రక్షణ మంత్రిత్వ శాఖ
భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ నిపుణ్
నాడు పోస్టు చేయడమైనది:
31 AUG 2026 4:43PM by PIB Hyderabad
నిస్టార్ శ్రేణికి చెందిన రెండో డైవింగ్ సహాయక నౌక ఐఎన్ఎస్ నిపుణ్ను భారత నౌకాదళం ప్రారంభించింది. 2026 ఆగస్టు 31న ముంబయిలోని నౌకాదళ ఓడరేవులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సముద్ర మధ్యంలో డైవింగ్, జలాంతర్గత కార్యకలాపాలు, జలాంతర్గాముల రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడంలో ఇదొక కీలక మైలురాయిగా పేర్కొనవచ్చు.
నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ అధ్యక్షతన.. పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నౌకాదళ సీనియర్ అధికారులు, విశాఖపట్నం హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) ప్రతినిధులు, పూర్వ సైనికోద్యోగులు, పలువురు ప్రముఖులతోపాటు నౌకాదళ సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్.. దేశీయ పరిజ్ఞానంతో ఈ నౌకను రూపకల్పన చేసి, నిర్మించింది. ‘ఐఎన్ఎస్ నిపుణ్’ చేరిక.. భారత నౌకాదళ ప్రత్యేక జలాంతర్గత సామర్థ్యానికి మరింత బలాన్ని చేకూర్చింది. సాంకేతికంగా సంక్లిష్టమైన ప్రత్యేక నౌకలను తయారుచేసే స్థాయికి భారత్ చేరుకున్నదనేందుకు ఇది నిదర్శనం. అంతేకాకుండా రక్షణ రంగానికి చెందిన నౌకా నిర్మాణంలో ఆత్మనిర్భరత దిశగా ఇది మరో కీలక ముందడుగు. నౌకాదళ దేశీయ సామర్థ్యాలను పటిష్టం చేసుకోవడంలో దేశంలోని ఓడరేవులు, రక్షణ రంగ పరిశ్రమలు, అనుబంధ సంస్థల పాత్రను కూడా ఇది వెల్లడిస్తోంది.
సముద్ర అగాధాల్లో డైవింగ్, జలాంతర్గత కార్యకలాపాల కోసం ఐఎన్ఎస్ నిపుణ్ నౌకను ప్రత్యేకంగా రూపొందించారు. శాచ్యురేషన్, ఎయిర్, హీలియాక్స్ తరహా డైవింగ్ సామర్థ్యం ఈ నౌక సొంతం. నీటి లోపల పరిశీలనలు, సహాయక చర్యలు చేపట్టడానికి వీలుగా ఇందులో రిమోట్తో పనిచేసే అధునాతన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక డైవింగ్ కాంప్లెక్సు, గతిశీల స్థాన నిర్ణయ సామర్థ్యంతోపాటు.. అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండడంతో, సముద్రంలో దీర్ఘకాలం పాటు సంక్లిష్టమైన ఆపరేషన్లను నిర్వహించడానికి సాధ్యపడుతుంది.
జలాంతర్గాముల రక్షణ చర్యలను చేపట్టే సామర్థ్యం కూడా ఐఎన్ఎస్ నిపుణ్కు ఉంది. సముద్ర గర్భంలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇది భారత నౌకాదళానికి ఎంతో దోహదపడుతుంది. ఇప్పటికే సేవలందిస్తున్న తోటి నౌక ఐఎన్ఎస్ నిస్టార్తో కలిపి చూస్తే.. డైవింగ్, జలాంతర్గత కార్యకలాపాలు, సముద్రపు అడుగున చిక్కుకున్న వస్తువులను వెలికితీసే చర్యలు, జలాంతర్గాముల రక్షణ రంగాల్లో నౌకాదళ ప్రత్యేక సామర్థ్యం గణనీయంగా పెరిగింది.
