వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రపంచ వాణిజ్యంలో మహిళా నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలను విస్తరించేందుకు బ్రిక్స్ భాగస్వాములతో కలసి పనిచేయనున్న భారత్ : కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ఉమ్మడి బ్రిక్స్ వాణిజ్య వేదిక, ప్రదర్శనలు, కొనుగోలుదారు–విక్రేత సమావేశాల్లో మహిళా యాజమాన్యంలోని సంస్థల అధిక భాగస్వామ్యం కోసం పిలుపునిచ్చిన శ్రీ గోయల్
మహిళా పురోగతి నిధిని నిర్దుష్టమైన కార్యక్రమంగా మార్చనున్న బ్రిక్స్ సభ్య దేశాలు: శ్రీ గోయల్
బ్రిక్స్ దేశాల మధ్య స్థిరమైన నియమాలు, డిజిటల్ వాణిజ్య డాక్యుమెంటేషన్, విస్తృతమైన సేవల వాణిజ్యం గురించి వివరించిన శ్రీ గోయల్
అంతర్జాతీయంగా వాణిజ్య ప్రతికూలతలు ఎదురవుతున్నప్పటికీ ఏప్రిల్–ఆగస్టు మధ్యలో 15 శాతానికి పైగా పెరిగిన భారత వస్తు ఎగుమతులు: శ్రీ గోయల్
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2026 10:23PM by PIB Hyderabad
మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అంతర్జాతీయ వాణిజ్యంలో అవకాశాలను విస్తరించేందుకు కలసి పనిచేయాలని బ్రిక్స్ దేశాలకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు పిలుపునిచ్చారు. రుణాలు, మార్కెట్లు, వ్యాపారానికి అనువైన నియమాలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త మూడు ముఖ్యమైన అవరోధాలను అధిగమించాల్సి ఉంటుందన్నారు. అవి రుణాలను పొందడం, కొనుగోలుదారులు, మార్కెట్లు అందుబాటులో ఉండటం, స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని ప్రోత్సహించే, అవకాశాలను అందించే నియమాలు ఉండటం.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో నేర్చుకున్న పాఠాలను బ్రిక్స్ విమెన్స్ బిజినెస్ అలయన్స్, విస్తృతమైన బ్రిక్స్ వ్యాపార భాగస్వామానికి అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని శ్రీ గోయల్ చెప్పారు. దేశాభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషించాలనే లక్ష్యంతో వారికి విద్య, నైపుణ్యాలు, మెరుగైన జీవన నాణ్యతను అందించడం ద్వారా వారిని ఆర్థికంగా, సామాజికంగా సాధికారపరచడంపై భారత్ దృష్టి సారించిందని ఆయన చెప్పారు.
మహిళల్లో ఆర్థిక సమ్మిళిత్వాన్ని పెంపొందించడంలో భారత్ అనుభవాలను శ్రీ గోయల్ వివరించారు. పన్నెండేళ్ల క్రితం అనేక మంది మహిళలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు బ్యాంకు ఖాతాలు, వారి పేరిట ఆస్తులు లేదా క్రెడిట్ హిస్టరీలు ఉండేవి కాదు. రుణాలను పొందడానికి తరచూ అనర్హతకు గురయ్యేవారని చెప్పారు. భారత్ మహిళల పేరిట ఇళ్లు కట్టించిందనీ, దాదాపు 300 మిలియన్ల ఖాతాలను తెరిచిందనీ, క్రెడిట్ హిస్టరీ లేనివారితో సహా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకొనే వారికి పూచీకత్తులు లేని రుణాలను అందించిందనీ తెలిపారు.
ప్రస్తుతం వివిధ ఆలోచనలు, వ్యాపారాలపై కలసి పనిచేస్తున్న తొమ్మిది మిలియన్ల స్వయం సహాయక బృందాలు, చిన్న సహకార సంఘాలు లేదా బృందాల్లో సుమారుగా 100 మిలియన్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని ఆయన వెల్లడించారు. రూ. 1 లక్ష కంటే ఎక్కువ వ్యక్తిగత ఆదాయాన్ని ఆర్జిస్తున్న మహిళల సంఖ్య 30 మిలియన్లను దాటింది. వారిని ‘లఖ్పతీ దీదీ’లని పిలుస్తున్నాం. ఈ సంఖ్యను, ఆదాయాన్ని పెంచాలని భారత్ ఆశిస్తోందని ఆయన చెప్పారు.
