సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
‘ప్రత్యేక ప్రచారం 6’ కోసం సెప్టెంబర్ 16న ఆన్లైన్ వేదికను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు ప్రత్యేక ప్రచారం 6 సన్నాహక దశ
అక్టోబర్ 2 నుంచి 31 వరకు ప్రత్యేక ప్రచారం 6 అమలు దశ
ఈ-వ్యర్థాల సమర్థవంతమైన సేకరణ, వేరు చేయడం, తొలగింపుపై ప్రత్యేక దృష్టి
నాడు పోస్టు చేయడమైనది:
15 SEP 2026 1:41PM by PIB Hyderabad
‘ప్రత్యేక ప్రచారం 6’ పురోగతిని పర్యవేక్షించేందుకు రూపొందించిన ఆన్లైన్ వేదికను (https://scdpm.nic.in/SCDPM26) కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని మొత్తం 84 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ‘ప్రత్యేక ప్రచారం 6’ నోడల్ అధికారులు, ప్రజా ఫిర్యాదుల నోడల్ అధికారులు, అప్పీల్ అధికారులతో నిర్వహించే సమావేశంలో ఈ వేదికను ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ (డీఏఆర్పీజీ) కార్యదర్శి, తపాలా శాఖ కార్యదర్శి, బొగ్గు శాఖ కార్యదర్శి, పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ (డీఎస్ఈఎల్) కార్యదర్శి, గనుల శాఖ కార్యదర్శి కూడా ప్రసంగించనున్నారు.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతను సంస్థాగతం చేయడం, పెండింగ్లో ఉన్న పనులను తగ్గించడం కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రత్యేక ప్రచారాలను సమన్వయం చేసి, ముందుకు నడిపించే నోడల్ శాఖగా 2021 నుంచి పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ (డీఏఆర్పీజీ) వ్యవహరిస్తోంది. ప్రత్యేక ప్రచారం 6ను 2026 అక్టోబర్ 2 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. దీనికి ముందు సన్నాహక దశను 2026 సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు చేపడతారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని కార్యాలయాల్లో పరిశుభ్రతను పూర్తిస్థాయిలో అమలు చేయడం ఈ ప్రత్యేక ప్రచారం లక్ష్యం.
2021 నుంచి 2025 వరకు నిర్వహించిన ప్రత్యేక ప్రచారాల అయిదు దశలతో పాటు, 2026 జూలై వరకు నిర్వహించిన నెలవారీ సచివాలయ సంస్కరణల పర్యవేక్షణ ద్వారా ఇప్పటి వరకు 24.20 లక్షలకు పైగా ప్రదేశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాల ద్వారా 180.48 లక్షలకు పైగా ఫైళ్లను తొలగించారు లేదా వాటికి సంబంధించిన పనులను పూర్తిచేశారు. స్క్రాప్ (వ్యర్థ పదార్థాల) విక్రయం ద్వారా రూ.5,102.91 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ప్రత్యేక ప్రచారం 5లోనే దాదాపు 11.6 లక్షల ప్రదేశాలను పరిశీలించారు. 29.52 లక్షల ఫైళ్లను తొలగించారు. 233.75 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఖాళీ చేశారు. స్క్రాప్ విక్రయం ద్వారా సుమారు రూ.833.92 కోట్ల ఆదాయం పొందారు.
ప్రత్యేక ప్రచారాల సందర్భంగా అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టారు. డిసెంబర్లో నిర్వహించిన సుపరిపాలన వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను మూల్యాంకన నివేదికల రూపంలో రూపొందించి విడుదల చేశారు. ప్రత్యేక ప్రచారాలకు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులు నాయకత్వం వహించారు. ప్రత్యేక ప్రచారాల కార్యక్రమాలు, విజయాల గురించి ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కూడా ప్రస్తావించారు.
2026 ఆగస్టు 5న కేందర ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులకు కేబినెట్ కార్యదర్శి డీఓ లేఖ రాశారు. అలాగే ప్రత్యేక ప్రచారం 6కు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను డీఏఆర్పీజీ 2026 ఆగస్టు 13న జారీ చేసింది. ప్రత్యేక ప్రచారం 6ను అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు వాటి అనుబంధ, ఆధీన, స్వయంప్రతిపత్తి కార్యాలయాల్లో నిర్వహించనున్నారు. ప్రజలకు సేవలు అందించే లేదా ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న క్షేత్రస్థాయి, ఇతర ప్రాంతాల్లోని కార్యాలయాలు, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు కూడా ఇందులో భాగస్వామ్యం కానున్నాయి. ఈ ప్రచారంలో పౌరులే కేంద్రంగా ఉండే విధానాలు, అందరినీ కలుపుకొని వెళ్లే చర్యలు వంటి ఉత్తమ పద్ధతులను మరింత విస్తృతంగా అమలు చేయడంపై దృష్టి సారించనున్నారు. ఈ-వ్యర్థాలను సమర్థవంతంగా సేకరించడం, వేరు చేయడం, తొలగించడం వంటి చర్యలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
‘ప్రత్యేక ప్రచారం 6’ సన్నాహక దశ 2026 సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ దశలో మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఎంపిక చేసిన విభాగాల్లో పెండింగ్లో ఉన్న పనులను గుర్తిస్తాయి. క్షేత్రస్థాయి సిబ్బందిని సమీకరించి, ప్రచారం నిర్వహించాల్సిన ప్రదేశాలను ఖరారు చేస్తాయి. రికార్డులను పరిశీలించడంతోపాటు కార్యాలయ స్థలాల సమర్థవంతమైన వినియోగానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తాయి. గుర్తించిన స్క్రాప్ (వ్యర్థ పదార్థాలను) తొలగించే చర్యలను చేపడతాయి. ప్రత్యేక ప్రచారం 6లో అమలు చేసిన ఉత్తమ పద్ధతులను 2026 డిసెంబర్ 19 నుంచి 25 వరకు నిర్వహించే సుపరిపాలన వారోత్సవాల సందర్భంగా ప్రదర్శించనున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2310501)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4