• Sitemap
  • Advance Search
Technology

క్యూల‌ నుంచి క్యూఆర్ కోడ్‌ల వ‌ర‌కు: భార‌త‌దేశపు చెల్లింపుల‌ విప్ల‌వం

ప్ర‌తి భార‌తీయుడి కోసం వేగ‌వంత‌మైన‌, సుల‌భ‌మైన‌, మ‌రింత స‌మ‌గ్ర‌మైన‌ లావాదేవీలు

Posted On: 11 APR 2026 9:05AM

 

కొన్నేళ్ల క్రితం వ‌ర‌కు ఒక సాధార‌ణ ఆర్థిక లావాదేవీకి కూడా స‌మ‌యం, శ్ర‌మ‌, ఓపిక అవ‌స‌ర‌మ‌య్యేవి. బిల్లులు చెల్లించేందుకు పొడ‌వైన క్యూలైన్ల‌లో నిల‌బ‌డాల్సి వ‌చ్చేది. డ‌బ్బు పంపించాలంటే బ్యాంకుకు వెళ్లి, ఫారాలు నింపాల్సి ఉండేది. డ‌బ్బు వెళ్లిందా అనేది నిర్ధారించుకోవ‌డానికి రోజుల త‌ర‌బ‌డి ఎదురుచూడాల్సి వ‌చ్చేది. కోట్లాది మంది భార‌తీయులు బ్యాంకింగ్ స‌దుపాయం లేకుండా ఉండేవారు. త‌ద్వారా వారు ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు బ‌య‌ట ఉండేవారు. అయితే, ఆ భార‌తదేశం ఇప్పుడు గ‌తం.

భార‌త‌దేశ ఆర్థిక ప్ర‌యాణం శ‌తాబ్దాలుగా వ‌స్తుమార్పిడి వ్య‌వ‌స్థ‌లు, గ‌వ్వ‌ల ద‌గ్గ‌ర నుంచి నాణేలు, పేప‌ర్ క‌రెన్సీ, చెక్కుల వ‌ర‌కు ప‌రిణామం చెందింది. ఆధునిక చరిత్ర‌లో చాలావ‌ర‌కు న‌గ‌దు మాత్ర‌మే లావాదేవీలకు ప్ర‌ధాన విధానంగా ఉంది. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు చెల్లింపుల‌ను లాంఛ‌నంగా మార్చిన‌ప్ప‌టికీ అవి ఆల‌స్యంగా జ‌రిగేవి. పైగా ప‌రిమిత వ‌ర్గానికి మాత్ర‌మే అందుబాటులో ఉండేవి. బ్యాంకింగ్ స‌దుపాయాలు ప్ర‌ధానంగా ప‌ట్ట‌ణ కేంద్రీకృతంగా ఉండేవి. దీంతో గ్రామీణ‌, మారుమూల ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందేవి కావు.

2000వ ద‌శ‌కం ఆరంభంలో చెల్లింపుల్లో డిజిట‌ల్ ప‌రివ‌ర్త‌న ప్రారంభ‌మైంది. వేగ‌వంత‌మైన‌, 24 గంట‌ల పాటూ బ‌దిలీల‌కు అవ‌కాశం క‌ల్పిస్తూ భార‌త రిజ‌ర్వ్ బ్యాంకు 2004లో రియ‌ల్‌-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్‌(ఆర్టీజీఎస్‌), 2010లో ఇమ్మిడియ‌ట్ పేమెంట్ స‌ర్వీస్‌(ఐఎంపీఎస్‌) వంటి వ్య‌వ‌స్థ‌ల‌ను అమ‌లులోకి తీసుకువ‌చ్చింది. ఇవి ముఖ్య‌మైన‌ మైలురాళ్లు అయిన‌ప్ప‌టికీ అప్ప‌టికే బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో ఉన్న వారికి మాత్ర‌మే ఇవి చేరాయి. దీంతో అధికారిక ఆర్థిక సేవ‌లు అప్ప‌టికీ చాలామందికి ప‌రిమితంగానే అందాయి.

