Energy & Environment
సముద్ర మంథన్ – జాతీయ తీరప్రాంత అన్వేషణ పథకం
ఇంధన వనరుల కోసం సముద్ర మథనం
Posted On:
03 AUG 2026 6:02PM
ఇంధన భద్రత, స్వావలంబన దిశగా భారత ప్రయాణంలో ‘సముద్ర మంథన్’ కీలక ముందడుగు. 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు తొలి దశకు ₹84,084 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ పథకం.. భారత సముద్రగర్భంలోని అపార హైడ్రోకార్బన్ సామర్థ్యాన్ని వెలికితీయనుంది. అన్వేషణను వేగవంతం చేయడం, ఆధునిక సాంకేతికతను వినియోగించడం, ఉమ్మడి మౌలిక సదుపాయాలను కల్పించడం, దేశీయ తయారీని బలోపేతం చేయడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. 600 ఎంఎంటీఓఈలకు పైగా హైడ్రోకార్బన్ నిల్వలను జోడించడం, దేశీయ ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ప్రపంచ స్థాయి పోటీతత్వం కలిగిన తీరప్రాంత ఇంధన వ్యవస్థను నిర్మించడం దీని లక్ష్యం.
తీరప్రాంత అన్వేషణలో కొత్త అధ్యాయం
ఆధునిక జీవితంలోని ప్రతి అంశానికీ ఇంధనమే చోదకశక్తి. గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, విస్తృత ఆర్థిక వ్యవస్థకు ఇది శక్తినిస్తుంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విశ్వసనీయమైన, అందుబాటు ధరలో లభించే, సురక్షిత ఇంధన సరఫరాకు భరోసా కల్పించడం జాతీయ ప్రాధాన్యంగా మారింది. దేశ ఇంధన అవసరాలు నిరంతరం పెరుగుతుండగా, ముడి చమురు, సహజ వాయువు అవసరాల్లో గణనీయమైన భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటున్నాం. ఇంధన భద్రతను బలోపేతం చేయడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కోసం దేశీయ ఉత్పత్తిని విస్తరించడం అత్యవసరం.
దేశంలోని కీలక ఇంధన వనరుల్లో హైడ్రోకార్బన్లు ఒకటి. హైడ్రోజన్, కార్బన్తో ఏర్పడిన సేంద్రీయ సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అంటారు. ఇవి భూమి, సముద్ర గర్భంలో లోతుగా లభిస్తాయి. విస్తృతంగా వినియోగించే హైడ్రోకార్బన్లలో ముడి చమురు, సహజ వాయువు ప్రధానమైనవి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, పెట్రో రసాయనాలు, ఎరువులు, అనేక పారిశ్రామిక ఉత్పత్తులకు ఇవి ముడి పదార్థాలను అందిస్తాయి.
భారత తీరప్రాంత బేసిన్లలో వెలికితీయని అపార హైడ్రోకార్బన్ సామర్థ్యం ఉంది. భూమిలో హైడ్రోకార్బన్లు చేరే విశాలమైన సహజ పల్లపు ప్రాంతాన్ని బేసిన్ అంటారు. ఈ వనరులను వెలికితీయాలంటే ఆధునిక అన్వేషణ పద్ధతులు, విశ్వసనీయమైన భూగర్భ సమాచారం, అధునాతన డ్రిల్లింగ్ సామర్థ్యం, బలమైన దేశీయ సరఫరా వ్యవస్థ అవసరం. ఈ ప్రయత్నాన్ని వేగవంతం చేసేందుకు 2026 జులై 31న ‘సముద్ర మంథన్–జాతీయ తీరప్రాంత అన్వేషణ పథకం’కు ఆమోదం లభించింది. 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు తొలి దశకు ₹84,084 కోట్ల వ్యయంతో హైడ్రోకార్బన్ అన్వేషణ, ఉత్పత్తి రంగానికి ఊతమివ్వాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది.

ఎందుకు భారత్కు సముద్రాలు కీలకం?
ముడి చమురు వినియోగంలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. దేశ వార్షిక దిగుమతుల వ్యయం దాదాపు 144 బిలియన్ అమెరికన్ డాలర్లు లేదా సుమారు ₹13 లక్షల కోట్లుగా ఉంది. అంతరాయం లేని ఇంధన లభ్యత ఎంత కీలకమో ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలు చాటాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు దేశీయ ఉత్పత్తిని పెంచడం అత్యంత అవసరంగా మారింది.