చిన్న తరహా వ్యాపారులకు సుమారుగా 560 మిలియన్ల రుణాలను భారత్ అందించిందని, వాటిలో 68 శాతానికంటే ఎక్కువ మహిళా వ్యాపారవేత్తలకే దక్కాయని శ్రీ గోయల్ చెప్పారు. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించి, వారి కుటుంబసభ్యులపై ఆధారపడకుండా చేయడమే లక్ష్యమని తెలియజేశారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడినప్పడు, వారు భారత దేశ వృద్ధి ప్రయాణంలో కీలకంగా మారతారని చెప్పారు.
దశాబ్దం క్రితం భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం దాదాపు 19 శాతంగా ఉండేదని మంత్రి తెలిపారు. ఆదాయం స్థాయులు పెరిగి, నైపుణ్యాలు అభివృద్ధి చెంది, ప్రతిభ వెలుగులోకి వచ్చిన కొద్దీ ఈ సంఖ్య 50 శాతానికి లేదా అంత కంటే ఎక్కువకు చేరుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ది చెందిన సమాజాల్లో సంఘటిత కార్మికరంగంలో మహిళల భాగస్వామ్యం 50 శాతాన్ని అధిగమించిందని చెప్పారు. సంఘటిత శ్రామిక శక్తిలోకి మరింత మంది మహిళలు ప్రవేశించడం ద్వారా భారత్ గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించగలదని శ్రీ గోయల్ స్పష్టం చేశారు.
ఒక వ్యక్తి వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా కుటుంబంలో ఆదాయాన్ని ఆర్జించే వారిగా మారడానికి అవసరమైన సమాన అవకాశాలను, మార్గాలను అందించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. మహిళాభివృద్ధికి, మహిళల నేతృత్వంలో అభివృద్ధికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని తెలియజేశారు.
చదువుకున్న లేదా నైపుణ్యాలున్న మహిళల మొత్తం కుటుంబానికే అండగా ఉంటుందని, కుటుంబాన్ని నడిపిస్తూ, పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడంలో తోడ్పడుతుందని శ్రీ గోయల్ అన్నారు. మహిళాభివృద్ధి, మహిళా నేతృత్వ అభివృద్ధిపై దృష్టి సారించిన వివిధ పథకాలు, కార్యక్రమాల్లో మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా నూతన భారతదేశ రూపశిల్పులుగా చూడాలని ఆయన కోరారు.
అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలను విస్తరించడంపై గత నెల జైపూర్లో జరిగిన బ్రిక్స్ వాణిజ్య, పరిశ్రమల మంత్రుల సమావేశాన్ని శ్రీ గోయల్ ప్రస్తావించారు. ఆ సమావేశంలో చిన్న ఎగుమతిదారులను మదింపు చేయడానికి స్వచ్ఛంద సూత్రాలపై మంత్రులు అంగీకరించారని ఆయన తెలిపారు. ఈ మదింపు కేవలం ఇన్వాయిస్లు, చెల్లింపుల ఆధారంగా మాత్రమే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్త సామర్థ్యం, గతం నుంచి వర్తమానానికి, భవిష్యత్తుకు వచ్చిన మార్పు ఆధారంగా ఉండాలని ఆయన అన్నారు.
విదేశీ వాణిజ్యాన్ని కేవలం హామీతో కూడిన వ్యాపారంగా చూడకూడదని, సమాజాలను, వ్యాపారాలను ఏకీకరించడానికి, విదేశీ ప్రయాణం గురించి ఊహించని అణగారిన వర్గాలకు అవకాశాలను కల్పించడానికి లభించిన అవకాశంగా చూడాలని ఆయన అన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఉమ్మడి బ్రిక్స్ వేదికను అన్వేషించాలనే జైపూర్ ఏకాభిప్రాయాన్ని బ్రిక్స్ దేశాలు అంగీకరించాయని చెప్పారు. ఈ వేదిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న మార్కెట్లు, కొనుగోలుదారులు అందుబాటులో ఉండటమనే రెండో సమస్యను పరిష్కరించడంలో తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి వేదిక ఒకసారి అందుబాటులోకి వస్తే, ఏదైనా ఒక బ్రిక్స్ దేశంలో ఏ ఉత్పత్తి అవసరం ఉందో ఇతర దేశాలకు సులభంగా తెలుస్తుందని శ్రీ గోయల్ చెప్పారు. అలాగే, వ్యాపారుల మధ్య లావాదేవీల రసీదులను కూడా ఈ వేదిక ద్వారా అందరికీ తెలిసేలా బహిర్గతం చేయవచ్చన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం విస్తరిస్తున్న కొద్దీ మహిళా పారిశ్రామికవేత్తలకు, చిన్న వ్యాపారులకు అండగా నిలిచేందుకు ఎన్నో ఆర్థిక సంస్థలు ఈ వేదికలో చేరవచ్చని తెలియజేశారు.