భార‌త‌దేశ జ‌నాభాలో ఎక్కువ మందికి రుణం, బీమా, సుర‌క్షిత‌మైన పొదుపు సేవ‌లు అంద‌క అధికారిక ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వెలుప‌లే ఉండిపోయారు. విస్త‌రించ‌త‌గిన‌, స‌మ‌గ్ర‌మైన‌, నిరంత‌రం ప‌నిచేసే డిజిట‌ల్ మౌలిక స‌దుపాయాలు లేక‌పోవ‌డం వ‌ల్ల ఆర్థిక వృద్ధి ప్ర‌యోజ‌నాలు అంద‌రికీ పూర్తిగా చేర‌లేక‌పోయాయి. దీంతో ప‌రివ‌ర్త‌నాత్మ‌క మార్పు అవ‌స‌రం స్ప‌ష్టమైంది. ఈ అవ‌స‌ర‌మే భార‌త‌దేశ డిజిట‌ల్ చెల్లింపుల విప్ల‌వానికి వేదిక‌గా నిలిచింది.

జేఏఎం త్ర‌యం: డిజిట‌ల్ బ్యాంకింగ్‌కు నిర్మాణాత్మ‌క పురోగ‌తి
భార‌త‌దేశ డిజిట‌ల్ చెల్లింపుల ప‌రివ‌ర్త‌న ప్ర‌ధాన‌మంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న‌, ఆధార్‌, మొబైల్ అనుసంధాన‌త అనే మూడు కీల‌క స్తంభాల‌తో కూడిన పునాదిపై నిర్మిత‌మైంది. వీటిని జేఏఎం త్ర‌యం అని పిలుస్తారు. ప్ర‌త్యేక ఉద్దేశాలు క‌లిగి ఉన్న ఈ మూడు స్తంభాలు క‌లిసి వృథాను త‌గ్గించ‌డం, అధికారిక బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కాన్ని పెంచ‌డం, డిజిట‌ల్ సేవ‌ల వినియోగానికి పౌరుల‌ను సిద్ధం చేయ‌డం ద్వారా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేశాయి.

 


''జేఏఎం త్ర‌యం మ‌న బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను కొత్త ద‌శ‌కు తీసుకెళ్లింది.''
- కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్‌

భారీ స్థాయిలో జీరో-బ్యాలెన్స్ అకౌంట్లు తెరిపించ‌డం ద్వారా ప్ర‌ధాన‌మంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న‌ కోట్లాది మందిని అధికారిక బ్యాకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి తీసుకువ‌చ్చింది. త‌ద్వారా అత్యంత వెనుక‌బ‌డిన ప్ర‌జ‌లు కూడా ఆర్థిక అనుసంధాన‌త పొందేందుకు వీలు క‌ల్పించింది. విశ్వ‌స‌నీయ‌మైన డిజిట‌ల్ గుర్తింపు అందించ‌డంతో పాటు సేవ‌ల‌ను క‌చ్చిత‌త్వంతో, అవాంత‌రాలు లేకుండా అందించే అవ‌కాశం క‌ల్పించ‌డం ద్వారా ఈ పునాదిని ఆధార్ బ‌లోపేతం చేసింది. వీటికి తోడు మొబైల్ అనుసంధాన‌త‌, ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం వేగంగా విస్త‌రించ‌డం పౌరుల‌కు క‌మ్యూనికేష‌న్‌,  ప్రామాణీక‌ర‌ణ‌, లావాదేవీల‌కు అనుకూల‌మైన‌, రియ‌ల్ టైమ్ ఇంట‌ర్‌ఫేస్ సౌల‌భ్యం ల‌భించింది.

ఈ స‌మ‌గ్ర చ‌ట్రానికి న‌గ‌దు బ‌దిలీ(డీబీటీ) వ్య‌వ‌స్థ ద్వారా పూర్తి రూపాన్ని పొందింది. ఇది ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాల‌ను నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి బ‌దిలీ చేసే విధానాన్ని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించింది. మ‌ధ్య‌వ‌ర్తుల‌ను తగ్గించ‌డంతో పాటు పార‌ద‌ర్శ‌క‌త‌ను పెంచ‌డం ద్వారా డీబీటీ విధానం డిజిట‌ల్ వ్య‌వ‌స్థ‌ల‌పై విశ్వాసాన్ని పెంచ‌డంతో పాటు సామ‌ర్థ్యాన్ని మెరుగుప‌రిచింది.

