Energy & Environment
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్
వ్యూహాత్మక ప్రాముఖ్యత, సుస్థిర అభివృద్ధి
Posted On:
01 MAY 2026 9:21AM
కీలకాంశాలు
- తూర్పు-పశ్చిమ షిప్పింగ్ మార్గానికి దగ్గరగా(సుమారు 40 నాటికల్ మైళ్లు) ఉండటాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా, రక్షణ, జాతీయ భద్రతా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విదేశీ ట్రాన్స్షిప్మెంట్ ఓడరేవులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా గ్రేట్ నికోబార్ను ఒక వ్యూహాత్మక సముద్ర, ఆర్థిక కేంద్రంగా మార్చాలని గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.
- ఇందులో ప్రధాన మౌలిక సదుపాయాల భాగాలు ఉన్నాయి: 14.2 మిలియన్ ట్వంటీ ఫుట్ ఈక్వివలెంట్ యూనిట్(ఎంటీఈయూ) అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం(గంటకు 4000 మంది గరిష్ట ప్రయాణికులు-పీహెచ్పీ), 450 ఎంవీఏ గ్యాస్-సోలార్ పవర్ ప్లాంట్, ఒక ప్రణాళికాబద్ధమైన టౌన్షిప్.
- ఈ అభివృద్ధి నియంత్రిత పర్యావరణ చట్రాన్ని అనుసరిస్తుంది. ఈఐఏ నోటిఫికేషన్ 2006, ఐసీఆర్జెడ్ నోటిఫికేషన్ 2019 ప్రకారం అనుమతులు, 42 సమ్మతి షరతులు, ద్వీప అటవీ విస్తీర్ణంలో 1.82% మళ్లింపు, 97.30 చదరపు కిలోమీటర్ల మేర పరిహార అటవీ పెంచాలనేది ప్రణాళిక.
- గిరిజన సంక్షేమంపై ప్రధాన దృష్టి ఉంటుంది. షోంపెన్, నికోబారీస్ కమ్యూనిటీలకు ఎటువంటి తరలింపు ప్రతిపాదన లేదు. మరో నోటిఫికేషన్ చర్యల ద్వారా నోటిఫైడ్ గిరిజన రిజర్వ్ ప్రాంతంలో నికర పెరుగుదల ఉంటుంది.
పరిచయం
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది అండమాన్ సముద్రంలో, ఆగ్నేయాసియాలో భారతదేశ ఉనికిని బలోపేతం చేసే లక్ష్యంతో కూడిన ఒక వ్యూహాత్మక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నిర్దిష్ట పర్యావరణ, స్థానిక వర్గాల రక్షణతో ఓడరేవు ఆధారిత వృద్ధిని సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. వ్యూహాత్మక, ఆర్థిక, పర్యావరణ ప్రాధాన్యతలను కలపడం ద్వారా గ్రేట్ నికోబార్లో అభివృద్ధి సుస్థిరంగా, కలుపుకొని పోయేలా, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని ఈ ప్రాజెక్ట్ కోరుకుంటుంది.
ఈ ప్రాజెక్టులో ఇవి ఉన్నాయి:
1. 14.2 మిలియన్ టీఈయూ(ట్వంటీ-ఫుట్ ఈక్వివలెంట్ యూనిట్) సామర్థ్యంతో అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్(ఐసీటీటీ).
2. గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం(గంటకు 4000 గరిష్ట ప్రయాణికులు-పీహెచ్పీ) 450 ఎంవీఏ(మెగావోల్ట్ ఆంపియర్) గ్యాస్, సౌర ఆధారిత విద్యుత్ కేంద్రం.
3. 16,610 హెక్టార్లలో విస్తరించి ఉన్న కొత్త టౌన్షిప్.