తీరప్రాంతంలో అవకాశాలు
భారత్ భవిష్యత్ చమురు, సహజ వాయువు సామర్థ్యంలో అధిక భాగం సముద్రగర్భంలో ఉంది. సముద్రంలో అత్యంత లోతైన నీటి ప్రాంతాలను డీప్వాటర్, అల్ట్రా డీప్వాటర్ బేసిన్లు అంటారు. భారత తూర్పు, పశ్చిమ తీరాల్లోని సముద్రతీరేతర బేసిన్లు 3,000 మీటర్ల నీటి లోతు వరకు విస్తరించి ఉన్నాయి. వీటిలో 5,600 ఎంఎంటీఓఈలకు(మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఎక్వివాలెంట్) పైగా హైడ్రోకార్బన్ సామర్థ్యం ఉన్నట్లు అంచనా. కావేరి, మహానది, అండమాన్ బేసిన్లలో ఇటీవల గుర్తించిన వనరులు ఈ అవకాశాలపై మరింత నమ్మకాన్ని పెంచాయి.
లోతైన సముద్ర అన్వేషణలో సవాళ్లు
అన్వేషణకు భారీ వ్యయంతో పాటు ఎంతో సమయం అవసరం. బ్లాక్ కేటాయింపు నుంచి వాణిజ్య ఉత్పత్తి వరకు సాధారణంగా 5 నుంచి 10 ఏళ్లు పడుతుంది. లోతైన సముద్రంలో ఒక్క అన్వేషణ బావిని తవ్వేందుకు దాదాపు 125 నుంచి 150 మిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయం అవుతుంది. ఇంత భారీ ఆర్థిక వ్యయం సముద్రగర్భ అన్వేషణను నిరుత్సాహపరిచే అవకాశం ఉంది.

నిరంతర అన్వేషణ అవసరానికి మరో కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఉత్పత్తి సాగుతున్న క్షేత్రాల్లో సహజంగా ఏటా దాదాపు 6 నుంచి 7 శాతం క్షీణత నమోదవుతోంది. ప్రస్తుత ఉత్పత్తిని కొనసాగించాలన్నా కొత్త వనరులను గుర్తించాల్సి ఉంటుంది. అందువల్ల నిరంతర అన్వేషణ ఇంధన రంగంలో దీర్ఘకాలిక స్వావలంబనకు మార్గం చూపుతుంది.
సముద్ర మంథన్ మిషన్ అంతరార్థం
విధాన సంస్కరణల నుంచి మిషన్ పద్ధతిలో అమలు దిశగా మార్పునకు సముద్ర మంథన్ నాంది పలుకుతోంది. సరిహద్దు సముద్ర ప్రాంతాల్లో నిరంతర పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పథకం ఆర్థిక ముప్పును పంచుకునే విధానాన్ని అనుసరిస్తుంది. తీరప్రాంత ప్రాజెక్టుల్లో ముప్పును తగ్గించడం, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, మొత్తం విలువ గొలుసులో దీర్ఘకాలిక జాతీయ సామర్థ్యాన్ని నిర్మించడం దీని లక్ష్యం. గత దశాబ్ద కాలంలో చేపట్టిన సంస్కరణలను సముద్రంలో ఆచరణాత్మక చర్యలుగా ఇది మారుస్తుంది.
సముద్ర మంథన్లోని భాగాలు
తీరప్రాంత అన్వేషణకు విశ్వసనీయ సమాచారం, అధునాతన సాంకేతికత, ఆధునిక మౌలిక సదుపాయాలు, విపత్కర పరిస్థితులను తట్టుకునే సరఫరా వ్యవస్థ అవసరం. నాలుగు విభాగాల ద్వారా ఈ అంశాలన్నింటినీ సముద్ర మంథన్ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది.
భూకంప తరంగాల సమాచారం సేకరణ, విశ్లేషణ, ఫలితాల నిర్ధారణ
తీరప్రాంత ప్రాంతాల్లో పరిమిత భూకంప తరంగాల సర్వే కారణంగా డ్రిల్లింగ్కు సిద్ధంగా ఉన్న చమురు, సహజ వాయువు అవకాశాలను గుర్తించడం కష్టమైంది. ₹28,534 కోట్ల వ్యయంతో భారీ స్థాయిలో 2డీ, 3డీ సీస్మిక్ సర్వేలకు ఈ పథకం నిధులు అందిస్తుంది. అధునాతన సాంకేతికత, కృత్రిమ మేధ ద్వారా సమాచార విశ్లేషణ, ఫలితాల నిర్ధారణ వేగవంతమవుతాయి. జాతీయ సమాచార భాండాగారంలోని పాత సమాచారాన్ని కూడా ఆధునిక సాధనాలతో తిరిగి విశ్లేషిస్తారు.
