Infrastructure
సులభతర జీవనం: భారతదేశ సమగ్ర ప్రగతి ప్రస్థానం
Posted On:
15 JUN 2026 4:05PM
2014 - 2026 మధ్య సాగిన ఒక నిర్ణయాత్మక పాలనా ప్రస్థానం భారతదేశ పౌరుల దైనందిన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. భద్రమైన ఇల్లు, స్వచ్ఛమైన వంట గ్యాస్, సురక్షితమైన తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యం ద్వారా ప్రజలు కొత్త అవకాశాలను పొందారు. విశ్వసనీయమైన విద్యుత్, తక్కువ ధరకే లభించే వెలుతురు, విస్తరించిన రవాణా వ్యవస్థలు లక్షలాది మందికి సౌకర్యాన్ని, అనుసంధానాన్ని అందించాయి. రహదారులు, ఆధునీకరించిన రైల్వేలు, మెట్రో వ్యవస్థలు, ప్రాంతీయ విమాన మార్గాలు ప్రయాణ అలసటను తగ్గించి, వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలను సులభతరం చేశాయి. జన్ ధన్, ముద్ర పథకాల ద్వారా బ్యాంకింగ్, రుణాలు అందుబాటులోకి వచ్చి, ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్న పౌరులకు ఆర్థిక సమ్మిళిత్వం లభించింది. అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ ద్వారా పట్టణ మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి. మైగవ్ వంటి డిజిటల్ సంస్కరణలు, భాగస్వామ్య వేదికలు జవాబుదారీతనాన్ని, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించాయి. ఈ కార్యక్రమాలన్నీ కలిసి దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబాలలో ఒక కొత్త ధీమాను, గౌరవాన్ని, అవకాశాలను సృష్టించాయి. భారతదేశ పన్నెండేళ్ల ప్రస్థానం సమగ్ర ప్రగతిని ప్రతిబింబిస్తోంది. ఈ పాలన దైనందిన జీవితాన్ని సరికొత్తగా తీర్చిదిద్దడంతో పాటు లక్షలాది మంది అభివృద్ధి పునాదులను బలోపేతం చేసింది.
పన్నెండేళ్ల పరివర్తన: భారతదేశ సులభతర జీవన గాథ
భారతదేశం 2014 నుంచి సాగించిన ప్రస్థానం గౌరవం, అవకాశం, సమగ్ర ప్రగతి వైపు సాధించిన నిర్ణయాత్మక మార్పును తెలియజేస్తుంది. గత పన్నెండేళ్లు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, సంస్కరణల ద్వారా లక్ష్య సాధనతో కూడిన పాలనా పరివర్తనకు చిహ్నంగా నిలిచాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సురక్షితమైన ఇళ్లు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా స్వచ్ఛమైన వంట గ్యాస్, జల్ జీవన్ మిషన్ కింద సురక్షితమైన తాగునీరు దైనందిన జీవితాన్ని మార్చివేశాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యం మెరుగవగా, సౌభాగ్య పథకం ద్వారా లక్షలాది ఇళ్లకు నమ్మకమైన విద్యుత్ సరఫరా అందింది. కొత్త హైవేలు, సొరంగాలు, వంతెనలు, మెట్రో నెట్వర్క్లు, ప్రాంతీయ విమాన మార్గాలతో రవాణా, అనుసంధానత చరిత్రాత్మక వేగంతో విస్తరించాయి.
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఆర్థిక సమ్మిళిత్వం పౌరులకు బ్యాంకింగ్, రుణాలు, భద్రతతో కూడిన సాధికారతను అందించింది. అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ కింద పట్టణ పరివర్తన వేలాది పట్టణాలలో మౌలిక సదుపాయాలను, సేవలను బలోపేతం చేసింది. మైగవ్ వంటి డిజిటల్ సంస్కరణలు, పౌర వేదికలు పాలనలో భాగస్వామ్యాన్ని, జవాబుదారీతనాన్ని, నమ్మకాన్ని పెంపొందించాయి. ఈ కార్యక్రమాలన్నీ కలిసి సౌకర్యం, భద్రత, అవకాశాలతో కూడిన కొత్త వాతావరణాన్ని సృష్టించాయి.
గృహనిర్మాణం, ప్రాథమిక వసతులు
గౌరవప్రదమైన జీవితానికి సురక్షితమైన, పక్కా ఇల్లు ప్రాథమిక పునాది. 2014కు ముందు, పట్టణ, గ్రామీణ భారతదేశం రెండింటిలోనూ ప్రభుత్వ గృహ నిర్మాణాల వేగం, పరిమాణం అవసరాల కంటే చాలా తక్కువగా ఉండేవి. పట్టణ ప్రాంతాల కోసం 2015లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రారంభమైంది. ఇది 2016లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ కింద గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి, సరసమైన ధరల గృహాల లభ్యతను, పంపిణీని ప్రాథమికంగా పునర్నిర్వచించింది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్
2015లో ప్రారంభమైన ఈ పథకం అర్హులైన ప్రతి పట్టణ కుటుంబానికి పక్కా ఇళ్లను అందిస్తుంది. ఈ పథకం భారతదేశంలోని అన్ని పట్టణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అల్ప ఆదాయ వర్గాలు, మధ్య ఆదాయ వర్గాలకు సేవలందిస్తుంది.
2024లో ప్రారంభమైన ఈ పథకం రెండవ దశ, లబ్ధిదారుల నేతృత్వంలోని నిర్మాణం కింద అర్హులైన కుటుంబాలకు రూ. 2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం ప్రకారం కుటుంబంలోని మహిళా సభ్యురాలు యజమానిగా లేదా ఉమ్మడి యజమానిగా ఉండటం తప్పనిసరి.
ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఈ పథకం కింద 1.25 కోట్లకు పైగా ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 98 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. గత ప్రభుత్వాల పాత పథకాల కింద 2005-14 మధ్య కాలంలో కేవలం 8 లక్షల పట్టణ ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్
2016లో ప్రారంభమైన ఈ పథకం మైదాన ప్రాంతాలలో ప్రతి ఇంటికి రూ. 1.20 లక్షలు, కొండ ప్రాంతాలు, కఠినమైన భూభాగాలలో రూ. 1.30 లక్షలు అందిస్తుంది. 2016 - 2026 మధ్య కాలంలో మొత్తం 3.98 కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యం నమోదైంది. వీటిలో 3.91 కోట్ల ఇళ్లు మంజూరు కాగా, 3.05 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మంజూరైన ఇళ్లలో 75 శాతం ఇళ్లు మహిళల యాజమాన్యంలో లేదా ఉమ్మడి యాజమాన్యంలో ఉన్నాయి. ఇళ్లన్నీ మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ కనెక్షన్ల వంటి వసతుల కోసం ప్రభుత్వ కార్యక్రమాలకు అనుగుణంగా ఉన్నాయి.
అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ (అమృత్)
2015లో ప్రారంభమైన ఈ అమృత్ పథకం విస్తృతమైన పట్టణ కేంద్రాలలో ప్రాథమిక సేవల లోపాలను పరిష్కరించింది. అమృత్ మొదటి దశ నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పచ్చని ప్రదేశాలు, రవాణాపై దృష్టి సారించి 500 నగరాలను కవర్ చేసింది. 2021 అక్టోబర్లో అమృత్ రెండో దశ రూ.2.99 లక్షల కోట్ల వ్యయంతో 4,800 పట్టణాలకు విస్తరించింది. ఈ కేటాయింపు అసలు మిషన్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. 2015కు ముందు జేఎన్ఎన్యూఆర్ఎం కింద కేటాయించిన రూ.62,983 కోట్లతో పోలిస్తే, అమృత్, అమృత్ రెండో దశ కింద రూ.2.79 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరయ్యాయి.