ముఖ్యంగా ఈ మార్పు కేవ‌లం సౌల‌భ్యానికే పరిమ‌తం కాకుండా భాగ‌స్వామ్యాన్ని ప్రోత్స‌హించింది. డీబీటీ ద్వారా ప్ర‌జ‌ల‌కు డిజిట‌ల్ ఆర్థిక లావాదేవీల వినియోగంపై అవ‌గాహ‌న తెచ్చుకున్నారు. ఇది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్‌(యూపీఐ) వంటి వేదికల‌ను విస్తృతంగా వినియోగించేందుకు మార్గం సుగ‌మం చేసింది.

యూపీఐ: ఓ స‌మూల ఆవిష్క‌ర‌ణ‌
2016లో నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్‌(యూపీఐ)ని ప్రారంభించింది. ఇది భార‌తదేశంలో లావాదేవీల‌ను ప్రాథ‌మికంగా స‌ర‌ళీక‌రించింది. ప్ర‌ధానంగా సువివ‌ర బ్యాంకింగ్ వివ‌రాల‌ను పంచుకోవాల్సిన అవ‌స‌రాన్ని తొల‌గిస్తూ వ‌ర్చువ‌ల్ పేమెంట్ అడ్ర‌స్ ద్వారా ఏ బ్యాంకు ఖాతా నుంచైనా మ‌రో బ్యాంకు ఖాతాకు న‌గ‌దు పంపించేందుకు యూపీఐ అవ‌కాశం క‌ల్పించింది.

యూపీఐ అనే ఆలోచ‌న దాని స‌ర‌ళ‌త‌తో విప్ల‌వాత్మ‌క‌మైన‌ది. ఖాతా నెంబ‌ర్లు గుర్తించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. సంక్లిష్ట‌మైన ఖాతా నెంబ‌ర్లు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లను సర‌ళ‌మైన ఇంట‌ర్‌ఫేస్ భ‌ర్తీ చేసింది. వినియోగ‌దారులు త‌క్ష‌ణ న‌గ‌దు బ‌దిలీ కోసం కేవ‌లం మొబైల్ నెంబ‌రు, యూపీఐ ఐడీ, సుర‌క్షిత‌మైన ప్ర‌మాణిక‌ర మాత్ర‌మే అవ‌స‌రం. లావాదేవీలు త‌క్ష‌ణ‌మే పూర్త‌వుతాయి. 24 గంట‌లూ బ్యాంకులు, అప్లికేష‌న్ల మ‌ధ్య నిరంత‌రాయంగా ప‌నిచేస్తుంది.

యూపీఐ వేగ‌వంత‌మైన విస్త‌ర‌ణ‌లో ఇంట‌ర్ఆప‌ర‌బిలిటీ అనేది కీల‌కంగా ప‌నిచేసింది. యూపీఐ వ్య‌వ‌స్థ‌లో 2021లో 216 బ్యాంకులు ఉండ‌గా 2026 జ‌న‌వ‌రి నాటికి 691 బ్యాంకులు ఉన్నాయి. త‌ద్వారా ఈ వ్య‌వ‌స్థ ఒక ఏకీకృత చెల్లింపు మౌలిక స‌దుపాయంగా ఎదిగింది. వినియోగ‌దారులు త‌మ బ్యాంకు లేదా యూపీఐ ప్లాట్‌ఫార్మ్ ఏద‌నేది సంబంధం లేకుండా సులువుగా లావాదేవీలు జ‌ర‌ప‌డానికి వీలు క‌ల్పించింది. మ‌రోవైపు చౌక ధ‌ర‌తో కూడిన నిర్మ‌ణం వ్య‌క్తులు, వ్యాపారుల‌కు అడ్డంకుల‌ను త‌గ్గించ‌డంతో పాటు బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థ‌ల మ‌ధ్‌య ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించింది.

