగింపు వేడుక
నాలుగు రకాల కోర్సుల్లో విజయవంతంగా ముగిసిన శిక్షణ
కొవిడ్ కారణంగా ట్రైనీల తల్లిదండ్రులు, అతిథులు లేకుండా వేడుక
Posted On:
12 JUN 2020 6:34PM by PIB Hyderabad
కేరళ ఎజ్హిమలలోని భారత నావికాదళ అకాడమీ (ఐఎన్ఏ)లో కోర్సు ముగింపు వేడుకలు శనివారం జరగనున్నాయి. కొవిడ్ సంబంధ జాగ్రత్తలు తీసుకుంటూ, ట్రైనీల తల్లిదండ్రులు, అతిథులు లేకుండా ఈ వేడుక జరగనుంది. 98వ ఇండియన్ నావల్ అకాడమీ కోర్స్ (బీటెక్), 98వ ఇండియన్ నావల్ అకాడమీ కోర్స్ (ఎంఎస్సీ), 29వ నావల్ ఓరియంటేషన్ కోర్స్ (ఎక్స్టెండెడ్), 30వ నావల్ ఓరియంటేషన్ కోర్స్ (రెగ్యులర్)ను పూర్తి చేసుకున్నవారితోపాటు, తీర రక్షక దళం, మిత్ర దేశాల ట్రైనీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
కొవిడ్ సమయంలో శిక్షణ కొనసాగించడానికి "అనుసరించు, స్వీకరించు" సూత్రాన్ని ఐఎన్ఏ పాటించింది. పరిస్థితులకు తగ్గట్లుగా శిక్షణ కార్యక్రమాల్లో మార్పులు చేసి, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ శిక్షణ కొనసాగించింది. విద్య, ఔట్ డోర్ శిక్షణ ప్రమాణాలను అందుకుని ట్రైనీలు విజయవంతంగా కోర్సును పూర్తి చేశారు. ఈ నెల 10వ తేదీన, రియర్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి వీరి చేత విధేయత ప్రమాణం చేయించారు. ఐఎన్ఏకు చెందిన యుద్ధ సంస్మరణ ప్రదేశం "ప్రేరణ స్థల్" వద్ద, అమరవీరుల త్యాగానికి గుర్తుగా నివాళులు అర్పించారు. కోర్సు పూర్తయిన తర్వాత, ఈ ట్రైనీలు ఐఎన్ఏ నుంచి నేరుగా తమ వృత్తి విద్య పాఠశాలలు, యూనిట్లకు వెళతారు.
వైస్ అడ్మిరల్ అనిల్ కుమార్ చావ్లా సహా ముఖ్య నావికాదళ అధికారులు కోర్సు ముగింపు వేడుకకు హాజరవుతారు.
(Release ID: 1631282)