అన్ని అవసరాల సార్వత్రిక లభ్యత
2014కు ముందు చాలా మంది పౌరులకు గౌరవప్రదమైన జీవితానికి అవసరమైన సేవలు అందేవి కావు. ముఖ్యంగా గ్రామీణ మహిళలు స్వచ్ఛమైన వంట గ్యాస్, సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్య వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ లోపాలను క్రమపద్ధతిలో పరిష్కరించడానికి ప్రత్యేక లక్ష్యాలతో కూడిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఫలితాలు అద్భుతమైన మార్పును తెచ్చాయి. ప్రతి ప్రాంతంలో కోట్ల మంది లబ్ధిదారులకు చేరువయ్యాయి. స్వతంత్ర భారతదేశంలో దైనందిన జీవన ప్రమాణాలలో వచ్చిన అత్యంత ముఖ్యమైన మెరుగుదలలలో ఈ కార్యక్రమాలు ఒకటిగా నిలిచాయి.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన
2016 మేలో ప్రారంభమైన ప్రధానమంత్రి ఉజ్వల యోజన.. స్వచ్ఛమైన ఎల్పీజీ కనెక్షన్లను అందించడం ద్వారా గ్రామీణ వంట పద్ధతులను మార్చివేసింది. ఈ పథకం దేశవ్యాప్తంగా విస్తరించి, 2019 సెప్టెంబర్ నాటికి తన ప్రాథమిక లక్ష్యమైన 8 కోట్ల కనెక్షన్లను సాధించింది. మిగిలిన ఇళ్లను కవర్ చేయడానికి, 2021 ఆగస్టులో మరో కోటి అదనపు కనెక్షన్ల లక్ష్యంతో ఉజ్వల రెండో దశను ప్రవేశపెట్టారు. ఈ లక్ష్యం 2022 జనవరి నాటికి పూర్తయింది. ప్రభుత్వం మరో 60 లక్షల కనెక్షన్లను మంజూరు చేయడంతో 2022 డిసెంబర్ నాటికి 1.60 కోట్లకు చేరుకుంది. 2024 జూలైలో మరో 75 లక్షల కనెక్షన్లు పూర్తయ్యాయి. ఆ తర్వాత 2025–26 ఆర్థిక సంవత్సరంలో మరో 25 లక్షల కనెక్షన్లకు ఆమోదం లభించింది. దీనివల్ల ఎల్పీజీ లభ్యత పూర్తి స్థాయికి చేరింది. 10.57 కోట్లకు పైగా స్వచ్ఛమైన వంట గ్యాస్ కనెక్షన్లు అందించడం ద్వారా పెద్ద ఎత్తున సౌకర్యాన్ని, గౌరవాన్ని చేకూర్చారు.
జాతీయ ఎల్పీజీ కవరేజీ 2014 ఏప్రిల్ నాటి 55.9% నుంచి 2026 ఏప్రిల్ నాటికి 107.2% కి పెరిగింది. ఇది విస్తృత లభ్యతను ప్రతిబింబిస్తుంది. వినియోగదారులు 14.51 కోట్ల నుంచి (ఏప్రిల్ 2014) 33.39 కోట్లకు (ఏప్రిల్ 2026) పెరిగారు. వినియోగం రెట్టింపు అయింది. 2026 మార్చి నాటికి విస్తరించిన డిస్ట్రిబ్యూటర్షిప్లు, బాట్లింగ్ మౌలిక సదుపాయాల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు గ్యాస్ లభ్యత మెరుగైంది.
జల్ జీవన్ మిషన్ (జేజేఎం)
హర్ ఘర్ జల్ అనే లక్ష్యంతో ప్రారంభమైన జల్ జీవన్ మిషన్(జేజేఎం) పైపుల ద్వారా నీటి సరఫరాను వేగంగా విస్తరించింది. 2019లో ఈ మిషన్ ప్రారంభించినప్పుడు కేవలం 3.23 కోట్ల (16.72%) గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయి. 2026 జూన్ నాటికి 15.86 కోట్లకు పైగా (81.94%) కుటుంబాలు పైపుల ద్వారా స్వచ్ఛమైన నీటిని పొందుతున్నాయి. కేవలం ఆరేళ్లలోనే రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడి సహాయంతో 12 కోట్ల కొత్త కనెక్షన్లు చేరాయి.
జల్ జీవన్ మిషన్ గ్రామీణ భారతదేశంలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. 9 కోట్లకు పైగా మహిళలకు నీటిని తెచ్చే శ్రమ నుంచి విముక్తి లభించింది. దీనివల్ల సమయం ఆదా అయి, ఆరోగ్యం మెరుగైంది. 1.81 లక్షల గ్రామాలు గ్రామసభల ద్వారా హర్ ఘర్ జల్ గ్రామాలుగా ధ్రువీకరణ పొందాయి. ఇది అందరికీ నీటి లభ్యతను కల్పించింది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తి గ్రామీణ గృహాల కవరేజీని సాధించి, నీటి భద్రతలో ఒక మైలురాయిని అధిగమించాయి.
ఈ మిషన్లో నీటి నాణ్యతకు కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 2,843 ప్రయోగశాలలు 38.78 లక్షల నమూనాలను పరీక్షించాయి. ఫీల్డ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించడంలో 24.80 లక్షలకు పైగా మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఇది గ్రామ స్థాయిలో యాజమాన్య బాధ్యతను, నమ్మకాన్ని పెంపొందించింది.
2026 మార్చిలో ఈ మిషన్ జల్ జీవన్ మిషన్ రెండో దశ కింద 2028 డిసెంబర్ వరకు పొడిగించారు. మెరుగుపరిచిన ఈ కొత్త ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వ రూ.3.59 లక్షల కోట్ల మద్దతుతో కలిపి మొత్తం రూ.8.69 లక్షల కోట్ల భారీ వ్యయం ఉంది.

స్వచ్ఛ భారత్ మిషన్(ఎస్బీఎం)
2014లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ – గ్రామీణ్ అన్ని గ్రామీణ కుటుంబాలకు మరుగుదొడ్లను అందించి, గ్రామాల పొడవునా గౌరవాన్ని, పరిశుభ్రతను ఇచ్చింది. పారిశుద్ధ్య కవరేజీ 2014లో 39% నుంచి 2019 నాటికి 100% కి వేగంగా పెరిగింది. ఇది దేశవ్యాప్త పరివర్తనను సూచిస్తుంది.
ఈ మిషన్ సాధించిన విజయాలు అసాధారణమైనవి. జూన్ 2026 నాటికి మొత్తంగా 12.14 కోట్లకు పైగా గృహ మరుగుదొడ్లు, 2.76 లక్షల సామాజిక పారిశుద్ధ్య సముదాయాలు పూర్తయ్యాయి. 5.69 లక్షలకు పైగా గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహిత ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. 5.34 లక్షల గ్రామాలలో ఘన వ్యర్థాల నిర్వహణకు ఏర్పాట్లు ఉండగా, 5.55 లక్షల గ్రామాలలో ద్రవ వ్యర్థాల నిర్వహణకు ఏర్పాట్లు ఉన్నాయి.
స్వచ్ఛ భారత్ మిషన్‑అర్బన్: 2014లో ప్రారంభమైన ఈ మిషన్ నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మార్చివేసింది. 2014 - 2026 మధ్య కాలంలో 63 లక్షలకు పైగా గృహ మరుగుదొడ్లు, ఆరు లక్షల సామాజిక మరుగుదొడ్లు నిర్మించారు. పట్టణ వ్యర్థాల ప్రాసెసింగ్ 2014లో 16 శాతంతో పోలిస్తే 2026లో 82 శాతానికి పెరిగింది. ఇంటింటికీ వ్యర్థాల సేకరణ 2014లో 43 శాతంతో పోలిస్తే 2026లో 98 శాతానికి చేరింది.