యూపీఐ విస్త‌ర‌ణ ప్ర‌భావం కేవ‌లం చెల్లింపుల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డంతో పాటు వ్య‌క్తులు, చిన్న వ్యాపారాలు, అసంఘ‌టిత కార్మికులు ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భాగ‌స్వాములయ్యే విధానాన్ని పున‌ర్నిర్మించ‌డం ప్రారంభించింది. డిజిట‌ల్ లావాదేవీలు అన్ని ప్రాంతాలు, ఆదాయ వ‌ర్గాల‌లో మ‌రింత అందుబాటులోకి రావ‌డంతో పాటు విశ్వ‌స‌నీయ‌మైన‌విగా గుర్తింపు పొంది విస్తృతంగా ఆమోదం పొందాయి.

అంకెల్లో యూపీఐ: విస్తృతి, వేగం, అంత‌ర్జాతీయ నాయ‌క‌త్వం
21.70 బిలియ‌న్లు: 2026 జ‌న‌వ‌రిలో జ‌రిగిన లావాదేవీలు
రూ.28.33 ల‌క్ష‌ల కోట్లు: 2026 జ‌న‌వ‌రిలో ప్రాసెస్ అయిన విలువ‌
81%: భార‌త్‌లోని మొత్తం రిటైల్ డిజిట‌ల్ లావాదేవీల‌లో వాటా
49%: ప్ర‌పంచ‌వ్యాప్త రియ‌ల్‌టైమ్ చెల్లింపుల్లో భార‌త‌దేశ వాటా
యూపీఐ: ప‌రిణామం ప‌రంగా ప్ర‌పంచంలోనే అతిపెద్ద రియ‌ల్ టైమ్ చెల్లింపుల వ్య‌వ‌స్థ‌(ఐఎంఎఫ్‌)
10 ఏళ్ల లోపే: ప్ర‌పంచ‌స్థాయి చెల్లింపుల వ్య‌వ‌స్థ‌ను నిర్మించ‌డానికి ప‌ట్టిన స‌మ‌యం

సౌల‌భ్యానికి మించి: ఆర్థిక సౌక‌ర్యం విస్త‌ర‌ణ‌
చెల్లింపుల‌ను స‌ర‌ళీక‌రించ‌డం నుంచి ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భాగ‌స్వామ్యాన్ని పున‌ర్నిర్మించే స్థాయికి యూపీఐ చేరుకుంది. త‌క్ష‌ణ‌, చిన్న మొత్తంలోనూ లావాదేవీల‌ను అనుమ‌తించ‌డం ద్వారా న‌గ‌దుపై ఆధార‌ప‌డ‌టాన్ని యూపీఐ త‌గ్గించింది. సామ‌ర్థ్యాన్ని మెరుగుప‌ర్చ‌డంతో పాటు ల‌క్ష‌లాది మందికి అధికారిక ఆర్థిక సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. చిన్న వ్యాపారుల‌కు, అసంఘ‌టిత కార్మికుల‌కు ఈ మార్పు అత్యంత ముఖ్య‌మైన‌ది. వారికి ఇది రుణ‌, బీమా, పొదుపు కోసం కొత్త మార్గాల‌ను సృష్టించింది.

యూపీఐ అస‌లు క‌థ లావాదేవీల ప‌రిణామం ఎంత అనేది అంశంలో లేదు. ఎవ‌రు లావాదేవీలు జ‌రుపుతున్నార‌నే దానిలో ఉంది. ఆటోరిక్షా డ్రైవ‌ర్లు కూడా క్యూఆర్ కోడ్‌ల ద్వారా చెల్లింపుల‌ను అంగీక‌రిస్తున్నారు. గ్రామీణ సంత‌ల్లో లావాదేవీలు త‌క్ష‌ణ‌మే పూర్త‌వుతున్నాయి. వీధి వ్యాప‌రులు చిల్ల‌రతో ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం త‌ప్పింది. గృహాల్లో ప‌నిచేసే కార్మికులు కూడా మామూలు స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించి డ‌బ్బులు ఏ రాష్ట్రానికైనా పంపించ‌వ‌చ్చు. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల మ‌ధ్య‌, అధికారిక‌, అన‌ధికారిక అనే విభ‌జ‌నల‌ను ఈ వ్య‌వ‌స్థ క్ర‌మంగా రూపుమాపింది. ఇది ఆర్థిక స‌మ్మిళితం వైపు ఒక నిర్ణ‌యాత్మ‌క మార్పుగా నిలిచింది.