అభివృద్ధి సున్నితమైన, సంపూర్ణ విధానాన్ని అనుసరిస్తుంది. ఇది స్థానిక వర్గాల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ద్వీపంలోని పర్యావరణ వనరులను రక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళిక సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ ప్రభావాలను జాగ్రత్తగా అంచనా వేస్తుంది. పర్యావరణ, సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సమతుల్యం చేసే ఎంపికలకు ప్రాధాన్యత ఇస్తుంది.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ప్రధాన మౌలిక సదుపాయాల భాగాలు
1. అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్
భారతదేశపు ఓడరేవులలో పెద్ద ఓడల కోసం లోతైన నీటి బెర్తులు లేవు. దీని వల్ల సరుకు కొలంబో, సింగపూర్ ద్వారా మళ్లిస్తున్నారు. దీంతో భారతదేశం గణనీయమైన ఆదాయాన్ని కోల్పోతుంది. మయన్మార్, చైనా, శ్రీలంక వంటి దేశాలు ఈ వాణిజ్యాన్ని చేజిక్కించుకోవడానికి ఇప్పటికే లోతైన నీటి సౌకర్యాలను నిర్మిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఐలాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద గ్రేట్ నికోబార్ ఐలాండ్ సంపూర్ణ అభివృద్ధిలో భాగంగా గలాథియా బే వద్ద అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్(ఐసీటీపీ) అభివృద్ధి చేయనున్నారు. ప్రతిపాదిత విమానాశ్రయం, టౌన్షిప్, పవర్ ప్లాంట్తో పాటు, గలాథియా బే ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ మొత్తం గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్లో ప్రధాన మౌలిక సదుపాయాల భాగంగా ఉంది. ఈ ఓడరేవు వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఎందుకంటే ఇది తూర్పు-పశ్చిమ అంతర్జాతీయ షిప్పింగ్ మార్గానికి దగ్గరగా, సుమారు 40 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. 20 మీటర్లకు పైగా సహజ నీటి లోతును కలిగి ఉంది. ఈ వ్యూహాత్మక స్థానం గేట్వే, ట్రాన్స్షిప్మెంట్ సరుకు రెండింటినీ ఆకర్షించడానికి, కొలంబో, సింగపూర్, క్లాంగ్ వంటి విదేశీ ఓడరేవులపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించడానికి దానికి ప్రయోజనాన్ని ఇస్తుంది. భారతదేశ జాతీయ భద్రత, వ్యూహాత్మక, రక్షణ ఉనికిని మెరుగుపరచడానికి, దీవుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి, ఈ ప్రాంతంలో సంపూర్ణ అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ ప్రాజెక్ట్ రూపొందించారు.
2. గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం
ద్వీపంలో అంతర్జాతీయ, భారతీయ పర్యాటకులను ఆకర్షించగల ప్రపంచ స్థాయి పర్యావరణ వనరులు ఉన్నాయి. కనెక్టివిటీని మెరుగుపరచడానికి, పర్యాటకం కోసం ద్వీపాన్ని తెరవడానికి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం. ఈ ద్వీపం సెనాంగ్ సిటీ, ఫుకెట్ ఐలాండ్, లంకావి ఐలాండ్ వంటి అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలకు దగ్గరగా ఉంది. పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం ప్రస్తుతం ఏటా సుమారు 1.8 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహిస్తోంది. కొత్త విమానాశ్రయం ప్రారంభమైనప్పుడు కనీసం 1 మిలియన్ మంది ప్రయాణికులను నిర్వహిస్తుందని, ఆ తర్వాత ఏటా సుమారు 10 మిలియన్ల మంది ప్రయాణికులకు పెరుగుతుందని భావిస్తున్నారు.
3. టౌన్షిప్, ప్రాంత అభివృద్ధి
ప్రణాళికాబద్ధమైన టౌన్షిప్ ద్వీపం ఓడరేవు ఆధారిత అభివృద్ధి నుంచి ఉత్పన్నమయ్యే నివాస, వాణిజ్య, సంస్థాగత అవసరాలకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించినది. ఇది మొత్తం సమగ్ర అభివృద్ధి చట్రానికి అనుగుణంగా సిబ్బందికి, సేవా ప్రదాతలకు, సంబంధిత ఆర్థిక కార్యకలాపాలకు అవసరమైన పట్టణ మౌలిక సదుపాయాలను అందిస్తుంది.