నౌక ప్రత్యేక పాత్రను, సముద్ర గర్భంలోకి వెళ్లే నావికుల సాహస పటిమను చాటేలా ఈ నౌకపై చిహ్నం, సూక్తి ఉన్నాయి. ‘అగాధాల్లోనూ అందరికన్నా ముందే (ఫార్ బినీత్, ఫ్యూ బియాండ్)’ అన్న ఈ వాక్యం.. అత్యంత సవాలుతో కూడిన సముద్రపు లోతుల్లో ఆపరేషన్లు నిర్వహించేందుకు కావలసిన పట్టుదల, నైపుణ్యం, సహనానికి నిదర్శనంగా నిలుస్తుంది.
ఈ సందర్భంగా నౌకాదళ ప్రధానాధికారి (సీఎన్ఎస్) మాట్లాడుతూ.. భారత నౌకాదళం, హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్, దేశీయ పారిశ్రామిక రంగాలు కలసికట్టుగా సాధించిన విజయానికి ఐఎన్ఎస్ నిపుణ్ నిదర్శనమన్నారు. ఒకే విడత సముద్ర పరీక్షల్లో అన్ని డైవింగ్ వ్యవస్థల సామర్థ్యాన్ని నిరూపించడం.. దేశ సాంకేతిక ఆత్మవిశ్వాసానికీ, ఇంజినీరింగ్ నైపుణ్యానికీ నిదర్శనమన్నారు.
వివాదాస్పద సముద్ర వాతావరణం పెరుగుతుండడం, ప్రపంచ సముద్ర మార్గాలకు పొంచి ఉన్న ముప్పుల నేపథ్యంలో.. పోరాట సంసిద్ధత భారత నౌకాదళానికి అత్యంత ప్రాధాన్య అంశంగా ఉందని సీఎన్ఎస్ స్పష్టం చేశారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ పరిధిలోని పశ్చిమ తీరప్రాంతంలో సేవలందించే ఐఎన్ఎస్ నిపుణ్.. వివిధ రకాల జలాంతర్గత కార్యకలాపాలకు కావాల్సిన ప్రత్యేక సామర్థ్యాలను పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.
ప్రపంచంలో కొద్ది దేశాల నౌకాదళాల వద్ద మాత్రమే ఉన్న ఈ ప్రత్యేక సామర్థ్యాలు.. ఐఎన్ఎస్ నిపుణ సొంతమని సీఎన్ఎస్ పునరుద్ఘాటించారు. ప్రమాదంలో చిక్కుకున్న మన జలాంతర్గాములతోపాటు.. మిత్రదేశాల జలాంతర్గాముల విషయంలో కూడా తక్షణ సహాయక చర్యలకు ఇదెంతగానో ఉపయోగపడుతుందన్నారు. దీంతో భారత్ ఈ ప్రాంతంలో విశ్వసనీయ జలాంతర్గామి రక్షణ భాగస్వామిగా ఎదుగుతుందని తెలిపారు. అంతేకాకుండా మునిగిన నౌకల నుంచి వస్తువులను బయటకు తీయడం (సాల్వేజ్), మానవతా సాయం, విపత్తు సహాయక (హెచ్ఎడీఆర్) చర్యలను చేపట్టడంలో కూడా ఇది ప్రత్యేకంగా సహాయాన్ని అందిస్తుందని ఆయన వివరించారు.
నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి సీఎన్ఎస్ మాట్లాడుతూ.. వారు ఒక అత్యాధునిక నౌక బాధ్యతలను స్వీకరించడమే కాకుండా, ఆ ఉక్కుకు ఊపిరి పోసి, దానికొక శక్తిమంతమైన రూపాన్నిచ్చే గురుతర బాధ్యతను నిర్వర్తించారన్నారు. ‘నిశ్చయ్, నిర్భయ్, నిపుణ్’ అనే ఈ నౌక ప్రధాన లక్ష్యానికి అనుగుణంగా నడుచుకోవాలని వారిని కోరారు. అలాగే విధి నిర్వహణ, గౌరవం, ధైర్యం అనే నౌకాదళ మౌలిక విలువలకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆరంభ పతాకావిష్కరణతో.. భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ నిపుణ్ అధికారికంగా ప్రవేశించింది. సముద్రపు అలల అడుగున విధులు నిర్వర్తించే నౌకాదళ సిబ్బందికి తోడ్పాటునందిస్తూ.. దేశ నౌకా వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకు సిద్ధంగా ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2305257)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5