ఇదే స‌మ‌యంలో యూపీఐ ఒక విస్తృత‌మైన ఆర్థిక వేదిక‌గా రూపాంత‌రం చెందుతోంది. చిన్న మొత్తంలో చెల్లింపులు వేగంగా చేసేందుకు యూపీఐ లైట్ అవ‌కాశం క‌ల్పిస్తోంది. యుటిలిటీ బిల్లులు, స‌బ్‌స్క్రిప్ష‌న్‌లు వంటి పున‌రావృతమ‌య్యే ఖ‌ర్చుల‌నును యూపీఐ ఆటోపే  క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తుంది. ముంద‌స్తు ఆమోదం పొందున రుణ స‌దుపాయాల సౌక‌ర్యాన్ని క్రెడిట్ ఆన్ యూపీఐ మ‌రింత విస్తృతం చేస్తోంది. ఈ వ్య‌వ‌స్థ ఆధారంగా ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్ సంస్థ‌లు రుణాలు అందజేయ‌డంతో పాటు రుణ చెల్లింపుల‌ను అనుమ‌తిస్తున్నాయి. వ్యక్తుల‌కు త‌గిన ఆర్థిక ఉత్ప‌త్తుల‌ను అందిస్తున్నాయి. త‌ద్వారా దేశ‌వ్యాప్తంగా అధికారిక ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిధిని విస్త‌రిస్తున్నాయి.

డిజిట‌ల్ చెల్లింపులు: పెరుగుతున్న‌ సౌల‌భ్యం, సామ‌ర్థ్యం, భ‌ద్ర‌త‌, విశ్వాసం
విస్తృత వ్య‌వ‌స్థ‌పై నిర్మిత‌మైన యూపీఐ ఇప్పుడు దేశ దైనందిన ఆర్థిక నిర్మాణంలో భాగ‌మైపోయింది. సౌల‌భ్యం కోసం ఒక సాధ‌నంగా ప్రారంభ‌మై ఇప్పుడు వ్య‌క్తులు, వ్యాపారాలు, ఆర్థిక సంస్థ‌లు ఆధార‌ప‌డే విశ్వ‌స‌నీయ వ్య‌వ‌స్థ‌గా ఎదిగింది.

వినియోగ‌దారుల‌కు ఈ అనుభ‌వాన్ని సుల‌భం, న‌మ్మ‌కంగా నిర్వ‌చించొచ్చు. ఒకే అప్లికేష‌న్ ద్వారా బ‌హుళ బ్యాంకు ఖాతాల‌కు ఎప్పుడైనా, ఎక్క‌డినుంచైనా లావాదేవీల‌ను పూర్తి చేయ‌వ‌చ్చు. ఇందుకోసం సున్నిత‌మైన బ్యాంకింగ్ వివ‌రాల‌ను పంచుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఈ వ్య‌వ‌స్థ‌లో అంత‌ర్భాగంగా ఉన్న ర‌క్ష‌ణ మ‌న చెల్లింపులు సుర‌క్షితంగా జ‌రిగేలా చూస్తాయి. యాప్‌ల‌లోని స‌హాయ‌క ఫీచ‌ర్లు ఫిర్యాదుల ప‌రిష్కారాన్ని సుల‌భ‌త‌రంగా మాస్తున్నాయి. త‌ద్వారా ఈ వ్య‌వ‌స్థ మొద‌టిసారి ఉప‌యోగించే వారికీ అందుబాటులో ఉంటోంది.