4. విద్యుత్ కేంద్రం
ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, విమానాశ్రయం, సంబంధిత పట్టణ మౌలిక సదుపాయాల నిర్వహణకు నమ్మకమైన విద్యుత్ మౌలిక సదుపాయాలు అవసరం. ప్రస్తుతం అండమాన్ & నికోబార్ దీవులలో డీజిల్ జనరేటింగ్ సెట్లు ప్రధాన ఇంధన వనరుగా ఉన్నాయి. పవర్ ప్లాంట్ ప్రాథమిక లక్ష్యం అంతరాయాలు లేకుండా మంచి నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ శక్తిని అందించడం. ఒక ప్రాథమిక భాగం విఫలమైనా విద్యుత్ సరఫరా కొనసాగేలా ఈ వ్యవస్థ రూపొందింది. అదనపు ఉత్పత్తి కోసం పునరుత్పాదక ఇంధన వనరులను కూడా ప్లాన్ చేస్తారు. అంతరాయం లేని ఇంధన సరఫరా ద్వీపం జీడీపీని పెంచడంలో కీలకమైన అంశం.

వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యత
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ మూడు విభిన్న దశల్లో అమలవుతోంది-
- మొదటి దశ: (2025–35, 72.12 చ.కి.మీ),
- రెండో దశ: (2036–41, 45.27 చ.కి.మీ),
- మూడో దశ: (2042–47, 48.71 చ.కి.మీ)
ఇది మొత్తం 166.10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 35.35 చదరపు కిలోమీటర్ల రెవెన్యూ భూమి, 130.75 చదరపు కిలోమీటర్ల అటవీ భూమి ఉన్నాయి. ఈ దశల వారీ విధానం క్రమబద్ధమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి అనుమతిస్తుంది. అదే సమయంలో ప్రతి దశలో పర్యావరణ రక్షణలు, గిరిజన సంక్షేమ చర్యలు సమర్థవంతంగా అనుసంధానించేలా చూస్తుంది.
ప్రాజెక్ట్ వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యత గ్రేట్ నికోబార్ను హిందూ మహాసముద్ర ప్రాంతంలో కీలకమైన కేంద్రంగా ఉంచాల్సిన అవసరం ద్వారా నొక్కి చెపుతోంది. ఈ ప్రాజెక్ట్ భూ వినియోగం, సమన్వయ పర్యావరణ నిర్వహణ, దీర్ఘకాలిక ప్రాంతీయ ప్రయోజనాలను నిర్ధారిస్తుంది. అదే సమయంలో పర్యావరణ ప్రభావ అంచనా(ఈఐఏ) నిబంధనలు, చట్టబద్ధమైన అనుమతులకు పూర్తిగా కట్టుబడి ఉంటుంది.
పర్యావరణ ప్రభావ అంచనా(ఈఐఏ) అనేది సుస్థిర అభివృద్ధి కోసం సహజ వనరుల సరైన వినియోగాన్ని నిర్ధారించే ఒక సాధనం. పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్-2006 షెడ్యూల్ ప్రకారం నిర్దేశిత వర్గాల ప్రాజెక్టులకు ఈఐఏ తప్పనిసరి. వివిధ రంగాల నిపుణుల కమిటీలు ప్రాజెక్ట్ ప్రతిపాదనలను పరిశీలించి, పర్యావరణ ప్రభావాలను అంచనా వేసి, ఆమోదం లేదా తిరస్కరణను సిఫార్సు చేస్తాయి.
గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ పర్యావరణ ప్రభావ అంచనా
- స్క్రీనింగ్, స్కోపింగ్, ప్రజా సంప్రదింపులు, మదింపు వంటి వివరణాత్మక ప్రక్రియ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఈఐఏ నోటిఫికేషన్-2006 కింద ముందస్తు పర్యావరణ అనుమతిని పొందింది.