స్వచ్ఛ భారత్ మిషన్ మొత్తం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పట్టణ స్థానిక సంస్థలు 2019 అక్టోబర్లో తమను తాము బహిరంగ మలవిసర్జన రహితంగా ప్రకటించుకున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం.. 2014తో పోలిస్తే 2019లో విరేచనాల వల్ల సంభవించే మరణాలు 3,00,000 తగ్గాయి.
అందరికీ విద్యుత్: నమ్మకమైన, చౌకైన, స్వచ్ఛమైన ఇంధనం
నమ్మకమైన విద్యుత్ సరఫరా అనేది సౌకర్యవంతమైన దైనందిన జీవితం వెనుక ఉన్న నిశ్శబ్ద శక్తి. గత పన్నెండేళ్లలో భారతదేశం విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, చివరి లబ్ధిదారుడి వరకు సరఫరా చేసే వ్యవస్థలను మార్చివేసింది. దీని ఫలితంగా ప్రతి ఇంటా ఎక్కువ వెలుతురు, ఎక్కువ సౌకర్యం, ఎక్కువ గౌరవం లభించాయి.
ఉత్పత్తి సామర్థ్యం, నమ్మకమైన, స్వచ్ఛమైన గ్రిడ్
మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం గత 12 ఏళ్లలో రెట్టింపు కంటే ఎక్కువ అయింది. ఇది 2014 ఆర్థిక సంవత్సరంలో 248 గిగావాట్ల నుంచి మార్చి 2026 నాటికి 532 గిగావాట్లకు పైగా పెరిగింది.
పునరుత్పాదక వనరులు ఇప్పుడు ఈ సామర్థ్యంలో సగానికి పైగా ఉన్నాయి. పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2014లో 76.38 గిగావాట్లతో పోలిస్తే 2026 మార్చిలో 274.69 గిగావాట్లకు చేరింది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్వచ్ఛమైన ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. సౌర విద్యుత్ 2014లో 2.82 గిగావాట్లతో పోలిస్తే ఇప్పుడు 150.26 గిగావాట్ల సహకారాన్ని అందిస్తోంది. పవన విద్యుత్ సామర్థ్యం 21.04 గిగావాట్ల (మార్చి 2014) నుంచి 56.09 గిగావాట్లకు (మార్చి 2026) పెరిగి 2.66 రెట్లు అయింది. అణు విద్యుత్ 84% వృద్ధి చెంది, మార్చి 2014 నాటి 4.78 గిగావాట్లతో పోలిస్తే 8.78 గిగావాట్లకు (మార్చి 2026) చేరింది. జలవిద్యుత్ సామర్థ్యం 51.4 గిగావాట్లుగా (మార్చి 2026) ఉండగా, ఇతర వనరులు (జీవపదార్థాలు మొదలైనవి) 11.74 గిగావాట్ల (మార్చి 2026) సహకారాన్ని అందిస్తున్నాయి.
పౌరులకు ఇప్పుడు దాదాపు రోజంతా విద్యుత్ అందుబాటులో ఉంటోంది. సగటు గ్రామీణ సరఫరా 2014లో 12.5 గంటల నుంచి 2026లో 22.6 గంటలకు పెరిగింది. పట్టణ ప్రాంతాలు ఇప్పుడు ప్రతిరోజూ 23.4 గంటల వరకు సరఫరాను పొందుతున్నాయి. జాతీయ విద్యుత్ కొరత 2013-14 నాటి 4.2% నుంచి 2025-26 నాటికి కేవలం 0.03% కి పడిపోయింది. తలసరి విద్యుత్ వినియోగం 957 కిలోవాట్ల (2013-14) నుంచి 1,460 కిలోవాట్లకు (2024-25) పెరిగింది.
అత్యధిక విద్యుత్ డిమాండ్ను అందుకున్న రికార్డు సామర్థ్యం
భారతదేశం 25 ఏప్రిల్ 2026న తన అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ అయిన 256.1 గిగావాట్లను సాధించింది. పొరుగు దేశాలకు ఎగుమతులను కొనసాగిస్తూనే ఎలాంటి కొరత లేకుండా ఈ డిమాండ్ను తీర్చడం విశేషం. ఈ మైలురాయి మే 2024లో నమోదైన మునుపటి గరిష్ట స్థాయి 250 గిగావాట్లను అధిగమించింది. వేసవి పరిస్థితులకు అనుగుణంగా డిమాండ్ వృద్ధి చెంది, ఏప్రిల్ 2026లో 8.9 శాతం పెరుగుదలను చూపించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 65 గిగావాట్ల అదనపు సామర్థ్యం చేరడం భవిష్యత్తు డిమాండ్ కోసం సన్నద్ధతను బలోపేతం చేసింది. సౌర, జల, అణు, థర్మల్ సహా విభిన్న ఉత్పత్తి వనరులు నమ్మకత్వాన్ని, గ్రిడ్ స్థిరత్వాన్ని అందించాయి.
సరఫరా మార్గాల వ్యవస్థ (220 కిలోవోల్టులు, అంతకంటే ఎక్కువ) జనవరి 2026 నాటికి 5 లక్షల సర్క్యూట్ కిలోమీటర్లకు పైగా పెరిగింది. ట్రాన్స్ఫార్మేషన్ సామర్థ్యం 1,407 జీవీఏ (220 కిలోవోల్టులు, అంతకంటే ఎక్కువ) కి చేరింది. అంతర-ప్రాంతీయ ప్రసార సామర్థ్యం జనవరి 2026లో 120 గిగావాట్లను తాకింది. భారతదేశం ఇప్పుడు ఒకే ఫ్రీక్వెన్సీతో నడిచే ప్రపంచంలోనే అతిపెద్ద సమకాలీకరించిన జాతీయ గ్రిడ్ను నడుపుతోంది.
సౌభాగ్య: ప్రతి ఇంటికీ వెలుగులు
2017లో ప్రారంభమైన ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య), విద్యుద్దీకరణ జరగని గ్రామీణ, పట్టణ గృహాలకు ఉచితంగా చివరి లబ్ధిదారుడి వరకు కనెక్షన్లను ఇచ్చింది. మార్చి 2022 నాటికి సుమారు 2.86 కోట్ల కుటుంబాలు విద్యుత్ కనెక్షన్ను పొందాయి. అన్ని లక్ష్యాలు సాధించడంతో ఈ పథకం ముగింపును గుర్తించింది.
పీఎం సూర్య ఘర్: ఇళ్లే విద్యుత్ ఉత్పత్తికేంద్రాలు
2024 ఫిబ్రవరిలో ప్రారంభమైన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన.. కుటుంబాలకు ఉదారమైన కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో పైకప్పు సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రతి ఇల్లు నెలవారీ 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను పొందడానికి అర్హత కలిగి ఉంటుంది. సబ్సిడీ రూ. 78,000 వరకు లభిస్తుంది. ఇది నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ అవుతోంది. మే 2026 నాటికి 40 లక్షలకు పైగా కుటుంబాలు పైకప్పు సౌర వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. రూ.75,021 కోట్ల మద్దతుతో 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి కోటి ఇళ్లను ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. కుటుంబాలు ఇప్పుడు తమ బిల్లులను తగ్గించుకోవడమే కాకుండా మిగిలిన విద్యుత్ను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని కూడా పొందుతున్నాయి.
