Economy
తెలంగాణ పురోగతికి తోడ్పాటు: పరిశ్రమలు, చేతివృత్తులను శక్తిమంతం చేసిన జీఎస్టీ
Posted On:
14 OCT 2025 16:31 PM
ముఖ్య విషయాలు
· తెలంగాణ తన వ్యవసాయ ఉత్పత్తిలో 25 శాతం ఉత్పత్తులను 4,000లకు పైగా కర్మాగారాలు, 80,000 అనధికారిక యూనిట్ల ద్వారా శుద్ధి చేస్తోంది. 2023–24 కాలంలో వ్యవసాయ-ఎగుమతి విలువలో శుద్ధి చేసిన ఆహార ఉత్పాదకాల వాటా 50 శాతంగా ఉంది. జీఎస్టీ తగ్గింపుతో ధరలు 6-7 శాతం తగ్గుతాయి.
· రాష్ట్రం 800లకు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలకు ఆతిథ్యం ఇస్తోంది.. 2014 నుంచి 4.5 లక్షల ఉద్యోగాలను కల్పించింది.. భారత బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో 50 శాతం వాటాను ఇది కలిగి ఉంది. జీఎస్టీ తగ్గింపుతో ఔషధాల ధరలు 6-7 శాతం తగ్గుతాయి.
· 2024–25 కాలంలో విమానాలు, అంతరిక్ష నౌకలు, సంబంధిత భాగాల ఎగుమతులు తెలంగాణ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 31 శాతం వాటా కలిగి ఉన్నాయి. జీఎస్టీ, ఐజీఎస్టీ తగ్గింపుతో ఎగుమతి సామర్థ్యం మరింత బలపడుతుంది.
· 2023-24 కాలంలో తెలంగాణ ఎగుమతి చేసిన ఆటో విడిభాగాల విలువ రూ. 177 కోట్లు, కార్ల విలువ రూ. 79 కోట్లుగా ఉంది. జీఎస్టీ తగ్గింపుతో ఎగుమతి సామర్థ్యం పెరగడంతో పాటు.. ఉత్పత్తి వ్యయాలూ తగ్గుతాయి.
· జీఐ-ట్యాగ్ పొందిన హస్తకళలు, బొమ్మలపై జీఎస్టీ తగ్గింపుతో వాటి ధరలు 6 శాతం తగ్గుతాయి.. ఇది అమ్మకాలతో పాటు చేతివృత్తులవారి ఆదాయాన్నీ పెంచుతుంది.. ప్రపంచ మార్కెట్ పరిధినీ విస్తరిస్తుంది.
|
పరిచయం
2014 జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ.. దేశంలో కొత్త, అతి చిన్న రాష్ట్రంగా అవతరించింది. ఎత్తయిన దక్కన్ పీఠభూమి ప్రాంతంతో వ్యూహాత్మక ప్రాంతంగా.. తరచుగా "ఉత్తరానికి దక్షిణం.. దక్షిణానికి ఉత్తరం" గా వర్ణించే తెలంగాణ చాలా కాలంగా అనేక భాషలు, సంస్కృతులు, సంప్రదాయాల కూడలిగా ఉంది. ఇది వంటకాలు, కళలు, చేనేత వస్త్రాలు, హస్తకళలకు ప్రసిద్ధి చెందింది. ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం కీలకమైన ఆహార శుద్ధి పరిశ్రమను, జాతీయస్థాయి ప్రాధాన్యం గల ఔషధ కేంద్రాన్ని కలిగి ఉంది. రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ ఏరోస్పేస్, రక్షణ రంగ తయారీకి ప్రముఖ కేంద్రంగా ఉంది.
