సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్లతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్న సామాజిక న్యాయం, సాధికారతా విభాగం.. తరాల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం
పిల్లలు, తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రుల మధ్య అనుబంధాన్ని పెంచేలా...
దేశవ్యాప్తంగా 200 పాఠశాలల్లో కార్యక్రమం
ప్రతి తరమూ కలిసి సాగుతూ.. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అన్న ప్రధాని దార్శనికతను ప్రతిబింబించేలా ప్రణాళిక
నాడు పోస్టు చేయడమైనది:
31 AUG 2026 7:28PM by PIB Hyderabad
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ (ఆర్కేఎం)తో.. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వశాఖ పరిధిలోని సామాజిక న్యాయం, సాధికారతా విభాగం (డీవోఎస్జేఈ) రేపు ఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ‘తరాల మధ్య అనుబంధా’న్ని పెంచే లక్ష్యంతో దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమం అమలుకు ఇది తోడ్పాటునందిస్తుంది.
న్యూఢిల్లీ పహాడ్గంజ్లోని రామకృష్ణ మిషన్లో ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమం జరగనుంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, సహాయ మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ సుధాన్షు పంత్, సంయుక్త కార్యదర్శి శ్రీ సజీశ్ కుమార్ ఎన్, రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సర్వలోకానంద పాల్గొంటారు.
పాఠశాల వ్యవస్థ ద్వారా.. పిల్లలు, తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రుల మధ్య భావోద్వేగ, సాంస్కృతిక అనుబంధాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. ఇందుకోసం ఆటపాటలు, శాస్త్రీయ ఆధారాలతో కూడిన వినూత్న కార్యకలాపాలను నిర్వహించనున్నారు.
పెద్దలను గౌరవించడం, సమ్మిళిత అభివృద్ధి సాధనలకు ప్రధానమంత్రి ఇచ్చే ప్రాధాన్యాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. ప్రతి తరమూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే.. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే సంకల్పం పరిపూర్ణంగా నెరవేరుతుందని ఇది స్పష్టం చేస్తోంది.
ఈ భాగస్వామ్యం కింద.. విస్తరణకు అనువైన ఒక నమూనాను రూపొందించి, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 200 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సహాధ్యయన క్రీడలు, ద్విభాషా రిసోర్స్ సెంటర్ వెబ్సైట్ ఏర్పాటుతోపాటు.. ఉపాధ్యాయులకు ప్రత్యేక ధ్రువీకరణను అందించనున్నారు. ఈ ఫలితాల ఆధారంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని దేశమంతటా విస్తరించి, నిరంతరాయంగా కొనసాగించే అవకాశాన్ని పరిశీలిస్తారు.
మంత్రిత్వశాఖ ఇప్పటికే అమలు చేస్తున్న అటల్ వయో అభ్యుదయ యోజన, ‘ఎల్డర్లైన్’ హెల్ప్లైన్ వంటి వయోవృద్ధుల సంక్షేమ పథకాలకు.. ఈ కార్యక్రమం అదనపు బలాన్ని చేకూరుస్తుంది. వయోవృద్ధులు తమ అనుభవాలనూ, జీవన విలువలనూ తర్వాతి తరానికి అందించడానికి మంచి అవకాశాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది. అలాగే తల్లిదండ్రులు సంప్రదాయానికీ - ఆధునికతకూ మధ్య వారధిలా నిలిచేందుకు, పిల్లలు సాంస్కృతిక మూలాలను విస్మరించకుండా మానసిక ధైర్యంతో వికసించేందుకు ఇదెంతగానో తోడ్పడుతుంది.
శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద దివ్య బోధనల స్ఫూర్తితో ఆవిర్భవించిన రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్లకు.. విద్య, వైద్యం, సంస్కృతి, మానవతా సేవా రంగాల్లో శతాబ్దానికి పైగా విశేష అనుభవం ఉంది. ఈ సరికొత్త కార్యక్రమానికి రామకృష్ణ మిషన్ నిర్వహణ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. అలాగే దీనికి సంబంధించి పరిశోధన, రూపకల్పన, మూల్యాంకనం వంటి బాధ్యతల కోసం ఒక విజ్ఞానాభివృద్ధి భాగస్వామ్య సంస్థ సహకారాన్ని అందించనుంది.
***
(రిలీజ్ ఐడి: 2305277)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3