ఈ విశ్వాసాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తూ 2026 ఏప్రిల్ 1 నుంచి డిజిట‌ల్ చెల్లింపుల లావాదేవీల‌కు భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) మ‌రింత మెరుగైన ప్ర‌మాణీక‌ర‌ణ యంత్రాంగాల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. రెండంచెల ప్రామాణీక‌ర‌ణ త‌ప్ప‌నిస‌రి చేయ‌డం వ‌ల్ల ప్ర‌తి లావాదేవీ ఓటీపీల‌తో పాటు పిన్‌లు, బ‌యోమెట్రిక్ లేదా సుర‌క్షిత‌మైన టోకెన్ల వంటి బ‌హుళ ర‌క్ష‌ణ ద్వారా ధ్రువీక‌ర‌ణ పొందుతుంది. ఇది డిజిట‌ల్ వేదిక‌ల‌పై న‌మ్మ‌కాన్ని పెంచ‌డంతో పాటు మోసాల ముప్పును గ‌ణ‌నీయంగా త‌గ్గిస్తుంది.

వ్యాపారులు న‌గ‌దును నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం లేకుండా వేగంగా, స‌మ‌ర్థంగా నిధుల‌ను స్వీక‌రించే మార్గాన్ని అందిస్తోంది. కార్డులు, న‌గ‌దు కాకుండా మొబైల్ ఆధారిత చెల్లింపులు చేసేందుకు మొగ్గుచూపే వారితో స‌హా ఎక్కువ‌మంది వినియోగ‌దారుల‌కు సేవ‌లందించేందుకు వ్యాపారాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తోంది. చిన్న దుకాణాలైనా, వీధి సంత‌లైనా, ఆన్‌లైన్ వేదిక‌లైనా లావాదేవీలు త‌క్ష‌ణ‌మే పూర్త‌వుతున్నాయి. జాప్యాలు త‌గ్గ‌డంతో పాటు న‌గ‌దు నిర్వ‌హ‌ణ లేదా తిరిగివ్వ‌డం వంటి కార్య‌చ‌ర‌ణ స‌వాళ్లు సైతం త‌గ్గుతున్నాయి.

ఇప్ప‌టికే ఉన్న వ్య‌వ‌స్థ‌లను వినియోగించుకొని బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లకు సుర‌క్షిత‌మైన‌, త‌క్ష‌ణ లావాదేవీల‌కు వీలు క‌ల్పించ‌డం ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల సేవ‌ల‌ను యూపీఐ మెరుగుప‌రుస్తుంది. బ‌ల‌మైన ర‌క్ష‌ణ‌ల‌ను కలిగి ఉంటూనే భారీ స్థాయిలో వ్య‌క్తి నుంచి వ్య‌క్తికి, వ్యాపార చెల్లింపుల‌కు దోహ‌ద‌ప‌డుతుంది. త‌ద్వారా సామ‌ర్థ్యాన్ని మెరుగుప‌ర్చ‌డంతో పాటు అధికారిక ఆర్థిక సేవ‌లను మ‌రింత‌గా అందుబాటులోకి తెస్తాయి.

భార‌త‌దేశ ఆవిష్క‌ర‌ణ‌: ప్ర‌పంచ‌వ్యాప్త ప్ర‌భావం
భార‌తదేశ డిజిట‌ల్ చెల్లింపుల వ్య‌వ‌స్థ దేశీయ అవ‌స‌రాల‌ను తీర్చ‌డంతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒక న‌మూనాగా కూడా ఉద్భ‌వించింది. అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి(ఐఎంఎఫ్‌), ప్ర‌పంచ బ్యాంకు వంటి సంస్థ‌లు దీని స్థాయిని, సామ‌ర్థ్యాన్ని, స‌మ‌గ్ర‌త‌ను గుర్తించాయి.,

ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స‌హా ప్ర‌పంచ నాయ‌కులు.. యూపీఐ ద్వారా భార‌త‌దేశం నెల‌కు దాదాపు 20 బిలియ‌న్ల‌కు పైగా లావాదేవీల‌ను ప్రాసెస్ చేస్తున్న విష‌యాన్ని కొనియాడారు. ఇంత భారీ నిర్వ‌హ‌ణ‌ స్థాయి ఇత‌ర ఏ రియ‌ల్ టైమ్ పేమెంట్ సిస్ట‌మ్‌కు లేదు.