ముఖ్యంగా ఇటీవలి జీఎస్టీ సంస్కరణలు తెలంగాణ వృద్ధి వేగాన్ని మరింత బలోపేతం చేశాయి. ముఖ్యమైన వస్తువులు, సేవలపై పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా ఈ సంస్కరణలు డిమాండ్ను పెంచడంతో పాటు సామర్థ్యాన్నీ పెంపొందిస్తూ.. ఉపాధికి కొత్త మార్గాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఆహార శుద్ధి, ఔషధాల నుంచి.. తయారీ, ఎగుమతుల వరకు రాష్ట్రంలోని కీలక రంగాలకు జీఎస్టీ సంస్కరణలు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తూ... తెలంగాణ సమగ్ర, సుస్థిర అభివృద్ధి దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయి.
ఆహార శుద్ధి పరిశ్రమ
ఎక్కువగా ఎమ్ఎస్ఎమ్ఈలపై ఆధారపడే తెలంగాణ ఆహార శుద్ధి రంగం... స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడంలో, ఉద్యోగాలను సృష్టించడంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పరిశ్రమ రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తిలో 25 శాతం ఉత్పత్తులను శుద్ధి చేస్తుంది.. తద్వారా వ్యవసాయ క్షేత్రాలు, మార్కెట్ల మధ్య కీలక వారధిగా ఈ రంగం పనిచేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రధాన క్లస్టర్లతో ఈ రంగం భౌగోళిక వైవిధ్యం కలిగి ఉంది. హైదరాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, వరంగల్ అర్బన్ ప్రాంతాలు తినుబండారాలు.. నిజామాబాద్ సుగంధ ద్రవ్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి.. ఖమ్మం అరటి, సుగంధ ద్రవ్యాల ఆధారిత యూనిట్లకు ప్రసిద్ధి చెందాయి. తెలంగాణ 4,000 కర్మాగారాలు, 80,000 లకు పైగా అనధికారిక వ్యాపార సంస్థలకు నిలయంగా దేశంలోని మొత్తం ఆహార శుద్ధి యూనిట్లలో 10 శాతం వాటాను కలిగి ఉంది. దీని మార్కెట్ పరిధి దేశీయ తినుబండారాల మార్కెట్, రిటైలర్లు, డీ2సీ బ్రాండ్లు, ఎయిర్లైన్స్, సూపర్ మార్కెట్లకూ విస్తరించి ఉంది. ఎగుమతి విషయంలో శుద్ధి చేసిన ఆహారాలు 2023-24 కాలంలో రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ ఎగుమతుల్లో (విలువ ప్రకారం) 50 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి. ఇవి యూఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, రష్యా వంటి దేశాలకు ఎగుమతి అయ్యాయి.
ఇటీవలి జీఎస్టీ సంస్కరణల ద్వారా బనగానపల్లె మామిడిపండ్లు, తాండూర్ కందులు వంటి జీఐ-ట్యాగ్ పొందిన ఉత్పత్తులు సహా కీలక ఉత్పత్తి కేటగిరీలపై పన్నుల తగ్గింపుతో ఈ రంగం సామర్థ్యం మరింత మెరుగైంది.
జీఎస్టీ తగ్గించిన ఇతర వస్తువుల్లో.. పనీర్- చెనా (ప్యాక్ చేసినవి), యూహెచ్టీ పాలు, భారతీయ బ్రెడ్లు (ప్యాక్ చేసినవి), వెన్న, నెయ్యి, జున్ను, డ్రై ఫ్రూట్స్, నమ్కీన్, పాస్తా, పండ్లు-కూరగాయల రసాలు, కర్రీ పేస్ట్లు, ప్రిజర్వ్ చేసిన పండ్లు, జామ్లు, జెల్లీలు, ఐస్ క్రీం, సూప్లు, కార్న్ఫ్లేక్స్, తృణధాన్యాల ఫ్లేక్స్, చాక్లెట్లు, పేస్ట్రీలు, కేకులూ ఉన్నాయి.