ప్రపంచ విలువ ఆధారిత వ్యవస్థలపై సభ్య దేశాల ఉమ్మడి అవగాహనకు సంబంధించిన బ్రిక్స్ కార్యాచరణ ప్రణాళిక గురించి ప్రస్తావిస్తూ... అంతర్జాతీయ ప్రదర్శనలు, సమావేశాలు, సెమినార్లు, ఎగ్జిబిషన్లు, వ్యాపార వేదికల్లో మహిళా యాజమాన్యంలోని సంస్థలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలకు శ్రీ గోయల్ విజ్ఞప్తి చేశారు. దీనివల్ల వివిధ వేదికల్లో సహకారం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
రంగాల వారీగా మహిళల నేతృత్వంలోని మరిన్ని వ్యాపార ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని ఆయన బ్రిక్స్ దేశాలను కోరారు. ఒక బ్రిక్స్ సభ్య దేశం నుంచి మరొక దేశానికి పర్యటించేలా వస్త్ర పరిశ్రమకు సంబంధించిన మహిళా బృందం లాంటి వివిధ రంగాల వారీగా పూర్తిగా మహిళలతో కూడిన ప్రతినిధి బృందాలను బ్రిక్స్ సభ్యదేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలాంటి ప్రతినిధి బృందాలకు ఆదరణ లభిస్తుందని, విలువ ఆధారిత వ్యవస్థలను ఏకీకరించడంలో అవి తోడ్పడతాయని, బ్రిక్స్ వెలుపల ఉన్న మార్కెట్లతో కూడా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలను సృష్టిస్తాయని తెలియజేశారు.
వ్యాపారానికి స్థిరమైన నిబంధనలు ఉండాలనే మూడో సవాలుపై శ్రీ గోయల్ మాట్లాడారు. తగినంత స్థిరత్వం, స్పష్టత, స్వేచ్ఛాయుతమైన సరిహద్దులు, స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించే వాతావరణం లేకుండా వ్యాపారం చేయడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. డబ్ల్యూటీవో నిర్దేశించిన నిబంధనల పరిధిలో బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను పరిరక్షించి, బలోపేతం చేసేందుకు బ్రిక్స్ దేశాలన్నీ కట్టుబడి ఉన్నాయని ఆయన తెలిపారు. దీనివల్ల తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తమకంటూ విధానాలు రూపొందించుకునే అవకాశం లభిస్తుందని ఆయన వివరించారు.
ఎలక్ట్రానిక్ వాణిజ్య పత్రాలు, ఈ–ఇన్వాయిస్లు, ల్యాడింగ్ ఎలక్ట్రానిక్ బిల్లులు, ఈ–కస్టమ్స్ డిక్లరేషన్లకు సంబంధించిన వేదికను ఏర్పాటు చేసే దిశగా బ్రిక్స్ దేశాలు పనిచేయాలని శ్రీ గోయల్ అన్నారు. ప్రతి దేశ చట్టాలను గౌరవిస్తూనే, ఆన్లైన్ ద్వారా సరిహద్దులకు అతీతంగా సేవలు అందించడాన్ని సులభతరం చేసేందుకు అంగీకరించిన స్వచ్ఛంద సూత్రాలను కూడా ఆయన ప్రస్తావించారు.