- పర్యావరణ అనుమతిలో గాలి, నీరు, శబ్దం, వ్యర్థాల నిర్వహణ, సముద్ర పర్యావరణం, మానవ ఆరోగ్యం, విపత్తు నిర్వహణను కవర్ చేసే 42 నిర్దిష్ట షరతులు ఉన్నాయి. ఇవి పటిష్టమైన ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్(ఈఎంపీ)తో ఉన్నాయి.
- జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్ఎస్ఐ), సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ(సాకన్), వైల్డ్లైఫ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఐఐ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్(ఐఐఎస్సీ) వంటి నిపుణ సంస్థలు అధ్యయనాలు నిర్వహించాయి. సరైన రక్షణ చర్యలతో ప్రాజెక్ట్ కొనసాగవచ్చని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది.
- కాలుష్యం, జీవవైవిధ్యంతో పాటు షోంపెన్, నికోబారీస్ కమ్యూనిటీల సంక్షేమాన్ని పర్యవేక్షించడానికి మూడు స్వతంత్ర పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటయ్యాయి. కమిటీలు ఈ కింది విధంగా ఉన్నాయి:
1. కాలుష్య సంబంధిత విషయాలను పర్యవేక్షించే కమిటీ.
2. జీవవైవిధ్య సంబంధిత విషయాలను పర్యవేక్షించే కమిటీ.
3. షోంపెన్, నికోబారీస్ సంక్షేమం, సమస్యలను పర్యవేక్షించే కమిటీ.
- వాటాదారులు అందరి మధ్య ఈసీ/సీఆర్జెడ్ నిబంధనల సమన్వయ అమలును నిర్ధారించడానికి ఏ&ఎన్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక ఓవర్ఆర్చింగ్ కమిటీ ఏర్పాటైంది. ఇది పర్యవేక్షణ, మానిటరింగ్, అంతర్-సంస్థాగత సమన్వయం కోసం కేంద్ర యంత్రాంగంగా పనిచేస్తుంది.
పర్యావరణ రక్షణలు, పరిహార అటవీ పెంపకం ప్రణాళిక
అనుమతికి ముందు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్(ఈఎంపీ) తయారీతో సహా ప్రాజెక్టుపై బహుళ స్థాయిల చట్టబద్ధమైన పరిశీలన జరిగింది. ఈఎంపీ నిర్మాణం, కార్యాచరణ దశల కోసం తగ్గింపు చర్యలను వివరిస్తుంది. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్(ఈఎంపీ) అనేది ప్రతిపాదిత ప్రాజెక్ట్ చుట్టూ సుస్థిర అభివృద్ధిని నిర్ధారించే ప్రణాళిక. ఇందులో పరిశ్రమ, ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి, స్థానిక ప్రజలు భాగస్వాములుగా ఉంటారు.
ఇది పర్యావరణ ప్రభావాలను తగ్గించడానికి చర్యలను కలిగి ఉంటుంది. మూలం వద్ద, ప్రాజెక్ట్ సైట్ వద్ద పర్యావరణంపై ప్రభావం తగ్గేలా చూస్తుంది. కార్యకలాపాల సమయంలో ఆర్థిక అభివృద్ధికి మద్దతు ఇస్తూనే నిరంతర పర్యావరణ ప్రభావాలను తగ్గించడంపై ఈఎంపీ దృష్టి పెడుతుంది.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అండమాన్ ఆండ్ నికోబార్ దీవుల మొత్తం అటవీ విస్తీర్ణంలో 1.82% మళ్లిస్తుంది. ఈ ప్రాంతంలోని చెట్ల అంచనా సంఖ్య 18.65 లక్షలు కాగా 49.86 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో గరిష్టంగా 7.11 లక్షల చెట్లను నరికివేయాలని భావిస్తున్నారు. కీలక ప్రాజెక్టుల ప్రతిపాదిత దశల వారీ అభివృద్ధికి అనుగుణంగా చెట్ల నరికివేత దశలవారీగా నిర్వహిస్తారు. ముఖ్యంగా, 65.99 చదరపు కిలోమీటర్ల భూమిని ఎటువంటి చెట్ల నరికివేత లేకుండా గ్రీన్ జోన్లుగా రక్షిస్తారు. ఇది పర్యావరణ సమతుల్యతను నిర్ధారిస్తుంది. దీవులలో ఇప్పటికే 75% కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణం ఉన్నందున, పరిహార అటవీ పెంపకాన్ని స్థానికంగా చేపట్టడం సాధ్యం కాదు. బదులుగా 48.65 చదరపు కిలోమీటర్ల అటవీ మళ్లింపుకు పరిహారంగా 97.30 చదరపు కిలోమీటర్ల భూమిని గుర్తించి హర్యానాలో అటవీ పెంపకాన్ని ప్లాన్ చేశారు. అదనంగా, ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కింద అండమాన్ ఆండ్ నికోబార్ దీవులలో 24 లక్షల చెట్లను నాటారు.