తీరప్రాంత అన్వేషణకు వేగం
అధిక వ్యయం, సుదీర్ఘ కాలపరిమితి కారణంగా లోతైన సముద్రంలో డ్రిల్లింగ్ ఎంతో ముప్పుతో కూడిన ప్రక్రియ. ఈ ముప్పును పంచుకునేందుకు 60 డీప్వాటర్, అల్ట్రా డీప్వాటర్ బావుల తవ్వకానికి పథకం ₹43,200 కోట్లు కేటాయించింది. అర్హత కలిగిన డ్రిల్లింగ్ వ్యయంలో గరిష్ఠంగా 50 శాతం లేదా ఒక్కో బావికి ₹675 కోట్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంత మొత్తాన్ని ఆర్థిక సహాయంగా అందిస్తారు. చమురు, సహజ వాయువు నిల్వలను పెంచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు అన్వేషణ–ఉత్పత్తి సంస్థలు రెండింటికీ ఈ పథకం అందుబాటులో ఉంటుంది. నిల్వల పెంపును వేగవంతం చేసి, లోతైన సముద్రంలో భారత ఇంధన సామర్థ్యాన్ని వెలికితీస్తుంది.
ఉమ్మడి తీరప్రాంత మౌలిక సదుపాయాలు
ముఖ్యంగా మహానది, కచ్ బేసిన్లలో మౌలిక సదుపాయాల అధిక వ్యయం కారణంగా తీరప్రాంతాల్లో గుర్తించిన అనేక వనరుల నుంచి ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఎంపిక చేసిన బేసిన్లలో ఉమ్మడి ఉత్పత్తి, తరలింపు సదుపాయాల కోసం ఈ పథకం ₹10,000 కోట్లు అందిస్తుంది. ఉమ్మడి మౌలిక సదుపాయాలు ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించి, వినియోగంలోకి రాని వనరులను ఉత్పత్తి క్షేత్రాలుగా మారుస్తాయి.
చమురు–సహజ వాయువు తయారీ, సేవల జోన్
దేశీయ తయారీ తక్కువగా ఉండటం వల్ల అన్వేషణ వ్యయం, దిగుమతులపై ఆధారపడటం, విదేశీ మారక ద్రవ్య ప్రవాహం పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ₹2,000 కోట్లతో సమీకృత చమురు–సహజ వాయువు తయారీ, సేవల జోన్ను ఏర్పాటు చేస్తారు. తయారీ, మరమ్మతులు, గిడ్డంగులు, ఇంజినీరింగ్, సేవల రంగాల్లో దేశీయ సామర్థ్యాన్ని ఇది పెంచుతుంది. మొత్తం సరఫరా వ్యవస్థలో మేక్ ఇన్ ఇండియాను నేరుగా ముందుకు తీసుకెళ్తుంది. పర్యవేక్షణ, డిజిటల్ చర్యలు, మదింపు, మానవ వనరులు, అవగాహన, ప్రజా విస్తరణ కార్యక్రమాలు, సమావేశాలు, మీడియా కోసం ₹350 కోట్లు అందిస్తారు.