బ్రిక్స్ దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం కావాలని శ్రీ గోయల్ పిలుపునిచ్చారు. సభ్య దేశాలకూ, భాగస్వామ్య దేశాలకూ, ప్రపంచానికి సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలంటే చర్చలు, దౌత్యమే సరైన మార్గమని ఆయన చెప్పారు. ప్రపంచ వాణిజ్యం ఒత్తిడి సంకేతాలను చూపుతున్న తరుణంలో, ప్రస్తుతం రెండు యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచం అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్టత, అస్పష్టతతో కూడిన వాతావరణంలో మిగిలిన ప్రపంచంతో సంబంధాలను కొనసాగిస్తూనే బ్రిక్స్ దేశాల మధ్య వ్యాపారాన్ని పెంచడంలో సమష్టి ప్రయత్నాలకున్న ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచ శాంతికి, వస్తు, సేవల అంతర్జాతీయ వాణిజ్యానికి మద్దతుగా ఒక ఉమ్మడి అవగాహనతో దేశాలను ఏకం చేయడానికీ బ్రిక్స్ దేశాలు కృషి చేశాయని శ్రీ గోయల్ చెప్పారు. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సేవల వాణిజ్యంపై తగినంత దృష్టి సారించలేదన్నారు. ప్రపంచ సేవల వాణిజ్యం దాదాపు 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నప్పటికీ, బ్రిక్స్ దేశాల మధ్య సేవల వాణిజ్యం తక్కువ స్థాయిలో ఉందని తెలిపారు. ఇది గణనీయమైన వృద్ధిని సాధించేందుకు అవకాశాన్ని ఇస్తోందన్నారు.
రవాణా, ఇతర సేవా రంగాలతో పాటు వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక రంగంలో మహిళలు క్రియాశీలక పాత్ర పోషించగలరని శ్రీ గోయల్ అన్నారు. సేవా పంపిణీని మెరుగుపరచడానికి, సేవలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలను భాగస్వాములు చేయడానికి బ్రిక్స్ దేశాలు కలసి పనిచేసేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
బ్రిక్స్ ఆర్థిక భాగస్వామ్య వ్యూహం-2030ను అగ్రనేతలు ఆమోదించాలని బ్రిక్స్ వాణిజ్య మంత్రులు సిఫార్సు చేశారని శ్రీ గోయల్ చెప్పారు. బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం ద్వారా మరింత స్పష్టమైన అజెండాలు, కార్యాచరణ ప్రణాళికలు, మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే దశాబ్దాల్లో కొనసాగే సుదీర్ఘ భాగస్వామ్యానికి 2030 సంవత్సరం తొలి మెట్టుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
2030 నాటికి అమలు చేయడానికి పరిశీలనకు నాలుగు నిర్దిష్ట సూచనలను శ్రీ గోయల్ ముందుకు తెచ్చారు. రుణాలను అందించే అంశం గురించి ఆయన మాట్లాడారు. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్పై జరిపే అధ్యయనం మహిళా ఎగుమతిదారుల వాస్తవ అవసరాలను ప్రతిబింబించేలా చూడాలని బ్రిక్స్ మహిళా వ్యాపార కూటమికి, అనంత్ గోయెంకా నేతృత్వంలోని బ్రిక్స్ వ్యాపార మండలికి పిలుపునిచ్చారు. ఇలాంటి ఇన్వాయిస్లను రుణాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకొనేటప్పుడు ప్రభుత్వాలు, బ్యాంకులు, ఎగ్జిమ్ బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. అదే విధంగా జైపూర్ ఏకాభిప్రాయంలో స్పష్టం చేసిన మహిళా పురోగతి నిధి ప్రతిపాదనను ఓ నిర్దిష్ట కార్యక్రమంగా మార్చాలని పిలుపునిచ్చారు.
కొనుగోలుదారులను చేరుకోవడం గురించి మాట్లాడుతూ... కొనుగోలుదారు–విక్రేత సమావేశాలతో పాటు మరిన్ని బ్రిక్స్ ప్రదర్శనలు, ఉత్సవాలు, ఫోరంల్లో వివిధ బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాలకు చెందిన మహిళా యాజమాన్యంలోని సంస్థలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏ తరహా వ్యాపారాలు విజయవంతమయ్యాయి? ఏవి విఫలమయ్యాయి? ఏ రంగాలపై ఎక్కువ దృష్టి సారించాలి? అనే అంశాలతో సహా సాధించిన పురోగతికి సంబంధించిన నివేదికను ఏటా సమర్పించాలని ఆయన సూచించారు. బ్రిక్స్ దేశాల మధ్య మరింత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మహిళా నేతృత్వ కార్యక్రమాల్లో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలియజేశారు.