గిరిజన సంక్షేమం, సామాజిక పరిగణనలు
గ్రేట్ నికోబార్ ద్వీపంలో ఆదిమ మంగోలాయిడ్ తెగలు, వేటగాళ్లు-సేకరణదారులు అయిన షోంపెన్లు(సుమారు 237 మంది), తీరప్రాంత నివాసాలలో ఉంటూ మనుగడ కోసం ప్రధానంగా చేపల వేటపై ఆధారపడే నికోబారీస్ (సుమారు 1,094 మంది) నివసిస్తున్నారు. నికోబారీస్, షోంపెన్ తెగలు నిర్వాసితులు కాకుండా ఉండేలా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ జాగ్రత్తగా రూపొందింది. ప్రాజెక్ట్ ప్రాంతంలో కేవలం న్యూ చింగెన్, రాజీవ్ నగర్ వద్ద మాత్రమే గిరిజన నివాసాలు ఉన్నాయి. గిరిజన వర్గాల తరలింపు ఏదీ ప్రతిపాదించలేదని యంత్రాంగం స్పష్టంగా పేర్కొంది.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ 2015 నాటి షోంపెన్ పాలసీ, 2004 నాటి జరావా పాలసీతో పూర్తిగా ఏకీభవించింది. ఇవి భారీ స్థాయి అభివృద్ధి ప్రతిపాదనలు. ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాల(పీవీటీజీల) సంక్షేమం, సమగ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్మాణాత్మక సంప్రదింపుల ప్రక్రియను అనుసరించాలని ఆదేశిస్తున్నాయి. గిరిజన ప్రయోజనాలను కాపాడటానికి, నిర్మాణ, కార్యాచరణ దశలలో షోంపెన్, నికోబారీస్పై ప్రభావం చూపే సమస్యలను పర్యవేక్షించడానికి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ద్వారా ఒక స్వతంత్ర పర్యవేక్షణ కమిటీ తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. వర్గాల భద్రత, రక్షణ, శ్రేయస్సును నిర్ధారించడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గిరిజన సంక్షేమ డైరెక్టరేట్, అండమాన్ ఆదిమ్ జనజాతి వికాస్ సమితి(ఏఏజేవీఎస్), ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి గిరిజన నిపుణులతో కూడా సంప్రదింపులు జరిగాయి.
ప్రాజెక్ట్ అమలు చట్రం రాజ్యాంగంలోని అధికరణం 338ఏ(9) నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఈ ప్రాంతంలోని షెడ్యూల్డ్ తెగలు, ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాల ప్రయోజనాలను కాపాడటంపై తగిన ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా, అండమాన్ ఆండ్ నికోబార్ దీవుల కేంద్రపాలిత ప్రాంతం ఈ అభివృద్ధి ప్రాజెక్టును అమలు చేయడం మినహా ఈ తెగలను ప్రభావితం చేసే కొత్త విధానపరమైన చర్యలను తీసుకోలేదు. తద్వారా ప్రణాళికా ప్రక్రియలో గిరిజన హక్కులు, సంక్షేమం ప్రధానంగా ఉండేలా చూసింది.