ఈ రేటు తగ్గింపుతో షెల్ఫ్ ధరలు 6–7 శాతం తగ్గుతాయి. పీక్ సీజన్లలో ఫ్రూట్స్ టు ఫ్యాక్టరీకి సేకరణను పెంచుతాయి.. గ్రామీణ, సెమీ-అర్బన్ మార్కెట్లలో శుద్ధి చేసిన ఆహారాలను మరింత సరసమైనవిగా చేస్తాయి. ఈ సంస్కరణలు వినియోగదారుల్లో డిమాండ్ను పెంచడంతో పాటు రైతులు, తయారీదారులు, ఎఫ్ఎమ్సీజీ వ్యాపారస్తులు, ఎమ్ఎస్ఎమ్ఈ ఆహార యూనిట్లకు ఒకే విధమైన ప్రయోజనం చేకూరుస్తాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కేంద్రంగా తెలంగాణ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయి.
లైఫ్ సైన్సెస్ – ఫార్మా రంగం

దేశంలోని ప్రముఖ ఔషధ తయారీ కేంద్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉంది. ఈ రంగం రాష్ట్ర సరుకుల ఎగుమతుల్లో అత్యధిక వాటాను కలిగి ఉంది. ఈ వృద్ధికి ఆధారంగా ఉన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ "భారత లైఫ్ సైన్సెస్ రాజధాని"గా పేరుగాంచింది. 800 లకు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ రాష్ట్రంలో ఉంది.. 2014 నుంచి సమష్టిగా 4.5 లక్షలకు పైగా ఉద్యోగాలను ఇది సృష్టించింది.
తెలంగాణ ఫార్మాస్యూటికల్ నెట్వర్క్ దేశవ్యాప్త ఆసుపత్రులు, క్లినిక్లు, రిటైల్ మార్కెట్లకూ సేవలు అందిస్తుంది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, జీఎస్కే, నోవార్టిస్, శాంత వంటి ప్రధాన ప్రపంచస్థాయి, దేశీయ సంస్థలకు నిలయంగా ఉంది. భారత బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో తెలంగాణ దాదాపు 50 శాతం వాటాను కలిగి ఉండడంతో పాటు.. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉంది.. మొత్తం ఫార్మా ఎగుమతుల్లో అయిదో వంతు వాటానూ ఇది కలిగి ఉంది. భారత ఆరోగ్య సంరక్షణ తయారీ వాణిజ్య కార్యకలాపాల్లో ఈ రంగం కీలక పాత్రను ఇది స్పష్టం చేస్తుంది.
ఇటీవలి జీఎస్టీ సంస్కరణలు ఈ రంగం సామర్థ్యాన్ని, యాక్సెసిబిలిటీనీ మరింత బలోపేతం చేశాయి.. 30 క్యాన్సర్ మందులపై జీఎస్టీని 12 శాతం నుంచి సున్నాకి తగ్గించారు. అదనంగా వ్యక్తిగత ఉపయోగం కోసం గల అన్ని మందులు, ఔషధాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఈ తగ్గింపులు వినియోగదారుల వ్యయాన్ని 6-7 శాతం తగ్గిస్తాయి... ఇది ఆరోగ్య సంరక్షణను మరింత సరసమైనదిగా మార్చడంతో పాటు మరింత అందుబాటులో ఉండేలా చేస్తుంది. తెలంగాణ ఫార్మాస్యూటికల్, లైఫ్ సైన్సెస్ పరిశ్రమ వృద్ధినీ, ఆవిష్కరణలనూ పెంపొదిస్తుంది.
ఏరోస్పేస్ – రక్షణ రంగం

25కి పైగా పెద్ద కంపెనీలు, 1,000కి పైగా ఎమ్ఎస్ఎమ్ఈలతో హైదరాబాద్ ఒక ప్రముఖ ఏరోస్పేస్, రక్షణ రంగ తయారీ కేంద్రంగా ఉంది. ఈ నగరం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (డీఆర్డీఎల్), రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (ఎమ్డీఎన్), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ (డీఎమ్ఆర్ఎల్) వంటి ప్రముఖ పరిశోధన, రక్షణ సంస్థలకు నిలయంగా ఉంది. ఇది డజనుకు పైగా ప్రధాన డీఆర్డీవో ల్యాబ్లు, రక్షణ పీఎస్యూల మద్దతుతో బలమైన వ్యవస్థను ఏర్పరుస్తోంది.