జాతీయ స‌రిహ‌ద్దుల‌ను దాటిన యూపీఐ ఇప్పుడు యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌, సింగ‌పూర్‌, భుటాన్‌, నేపాల్‌, శ్రీలంక‌, ఫ్రాన్స్‌, మారిష‌స్‌, ఖ‌తార్ వంటి బ‌హుళ దేశాల్లో ప‌నిచేయ‌డం లేదా అక్క‌డి చెల్లింపు వ్య‌వ‌స్థ‌ల‌తో అనుసంధాన‌మై ఉంది. అంత‌ర్జాతీయంగా వినియోగించ‌గ‌ల సామ‌ర్థ్యం ఇప్పుడు స‌రిహ‌ద్దు అవ‌త‌ల కూడా లావాదేవీలు చేయ‌డాన్ని సుల‌భ‌త‌రం చేస్తోంది. డ‌బ్బు పంప‌డానికి స‌హాయ‌ప‌డటంతో పాటు ఆర్థిక స‌మ్మిళితానికి దోహ‌ద‌ప‌డుతోంది. ప్ర‌పంచ ఫిన్‌టెక్ రంగంలో భార‌త‌దేశ పాత్ర‌ను బ‌లోపేతం చేస్తోంది.

యూపీఐ: భార‌త్‌లో ఆర్థిక లావాదేవీల‌కు ఓ వ‌రం
ఆర్థిక సేవ‌లు అందుతున్న వారికి, ఆర్థికంగా క‌నిపించ‌ని వారికి మ‌ధ్య ఉన్న అంత‌రాన్ని యూపీఐ తొల‌గించింది. భార‌త‌దేశంలోని గ్రామీణ, సెమీ అర్బ‌న్ ప్రాంతాల్లో ఇప్పుడు మెట్రోపాలిట‌న్ న‌గ‌రాల‌తో స‌మానంగా వేగంగా, సుల‌భంగా లావాదేవీలు జ‌రుగుతున్నాయి.

ద‌శాబ్దంలోపే దేశీయంగా నిర్మిత‌మైన వ్య‌వ‌స్థ ఇప్పుడు ప్ర‌పంచంలో అగ్ర‌గామిగా ఎదుగుతోంది. బ్యాంకింగ్ సౌక‌ర్యం పొంద‌ని వారికి బ్యాంకింగ్ సేవ‌లు అందాల‌నే ల‌క్ష్యంతోచేప‌ట్టిన ఈ ప్ర‌య‌త్నం ఇప్పుడు రియ‌ల్‌-టైమ్ పేమెంట్‌ల‌లో ప్ర‌పంచ అత్యుత్త‌మ ప్ర‌మాణంగా మారింది. క్యూల నుంచి క్యూఆర్ కోడ్‌ల వ‌ర‌కు భార‌త‌దేశ ప్ర‌యాణం స‌మ్మిళిత ఆవిష్క‌ర‌ణ శ‌క్తిని ప్ర‌తిబింబిస్తోంది.

యూపీఐ అనేది కేవ‌లం ఒక చెల్లింపుల వ్య‌వ‌స్థ కాదు. ఇది ప్ర‌జ‌ల వేదిక‌. ఇది ఆర్థిక లావాదేవీల‌ను వేగవంతంగా, సుల‌భ‌త‌రంగా, పార‌ద‌ర్శ‌కంగా, అస‌లైన స‌మ్మిళ‌తంగా మార్చింది. ఈ క్ర‌మంలో ఇది భార‌తదేశం ఎలా చెల్లింపు విధానాన్నే కాదు, ఎలా పురోగ‌మిస్తుందో కూడా మార్చేసింది.

 

References:

Ministry of Finance:

Ministry of Electronics & IT:

National Payments Corporation of India (UPI):

Reserve Bank of India:

PIB Backgrounders:

Click here to see pdf

***

(Features ID: 158339) आगंतुक पटल : 47
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Kannada