|
క్రమ సంఖ్య
|
విభాగం
|
మొత్తం (₹ కోట్లు)
|
|
1
|
తీరప్రాంత సమాచారం సేకరణ
|
28,534
|
|
1ఏ
|
బేసిన్ అంతటా సమాచారం కోసం 2డీ సీస్మిక్ సమాచార సేకరణ
|
12,000
|
|
1బి
|
3డీ సీస్మిక్ సమాచార సేకరణ, ఇతర పద్ధతులు
|
12,534
|
|
1సి
|
ఎన్డీఆర్ సమాచార పునఃవిశ్లేషణ, కృత్రిమ మేధ సాధనాల అమలు
|
4,000
|
|
2
|
తీరప్రాంత అన్వేషణ, మౌలిక సదుపాయాల ఆధారిత ఉత్పత్తి
|
55,200
|
|
2ఏ
|
తీరప్రాంత అన్వేషణ వేగవంతం
|
43,200
|
|
2బి
|
మౌలిక సదుపాయాల ఆధారిత లోతైన సముద్ర ఉత్పత్తి, అన్వేషణ
|
10,000
|
|
2సి
|
చమురు–సహజ వాయువు తయారీ, సేవల జోన్ల అభివృద్ధి
|
2,000
|
|
3
|
పర్యవేక్షణ, సహాయక కార్యకలాపాలు
|
350
|
| |
మొత్తం
|
84,084
|
సమగ్ర సహాయక వ్యవస్థ
నిధుల కేటాయింపుతో పాటు మొత్తం విలువ గొలుసుకు అనుకూల వాతావరణాన్ని ఈ పథకం కల్పిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా కింది అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు:
* పారదర్శకమైన, సమర్థవంతమైన అమలు కోసం డిజిటల్ కార్యక్రమ నిర్వహణ
* రంగంలోని నిపుణుల సామర్థ్య నిర్మాణం
* అత్యాధునిక సాంకేతికతల స్వీకరణ
* భాగస్వాములతో నిరంతర సంప్రదింపులు
* అంతర్జాతీయ భాగస్వాములను ఆకర్షించేందుకు ప్రపంచ స్థాయి విస్తరణ కార్యక్రమాలు
సముద్ర మంథన్తో లభించే ఫలితాలు
ఆర్థిక వ్యవస్థకు, భావితరాలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. అన్వేషణ విజయవంతమైతే కింది విస్తృత ప్రయోజనాలు లభిస్తాయని అంచనా:
* భారీ నిల్వలు: హైడ్రోకార్బన్ నిల్వలు 600 ఎంఎంటీఓఈలకు పైగా పెరుగుతాయి. తద్వారా వనరుల పరిమాణం 1.6 బిలియన్ టన్నుల చమురు సమాన స్థాయి నుంచి 2.2 బిలియన్ టన్నుల చమురు సమాన స్థాయికి చేరుతుంది.
* అధిక ఉత్పత్తి: వార్షిక దేశీయ ఉత్పత్తిని దాదాపు 62 ఎంఎంటీఓఈల నుంచి 80 ఎంఎంటీఓఈలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదనంగా 10 నుంచి 15 ఎంఎంటీఓఈల ఉత్పత్తి లభిస్తుందని, గరిష్ఠంగా 20 ఎంఎంటీఓఈల సామర్థ్యం ఉంటుందని అంచనా.
* తగ్గనున్న దిగుమతుల వ్యయం: అదనపు ఉత్పత్తితో ముడి చమురు దిగుమతులపై ఏటా దాదాపు ₹1 లక్ష కోట్ల వ్యయాన్ని తగ్గించవచ్చు. తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని గణనీయంగా ఆదా చేయవచ్చు.
* పెట్టుబడులు, వృద్ధి: మొత్తం విలువ గొలుసులో పెట్టుబడులను పథకం ప్రోత్సహిస్తుంది. స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి బలమైన ఊతమిస్తుంది.
* ఉపాధి: అన్వేషణ, ఉత్పత్తి, అనుబంధ కార్యకలాపాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి.
* స్వదేశీ సామర్థ్యం: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కింద దేశీయ తయారీ మరింత విస్తరిస్తుంది. తీరప్రాంత సాంకేతికతల్లో ప్రపంచ స్థాయి పోటీతత్వం కలిగిన వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది.
ఈ ఫలితాలన్నీ దేశ ఇంధన వ్యవస్థ విపత్కర పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి. సాంకేతిక నాయకత్వానికి, పరిశ్రమలు–ఆవిష్కరణలకు దీర్ఘకాలిక అవకాశాలను కూడా పెంపొందిస్తాయి.
వరుస సంస్కరణలు
ఇటీవలి సంవత్సరాల్లో భారత్ తన హైడ్రోకార్బన్ అన్వేషణ, ఉత్పత్తి వ్యవస్థను స్థిరంగా పునర్నిర్మించింది. పలు నిర్మాణాత్మక సంస్కరణలతో ఈ రంగం మరింత బహిరంగంగా, పారదర్శకంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా మారింది.
* అందుబాటులోకి తీరప్రాంత విస్తీర్ణం: గతంలో ‘నో–గో’ ప్రాంతాలుగా ఉన్న వాటిలో 99 శాతానికి పైగా ఆంక్షలను తొలగించారు. ప్రత్యేక ఆర్థిక మండలంలోని 10 లక్షల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం ఇప్పుడు అన్వేషణకు అందుబాటులో ఉంది. సహజ వనరులపై భారత్కు హక్కులు ఉండే సముద్ర ప్రాంతాన్ని ప్రత్యేక ఆర్థిక మండలం అంటారు.