గవర్నమెంట్ ఇ-మార్కెట్ప్లేస్ ద్వారా ప్రభుత్వం చేపడుతున్న కొనుగోళ్లలో భారతదేశ అనుభవాన్ని శ్రీ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు పారదర్శకంగా వస్తువులు, సేవలను కొనుగోలు చేసేలా ఈ వేదిక ప్రోత్సహిస్తుంది. అలాగే కొనుగోలు అవకాశాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కేంద్ర, స్థానిక స్థాయుల్లో ప్రభుత్వానికి వస్తువులు, సేవలు అందించేందుకు మహిళా నేతృత్వంలోని సంస్థలకు ప్రత్యేక ప్రాధాన్యం, ప్రోత్సాహం లభిస్తుందని తెలియజేశారు. ఈ వేదికలో మహిళా నేతృత్వంలోని సంస్థలకు అతి పెద్ద స్థాయిలో వాటా ఉందని వెల్లడించారు.
పెరుగుతున్న మహిళా పారిశ్రామికవేత్తల ప్రాబల్యానికి ఉదాహరణలు చూపించారు. న్యూఢిల్లీకి సుమారు 2,500 కి.మీ. దూరంలో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలు ఇప్పుడు వాణిజ్య మంత్రిత్వ శాఖకు లేదా ప్రధానమంత్రి కార్యాలయానికి, కొన్నిసార్లు 100 డాలర్ల విలువైన చిన్న సరకులను కూడా సరఫరా చేయగలుగుతున్నారని శ్రీ గోయల్ వెల్లడించారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఎంతగా పురోగమిస్తున్నారో ఇది తెలియజేస్తోందన్నారు.
భారత్ చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం గురించి శ్రీ గోయల్ వివరించారు. దేశంలో దాదాపు 780 జిల్లాలు ఉన్నాయని, ప్రతి జిల్లాలోనూ ఒకటి, రెండు లేదా మూడు ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు సేవల రంగానికి కూడా విస్తరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వంటకాలను గుర్తించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమ గురించి ఉదహరించారు. భారత్లో స్వల్ప దూరాలకే వంటకాల్లో, రుచుల్లో ఎన్నో మార్పులు కనిపిస్తాయని ఆయన తెలియజేశారు. వైవిధ్యమైన ఉత్పత్తులు, రుచులు, సుగంధ ద్రవ్యాలు, వాటి మేళవింపునకు ప్రపంచ మార్కెట్లో వ్యాపారాలుగా ఎదిగేందుకు గణనీయమైన సామర్థ్యం ఉందని తెలియజేశారు.
ప్రపంచ మార్కెట్లను అభివృద్ధి చేయడం, జిల్లాలను ఎగుమతుల కేంద్రాలుగా మార్చాలనే లక్ష్యంతో వివిధ జిల్లాల్లో గుర్తించిన ఉత్పత్తులు, సేవలు, వంటకాలను రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగాలు ప్రోత్సహిస్తున్నాయని ఆయన అన్నారు.
భారత్లో పండించిన తాజా పండ్లు, కూరగాయలకు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా సుమారుగా 10 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్న గల్ఫ్ ప్రాంతంలో డిమాండు పెరుగుతోందని శ్రీ గోయల్ చెప్పారు. ఇది ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా ఆహార ఉత్పత్తుల నాణ్యమైన ప్యాకేజింగ్, డిజైనింగ్, ప్రాసెసింగ్ రంగాల్లో చిన్నకారు రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలకు విస్తృత స్థాయిలో అవకాశాలను కల్పిస్తుందని ఆయన వివరించారు. బ్రిక్స్ దేశాలు మరింతగా కలిసి పనిచేస్తే మహిళల ఉత్పత్తులను, సేవలను ప్రోత్సహించేందుకు మరిన్ని మహిళా సంఘాలు, మహిళలు నేతృత్వంలో మార్కెట్లను ఏర్పాటు చేయడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.
నియమాలు, విధానాల గురించి మాట్లాడుతూ, వ్యాపారం చేయడానికి లేదా తమ పనిని కొనసాగించడానికి ఆటంకం కలిగిస్తున్న పత్రాలను, ధృవపత్రాలను, ప్రక్రియలను, విధానాలను గుర్తించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని శ్రీ గోయల్ కోరారు. వారి అనుభవాల ఆధారంగా అందించిన ఆచరణాత్మక సమాచారం... వ్యాపారాన్ని సులభతరం చేసేలా ప్రక్రియలను, విధానాలను సరిచేయడానికి, డాక్యుమెంటేషన్ను తగ్గించడానికి, విధానాలను మెరుగుపరచడంలో ప్రభుత్వాలకు, విధాన రూపకర్తలకు తోడ్పాటును అందిస్తుంది.