ఈ నగర పారిశ్రామిక వ్యవస్థ కీలక మార్కెట్లకూ సేవలందిస్తోంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ కోసం 30 శాతం భాగాలను సేకరించే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), భారత సైన్యం, పారామిలిటరీ దళాలు, డీఆర్డీవో, వ్యవస్థ-స్థాయి ప్రొవైడర్లు వీటిలో భాగంగా ఉన్నాయి. ఈ బలాన్ని ప్రతిబింబిస్తూ.. భారత సైనిక హార్డ్వేర్ ఎగుమతులు యూఎస్, ఫ్రాన్స్, అర్మేనియాలతో పాటు 100కు పైగా దేశాలకు విస్తరించాయి. గత 2-3 సంవత్సరాల్లో ఈ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.
2024–25 కాలంలో విమానాలు, అంతరిక్ష నౌకలు, సంబంధిత భాగాల ఎగుమతులు తెలంగాణ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 31 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గణనీయంగా పెరిగిన రక్షణ రంగ, పీఎస్యూ ఆర్డర్లతో పాటు వ్యవసాయం, మైనింగ్, మౌలిక సదుపాయాల రంగాల్లో డ్రోన్లకూ దేశీయంగా డిమాండ్ పెరుగుతోంది.
ఇటీవలి జీఎస్టీ సంస్కరణలు ఈ రంగం సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేశాయి. మానవరహిత విమానాలు (28 నుంచి 18 శాతం వరకు గలవి ప్రస్తుతం 5 శాతానికి), టూ-వే రేడియో, ట్యాంకులు, ఇతర సాయుధ పోరాట వాహనాలు, భాగాలు (12 శాతం నుంచి 5 శాతానికి), టార్గెట్ మోషన్ సిమ్యులేటర్, భాగాలు, హెచ్ఏసీఎఫ్ఎస్ సబ్-అసెంబ్లీలు, ఎమ్ఆర్ఎస్ఏఎమ్ వ్యవస్థ భాగాలు, ఐఏడీడబ్ల్యూఎస్ భాగాలు, సైనిక రవాణా విమానాలు మొదలైన వాటి జీఎస్టీ రేట్లు (ఐజీఎస్టీ 18 శాతం నుంచి సున్నాకు) తగ్గించారు.
ఈ పన్ను తగ్గింపు తయారీ ఖర్చులను తగ్గిస్తుంది.. ఎగుమతి సామర్థ్యాన్ని, పరిశోధనాభివృద్ధి సామర్థ్యాన్నీ పెంచుతుంది.. ఏరోస్పేస్, రక్షణ రంగ వాణిజ్య కార్యకలాపాల్లో సమర్థమైన దేశీయ సేకరణకు, బడ్జెట్ వినియోగానికి మద్దతునిస్తుంది.
వాహన, వాహన విడి భాగాల పరిశ్రమ

తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వాహన, వాహన విడి భాగాల పరిశ్రమ ఉంది. మహీంద్రా గ్రూప్, హ్యుందాయ్, ఎంఆర్ఎఫ్ వంటి కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఓఈఎం, వాహన విడి భాగాలు (ఆఫ్టర్ మార్కెట్), పంపులు లేదా ఎలక్ట్రిక్ మోటార్లతో సహా విస్తృత విభాగాల అవసరాలను ఈ రంగం తీరుస్తోంది.