* కొత్త లైసెన్సింగ్ వ్యవస్థ: హైడ్రోకార్బన్ అన్వేషణ, లైసెన్సింగ్ విధానాన్ని (హెల్ప్) 2016లో ప్రారంభించారు. పాత నామినేషన్ ఆధారిత విధానం స్థానంలో హెల్ప్ కింద ఓపెన్ ఏకరేజ్ లైసెన్సింగ్ కార్యక్రమాన్ని (ఓఏఎల్పీ) ప్రవేశపెట్టారు. హైడ్రోకార్బన్ అన్వేషణ, సత్వర ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు హెల్ప్ తక్కువ పన్నులు, ఏకరూప లైసెన్సింగ్, ఆదాయ భాగస్వామ్యం, ప్రోత్సాహకాలను అందిస్తుంది.
* సరళమైన ఒప్పందాలు: భారత్ 2016లో ఉత్పత్తి భాగస్వామ్య ఒప్పందాల (పీఎస్సీ) నుంచి ఆదాయ భాగస్వామ్య ఒప్పందాల (ఆర్ఎస్సీ) విధానానికి మారింది. పీఎస్సీ విధానంలో వ్యయాన్ని తిరిగి పొందిన తర్వాత ప్రభుత్వం, కాంట్రాక్టర్ మధ్య లాభాలను పంచుకునేవారు. ఆర్ఎస్సీ విధానంలో నిర్దేశిత ఆదాయ వాటాకు ప్రతిఫలంగా అన్వేషణ ముప్పు, ఉత్పత్తి, అభివృద్ధి వ్యయాలన్నింటినీ కాంట్రాక్టర్ భరిస్తారు. తద్వారా పరిపాలనా జోక్యం తగ్గి, ఆర్థిక వ్యవస్థ మరింత సరళంగా, పారదర్శకంగా మారింది.
* ఆధునిక చట్టం: చమురు క్షేత్రాల (నియంత్రణ, అభివృద్ధి) సవరణ చట్టం–2025 ఒప్పందాలకు స్థిరత్వం కల్పించడంతో పాటు వివాద పరిష్కార వ్యవస్థను బలోపేతం చేసింది. సమీకృత పెట్రోలియం కార్యకలాపాలకు గుర్తింపు ఇచ్చి, ఆధునిక నియంత్రణ వ్యవస్థను రూపొందించింది.
* అనుకూల నిబంధనలు: పెట్రోలియం, సహజ వాయువు నిబంధనలు–2025 ఈ మార్పులను ఆచరణలోకి తీసుకొచ్చాయి. వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తూ, పెట్రోలియం లీజుల పరిపాలనను సరళీకరించాయి.
* అందరికీ సమాన అవకాశాలు: అన్ని ఒప్పంద విధానాల్లో కార్యదర్శుల సాధికార కమిటీ నిర్మాణం, అధికార పరిధిని ప్రామాణికం చేశారు. ఒప్పందం ఎప్పుడు కుదిరిందనే అంశంతో సంబంధం లేకుండా ప్రతి సంస్థకు ఇప్పుడు ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తున్నాయి.
* మరింత స్పష్టమైన దృష్టి: చమురు–సహజ వాయువు సంస్థ (ఓఎన్జీసీ), ఆయిల్ ఇండియా పనితీరు ప్రమాణాలను అన్వేషణకు ప్రాధాన్యం ఇచ్చేలా పునర్నిర్దేశించారు. దేశీయ వనరుల పరిధిని విస్తరించాలన్న జాతీయ నిబద్ధతకు ఇది మరింత బలం చేకూరుస్తోంది.
నాణ్యమైన సమాచారమే మెరుగైన అన్వేషణకు పునాది. తీరప్రాంతంలోని రాతి పొరల స్వరూపాన్ని తెలుసుకునేందుకు సీస్మిక్ సర్వేల్లో ధ్వని తరంగాలను భూమిలోకి పంపుతారు. పలు జాతీయ కార్యక్రమాల ద్వారా ఇలాంటి భూవైజ్ఞానిక పరిజ్ఞానంపై భారత్ నిరంతరం పెట్టుబడులు పెట్టింది. మిషన్ అన్వేషణ్, జాతీయ సీస్మిక్ కార్యక్రమం, విస్తరించిన ఖండాంతర అంచుల సర్వే, జాతీయ సమాచార భాండాగారం, హైడ్రోకార్బన్ వనరుల మదింపు అధ్యయనం వీటిలో ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత సమగ్ర భూవైజ్ఞానిక సమాచార వ్యవస్థల్లో ఒకదాన్ని ఇవన్నీ కలిసి రూపొందించాయి.
