బొగ్గు మంత్రిత్వ శాఖ
పంజాబ్ విద్యుదుత్పత్తి కేంద్రాలకు తగినంత బొగ్గు: క్యాప్టివ్ గనుల్లో పీఎస్పీసీఎల్
తవ్వకాలను ప్రారంభించినప్పటి నుంచి బొగ్గు సరఫరాకు వెసులుబాటు కల్పించిన కేంద్రం
నాడు పోస్టు చేయడమైనది:
06 SEP 2026 2:37PM by PIB Hyderabad
పంజాబ్ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గడానికి కేంద్రం నుంచి సరిపడా బొగ్గు సరఫరా కాకపోవడమే కారణమంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. పంజాబ్ విద్యుత్ కేంద్రాలకు సరిపడినంత బొగ్గు అందుబాటులో ఉంచినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పంజాబ్తో సహా దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి కోసం నిరంతరాయంగా బొగ్గును సరఫరా చేసేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) కట్టుబడి ఉందని తెలియజేసింది.
పంజాబ్ బొగ్గు సరఫరా వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు
పంజాబ్లో క్యాప్టివ్ గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచే అక్కడి స్వతంత్ర విద్యుత్ కేంద్రాలకు (ఐపీపీ) బొగ్గు రవాణాను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది.
-
జార్ఖండ్కు చెల్లించాల్సిన చట్టబద్ధమైన బకాయిలను చెల్లించే షరతుతో పీఎస్పీసీఎల్కు చెందిన పచ్వారా కేంద్ర క్యాప్టివ్ బొగ్గు గని నుంచి ఐపీపీలకు బొగ్గు సరఫరాకు అనుమతినిచ్చింది.
-
నిర్దేశిత తుది వినియోగ ప్లాంట్ల అవసరాలు తీరిన అనంతరం… నభా పవర్ లిమిటెడ్ (రాజ్పుర), తల్వాండి సబూ పవర్ లిమిటెడ్ (మన్సా) లాంటి వాటితో సహా పీఎస్పీసీఎల్ యాజమాన్యంలో లేని ఐపీపీలకు వార్షిక ఉత్పత్తిలో 50 శాతం వరకు బొగ్గును వాడుకునేందుకు ఇప్పటికే అనుమతి ఉంది. 50 శాతానికి మించి బొగ్గు అవసరమైన సందర్భాల్లో పీఎస్పీసీఎల్ కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు.
పంజాబ్కు కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) మద్దతు, పీఎస్పీసీఎల్ కేంద్రాల్లో తక్కువ పీఎల్ఎఫ్ (42 శాతం)
మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాలను పీఎస్పీసీఎల్ నిర్వహిస్తోంది. అవి గురు హర్ గోవింద్ టీపీఎస్ (లెహ్రా మొహబ్బత్), గోయిండ్వాల్ సాహిబ్ టీపీపీ, రోపర్ టీపీఎస్. వీటి మొత్తం సామర్థ్యం 2,300 మెగా వాట్లు. 04.09.2026 నాటికి సాధారణ అవసరాలతో పోలిస్తే.. సుమారు 117 శాతం అధికంగా బొగ్గు నిల్వలున్నాయి. తగినంత బొగ్గు అందుబాటులో ఉన్నప్పటికీ ఆగస్టు 2026లో ఈ విద్యుత్ కేంద్రాల సగటు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 42 శాతం మాత్రమే నమోదయింది. ఈ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గడానికి బొగ్గు కొరతే కారణమని చెప్పలేం.
దీనికి భిన్నంగా అదే కాల వ్యవధిలో పంజాబ్కు చెందిన ఐపీపీ నభా పవర్ లిమిటెడ్ దాదాపు 93 శాతం పీఎల్ఎఫ్ను నమోదు చేసింది. సీఐఎల్ వనరుల నుంచి సరిపడినంత బొగ్గు సరఫరా అవడంతో ఇది సాధ్యమైంది. రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి బొగ్గు కొరత అడ్డంకి కాదని ఈ ఉదాహరణ తెలియజేస్తోంది.
సీఐఎల్ ఇప్పటికే అందించిన బొగ్గు తరలింపును ఐపీపీలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది
పంజాబ్ ఆధారిత ఐపీపీలకు కోల్ ఇండియా అనుబంధ సంస్థలు బొగ్గును అందించినప్పటికీ బుకింగ్, తరలింపు ప్రక్రియ మందకొడిగా ఉంది.
-
ఆర్సీఆర్ విధానం ద్వారా 30.03.2026న ఎన్పీఎల్, టీఎస్పీఎల్కు అయిదు లక్షల టన్నుల (ఎల్టీ) బొగ్గును కేటాయించింది. ఇందులో ఇప్పటివరకు దాదాపు 4.1 లక్షల టన్నులు మాత్రమే బుక్ చేసుకోగా, సుమారు 3.1 లక్షల టన్నుల బొగ్గును తరలించారు.
-
ఎన్పీఎల్కు 3.5 ఎల్టీల బొగ్గును బీసీసీఎల్ కేటాయించింది. అందులో సుమారు 1.3 ఎల్టీల బొగ్గును మాత్రమే బుక్ అయింది. ఇప్పటి వరకు 0.98 ఎల్టీల బొగ్గును తరలించారు.
పంజాబ్లో విద్యుదుత్పత్తిని పెంచడంలో సమయానికి ఐపీపీలు బొగ్గును తరలించడానికీ, తన పరిధిలోని ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పీఎస్పీసీఎల్ మెరుగుపరుచుకోవడానికీ సమ ప్రాధాన్యముంది.
పంజాబ్లోని ఐపీపీలకు బొగ్గు రవాణాను సులభతరం చేయడానికి, పీఎస్పీసీఎల్ క్యాప్టివ్ గనుల నుంచి సరఫరాను అనుమతించేందుకు చట్టబద్ధమైన తుది వినియోగ పరిమితులను సడలించడంతో సహా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పటిష్టమైన చర్యలు తీసుకుందని బొగ్గు మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటిస్తోంది. పంజాబ్తో సహా దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి కోసం నిరంతరాయంగా బొగ్గు సరఫరాను కొనసాగించడానికి కోల్ ఇండియా లిమిటెడ్ కట్టుబడి ఉంది. పీఎస్పీసీఎల్ సొంత ప్లాంట్లను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవడం, ఇప్పటికే సీఐఎల్ అనుబంధ సంస్థలు కేటాయించిన బొగ్గును సకాలంలో తరలించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని మెరుగుపరిచి, రాష్ట్ర విద్యుత్ అవసరాలకు వాడుకోవచ్చును.
***
(రిలీజ్ ఐడి: 2307193)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9