ఉన్నత్ జ్యోతి బై అఫర్టబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్(ఉజాలా): చౌకైన, సమర్థవంతమైన విద్యుత్ వెలుగు
ఉజాలా పథకం కింద గత పన్నెండేళ్లలో 37 కోట్ల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేశారు. దీనివల్ల వార్షికంగా గృహ పొదుపులో రూ.19,153 కోట్ల ఆదా అయింది.
నమ్మకమైన విద్యుత్ ఇప్పుడు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విద్యుత్ విద్యావ్యవస్థకు, పరిశ్రమలకు, గృహ సౌకర్యాలకు మద్దతుగా నిలుస్తోంది. స్వచ్ఛమైన ఇంధన వనరులు వేగంగా విస్తరించి, పర్యావరణ స్థిరత్వాన్ని బలోపేతం చేస్తున్నాయి, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయి.
ఆర్థిక సమ్మిళిత్వం, సాధికారత
2014 నుంచి భారతదేశం ఒకదానితో ఒకటి అనుసంధానమైన ఆర్థిక సమ్మిళిత్వ పథకాలను ప్రవేశపెట్టింది. ఇవి పొదుపు, రుణాలు, బీమా, పింఛన్లతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించాయి. ఈ కార్యక్రమాలు అవకాశాలను విస్తరింపజేసి, భద్రతను బలోపేతం చేస్తూ, ఆధునిక ఆర్థిక వ్యవస్థలలో లక్షలాది మంది నమ్మకంతో భాగస్వాములు కావడానికి దోహదపడ్డాయి.

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన
జన్ ధన్, ఆధార్, మొబైల్ అనే జేఏఎం త్రయం భారతదేశ సంక్షేమ పంపిణీకి ప్రధాన వెన్నెముకగా మారింది. ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్న కోట్ల మంది పౌరులకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెస్తూ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన మొదటి స్తంభంగా నిలిచింది. ఇది మధ్యవర్తుల ప్రమేయం లేని ప్రత్యక్ష బదిలీలకు పునాది వేసింది. దీనివల్ల లబ్ధిదారులకు పారదర్శకంగా, సురక్షితంగా ప్రయోజనాలు అందాయి.
2014 ఆగస్టులో ప్రకటించిన ఈ జన్ ధన్ యోజన ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత్వ కార్యక్రమం. ఈ ఖాతాలు 2015లోని 14.72 కోట్ల నుంచి జూన్ 2026 నాటికి 58 కోట్లకు పైగా పెరిగాయి. జూన్ 2026 నాటికి డిపాజిట్లు రూ.3 లక్షల కోట్లకు పైగా చేరాయి. ఇది ప్రజల నమ్మకాన్ని, క్రియాశీల వినియోగాన్ని తెలియజేస్తోంది.
ఈ జన్ ధన్ ఖాతాలు అపూర్వమైన స్థాయిలో సంక్షేమ పంపిణీకి ప్రధాన మార్గాలుగా మారాయి. కేవలం 2024–25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.6.9 లక్షల కోట్లు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకాల కింద నేరుగా ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం 327 పథకాలను కవర్ చేస్తోంది. ఇది పాలనను సమగ్రంగా, జవాబుదారీగా మార్చడంతో పాటు దేశవ్యాప్తంగా ప్రతి లబ్ధిదారునికి స్పందించేలా చేసింది. జూన్ 2026 నాటికి ప్రమాద భీమా సౌకర్యంతో కూడిన 40.60 కోట్ల రూపే డెబిట్ కార్డులు జారీ అయ్యాయి.
ఇది కొత్తగా బ్యాంకు ఖాతాలు పొందిన లక్షలాది మంది పౌరులకు ఆర్థిక రక్షణను, భద్రతను విస్తరించింది. దైనందిన జీవితాన్ని మెరుగుపరచడంతో పాటు వారి ఆర్థిక నష్టభయాన్ని తగ్గించింది.
ప్రధానమంత్రి ముద్రా యోజన
చాలా ఏళ్లుగా చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు అధికారిక రుణాలు పొందే అవకాశాలు పరిమితంగా ఉండేవి. వారు దోపిడీ రేట్లకు వడ్డీలు వసూలు చేసే ప్రైవేట్ వ్యక్తులపై ఆధారపడేవారు. 2015లో ప్రారంభమైన ముద్రా యోజన.. సూక్ష్మ పరిశ్రమలను వృద్ధికి చోదక శక్తులుగా గుర్తించి, ఎలాంటి షూరిటీ లేని సంస్థాగత రుణాలను అందించింది.
ఈ పథకం కింద ప్రారంభమైనప్పటి నుంచి రూ.40 లక్షల కోట్ల విలువైన 57.7 కోట్లకు పైగా రుణాలు మంజూరయ్యాయి. ముద్రా రుణాలలో 66 శాతం రుణాలు మహిళలకే మంజూరయ్యాయి. వీటి విలువ రూ.16.88 లక్షల కోట్లు. లబ్ధిదారులలో దాదాపు సగం మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల వర్గాల నుంచి ఉన్నారు. ఇది రుణ సదుపాయాన్ని సామాజిక సమానత్వంతో అనుసంధానించింది.
2024–25 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రవేశపెట్టిన తరుణ్ ప్లస్ కేటగిరీతో రుణ పరిమితి రూ.20 లక్షలకి పెరిగింది. మునుపటి రుణాలను సకాలంలో చెల్లించిన పారిశ్రామికవేత్తలకు ఈ కేటగిరీ మద్దతుగా నిలిచింది. లేబర్ బ్యూరో అధ్యయనాల ప్రకారం.. 2015 - 2018 మధ్య కాలంలో ముద్రా రుణాలు 1.12 కోట్ల ఉద్యోగాలను సృష్టించాయి.
రవాణా, అనుసంధానత
అనుసంధానత అనేది అభివృద్ధి బలాన్ని సూచిస్తుంది. ఇది అవకాశాలను రూపొందిస్తూ దేశవ్యాప్తంగా సులభతర జీవనాన్ని మెరుగుపరుస్తుంది. 2014లో భారతదేశ రవాణా మౌలిక సదుపాయాలలో జాతీయ రహదారుల నిర్మాణం నెమ్మదిగా సాగేది. మరోవైపు పరిధి పరిమితంగా ఉండేది. ప్రాంతీయ విమాన అనుసంధానత కూడా తక్కువగా ఉండేది. ఆధునిక అంతర్-నగర రైలు సేవలు అందుబాటులో లేకపోవడంతో, సాధారణ ప్రయాణికులకు పరిమితమైన, అసమర్థమైన రవాణా ప్రత్యామ్నాయాలు మాత్రమే మిగిలాయి. అయితే 2014 - 2026 మధ్య కాలంలో భారతదేశం రహదారులు, రైల్వే, విమానయానం, పట్టణ రవాణా రంగాలను వేగవంతంగా మార్చివేసింది.
రహదారులు, జాతీయ రహదారులు
భారతదేశ రహదారుల వ్యవస్థ 2014 - 2026 మధ్య కాలంలో గణనీయంగా విస్తరించి, అనుసంధానాన్ని, రోజువారీ రాకపోకలను సరికొత్తగా మార్చింది. ప్రస్తుతం 63.73 లక్షల కిలోమీటర్ల పొడవుతో ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రహదారుల వ్యవస్థగా నిలిచింది. జాతీయ రహదారులు దాదాపు 61 శాతం వృద్ధి చెందాయి. 2014 ఆర్థిక సంవత్సరంలో 91,287 కిలోమీటర్లుగా ఉన్న రహదారులు మార్చి 2026 నాటికి 1,46,572 కిలోమీటర్లకు పెరిగాయి. నాలుగు వరుసలు, అంతకంటే ఎక్కువ వరుసల రహదారులు 2014 నాటి 18,371 కిలోమీటర్ల నుంచి 45,516 కిలోమీటర్లకు పెరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 3,644 కిలోమీటర్ల పొడవైన హై-స్పీడ్ కారిడార్లు లేదా ఎక్స్ప్రెస్వేలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఇవి ప్రయాణ సమయాన్ని, ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించాయి. 2026 మార్చి నాటికి భారత్మాలా ప్రాజెక్టు కింద 22,590 కిలోమీటర్ల రహదారులు పూర్తయ్యాయి.