ఈ సంస్కరణలు స్పష్టమైన విశ్వాసాన్ని కల్పించాయి. ప్రస్తుతం అన్వేషణ కొనసాగుతున్న విస్తీర్ణంలో దాదాపు 81 శాతాన్ని 2014 తర్వాత కేటాయించారు. ఓఏఎల్పీ కింద దాదాపు 3.8 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో 172 బ్లాక్లను కేటాయించారు. ఈ బ్లాక్లలో పెట్టుబడి హామీలు 4.3 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉన్నాయి. క్షేత్రస్థాయి కార్యకలాపాలు కూడా వేగం పుంజుకున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 674 బావులను తవ్వారు. ఐదు కొత్త వనరులను గుర్తించగా, మరో ఏడు వనరులను వాణిజ్య వినియోగంలోకి తీసుకొచ్చారు.
మహానది బేసిన్లో కొత్త అధ్యాయం
హైడ్రోకార్బన్ అన్వేషణ సంస్కరణల ప్రయాణంలో 2026 జులై 25 ఒక గర్వకారణమైన ఘట్టంగా నిలిచింది. మహానది పరివాహక ప్రాంతంలో తొలి మదింపు బావి తవ్వకాన్ని ప్రారంభించారు. గుర్తించిన హైడ్రోకార్బన్ వనరు నాణ్యత, వాణిజ్య విలువను మరింత సమగ్రంగా అంచనా వేసేందుకు మదింపు బావిని తవ్వుతారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ స్థాయి లోతైన సముద్ర డ్రిల్లింగ్ సాంకేతికతను వినియోగిస్తారు. ప్రణాళికలో ఉన్న నాలుగు డీప్వాటర్ బావుల్లో ఎంఎన్–డీడబ్ల్యూఎన్18–1–హెచ్డీ మొదటిది. దేశంలో అత్యధిక అవకాశాలు ఉన్న సముద్రతీరేతర బేసిన్లలో ఒకటైన మహానదిని ఈ బావుల ద్వారా పద్ధతిబద్ధంగా అంచనా వేస్తారు.
కొత్త బావి తవ్వకం ప్రారంభం భారత్ చేపట్టిన అత్యంత క్లిష్టమైన లోతైన సముద్ర అన్వేషణ కార్యక్రమాల్లో ఒకదానికి నాంది పలికింది. అంచనా వేసే ప్రతి వనరు, తవ్వే ప్రతి బావి దేశాన్ని స్వావలంబనకు మరింత చేరువ చేస్తాయి.
సురక్షిత ఇంధన భవిష్యత్తు దిశగా
భారత్ ఆశాజనకమైన ఇంధన శకానికి చేరువలో నిలిచింది. దేశ ఇంధన భవిష్యత్తు ఒకే వనరు గుర్తింపుపై ఆధారపడి లేదు. నిరంతర సంస్కరణలు, విజ్ఞానశాస్త్రం, వేల మంది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, తీరప్రాంత రంగ నిపుణుల అంకితభావంతో అది రూపుదిద్దుకుంటోంది.
సమాచారం, ముప్పును పంచుకునే భాగస్వామ్యం, ఉమ్మడి సదుపాయాలు, స్వదేశీ సామర్థ్యాన్ని సముద్ర మంథన్ ఒకే మిషన్లో మేళవిస్తుంది. సముద్ర మథనం ప్రారంభమవుతున్న వేళ ఎదుగుతున్న దేశ ఆకాంక్షలను ఇది తనతో తీసుకెళ్తోంది. సముద్ర అలల కింద వేసే ప్రతి అడుగు దేశాన్ని సురక్షితమైన, స్వావలంబనతో కూడిన భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుంది.
References
Ministry of Petroleum and Natural Gas:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2292841®=48&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2292841®=48&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2289301®=48&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2202520®=3&lang=1
https://x.com/PetroleumMin/status/2083261752230154401
https://x.com/HardeepSPuri/status/2083145561335570846
https://x.com/HardeepSPuri/status/2080925544833855843
Click here to see pdf
***
(Explainer ID: 159447)
आगंतुक पटल : 8
Provide suggestions / comments