2023–24లో తెలంగాణ రూ. 177 కోట్ల విలువైన వాహన విడిభాగాలను, రూ. 79 కోట్ల విలువైన కార్లను ఎగుమతి చేసింది. తయారీ, వాణిజ్యం రెండింటిలోనూ స్థిరమైన వృద్ధిని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
వాహన విడిభాగాలు, త్రిచక్ర వాహనాలు, చిన్న కార్లు, మోటార్ సైకిళ్లపై (350cc కంటే ఎక్కువ) ఇటీవల జీఎస్టీ తగ్గటంతో వీటికి సంబంధించిన వ్యవస్థ మరింత బలోపేతం అవుతోంది. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల ఓఈఎంల ఉత్పత్తి ఖర్చులు తగ్గటం, ధరలపరంగా పోటీతత్వం పెరగటం, విడి భాగాలతో పాటు ఇతర ఖర్చులు తగ్గటం ద్వారా వాణిజ్య కార్యకలాపాల్లో భాగస్వాములందరికీ ప్రయోజనం చేకూరుతోంది.
బొమ్మలు, హస్తకళలు
భారతదేశానికి చేతితో చేసిన బొమ్మల విషయంలో ఘనమైన సాంస్కృతిక వారసత్వం ఉంది. ఇది దేశానికి ఉన్న కళాత్మక వారసత్వం, హస్తకళ నైపుణ్యాలను తెలియజేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందుతుండటంతో బొమ్మలకు సంబంధించిన రిటైల్ పరిశ్రమ పలు సంవత్సరాలుగా గణనీయమైన వృద్ధిని సాధించింది. తెలంగాణ విషయానికి వస్తే నిర్మల్ బొమ్మలు, హస్తకళలలకు రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. దీనితో పాటు తరతరాల నుంచి వస్తోన్న విభిన్న హస్తకళలు, సంప్రదాయాలకు కూడా తెలంగాణ పేరు పొందింది. పెంబర్తి ఇత్తడి పాత్రలు లోహాలతో చేసే సంక్లిష్టమైన కళకు పేరెన్నికగన్నది. అదిలాబాద్ డోక్రా లోహ హస్తకళలు… పురాతన లాస్ట్-వాక్స్ కాస్టింగ్ పద్ధతిని ఉపయోగించే ఈ ప్రాంత గిరిజన కళను తెలియజేస్తున్నాయి. వరంగల్ జిల్లాలో తయారయ్యే తివాచీలు భిన్నమైన రంగులు, వివరణాత్మక నమూనాలు, మన్నికకు ప్రసిద్ధి చెందాయి.

నిర్మల్ బొమ్మలు, హస్తకళలు
చెక్క, లోహం, వస్త్రాలతో చేతుల మీదుగా తయారయ్యే నిర్మల్ బొమ్మలు, హస్త కళలకు 2009లో భౌగోళిక గుర్తింపు (జీఐ) కూడా లభించింది. అదిలాబాద్లోని నకాషి సామాజిక వర్గానికి చెందిన వారు ప్రధానంగా ఈ పురాతన హస్తకళల్లో ఉన్నారు. వీటి తయారీ కోసం పోనికి కలప, చింతపండు గింజల ద్వారా తయారు చేసిన సహజమైన బంకను ఉపయోగిస్తారు. వీటి తయారీ కళాకారుల సంప్రదాయ పద్ధతులను తెలియజేస్తోంది.
ఈ పరిశ్రమ దాదాపు 50–60 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. హస్తకళ ప్రదర్శనలు, రాష్ట్ర స్థాయి ఎంపోరియాలు, వాణిజ్య ఉత్సవాలు, ఆన్లైన్ మార్కెట్ల ద్వారా వీటి అమ్మకాలు జరుగుతున్నాయి. 2023–24లో భారతదేశం 150 దేశాలకు 152.34 మిలియన్ డాలర్ల విలువైన బొమ్మలను ఎగుమతి చేసింది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ హస్తకళలకు ఉన్న దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ స్థాయిని ఇది తెలియజేస్తోంది.