ప్రస్తుతం గ్రేట్ నికోబార్ ద్వీపంలో 751.070 చదరపు కిలోమీటర్ల భూమి అధికారికంగా గిరిజన రిజర్వ్గా గుర్తించి ఉంది. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రతిపాదించిన 166.10 చదరపు కిలోమీటర్లలో, 84.10 చదరపు కిలోమీటర్లు గిరిజన రిజర్వ్తో అతివ్యాప్తి చెందుతోంది. అయితే, ఈ భాగంలో 11.032 చదరపు కిలోమీటర్లు ఇప్పటికే స్థిరపడింది. 1972 నుంచి రెవెన్యూ భూమిగా ఉపయోగంలో ఉంది. పర్యవసానంగా ప్రాజెక్ట్ ప్రయోజనాల కోసం 73.07 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం డీ-నోటిఫై చేస్తారు. దీనికి పరిహారంగా 76.98 చదరపు కిలోమీటర్లను గిరిజన రిజర్వ్గా మళ్లీ నోటిఫై చేస్తున్నారు. ఫలితంగా గిరిజన రిజర్వ్కు నికరంగా 3.912 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అదనంగా చేరుతుంది. ప్రత్యేకించి, తొలి దశలో ప్రాజెక్ట్లో కేవలం 40.01 చదరపు కిలోమీటర్ల గిరిజన ప్రాంతం మాత్రమే ఉంది, ఇందులో 11.032 చదరపు కిలోమీటర్లు ఇప్పటికే 1972 నుంచి రెవెన్యూ వినియోగంలో ఉన్నాయి.
ముప్పు మదింపు, విపత్తు నిర్వహణ
ఈ ద్వీపం భూకంపాల పరంగా సున్నితమైన, తుఫానులకు గురయ్యే ప్రాంతంలో ఉంది. దీనిని పరిష్కరించడానికి, ప్రకృతి వైపరీత్యాలు (సునామీలు, భూకంపాలు, తుఫానులు), మానవ ప్రేరేపిత ప్రమాదాలు(పారిశ్రామిక ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు) రెండింటికి వర్తించేలా సమగ్ర ముప్పు మదింపు అధ్యయనం జరిగింది. అత్యవసర పరిస్థితుల కోసం సంసిద్ధతను నిర్ధారిస్తూ ఒక వల్నరబిలిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధమైంది. అంతేకాకుండా హైబ్రిడ్ పవర్ ప్లాంట్(గ్యాస్, సోలార్)పై ఆధారపడటం వల్ల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూనే అంతరాయాలకు వ్యతిరేకంగా స్థితిస్థాపకతను నిర్ధారిస్తుంది.
ముగింపు
ఆర్థిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమ్మిళితత్వాన్ని సంపూర్ణ అభివృద్ధి ఎలా సమతుల్యం చేయగలదో చెప్పడానికి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ. ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ జాతీయ భద్రత, సముద్ర, రక్షణ ఉనికిని బలోపేతం చేయడానికి గ్రేట్ నికోబార్ వ్యూహాత్మక స్థానాన్ని ఉపయోగించుకుంటుంది. అదే సమయంలో బలమైన పర్యావరణ రక్షణలు, గిరిజన సంక్షేమ యంత్రాంగాలను పొందుపరుస్తుంది. వన్యప్రాణుల సంరక్షణ, పరిహార అటవీ పెంపకం, విపత్తు సంసిద్ధత, సామాజిక సమ్మిళితత్వానికి కట్టుబడి ఉండటం ద్వారా పర్యావరణం పణంగా అభివృద్ధి జరగాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిరూపిస్తోంది.
మొత్తంగా ఈ ప్రాజెక్ట్ పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలలో భవిష్యత్తులో చేపట్టే భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు ఒక నమూనాగా నిలుస్తుంది. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం ఒకదానికొకటి విరుద్ధంగా ఉండకుండా, జాతీయ, ప్రపంచ ప్రయోజనాల కోసం ఒకదానికొకటి ఎలా బలోపేతం చేసుకోగలవో చూపిస్తుంది.
REFERENCES:
Niti Aayog
Press Information Bureau
Ministry of Environment, Forest and Climate Change
Others:
***
(Explainer ID: 158437)
आगंतुक पटल : 65
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Gujarati
,
Odia
,
Kannada