సమస్య గురించి మాత్రమే కాకుండా.. దానికి పరిష్కారాన్ని కూడా తెలియజేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని కోరారు. సమస్యతో పాటు ఓ సూచన లేదా కార్యాచరణను కూడా జోడిస్తే.. తగిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి వీలు కలుగుతుందని తెలిపారు. భాగస్వామ్య దేశాలతో వస్తు వాణిజ్యంలో భారతదేశానికి అపారమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయనీ, రాబోయే సంవత్సరాల్లో మహిళల నేతృత్వంలోని ఎగుమతిదారులు తమ వ్యాపారాలను అనేక రెట్లు విస్తరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
సవాళ్లను అవకాశాలుగా మలచుకోవాలని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు శ్రీ గోయల్ పిలుపునిచ్చారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నుంచి భారత్ నేర్చుకున్న ముఖ్యమైన అంశాల్లో ఇది కూడా ఒకటని తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత ఉన్నా, అంతర్జాతీయ వాణిజ్యం మందగమనంలో ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు తొలి అయిదు నెలల్లో వస్తు ఎగుమతుల్లో భారత్ 15 శాతానికి పైగా వృద్ధిని సాధించిందని వెల్లడించారు. ప్రపంచ సవాళ్లకు భారత్ వెనకడుగు వేయలేదనీ, ఆ సవాళ్లలోనే అవకాశాలను వెతుక్కుంటూ ముందుుకు వెళుతోందన్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రస్తుత సంవత్సరంలో భారీ లక్ష్యాలను నిర్దేశించుకుందని చెప్పారు.
భారతదేశ ఆర్థిక వృద్ధి గురించి కూడా శ్రీ గోయల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరిగిన తొలి త్రైమాసికంలో స్థిర ధరల వద్ద భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి చెందిందని ఆయన గుర్తుచేశారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటని ఆయన అభివర్ణించారు. తన అసలైన సామర్థ్యాన్ని భారత్ గుర్తిస్తోందన్నారు. సామర్థ్యంతో, ఆత్మవిశ్వాసంతో ప్రపంచ దేశాలతో కలసి పనిచేస్తోందని తెలిపారు.
ప్రపంచంతో కలసి పనిచేయడానికి భారత్ ఇక ఏమాత్రం భయపడటం లేదనీ, ప్రపంచీకరణకు, అంతర్జాతీయ వాణిజ్యానికి తలుపులను మరింతగా తెరవాలని భావిస్తోందని చెప్పారు. నిజాయతీతో కూడిన వ్యాపార పద్ధతులు, వాణిజ్యంలో ఉన్నతమైన నైతిక ప్రమాణాలను పాటిస్తూ.. పోటీతో నిండిన ప్రపంచ వాతావరణంలో గొప్ప అవకాశాల కోసం భారత్ అన్వేషిస్తోందని తెలియజేశారు.
భారత్ వందేళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకునే 2047 నాటికి ప్రస్తుతమున్న 4 ట్రిలియన్ డాలర్ల నుంచి 30 ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థను చేర్చాలనే లక్ష్యంగా చేసుకుందని శ్రీ గోయల్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన తెలిపారు. ఇందులో ప్రతి దశలోనూ బాధ్యతలను కేటాయించామని చెప్పారు. అలాగే దీనిని 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి సంకల్పంగా అభివర్ణించారు. మహిళల నేతృత్వంలో జరిగే కార్యక్రమాల ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
‘‘మహిళలు అభివృద్ధి చెందితే ప్రపంచమూ అభివృద్ధి చెందుతుంది’’ అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటలను శ్రీ గోయల్ ఉటంకించారు. మహిళలు తమ కథలను తామే వివరిస్తున్నారనీ, ప్రపంచ పౌరులను సంక్షేమం, మెరుగైన భవిష్యత్తును అందించే దిశగా ప్రయాణాన్ని యువతులే తీర్చిదిద్దుతారనీ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2308810)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4