ఇటీవలి జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించటం వల్ల చిల్లర ధరలు ఆరు శాతం తగ్గాయన్న అంచనా ఉంది. ఇది దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో నిర్మల్ బొమ్మల పోటీతత్వాన్ని మరింత పెంచటంతో పాటు దేశీయ సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహిస్తూ కళాకారుల జీవనోపాధికి మద్దతునిస్తోంది.
లోహలతో చేసే పెంబర్తి హస్తకళలు
సంప్రదాయ పెంబర్తి హస్తకళలను లోహలను ఉపయోగించి తయారుచేస్తారు. తెలంగాణలోని జనగాం జిల్లా వీటికి ప్రసిద్ధి చెందింది. దీనికి 2010లో జీఐ గుర్తింపు లభించింది. ఈ హస్తకళలో విశ్వకర్మ సమాజానికి చెందిన కళాకారులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం దాదాపు 100 కుటుంబాలు మాత్రమే ఈ సంప్రదాయాన్ని కాపాడుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి.
దక్షిణ భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాల అలంకరణలో ఈ కళను ఉపయోగించారు. పాండన్లు, నాగర్డాన్లు, ఇటార్డాన్లు, పాత్రలు, లాంప్షేడ్లు, మొక్కల కుండీలు వంటి సాంస్కృతిక, అలంకార, గృహోపకరణ వస్తువులలో కూడా ఈ కళను ఉపయోగిస్తున్నారు. హస్తకళ ప్రదర్శనలు, రాష్ట్ర స్థాయి ఎంపోరియాలు, ఉత్సవాల ద్వారా ఈ ఉత్పత్తులు విక్రయమవుతున్నాయి. ఇది సంప్రదాయ కళ, సమకాలీన ఆకర్షణల మిశ్రమాన్ని తెలియజేస్తోంది.
జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించటం వల్ల రిటైల్ ధరలు 6 శాతం తగ్గాయన్న అంచనా ఉంది. తద్వారా అమ్మకాలు వృద్ధి చెంది చేతివృత్తులవారి ఆదాయాలు పెరుగుతాయి. వీటితో పాటు ఈ సంస్కరణ.. దేశీయ మార్కెట్లలో ఈ సాంస్కృతిక హస్తకళలను నిలబెట్టుకునేందుకు, ప్రోత్సహించడానికి సహాయపడతాయి.
అదిలాబాదా డోక్రా
తెలంగాణలోని వోజ్ సామాజిక వర్గానికి చెందిన గిరిజన కళాకారులు తయారు చేసే సంప్రదాయ బెల్ మెటల్ హస్తకళల తయారీకి పురాతనమైన లాస్ట్-వాక్స్ కాస్టింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. దీనికి 2018లో జీఐ గుర్తింపు లభించింది. ఈ హస్తకళల వ్యాపారాన్ని దాదాపు 100 కుటుంబాలు కొనసాగిస్తున్నాయి.
స్థానిక మార్కెట్లు, ఉత్సవాలు, రాష్ట్ర హస్తకళల ఎంపోరియాలతో పాటు వర్థమాన ఆన్లైన్ వేదికల ద్వారా డోక్రా ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఇది సాంస్కృతిక వారసత్వం, పెరుగుతోన్న వాణిజ్య ఆకర్షణ రెండింటినీ తెలియజేస్తోంది.
ఇటీవల జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీనివల్ల చిల్లర ధరలు ఆరు శాతం తగ్గాయన్న అంచనా ఉంది. ఇది అమ్మకాలను పెంచి.. చేతివృత్తులవారి ఆదాయాలను పెరిగేలా చూసుకుంటుంది. అదే విధంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సంప్రదాయ హస్తకళల సంరక్షణ, వృద్ధిని మరింత ప్రోత్సహిస్తుంది.