పన్నెండేళ్ల మైలురాళ్ల వంటి అనుసంధానతలు:
- జెడ్ మోర్ లేదా సోనామార్గ్ సొరంగం(2025) లడఖ్ ప్రాంతానికి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచింది. ఇది పర్యాటకాన్ని, స్థానిక జీవనోపాధిని బలోపేతం చేస్తోంది.
- సుదర్శన్ సేతు (2024) ఓఖాను బేట్ ద్వారకతో అనుసంధానిస్తూ, తీర్థయాత్రలకు, తీరప్రాంత కార్యకలాపాలకు మద్దతుగా నిలుస్తోంది.
- మైత్రి సేతు (2021) త్రిపురను బంగ్లాదేశ్తో అనుసంధానిస్తూ, వ్యాపారాన్ని, ప్రయాణికుల రాకపోకలను పెంచుతోంది.
- అటల్ సొరంగం (2020) మనాలి, లాహౌల్ స్పితి మధ్య అన్ని కాలాల్లోనూ అనుకూలమైన రవాణాను అందిస్తూ ప్రయాణ దూరాన్ని 46 కిలోమీటర్లు తగ్గించింది.
- డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ సొరంగం (గతంలో దీనిని చెనాని-నశ్రి సొరంగం అని పిలిచేవారు, 2017) జమ్మూ-శ్రీనగర్ ప్రయాణ సమయాన్ని రెండు గంటలు తగ్గించింది.
- ధోలా సాదియా వంతెన (2017) అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లను కలుపుతూ ఈశాన్య ప్రాంత రవాణా బలాన్ని పెంచింది.
ఇటీవలి ప్రాజెక్టులు పట్టణ, ప్రాంతీయ రాకపోకలను మరింత ముందుకు తీసుకెళ్లాయి:
- ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ (2026) ప్రయాణ సమయాన్ని ఆరు గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గించింది. ఇందులో ఆసియాలోనే అత్యంత పొడవైన ఎలివేటెడ్ వన్యప్రాణుల కారిడార్ ఉంది.
- అహ్మదాబాద్-ధోలేరా ఎక్స్ప్రెస్వే (2026) లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించింది.
- బీహార్లోని గంగా నదిపై నిర్మించిన జాతీయ రహదారి-31 వంతెన (2025) భారీ వాహనాల ప్రయాణ మార్గాన్ని 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ తగ్గించింది.
- అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ 2 (2025) ఢిల్లీ మూడో రింగ్ రోడ్డుగా మారి సరుకు రవాణాను వేగవంతం చేసింది.
ద్వారకా ఎక్స్ప్రెస్వేలోని ఢిల్లీ విభాగం (2025) ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని తగ్గించింది.
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన: అన్ని కాలాలలోనూ అనుకూలంగా ఉండే మన్నికైన గ్రామీణ రహదారుల అనుసంధానాన్ని అందించడానికి ఈ పథకం ప్రారంభమైంది. ఇది గ్రామాలను మార్కెట్లు, పాఠశాలలు, ఆసుపత్రులతో అనుసంధానించింది. దీనివల్ల ప్రయాణం సులువై దైనందిన జీవితం మెరుగైంది. ఈ పథకానికి బడ్జెట్ మద్దతు 2014–15లోని రూ.386 కోట్ల నుంచి 2026–27 నాటికి రూ.19,000 కోట్లకు పెరిగింది. ఇప్పటివరకు అర్హత కలిగిన ఆవాసాలలో 99.6 శాతం అనుసంధానమయ్యాయి. పూర్తి చేసిన రహదారులు 2000-2014 మధ్య కాలంలోని 3.86 లక్షల కిలోమీటర్ల నుంచి 2014-2026 మధ్య కాలంలో 4.11 లక్షల కిలోమీటర్లకు పెరిగాయి. ఇదే కాలంలో వంతెనల సంఖ్య 484 నుంచి 10,293 కి పెరిగింది. ఇది గ్రామాలు వేరుగా ఉండే పరిస్థితులను తగ్గించి, గ్రామీణ వృద్ధిని బలోపేతం చేసింది.
రహదారి రవాణా, జాతీయ రహదారుల బడ్జెట్ కేటాయింపులు 2014 - 2026 మధ్య కాలంలో దాదాపు పది రెట్లు పెరిగాయి. రహదారుల విస్తరణ అనేక ప్రాంతాలలో లాజిస్టిక్స్, పర్యాటకం, వ్యాపారం, ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేసింది.
రైల్వేలు
భారతీయ రైల్వేలు దేశానికి ప్రధాన జీవనరేఖగా నిలుస్తున్నాయి. ఇది ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణికులను, మిలియన్ల టన్నుల సరుకును రవాణా చేస్తుంది. 2014 నుంచి రైల్వే దృష్టి వేగం, సౌకర్యం, భద్రత, సామర్థ్యం వైపు నిర్ణయాత్మకంగా మారింది. రైల్వే వ్యవస్థ విద్యుద్దీకరణ వేగంగా ముందుకు సాగింది. ఇది 2014కు ముందు ఉన్న 20 శాతం నుంచి మార్చి 2026 నాటికి 99.6 శాతానికి విస్తరించింది. ఇది 69,873 రూట్ కిలోమీటర్లను కవర్ చేస్తోంది. దీనివల్ల సామర్థ్యం పెరగడమే కాకుండా శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గింది. భారతదేశ స్వదేశీ స్వయంచాలక రైలు రక్షణ వ్యవస్థ అయిన ‘కవచ్’, రైళ్ల కదలికలను పర్యవేక్షిస్తూ ప్రమాదాలను నివారించడానికి బ్రేకులను వర్తింపజేస్తుంది. ఇది 3,103 రూట్ కిలోమీటర్లలో అందుబాటులోకి రాగా, 24,427 కిలోమీటర్లలో పనులు సాగుతున్నాయి. ఇది 4,277 లోకోమోటివ్లలో ఏర్పాటైంది. మరో 8,979 లోకోమోటివ్లలో పనులు పురోగతిలో ఉన్నాయి. దీని ఫలితంగా రైలు ప్రమాదాలు 2014–15లోని 135 నుంచి 2025–26 నాటికి కేవలం 16 కి పడిపోయాయి.
ఈ సంకల్పం బడ్జెట్లోనే స్పష్టంగా కనిపిస్తోంది. రైల్వేలకు సంబంధించిన స్థూల బడ్జెట్ కేటాయింపులు ఈ కాలంలో దాదాపు తొమ్మిది రెట్లు పెరిగాయి. ఇది 2014-15లోని సుమారు రూ.32,000 కోట్ల నుంచి 2026-27 నాటికి సుమారు రూ.2.78 లక్షల కోట్లకు చేరింది. ఈ నిరంతర పెట్టుబడి రోజువారీ ప్రయాణంలో స్పష్టమైన సౌకర్యంగా మారింది.

వందే భారత్
భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెమీ హై-స్పీడ్ రైలుగా మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ 15 ఫిబ్రవరి 2019న ప్రారంభమైంది. 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 162 సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇది భారతీయ రైల్వేలో వేగవంతమైన విస్తరణను సూచిస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ రైళ్లు 3.98 కోట్ల మంది ప్రయాణికులను చేరవేసాయి. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 34 శాతం పెరుగుదలను చూపిస్తుంది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు లక్ష పర్యటనల ద్వారా 9.1 కోట్లకు పైగా ప్రయాణికులు ప్రయాణించారు. ఇది ప్రజల బలమైన ఆదరణను ప్రతిబింబిస్తుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన వందే భారత్ స్లీపర్ సర్వీస్ జనవరి 2026లో ప్రారంభమై హౌరా, గువాహటీలను అనుసంధానించింది. మొదటి మూడు నెలల్లోనే ఈ స్లీపర్ రైలు 119 పర్యటనల ద్వారా 1.21 లక్షల మంది ప్రయాణికులను చేరవేసింది.
అమృత్ భారత్ రైళ్లు
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు సుదూర మార్గాలలో తక్కువ ధరకే సౌకర్యాన్ని అందించాయి. ప్రస్తుతం నడుస్తున్న అరవై పూర్తి నాన్-ఏసీ అమృత్ భారత్ రైలు సర్వీసులు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఈ రైళ్లు ఆధునిక సీటింగ్, భద్రతా వసతులతో తక్కువ ధరలో, నాన్-ఏసీ, అధిక సామర్థ్యం గల ప్రయాణాన్ని అందిస్తాయి. ఇవి బలహీన, దిగువ మధ్యతరగతి వర్గాలకు తక్కువ ఖర్చుతో కూడిన, సౌకర్యవంతమైన రవాణాను నిశ్చయపరుస్తూ, సుదూర ప్రాంతాల ప్రయాణ సౌకర్యాన్ని విస్తరిస్తున్నాయి.
అమృత్ భారత్ స్టేషన్ పథకం
2023లో ప్రారంభమైన అమృత్ భారత్ స్టేషన్ పథకం.. దీర్ఘకాలిక పునరాభివృద్ధి కోసం 1,338 స్టేషన్లను గుర్తించింది. వాటిలో 157 స్టేషన్లు ఆశావహ జిల్లాలలో ఉన్నాయి. ఇది సమగ్ర మౌలిక సదుపాయాల వృద్ధిని నిశ్చయపరుస్తుంది. 01 ఏప్రిల్ 2026 నాటికి 208 స్టేషన్లను ఆధునిక వసతులు, మెరుగైన ప్రయాణ సౌకర్యాలతో ఆధునీకరించారు. ఈ ఆధునీకరణలలో పార్కింగ్, వెయిటింగ్ లాంజ్లు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, మెరుగైన మరుగుదొడ్లు, సమయానుకూల సమాచార వ్యవస్థలు ఉన్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 119 పునరాభివృద్ధి చేసిన స్టేషన్లు ప్రారంభమవడం గణనీయమైన పురోగతిని సూచిస్తుంది.
హై-స్పీడ్ రైల్ కారిడార్లు
అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఇందులో సూరత్-బిలిమోరా విభాగం 2027లో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ 508 కిలోమీటర్ల కారిడార్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందింది. ప్రధాన నగరాలను హై-స్పీడ్ రైలు ద్వారా వేగంగా, సమర్థవంతంగా అనుసంధానించడానికి కేంద్ర బడ్జెట్ 2026-27లో మరో ఏడు బుల్లెట్ రైలు కారిడార్లను ప్రకటించారు. ఈ మార్గాలలో ఇవి ఉన్నాయి:
- ముంబై-పుణె
- పుణె-హైదరాబాద్
- హైదరాబాద్-బెంగళూరు
- హైదరాబాద్-చెన్నై
- చెన్నై-బెంగళూరు
- ఢిల్లీ-వారణాసి
- వారణాసి-సిలిగురి
ఈ ప్రకటనలు భారతదేశ వృద్ధి, సమగ్రత, స్థిరమైన అభివృద్ధిలో హై-స్పీడ్ రైల్ పోషించే వ్యూహాత్మక పాత్రను నొక్కి చెప్తున్నాయి.
పౌర విమానయానం – ఉడాన్
2014లో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. దీనివల్ల చిన్న నగరాలకు విమాన అనుసంధానత ఉండేది కాదు. 2016 అక్టోబర్లో ప్రారంభమైన ప్రాంతీయ అనుసంధాన పథకం ‘ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్’ (ఉడాన్) ఈ రంగాన్ని పూర్తిగా మార్చివేసింది. 2026 నాటికి ఉడాన్ కింద 95 విమానాశ్రయాలు, హెలిపోర్టులు, వాటర్ ఏరోడ్రోమ్ల పొడవునా 665 మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. దీని ఫలితంగా భారతదేశంలోని మొత్తం విమానాశ్రయాల సంఖ్య ఏప్రిల్ 2026 నాటికి 165 కి విస్తరించింది. ఈ విస్తరణను కొనసాగించడానికి ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మద్దతును పొడిగించింది. ఇది విమానయాన సంస్థలు కొత్త మార్గాలను సమర్థవంతంగా నడపడానికి వీలు కల్పించింది. ఈ సహాయం తక్కువ ధరల టిక్కెట్లను అందిస్తోంది. ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ లక్షలాది మంది పౌరులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ప్రారంభమైనప్పటి నుంచి ఉడాన్ పథకం 3.45 లక్షల విమానాల ద్వారా 1.64 కోట్ల మందికి పైగా ప్రయాణికులను చేరవేసింది. ఈశాన్య ప్రాంతం, కొండ ప్రాంతాల రాష్ట్రాలు, ద్వీప భూభాగాలు సహా మారుమూల ప్రాంతాలు మొదటిసారిగా జాతీయ విమానయాన గ్రిడ్తో అనుసంధానమయ్యాయి. రూ.4,800 కోట్లకు పైగా పెట్టుబడులు సేవలు లేని విమానాశ్రయాలకు పునరుజ్జీవనం పోశాయి. నవీ ముంబై, నోయిడా, మోపా, కన్నూర్, హోలోంగి సహా 2014 తర్వాత 25 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలకు ఆమోదం లభించింది.

2026 మార్చిలో సవరించిన ఉడాన్ పథకానికి ఆమోదం లభించింది. ఇది 120 కొత్త గమ్యస్థానాలను లక్ష్యంగా పెట్టుకుని, మరో 4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించాలని భావిస్తోంది. ఈ ప్రణాళికల్లో ఆశావహ జిల్లాల్లో 100 విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిప్యాడ్లు, చిన్న విమాన ప్రయాణ మార్గాలు ఉన్నాయి.
2022 డిసెంబర్లో ప్రారంభమైన డిజి యాత్ర వంటి కార్యక్రమాల ద్వారా ప్రయాణికుల సౌకర్యం కూడా మెరుగైంది. ఇది నిరంతరాయ, కాగిత రహిత ప్రయాణాన్ని అందిస్తుంది. మే 2026 నాటికి 38 విమానాశ్రయాల్లో 9.3 కోట్ల మందికి పైగా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. 2024లో ప్రారంభమైన ఉడాన్ యాత్రి కేఫ్లు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించాయి. ఈ చర్యలన్నీ కలిసి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి, చౌకగా, నమ్మదగినదిగా మార్చాయి. లక్షలాది మంది పౌరుల రవాణాను సరికొత్తగా తీర్చిదిద్దాయి.
మెట్రో రైల్
భారీ రవాణాకు అత్యంత సమర్థవంతమైన పరిష్కారంగా మెట్రో రైల్ ఆవిర్భవించింది. ఇది దేశవ్యాప్తంగా పట్టణ రవాణాను మార్చివేసింది. 2014లో కేవలం ఐదు నగరాల్లో 248 కిలోమీటర్ల వ్యవస్థతో మెట్రో రైల్ పనిచేసేది. 2026 మార్చి నాటికి దేశంలోని 26 నగరాల్లో 1,155 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ విస్తరణ భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో వ్యవస్థగా నిలిపింది.