వరంగల్ తివాచీలు
దక్షిణ తెలంగాణలోని చారిత్రాత్మక నగరమైన వరంగల్కు 2018లో కాటన్ తివాచీల విషయంలో జీఐ గుర్తింపు లభించింది. సంక్లిష్టతతో కూడిన ఈ తివాచీలను పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేత కార్మికులు నేస్తారు. వ్యక్తిగతంగా, సహకార సంఘాల ద్వారా ఈ హస్తకళను వారు కొనసాగిస్తున్నారు. ఈ తివాచీల విషయంలో మొత్తం దాదాపు 2,000 మంది ఉపాధి పొందుతున్నారు.
వరంగల్ తివాచీ విక్రయాలు ఫ్యాబ్ ఇండియా, సీసీఐసీ, గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ వంటి వాటితో పాటు స్థానిక మార్కెట్లు, ఉత్సవ కేంద్రాలు, రాష్ట్ర ఎంపోరియాలు, అమెజాన్ వంటి ఆన్లైన్ వేదికల ద్వారా జరుగుతున్నాయి. వీటిని జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర ఐరోపా దేశాలతో పాటు జపాన్, అమెరికా, కెనడాకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇది వాటికి ఉన్న అంతర్జాతీయ ఆకర్షణను తెలియజేస్తోంది.
జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించటంతో చిల్లర ధరలు 5 శాతం తగ్గాయన్న అంచనా ఉంది. దీనివల్ల వరంగల్ తివాచీల పోటీతత్వం పెరగటంతో పాటు వాటి ఎగుమతి సామర్థ్యం పెరుగుతుంది. దీనితో పాటు అమ్మకాలు మెరుగుపడి కళాకారుల ఆదాయాలు పెరుగుతాయి. తద్వారా ఈ సంప్రదాయ హస్తకళలు నిరంతరం వృద్ధి సాధిస్తాయి.
ముగింపు-
జీఎస్టీ సంస్కరణలు ఖర్చులను తగ్గించడం, పోటీతత్వాన్ని పెంచడం, వివిధ రంగాల విషయంలో మార్కెట్లను విస్తరించడం ద్వారా తెలంగాణ వృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఆహార శుద్ధి, ఔషధాల విషయంలో తగ్గిన పన్నులు.. ఉత్పత్తులను మరింత అందుబాటు ధరల్లోకి తీసుకురావటంతో పాటు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయి. విమానయానం, రక్షణ, వాహన రంగంలో జీఎస్టీ రేట్ల తగ్గింపు ఉత్పత్తి ఖర్చులను తగ్గిస్తుంది. తద్వారా ఎగుమతులు పెరగటంతో పాటు పరిశోధన, అభివృద్ధి మద్దతు లభిస్తుంది. సంప్రదాయ హస్తకళలు, బొమ్మలపై జీఎస్టీ 5 శాతానికి తగ్గటంతో అమ్మకాలు పెరిగి చేతివృత్తుల వారికి ఆదాయాలు మెరుగుపడతాయి. తద్వారా ఇవి బలమైన దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ను చూస్తాయి.
మొత్తంమీద ఈ సంస్కరణలు ఉత్పత్తులను అందుబాటు ధరల్లోకి తీసుకొచ్చి మార్కెట్ వృద్ధి, సమ్మిళిత ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. తద్వారా తెలంగాణను పరిశ్రమ, ఎగుమతులు, సాంస్కృతిక వారసత్వానికి కేంద్రంగా మారుస్తాయి.
సూచనలు
Telangana.gov.in
https://www.telangana.gov.in/about/language-culture/
https://www.telangana.gov.in/about/state-profile/
incredibleindia.gov.in
https://www.incredibleindia.gov.in/en/telangana
invest.telangana.gov.in
https://invest.telangana.gov.in/pharma/
tourism.telangana.gov.in
https://tourism.telangana.gov.in/page/arts-crafts
ఐబీఈఎఫ్
https://ibef.org/blogs/the-toy-story-in-india-understanding-india-s-booming-toy-retail-market
పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
***
(Factsheet ID: 150372)
Visitor Counter : 25
Provide suggestions / comments