రోజువారీ ప్రయాణికుల సంఖ్య 2013–14లోని 28 లక్షల నుంచి 2026లో 1.15 కోట్లకు పైగా పెరిగింది. పనులు ప్రారంభించే వేగం తొమ్మిది రెట్లు పెరిగింది. 2014కు ముందు నెలకు 0.68 కిలోమీటర్లుగా ఉన్న వేగం ప్రస్తుతం నెలకు సుమారు 6 కిలోమీటర్లకు చేరింది. బడ్జెట్ మద్దతు కూడా గణనీయంగా పెరిగింది. 2013–14లోని రూ.5,798 కోట్ల నుంచి 2025–26 నాటికి రూ.29,550 కోట్లకు చేరింది.
భారతదేశ మెట్రో విస్తరణ చరిత్రాత్మక విజయాలను అందించింది. 2024లో కోల్కతా హుగ్లీ నది కింద దేశంలోనే మొట్టమొదటి నీటి అడుగున మెట్రో సొరంగాన్ని ప్రారంభించింది. ఎలక్ట్రిక్ హైబ్రిడ్ పడవలతో 10 ద్వీపాలను అనుసంధానిస్తూ వాటర్ మెట్రో సేవలను అందుబాటులోకి తెచ్చిన మొదటి నగరంగా కొచ్చి నిలిచింది. 2026 జనవరిలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ‘భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి స్వర్ణ దశాబ్దం’ పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. మెట్రో రైలు సదుపాయం గృహ రుణాల చెల్లింపు క్రమశిక్షణను మెరుగుపరుస్తుందని, ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుందని ఈ అధ్యయనం కనుగొంది. మెట్రో రైలు పట్టణ రవాణాను ఎలా మార్చివేసిందో, ప్రయాణ అలసటను తగ్గించి లక్షలాది మంది పౌరులకు ఆధునిక రవాణాను ఎలా అందించిందో ఈ మైలురాళ్లు ప్రతిబింబిస్తాయి.
నమో భారత్ - రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టీఎస్)
ఢిల్లీ-మీరట్ కారిడార్పై నమో భారత్ రైలు 2023లో ప్రారంభమై 2026 ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇది వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. దీని గరిష్ట డిజైన్ వేగం గంటకు 180 కిలోమీటర్లు. ఈ వ్యవస్థ ఎల్టీఈ రేడియో బ్యాక్బోన్ను ఉపయోగించి హైబ్రిడ్ లెవెల్ 3 సిగ్నలింగ్తో కూడిన ప్రపంచంలోనే మొట్టమొదటి యూరోపియన్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ లెవెల్ 2 ని కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా ఈ కారిడార్లో ఎల్టీఈ బ్యాక్బోన్పై హైబ్రిడ్ లెవెల్ 3 రేడియో ఆధారిత సిగ్నలింగ్ పనిచేస్తుంది. ఈ అధునాతన సాంకేతికత రైలు కార్యకలాపాలను మరింత స్మార్ట్గా, సురక్షితంగా మారుస్తుంది. ప్రయాణాల పొడవునా ప్రయాణికుల నమ్మకాన్ని, భద్రతను పెంపొందిస్తుంది.

పాలనా సంస్కరణలు
పాలనా సంస్కరణలు పౌరులు సంస్థలతో వ్యవహరించే విధానాన్ని మార్చివేశాయి. నిబంధనల భారాన్ని తగ్గించడం, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం, సేవలను మరింత పారదర్శకంగా మార్చడంపైనే ప్రధాన దృష్టి సారించారు. చట్టపరమైన మార్పులు, పౌర వేదికలు రోజువారీ అవసరాల కోసం వేగవంతమైన, పారదర్శకమైన, ముందే అంచనా వేయగల వ్యవస్థలను సృష్టించాయి.
చట్టాల సరళీకరణ: జన్ విశ్వాస్ చట్టం
జన్ విశ్వాస్ చట్టం-2023 నిబంధనల భారాన్ని తగ్గించడంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇది బహుళ కేంద్ర చట్టాలలోని నిబంధనలను సవరించింది, చిన్నపాటి లోపాలను క్రిమినల్ శిక్షల నుంచి సివిల్ పరిహారాలుగా మార్చింది. పౌరులు, పరిశ్రమలు చిన్న చిన్న పొరపాట్లకు జైలు శిక్షను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇది భయాన్ని తగ్గించి, స్వచ్ఛందంగా నిబంధనలు పాటించడాన్ని ప్రోత్సహించింది.
జన్ విశ్వాస్ చట్టం-2026 దీని పరిధిని గణనీయంగా విస్తరించింది. ఇది 79 కేంద్ర చట్టాలలోని 784 నిబంధనలను కవర్ చేస్తుంది. 717 నిబంధనలను నేరరహితంగా మార్చింది, పౌరులను నేరుగా ప్రభావితం చేసే 67 నిబంధనలను సవరించింది.
- జైలు శిక్ష నిబంధనల స్థానంలో ద్రవ్య జరిమానాలు లేదా హెచ్చరికలను ప్రవేశపెట్టారు, ఇది చిన్న చిన్న విధానపరమైన లోపాలకు సంబంధించిన ఆందోళనలను తగ్గించింది.
- మొదటిసారి జరిగే ఉల్లంఘనలను సలహా నోటీసుల ద్వారా పరిష్కరిస్తున్నారు. తద్వారా శిక్షకు ముందే న్యాయాన్ని అందిస్తున్నారు.
- నేరాలకు అనుగుణంగా జరిమానాలను హేతుబద్ధీకరించారు. సమతుల్యమైన, అంచనా వేయగల అమలును సృష్టించారు.
- వేగవంతమైన పరిష్కారాన్ని అందించడానికి నిబంధనల కేసులలో ఆలస్యాన్ని తగ్గించడానికి అడ్జుడికేటింగ్ అధికారులను నియమించే నిబంధన తెచ్చారు.
- సమయానుకూల పరిష్కారాన్ని అందించడానికి, సహజ న్యాయ సూత్రాలను పాటించడానికి అప్పీలేట్ అథారిటీలను నియమించే నిబంధన తెచ్చారు.
- జరిమానాలు కాలానుగుణంగా సవరణలకు లోబడి ఉంటాయి. అమలు విధానాన్ని నిరంతరం స్పందించేలా ఉంచుతాయి.
పౌర వేదికలు
పౌరుల ఆధారిత వేదికలు స్పందించే పాలనకు ముందంజగా మారాయి. ఇవి వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారాన్ని, భాగస్వామ్య మార్గాలను అందిస్తున్నాయి.
- సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్: ఫిర్యాదుల పరిష్కారంపై పౌరుల సంతృప్తిని పర్యవేక్షించడానికి మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉన్న ఒక ప్రత్యేక ఫీడ్బ్యాక్ పోర్టల్. జనవరి 2025 - ఫిబ్రవరి 2026 మధ్య కాలంలో సుమారు 6 లక్షల ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. వాటిలో 69.8% ఫిర్యాదుదారులు సంతృప్తికరంగా ఉన్నట్లు రేటింగ్ ఇచ్చారు. ఇది జవాబుదారీతనంతో కూడిన సేవల పంపిణీ వైపు వచ్చిన ప్రాథమిక మార్పును నిరూపించింది.
- మైగవ్: 2014లో ప్రారంభమైన మైగవ్.. పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఈ వేదిక ఇంటరాక్టివ్ ప్రజాస్వామ్య కొత్త శకాన్ని సృష్టించింది. విధాన రూపకల్పనలో ప్రజల గొంతుకను విస్తరించింది. 60 మిలియన్ల కంటే ఎక్కువ మంది నమోదిత వినియోగదారులతో, ఇది పౌరులకు, ప్రభుత్వానికి మధ్య ఒక డైనమిక్ వంతెనలా పనిచేస్తుంది. మైగవ్ 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రాష్ట్ర స్థాయి విభాగాలను కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా భాగస్వామ్య పరిధిని విస్తరించింది. ఈ విభాగాలు ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాల కోసం రూపొందాయి. మైగవ్ సంప్రదింపులు, విధానాల ప్రచారం, పథకాల సమాచారాన్ని సులభతరం చేస్తుంది, పాలనలో సామూహిక వివేకం ప్రతిబింబించేలా చేస్తుంది.
ఈ వేదికలు పౌరులకు నేరుగా మాట్లాడే అవకాశాన్ని, వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారాన్ని అందించాయి. తద్వారా సంస్థలపై నమ్మకాన్ని పెంపొందించాయి.
పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్
2021లో ప్రారంభమైన పీఎం గతిశక్తి పథకం.. సమగ్ర ప్రణాళిక కోసం 58 మంత్రిత్వ శాఖలు, విభాగాలను అనుసంధానించింది. వారి డేటాను జాతీయ బృహత్ ప్రణాళికతో ఏకీకృతం చేశారు. ఇది వివిధ రంగాల సమన్వయంతో కూడిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాల నుంచి 3,204 డేటా లేయర్లు ఈ జీఐఎస్ ఆధారిత పోర్టల్లో ఉపయోగిస్తున్నారు. ఈ వేదిక సంప్రదాయ మౌలిక సదుపాయాలకు అతీతంగా, సమగ్ర వృద్ధి కోసం విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి సామాజిక రంగాలను కూడా కవర్ చేస్తుంది. పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక విస్తృత భాగస్వామ్యం కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు కూడా అందుబాటులో ఉంది.
ఈ సంస్కరణలు, వేదికలు నిబంధనల భారాన్ని తగ్గించాయి. పారదర్శకతను బలోపేతం చేశాయి. రోజువారీ పరస్పర చర్యలను మెరుగుపరిచాయి. పౌరులు వేగవంతమైన సేవలను, పారదర్శకమైన అమలును, నిర్ణయాధికారంలో ఎక్కువ భాగస్వామ్యాన్ని పొందారు. దైనందిన ప్రక్రియలు తక్కువ ఒత్తిడితో, మరింత అంచనా వేయగలవిగా, మరింత సాధికారతను ఇచ్చేవిగా మారాయి. ఇది నమ్మకం, సౌకర్యం వైపు సాధించిన నిర్ణయాత్మక మార్పును ప్రతిబింబిస్తుంది.
వికసిత్ భారత్కు పునాదిగా సులభతర జీవనం
2014 నుంచి 2026 వరకు భారతదేశ పాలనా ప్రస్థానం అనేది జీవితాలు మరింత గౌరవప్రదంగా, సాధికారతతో మారడానికి సంబంధించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ప్రతి ఇల్లు కుటుంబాలను అభద్రతాభావం నుంచి విముక్తం చేయగా, ప్రతి కుళాయి నీటి కనెక్షన్ గంటల తరబడి శ్రమను దూరం చేసింది. ముఖ్యంగా మహిళలు విద్య, జీవనోపాధి కోసం సమయాన్ని పొందారు. ప్రతి జన్ ధన్ ఖాతా కుటుంబాలను ఆర్థిక ప్రధాన స్రవంతిలోకి ఆహ్వానించింది. పొదుపు, రుణాలు పొందేలా చేసింది. రహదారులు, మెట్రోలు, విమానాశ్రయాలు సమాజాలను అవకాశాలతో అనుసంధానించాయి. ఒంటరితనాన్ని తగ్గించి వృద్ధికి తలుపులు తెరిచాయి. ఈ విజయాలు కేవలం గణాంకాలు కావు; ఇవి గ్రామాలు, పట్టణాలు, నగరాల పొడవునా దైనందిన జీవితంలో వచ్చిన స్పష్టమైన, నిజమైన మార్పులను సూచిస్తాయి.
భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఈ పునాది జాతీయ ప్రగతికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది. సమగ్ర వృద్ధి, స్థిరత్వం, ప్రతి పౌరునికి గౌరవం అనేవి పరస్పర పూరక లక్ష్యాలు. అంతేకాని పోటీ ప్రాధాన్యతలు కావు. పౌర-కేంద్రీకృత, మిషన్-ఆధారిత, సాంకేతికతతో కూడిన పాలన పెద్ద ఎత్తున ఫలితాలను ఇవ్వగలదని 2014 నుంచి 2026 వరకు సాగిన పన్నెండేళ్ల కాలం నిరూపించింది. ఈ ఫలితాలు జీవితాలను వేగంగా, లోతుగా మార్చివేసాయి. ప్రపంచం నేర్చుకోదగిన పరివర్తన పాఠాలను అందించాయి.
References:
Ministry of Housing and Urban Affairs:
https://pmaymis.gov.in/pmaymis2_2024/PMAY_SURVEY/EligiblityCheck.aspx
https://www.pib.gov.in/pressreleasepage.aspx?prid=1777284®=3&lang=2
https://amrut.mohua.gov.in/uploads/AMRUT_2.0_Operational_Guidelines.pdf
https://sbmurban.org/
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2220345®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2066736®=3&lang=2
Ministry of Rural Development:
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1944744®=3&lang=2
https://pmayg.dord.gov.in/netiayHome/Home.aspx
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2075171®=3&lang=2
Ministry of Power:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2256313®=3&lang=1
https://newsonair.gov.in/pm-surya-ghar-scheme-achieves-major-milestone-as-40-lakh-households-embrace-rooftop-solar/
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2111106®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2217216®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2090639®=3&lang=2#:~:text=36.87%20crore%20LED%20bulbs%20distributed,Introduction
Press Information Bureau:
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154355&ModuleId=3®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2182568®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2191618®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155102&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241822®=3&lang=2
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2021/oct/doc202110101.pdf
Cabinet:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2237548®=3&lang=1
Ministry of Jal Shakti:
https://ejalshakti.gov.in/jjmreport/jjmindia.aspx
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2226993®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2114291®=6&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2114291®=6&lang=1
https://swachhbharatmission.ddws.gov.in/about_sbm
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2040171®=3&lang=2
https://sbm.gov.in/sbmgdashboard/statesdashboard.aspx
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2248393®=3&lang=1
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2237010®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2247224®=3&lang=1
Prime Minister’s Office:
https://www.pmindia.gov.in/en/government_tr_rec/leveraging-the-power-of-jam-jan-dhan-aadhar-and-mobile/
Ministry of Finance:
https://www.pmjdy.gov.in/account
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2069170®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2249915®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1896725®=3&lang=2
Ministry of Commerce & Industry:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2246226®=3&lang=1
Ministry of Personnel, Public Grievance and Pensions:
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU6033_XP4G1y.pdf?source=pqals
MyGov:
https://www.mygov.in/overview
Ministry of Civil Aviation:
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1657813®=48&lang=2
Ministry of Petroleum and Natural Gas:
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU3352_6sijmI.pdf?source=pqals
https://www.facebook.com/PetroleumMinIndia/videos/iea-applauds-india-for-pm-ujjwala-yojanadr-fatih-birol-executive-director-of-iea/378453946154485/
Asian Development Bank (ADB):
https://www.adb.org/publications/energy-resilience-social-protection-india
Cleck to See PDF
***
(Explainer ID: 158915)
आगंतुक पटल : 16
Provide suggestions / comments